P.Venkateswara Rao
#చంద్రబాబు నాయుడు #ఉచిత పథకాలు.. 🤠 #ఏపీ న్యూస్ 🗞️ ఏపీ పాలిటిక్స్ 🎯
*ఆ దాహం తీరనిది.. అబద్ధాలను ఆడించేది..❗*
15.06.2026🎯
ప్రజాసేవచేయడానికి మాత్రమే రాజకీయాల్లో అడుగుపెడుతున్నానని ఎవరైనా చెప్పుకుంటే గనుక వారిని అతిపెద్ద మోసగాళ్లుగా భావించాల్సి ఉంటుంది. ఇవాల్టి రోజుల్లో ఈ రంగంలో అడుగుపెట్టడం అధికారం మీది కాంక్షతో తప్ప మరొకటి కాదు. కాలానుగుణంగా నాయకుల వైఖరులను మనం అర్థం చేసుకోగలిగితే అధికారకాంక్ష, అధికార దాహం పెద్ద నేరాలుగా మనకు కనిపించవు.
ఈ అధికార దాహం అనే సిద్ధాంతానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అతీతమైన వ్యక్తి కానే కాదు. ఈ రాష్ట్రానికి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా సేవలందించిన అరుదైన ఘనత ఆయన చెంతనే ఉన్నప్పటికీ ఆయనలోని అధికార దాహం తీరనిది. అయితే ఆయన వీక్ పాయింట్ కూడా ఆ దాహమే.
చంద్రబాబులోని అలవిమాలిన అధికార దాహం ఆయనను కీలుబొమ్మలా ఆడిస్తుంటుంది. ఆయనతో అబద్ధాలు చెప్పిస్తుంటుంది. మాట నిలకడ లేని నాయకుడిగా ఆయనను అపకీర్తి పాలు చేస్తుంది. ఎన్ని విపరిణామాలు ఎదురవుతున్నప్పటికీ ఆయన తనలోని దాహాన్ని మాత్రం ఉపశమింప చేసుకోలేకపోతున్నారు.
ప్రజలు తన అబద్ధాలను ఈసడించుకున్నప్పటికీ ఆయన పట్టించుకోకుండా ముందుకు సాగుతుంటారు. అదే వీక్ పాయింట్ చంద్రబాబును ప్రజల ముందు దోషిగా నిలబెడుతోంది. ఆచరణ సాధ్యం కానీ హామీలను కేవలం అధికార దాహంతో ప్రకటించి గెలిచిన తర్వాత వాటి ఊసెత్తకుండా ఏళ్లు గడిపేస్తున్న వైఖరి చంద్రబాబుకు నష్టదాయకమే.
ఒకసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబులో అసహనం, అభద్రత పెరిగాయని చెప్పాలి. 30 ఏళ్ల పాటు నిరంతరాయంగా ముఖ్యమంత్రి పదవిలోనే ఉండడం లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి సాగించిన సంక్షేమ పాలన చంద్రబాబుకు మింగుడు పడలేదు.
అధికారాన్ని హస్తగతం చేసుకోకపోతే జగన్ కోరుకున్నదే జరుగుతుందని, తెలుగుదేశం పార్టీ భవిష్యత్ ప్రస్థానానికి, తనలోని అధికార దాహానికి మరణ శాసనం లిఖించినట్లు అవుతుందని చంద్రబాబుకు ఆనాడు స్పష్టత ఉంది.
అందుకే ఆచరణాత్మక నాయకుడు ఎవరైనా సరే ఊహించడానికి కూడా వెనుకాడే రీతిలో ప్రజాకర్షక పధకాలను ఎన్నికల హామీలుగా చంద్రబాబు ప్రకటించారు.
సాధారణంగా హామీ ఇవ్వాలంటే వంద రకాలుగా ముందు ఆలోచించే సంశయాలులువు అయిన చంద్రబాబు నాయుడు.. ముందు యూనికాన్ చూసుకోకుండా ఎన్నికలకు ఏడాది ముందుగానే సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారు. ఎన్నికలలో నెగ్గారు. ఒకటి రెండు హామీలను పూర్తిగాను, మరో రెండు పాక్షికంగానూ అమలులోకి తెచ్చారు. అత్యంత కీలకమైన, ప్రజలు కోటి ఆశలతో ఎదురుచూస్తూ ఉండే కీలక హామీలను విస్మరించారు. చంద్రబాబు మాట నిలకడ పాటించకపోవడం గురించి విపక్షాలు చేసే విమర్శలు, చూపే ఉదాహరణలు అనేకం మనకు కనిపిస్తాయి.
ఎన్డీఏ కూటమి ఏపీలో అధికారంలోకి రావడానికి ప్రధానంగా తోడ్పడిన సూపర్ సిక్స్ హామీల వరకు ఆలోచిస్తే దీపం పథకం కూడా సంపూర్ణంగా అమలు కాలేదు. రైతు భరోసా అందడంపై కూడా రాష్ట్ర వాటా పై అనేక విమర్శలు ఉన్నాయి. వీటన్నింటినీ మించి రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయల వంతున ఇస్తానని, ప్రతి నిరుద్యోగికి 3000 రూపాయల భృతి ఇస్తానని చంద్రబాబు చెప్పిన హామీలు గాలికి కొట్టుకుపోయాయి.
రెండు సంవత్సరాలుగా ఈ ప్రధానమైన రెండు హామీల గురించి మాటమాత్రంగా కూడా ప్రస్తావించకుండానే చంద్రబాబు రోజులు నెట్టేస్తున్నారు
సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ అతి పెద్ద అబద్ధాన్ని ప్రతిసారి పదే పదే చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత రెండేళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన భారీ సభలో కూడా వీటి ఊసు లేదు. ప్రజలకు ఆశాభంగం కలిగించిన పరిణామం ఇది.
ఆ రెండు హామీల కోసం ప్రజలు నిరీక్షిస్తున్నారనే సంగతి చంద్రబాబుకు తెలుసు. సాధారణంగా నాయకులు ఎన్నికలవేళ ఇచ్చే ప్రతి హామీని గెలిచిన వెంటనే అమలు చేయాలని ఏ ఒక్కరూ ఆశించరు, ఊహించరు. కానీ ప్రజలు వేటినైతే ఎక్కువగా కోరుకుంటున్నారో వాటి విషయంలో ప్రభుత్వ వైఖరి ఏమిటో కనీసం ప్రకటించడం పాలకుల కర్తవ్యం.
ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి తక్షణం ఇవ్వగల ఆర్థిక స్తోమత రాష్ట్రానికి ప్రస్తుతం లేకపోవచ్చు.
కానీ ఈ ఐదేళ్ల పదవీకాలం ముగిసేలోగా ఎప్పటికీ ఆ హామీలు అమలు చేస్తాము ఒక గడువును అధినేత ప్రకటించాలని ప్రజలు కోరుకుంటే తప్పుకాదు.
కానీ ముందే చెప్పుకున్నట్టు చంద్రబాబు నాయుడు లోని అధికార దాహం అనే వీక్ పాయింట్ ఆయనలోని ప్రాక్టికల్ నాయకుడిని కబళించేసింది. సామాన్య ప్రజలు ఆడిన మాట తప్పే వ్యక్తిగా చంద్రబాబును ఈ రెండు కారణాల చేత గుర్తుంచుకుంటే తప్పేముంది.
దేశంలోని అత్యంత సీనియారిటీ ఉన్న రాజకీయ దురంధరుల్లో ఒకడైన చంద్రబాబు నాయుడు ఇలాంటి వీక్ పాయింట్లను అధిగమించి ముందుకు సాగే తెగువను ఇప్పటికైనా అలవాటు చేసుకోవాలని..
మాయమాటల ద్వారా కాకుండా స్వచ్ఛమైన హామీలతో మాత్రమే ప్రజల మనసులు గెలుచుకోవాలని సర్వత్రా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
*..వెంకట్ ఆరికట్ల*