🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,
తేదీ ... 03 - 06 - 2026,
వారం ... సౌమ్యవాసరే ( బుధవారం )
శ్రీ పరాభవ నామ సంవత్సరం,
ఉత్తరాయణం,
గ్రీష్మ ఋతువు,
అధిక జ్యేష్ఠ మాసం,
బహుళ పక్షం,
*_నేటి మాట_*
*మానవుని అజ్ఞానానికి ఈశ్వరుని నవ్వు...!!*
ఇంకాసేపట్లో చనిపోయే బిడ్డకు వైద్యంచేస్తూ వైద్యుడు వాళ్ళ తల్లితో “ఏమీ భయం లేదమ్మా మీ అబ్బాయికి ఏమి కాదు, నేను బతికిస్తాను“ అన్నప్పుడు...
మరోసారి ఇద్దరు అన్నదమ్ములు భూమిని పంచుకొని “ఇదిగో ఈ భూమి నాది , అదిగో అటువైపు వున్నది నా తమ్మునిది" అన్నప్పుడు.
వీడి తండ్రి, తాత, ఇదే మాట అన్నారు పోయారు, ఇప్పుడు వీడు అదే అంటున్నాడు.
రేపు వీడు పోతాడు అయినా “ఇది నాది” అనే భ్రమలో, మాయలో, అజ్ఞానంలో బతుకు తున్నాడు అని ఈశ్వరుడు నవ్వుకుంటారట.
నిజమే... ఏదీ శాశ్వతం కాదు. మనం, మన పిల్లలు, మనం సంపాదించుకున్న ఇళ్ళు, భూమి, మన బ్యాంకు బాలన్స్ ఏవి మన వెంట రావు.
ఈ విషయం మనకందరికీ తెలుసు, అయినా “నాది, నావి “అనే మాయలోనే ఉండి పోతున్నాము.
ప్రతి రోజూ తెల్లవారు తోంది, పగలు వెళ్ళిపోతోంది.
రాత్రి మొదలవుతోంది, తర్వాత మళ్ళీ తిరిగి పగలు ఏర్పడు తోంది.
పగలు తిరగడం, రాత్రుళ్ళు నిద్రపోవడం ఎన్నాళ్ళిలా? ప్రతిరోజూ తిన్నదే తింటున్నాం, తాగిందే తాగుతున్నాం.
రోజూ అదే తిండి, అదే నీరు, అదే మంచం, అదే నిద్ర, అయినా ఎందుకో వీటి మీద ఆశ చావడం లేదు.
దుఃఖం తొలగడమూ లేదు, ఏమాత్రం అర్ధం కాని ఈ పగలు, రాత్రి అనే ప్రయాణం చివరికి ఎక్కడికి...
ఆలోచిస్తుంటే ఈ ప్రయాణం ఒకరోజు చావడం దగ్గరకు తప్ప మరొక చోటుకు కానే కాదని మాత్రం తెలుస్తోంది.
ఇక్కడ పుట్టేదంతా ఒకనాటికి తప్పక నశించేదే అయినప్పుడు ఈ దుఃఖం దేనికి..
ఈ ఆరాటం దేనికి.. మనలో ఏర్పడి ఉన్న ఈ “నాది - నావి - నావాళ్ళు” అనే భ్రమంతా మనకు ఎక్కడి నుంచి వచ్చింది..? ఈ జీవితమే మూన్నాళ్ళ ముచ్చటని తెలుస్తూనే ఉన్నప్పటికీ మరి మనం ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాం..? డబ్బు సంపాదించాలి.. దాన్ని భద్రంగా దాచుకోవాలి.. అందరికంటే గొప్పవాళ్ళం అయిపోవాలి అని...
ఇదంతా పిచ్చి కాకపోతే ఇంకేంటి.!
ఇలా మనలో మనం ప్రశ్నించుకోవాలి, ఈ శరీరం పుట్టేటప్పుడు, ఈ శరీరం పెరిగేటప్పుడు, ఈ శరీరం పోయేటప్పుడు ఏదయితే మార్పు అనేదే లేకుండా ఈ శరీరంలో ఉందో అదే ఆత్మ.
ఆ ఆత్మే నేను అన్న ఎరుక కలిగిననాడు ఆత్మజ్ఞానం మనలో వుద్భవిస్తుంది.
జ్ఞానం కలిగిన తరువాత వైరాగ్యం,దాని తరువాత భక్తి , భక్తికి పరాకాష్ట
భగవంతుని దర్శనభాగ్యం. చివరిగా ముక్తి... ముక్తి పొందడానికెే దైవం మనకు మానవజన్మ ప్రసాదించాడని తెలుసుకున్న తరవాత సాధన చెయ్యాలి.
మనం కోరుకునే జ్ఞానం, ముక్తి మరెక్కడో లేదు, మన మనస్సులోనే ఉంది.
మనిషి దేవుణ్ణి కోరుకోవలసినది...
అనాయాసేన మరణం,
వినా దైన్యేన జీవనం,
దేహాంతే తవ సాన్నిధ్యం,
దేహిమాం పరమేశ్వర ||
అర్ధం :
బాధలేని సుఖమరణం,
ఒకరిపై ఆధారపడని జీవితం,
పోయేముందు నీ దర్శనం,
ప్రసాదించు పరమాత్మ...
*_🌺శుభమస్తు🌺_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏
రాజేష్ #నేటి రాశి ఫలాలు


