P.Venkateswara Rao
689 views • 2 months ago
#🟡తెలుగుదేశం పార్టీ #ఏపీ న్యూస్ 🗞️ ఏపీ పాలిటిక్స్ 🎯
*ఇద్దరు ప్రభాకర్ల అరాచకం.. టీడీపీకి డేంజర్❗*
16.06.2026🎯
ఆ ఇద్దరు టీడీపీ నాయకులు వీధికెక్కారు. రాజకీయంగా నష్టపోయే ప్రమాదం పొంచి వుందని టీడీపీకి డేంజర్ సిగ్నల్స్ మోగుతున్నాయి.
ఆ ఇద్దరు నాయకులే జేసీ ప్రభాకర్రెడ్డి, చింతమనేని ప్రభాకర్ చౌదరి.
ఒకరేమో అనంతపురం జిల్లా తాడిపత్రిలో, మరొకరేమో ఏలూరు జిల్లా దెందులూరు, చుట్టు పక్కల రచ్చరచ్చ చేస్తున్నారు. వీళ్లిద్దరికీ అడ్డుకట్టే వేసే ధైర్యం టీడీపీ పెద్దలు చేయలేకపోతున్నారు. దీంతో వాళ్లిద్దరూ రెచ్చిపోతున్నారు
టీడీపీ మీడియా తమ గురించి రాసే సాహసం చేయదని, అందువల్ల అరాచకాలు సమాజానికి తెలియవని ఇద్దరు నాయకులు అనుకుంటున్నారేమో అని పౌర సమాజం దెప్పి పొడుస్తోంది. చేతిలో అధికారం వుండడంతో అంతా మా ఇష్టం, మా రాజ్యం అన్నట్టుగా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్రెడ్డి, దెందులూరులో చింతమనేని ప్రభాకర్ చౌదరి వ్యవహరిస్తున్నారు.
గతంలో 2014-19 మధ్య కాలంలో వీళ్లిద్దరి ఆగడాలు ఇదే రీతిలో కొనసాగాయి. నాడు చంద్రబాబు సర్కార్కు ప్రజల్లో వ్యతిరేకత రావడానికి వీళ్లిద్దరూ తమ వంతు పాత్రను పోషించారు. ఇప్పుడు మళ్లీ అదే పాత్రను పునరావృతం చేస్తున్నారు. గతానుభవాల నుంచి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ఏమీ నేర్చుకుంటున్నట్టు కనిపించడం లేదు.
అందుకే వాళ్లిద్దరూ చెలరేగిపోతున్నారు.
ఇదే రీతిలో ఏ దళిత ఎమ్మెల్యేనో వ్యవహరించి వుంటే, టీడీపీ అధిష్టానం ఉదాసీనంగా వ్యవహరించి వుండేదా? అనే ప్రశ్న ఎదురవుతోంది. సామాజికంగా, ఆర్థికంగా బలమైన ప్రజాప్రతినిధులు ఎంత అప్రజాస్వామికంగా వ్యవహరించినా చూసీచూడనట్టు ప్రభుత్వ పెద్దలు వ్యవహరించడాన్ని కొందరు దళిత ఎమ్మెల్యేలు విమర్శిస్తున్నారు.
అయితే జేసీ, చింతమనేని పేర్ల చివర్లో రెడ్డి, చౌదరి వుండడంతో చంద్రబాబు, లోకేశ్ చర్యలు తీసుకోడానికి భయపడుతున్నారని టీడీపీ దళిత ఎమ్మెల్యేలు విమర్శిస్తున్నారు.
తాడిపత్రిలో జేసీ ప్రభాకర్రెడ్డి, ఏలూరు, దెందులూరులలో కొన్ని రోజులుగా చింతమనేని వ్యవహరిస్తున్న తీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
చంద్రబాబు పాలన కట్టు తప్పిందనేందుకు వీళ్లిద్దరినీ ఉదహరించే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకుంది.
2014-19 మధ్య కాలంలో వైఎస్ జగన్, ఆయన తల్లిపై జేసీ ప్రభాకర్రెడ్డి నోరు పారేసుకున్నారు.
ఆ తర్వాత వైసీపీ హయాంలో జేసీ ప్రభాకర్రెడ్డి మూల్యం చెల్లించుకున్నారు.
అయినప్పటికీ జేసీలో ఎలాంటి మార్పు రాలేదు. వీధి నాటకాలకు మించి ఆయన ప్రవర్తన వుంది.
ఇప్పటికే జేసీ ప్రభాకర్రెడ్డి తీరుతో యావత్ తెలుగు సమాజం అసహనంగా వుంది. ఇటు కూటమి ఎమ్మెల్యేలతోనూ, సొంత పార్టీ నాయకులతోనూ ఆయనకు గొడవలే. వయసు పైబడి ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని కూటమి నేతలు సరిపెట్టుకుంటున్నారు.
ఇక వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయంలో జేసీ ప్రవర్తన, అన్ని హద్దుల్ని దాటింది. అధికారం శాశ్వతమన్నట్టు, తానేదో తాడిపత్రి రాజ్యానికి రాజు అయ్యినట్టుగా జేసీ ప్రవర్తన వుంది.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఐదేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయనే స్పృహ జేసీలో వుండి వుంటే, ఈ రకంగా ప్రవర్తించి వుండరనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఇక చింతమనేని ప్రభాకర్ చౌదరి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఏలూరు వెళ్లి, సొంత పార్టీకి చెందిన లీగల్ విభాగ రాష్ట్ర నాయకుడైన శ్రీనివాసబాబు ఇంటిపైకి అర్ధరాత్రి వేళ దాడికి పాల్పడడం అత్యంత హేయం, నీచం.
గతంలో మహిళా తహశీల్దార్ వనజాక్షి విషయంలో చింతమనేని దుష్ప్రవర్తనను యావత్ తెలుగు సమాజం అసహ్యించుకుంది. అదేంటో గానీ, ఇలాంటి ఒక ఎమ్మెల్యే వుండాలని టీడీపీ అధిష్టానం కోరుకుంటున్నట్టుగా వుంది.
చింతమనేనిని కట్టడి చేస్తే, ఏదో జరగకూడని నష్టం తమకు జరుగుతుందని టీడీపీ పెద్దలు భావిస్తున్నట్టుగా వుంది. చింతమనేనిపై వస్తున్న ఆరోపణల గురించి ప్రభుత్వ పెద్దలకు పట్టింపు ఉన్నట్టు లేదు.
అందుకే ఆయనపై అవినీతి ఆరోపణలు చేసిన, సొంత పార్టీ నేతపై సస్పెన్షన్ వేటు వేయడం ద్వారా, తాము ఎవరి వైపో పాలకులు చెప్పకనే చెప్పారు.
ఇలాంటి నాయకుల తీరుతో మరోసారి రానున్న రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోడానికి ముఖ్యంగా టీడీపీ నాయకులు సిద్ధంగా వుండాలి.
వీధికెక్కి రోజూ రచ్చ చేస్తున్న ప్రభాకర్రెడ్డి, ప్రభాకర్ చౌదరిని కట్టడి చేయకుండా, తప్పు చేస్తున్న ప్రభుత్వం, ప్రజాగ్రహం ఏంటో రుచి చూడడానికి రోజులు లెక్కిస్తుండాలి.
కాలం కంటే ఎవరూ గొప్పవాళ్లు లేరు. కాలం అనేది అందరి భరతం పడుతుంది. తస్మాత్ జాగ్రత్త!
15 likes
5 shares