👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
923 views • 2 days ago
🌺 అద్భుతాల మిళితం.. లలిత సహస్రనామ స్తోత్రం.. 6 🌺
🌺 మూలాధారం నుండి సహస్రారం వరకు... కుండలినీ శక్తి దివ్య ప్రయాణం 🌺
...వేణి కొలిపాక
పంచదశాక్షరీ మంత్రమయమైన అమ్మవారిని దర్శింపజేసిన వసిన్యాది దేవతలు, మన శరీర చక్రాలలో ఆ పరాశక్తి ఉనికిని, కుండలినీ శక్తి యొక్క దివ్య ప్రయాణాన్ని 38, 39, 40వ శ్లోకాల ద్వారా మనకు తెలియజేస్తున్నారు. 38, 39 శ్లోకాల భావాన్ని జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు చదివి అర్థం చేసుకోవాల్సిందిగా మనవి.
━━━━━━━━━━━━━━━
🌺 38వ శ్లోకం 🌺
మూలాధారైక నిలయా, బ్రహ్మగ్రంథి విభేదినీ ।
మణిపూరాంత రుదితా, విష్ణుగ్రంథి విభేదినీ ॥ 38 ॥
ఈ శ్లోకంలో నాలుగు నామాలు ఉన్నాయి. ప్రతి నామం ఒక మహత్తర యోగ రహస్యాన్ని మనకు తెలియజేస్తుంది.
━━━━━━━━━━━━━━━
🌺 మూలాధారంలో అమ్మ 🌺
వెన్నుముక క్రింద మన ఆసన స్థానంలో ఉన్నదే మూలాధార చక్రం. షట్చక్రాలకు ఇది మూలాధారమై, పృథ్వీ తత్వాన్ని కలిగి, కుండలినీ శక్తి సౌధానికి పునాది లాగా ఉంది. ఇదే అమ్మవారికి ముఖ్య నివాసము.
మనలోని శక్తి నిశ్శబ్దంగా, మూడున్నర చుట్లు చుట్టుకుని, సర్పాకారంలో ఇక్కడ కుండలినీ రూపంలో నిద్రిస్తూ ఉంటుంది.
దీనిని యోగ సాధన ద్వారా మేలుకొలపాలి. అది గురుముఖతః జరగవలసిన సాధన. అయితే "మూలాధారైక నిలయా" అనే ఈ నామమును నిరంతరం జపం చేసి, ప్రతి ఒక్కరికి సాధించుకునే వీలును ప్రసాదించారు వసిన్యాది దేవతలు.
━━━━━━━━━━━━━━━
🌺 బ్రహ్మ గ్రంథి విభేదినీ 🌺
మానవ శరీరంలో బ్రహ్మ, విష్ణు, రుద్ర అనే మూడు గ్రంథులు ఉంటాయి. కుండలినీ శక్తి సహస్రార చక్రమును చేరుకోవటానికి ఈ ఆరు చక్రాల గుండా చేసే ప్రయాణంలో ప్రతి రెండు చక్రాలకు ఒక గ్రంథి, అనగా ముడి అంటే బంధము ఉంటుంది. దానిని భేదించుకుని ముందుకు సాగాలి శక్తి పయనం.
ముందుగా మూలాధార చక్రము దాటి స్వాధిష్ఠాన చక్రము పైన ఉన్న బ్రహ్మ గ్రంథిని చేరుతుంది కుండలినీ శక్తి. ఈ స్థూల శరీరానికి ఉండే భయం, కోరికలు, ఆందోళనలు మిక్కుటంగా కలిగి మాయతో బంధింపబడి ఉంటుంది. అదే బ్రహ్మ గ్రంథి.
ఎప్పుడైతే ఈ ముడిని అమ్మవారు ఛేదించుతుందో, అప్పుడు మాయ వీడి అజ్ఞానము తొలగి, "నేను ఈ శరీరం కాదు" అనే జ్ఞానం ఏర్పడుతుంది.
━━━━━━━━━━━━━━━
🌺 మణిపూరాంత రుదితా 🌺
మన ఆరు చక్రాలలో మూడవది మణిపూర చక్రం. శక్తి మొదటి రెండు చక్రాలను దాటుకొని ఎగసి మణిపూర చక్ర మధ్యభాగంలో అగ్ని రూపిణిగా ఉదయిస్తుంది. ఈ చక్రము సరిగ్గా మన నాభి స్థానంలో ఉంటుంది.
━━━━━━━━━━━━━━━
🌺 విష్ణుగ్రంథి విభేదినీ 🌺
మణిపూర చక్రము దాటి అనాహత చక్రము పైనున్న విష్ణుగ్రంథిని చేరుకుంటుంది కుండలినీ శక్తి స్వరూపిణి అయిన లలితా త్రిపురసుందరి.
ఈ ముడి మణిపూర, అనాహత చక్రాలను చైతన్యవంతం కాకుండా బంధించి ఉంచుతుంది. మన మనసులోని భావోద్వేగాలు, బంధాలు, అహంకారాలు, ఆలోచనలే విష్ణు గ్రంథి.
ఈ విష్ణుగ్రంథి ఎప్పుడైతే విభేదన జరుగుతుందో, ఆ మనిషిలో క్రోధం, భావోద్వేగాలు, అహంకారం, ఆవేశాలు మొదలైన భవబంధాలు తొలగిపోయి, ప్రేమ, భక్తి, కష్టసుఖాల యందు సమత్వము మొదలైన సత్వగుణాలను పొంది, గాఢమైన ప్రశాంతతను అనుభవిస్తాడు.
🌺 ఆజ్ఞా చక్రం నుండి సహస్రారం వరకు... పరమానందానికి దారి 🌺
---
39వ శ్లోకం
ఆజ్ఞా చక్రాంతరాళస్థా, రుద్రగ్రంథి విభేదినీ ।
సహస్రారాంబుజా రూఢా, సుధాసారాభివర్షిణీ ॥ 39॥
ఈ శ్లోకంలో కూడా నాలుగు నామాలను పొందుపరిచారు వసిన్యాది దేవతలు. ఈ నాలుగు నామాలు సాధకుని ఆధ్యాత్మిక ప్రయాణంలో అంతిమ దశను అత్యంత అద్భుతంగా వివరిస్తాయి.
---
🌺 ఆజ్ఞా చక్రాంతరాళస్థా
ఆజ్ఞా చక్రము మన రెండు కనుబొమ్మల మధ్య భాగంలో ఉంటుంది. వెన్నుపూసను ఆధారంగా చేసుకొని ఉన్న ఆరు చక్రాలలో ఇది ఆరవది. దీనిని జ్ఞాన ద్వారము, భ్రూమధ్య స్థానము, శక్తి కేంద్రము అని చెబుతూ ఉంటారు. మన ఆలోచనలు, నిర్ణయాలు, సంకల్పాలను నియంత్రించే విచక్షణ శక్తిని కలిగి ఉంటుంది.
ఆజ్ఞా చక్రంలో మధ్య భాగంలో కొలువై ఉంటుంది అమ్మవారు. ఇక్కడ భాసిల్లుతున్న అమ్మను ధ్యానం చేయడం ద్వారా అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందవచ్చు.
---
🌺 రుద్రగ్రంథి విభేదినీ
విశుద్ధ చక్రము దాటగా వచ్చే ఆజ్ఞా చక్రము పై భాగమున ఈ రుద్ర గ్రంథి ఉంటుంది. దీనిచే బంధించబడి ఉన్నప్పుడు భయాందోళనలు, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, మానసిక సమస్యలు, అయోమయ పరిస్థితులు కలుగుతాయి.
అమ్మవారు శక్తి స్వరూపిణిగా విశుద్ధ చక్రం దాటి ఆజ్ఞా చక్రం చేరుకొని, ఆ పైనున్న ఈ రుద్రగ్రంథిని భేదించడం వలన 'నేను, నాది' అనే అహంకారం తొలగిపోయి, మానసిక ప్రశాంతత కలిగి, జ్ఞానం వస్తుంది.
ఇది సాధకుడికి అత్యంత కష్టమైన అంతిమ దశ. ఇది సాధించాలంటే ఎంతో ఏకాగ్రతతో, అంకితభావంతో సాధన చేయాలి. ఈ గ్రంథి భేదన జరిగితే పూర్వజన్మ కర్మబంధాలు కూడా దగ్ధమై, 'నేను శరీరం కాదు... శుద్ధ చైతన్య స్వరూపుడిని' అనే జ్ఞానం కలుగుతుంది.
---
🌺 సహస్రారాంబుజా రూఢా
సహస్రార చక్రము అంటే బ్రహ్మరంధ్రం కింద ఉండేదే ఈ చక్రము. ఇక్కడ వెయ్యి దళముల పద్మమును అధిష్ఠించి ఉన్నది లలితా త్రిపురసుందరి.
మూలాధారము నుంచి సహస్రారం చేరుకోవడానికి అమ్మ, ఆరు చక్రాలను, మూడు గ్రంథులనే అడ్డు ముడులను, సాధకుడి సాధన ఫలితంగా విప్పుకుంటూ, సహస్రార చక్రము చేరుకొని, అక్కడ వెయ్యి దళాల పద్మములో శివునితో ఆసీనమవుతుంది.
అనంత నక్షత్ర కాంతులతో శివశక్తుల దర్శనం జరుగుతుంది. అదే బ్రహ్మానంద స్థితి. సాధకునికి అంతకుమించిన ఆనందామృతం మరొకటి ఉంటుందా?
---
🌺 సుధాసారాభివర్షిణీ
కుండలినీ శక్తి, ఆరు చక్రాలను, మూడు గ్రంథులను దాటుకుంటూ సహస్రార చక్రము చేరుకుని అక్కడ శివునితో కూడగా, అమృత వర్షాన్ని కురిపిస్తుంది.
అది అమృత సముద్రం — అందులో మణిద్వీపం — దానియందు చింతామణి గృహం — అందు కామేశ్వరుని వామాంకముపై అమ్మ ఆసీనమై కురిపిస్తున్న అమృత వర్షానికి, తన ఆరు చక్రాలు, డెబ్బై రెండు వేల నాడులు తడిసి ముద్దవ్వడం సాధకుడు అనుభవపూర్వకంగా తెలుసుకొంటాడు.
ఇప్పుడు ఆ సాధకునికి ఎటువంటి భవబంధాలు అంటవు. మనసు ప్రేమతో నిండి నిర్మలంగా ఉంటుంది.
✨ మూలాధారంలో ప్రారంభమైన కుండలినీ యాత్ర... సహస్రారంలో శివశక్తుల ఐక్యంతో పరిపూర్ణమవుతుంది.
🌺 అక్కడ ద్వైతం ఉండదు... భయం ఉండదు... బంధం ఉండదు... మిగిలేది పరమానందమే.
🙏 ఆ పరమానంద స్వరూపిణి శ్రీలలితా పరమేశ్వరి కటాక్షం సర్వజనులపై ప్రసరించాలని మనసారా ప్రార్థిద్దాం...🙏
#☘️🛑🙏sree lalitha tripura sundari devi darshanam 🛑☘️🙏 #lalitha tripura sundari #sree lalitha tripura sundari devi darshanam #లలితా దేవి చైతన్యము - Lalitha Devi Chatanyam #🙏🏻sri lalitha devi
39 likes
19 shares