P.Venkateswara Rao
1K views
#అమరావతి రైతుల ఆవేదన 🙏 #ఏపీ అప్ డేట్స్..📖
*రాజధాని.. నిన్ను నువ్వు కాపాడుకో❗*
NOVEMBER 29, 2025🎯
రాజధాని అమరావతి తనను తాను రక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూస్తూ కూచుంటే, అసలుకే ఎసరు వస్తుంది. రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో రెండో దశలో రైతుల నుంచి 16,666.57 ఎకరాలు సమీకరించేందుకు
తాజాగా చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. ఇప్పటికే తీసుకున్న భూముల అభివృద్ధికి దిక్కులేదని, కొత్తగా తీసుకుని ఏం చేస్తారనే ప్రశ్న, నిలదీత ఎదురవుతున్నా పట్టించుకునే పరిస్థితిలో పాలకులు లేరు.
ఇదేమని ఎవరైనా ప్రశ్నిస్తే, వాళ్లని రాజధాని వ్యతిరేకులుగా చిత్రీకరించడానికి ప్రభుత్వం, దాని మీడియా సిద్ధంగా ఉన్నాయి. అందుకే బాధితులు స్పందించి, రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. తుళ్లూరు, అమరావతి మండలాల పరిధిలోని ఏడు గ్రామాలకు చెందిన రైతుల నుంచి భూసమీకరణ విధానంలో భూములు తీసుకోడానికి ప్రభుత్వం నిర్ణయించింది.
రాజధాని అభివృద్ధికి లేనిది భూమి కాదు. పాలకుల వద్ద వజ్ర సంకల్పం లేదన్న విమర్శను కొట్టి పారేయలేం. ఇప్పటికే రైతుల వద్ద 50 వేల ఎకరాలను ప్రభుత్వం పదేళ్ల క్రితం తీసుకుంది. ఇందులో చేయాలనే తలంపు వుంటే, ఎంతైనా అభివృద్ధి చేయొచ్చు. ఆ పని చేయకుండా, ఇంకా వేల ఎకరాల భూమి కావాలని కోరుకోవడం వెనుక మతలబు ఏంటో అంతుచిక్కడం లేదు. ఇప్పుడు రెండో
విడతతోనే విడిచిపెట్టరు. మున్ముందు మూడో విడత కూడా ఉన్నట్టు మంత్రి నారాయణ చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని దేవతల రాజధానిగా పాలకులు అభివర్ణిస్తుంటారు. ప్రస్తుత పాలకుల పొగడ్తలకు అర్థాలే వేరు. ప్రశంసల మాయలో ముంచుతున్నారంటే, దేనికో ఎసరు పెట్టారని అర్థం చేసుకోవాల్సి వుంటుంది. జంతువుల్ని బలి ఇచ్చేటపుడు వేప ఆకు, పూలతో అలంకరిస్తారు. అలాగే కుంకుమ పెట్టి భక్తిని చాటుకుంటారు. చివరికి పూజిస్తూనే దేవతలకు బలి ఇస్తుంటారు.
ఇప్పుడీ విషయం బాగా అర్థం కావాల్సింది అమరావతి రాజధాని రైతులకే. త్యాగధనులంటూ పాలకులు కీర్తిస్తుంటే, మైమరిచి మరో లోకంలో విహరిస్తే, జరగాల్సిన నష్టం జరగకుండా వుండదు. అందుకే అమరావతి రాజధానీ…… నిన్ను నువ్వు కాపాడుకో అనే హెచ్చరిక పౌర సమాజం నుంచి వస్తోంది.
ఒకవేళ రాజధాని రైతులు ఆశించినట్టు ఆ ప్రాంతం అభివృద్ధి చెంది వుంటే, ఇవాళ మరోసారి రోడ్డెక్కాల్సి వస్తుందనే హెచ్చరిక అక్కడి జేఏసీల నుంచి వచ్చేది కాదేమో! కొంత మంది రాజధాని రైతులతో సీఎం చంద్రబాబు సమావేశమై, రెండో దశ భూసమీకరణ తప్పదని తేల్చి చెప్పారు. సీఎం చెప్పిన 24 గంటలు కూడా గడవకనే, రెండో విడతకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. దీంతో రాజధాని వెన్నులో వణుకు. అభివృద్ధి, రాజధాని భూముల విలువ పేరుతో సీఎం బ్లాక్ మెయిలు పాల్పడుతున్నారనే అభిప్రాయం కూడా ఆ ప్రాంతవాసుల నుంచి వ్యక్తం కావడం గమనార్హం.
మొదటి విడత భూసమీకరణలో ప్రభుత్వ, ప్రైవేట్ భూములన్నీ కలుపుకుంటే 50 వేల ఎకరాలకు పైచిలుకే.
రానున్న రోజుల్లో వివిధ దశలో సుమారు 40-45 వేల ఎకరాల భూమిని సమీకరించాలని చంద్రబాబు సర్కార్ గట్టిగా నిర్ణయించింది. తాజాగా 16,666 ఎకరాల సేకరణకు ప్రభుత్వం సిద్ధమైంది. సీఎం చంద్రబాబు అభిప్రాయం ప్రకారం.. మొదటి విడతలో తీసుకున్న భూమితోనే సరిపెట్టుకుంటే, అమరావతి కేవలం ఒక మున్సిపాల్టీకే పరిమితం అవుతుంది.
రాజధానిలో పెట్టుబడులు పెట్టేందుకు ఇంకా భూములు కావాలని ఆయన అంటున్నారు. సమీపంలో గన్నవరం విమానాశ్రయం ఉన్నప్పటికీ, అది చాలదని కూటమి ప్రభుత్వం అంటోంది. అందుకే 5 వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం, 2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్, అలాగే 2,500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ నిర్మాణం చేపట్టడానికి భూములివ్వాలని ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది.
భూములిస్తే అమరావతి అభివృద్ధి జరిగి, ప్లాట్లకు విపరీతంగా ధరలొచ్చి మీ జీవితాలు బాగుపడతాయని స్వయంగా సీఎం చంద్రబాబు అంటున్నారు.
ఒకవేళ కాదు, కూడదంటే అమరావతి అభివృద్ధికి నోచుకోక, భూముల విలువ పెరగదని ఆయన పరోక్షంగా హెచ్చరించడం గమనార్హం. మరి పదేళ్ల క్రితం భూములు తీసుకునే సందర్భంలో ఇలాంటి మాటలు చెప్పలేదు. అదేదో అప్పుడే కావాల్సినంత భూములు తీసుకుని ఉండొచ్చు కదా? అనే ప్రశ్న రాజధాని రైతుల నుంచి వినిపిస్తోంది. చంద్రబాబు హెచ్చరిక నేపథ్యంలో రాజధాని ప్రాంత వాసులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
భూములు అవసరమైనప్పుడల్లా ఏదో రకంగా మాటలతో మభ్యపెడుతున్నారన్న అనుమానం వారిలో వుంది. అలాగే పదేళ్ల క్రితం తీసుకున్న భూములకు సంబంధించి అభివృద్ధి జరగలేదని, అలాగే ప్లాట్ల కేటాయింపు, రిజిస్ట్రేషన్లు తదితర పదుల సంఖ్యలో సమస్యలతో సీఆర్డీఏ చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్న రైతులు కళ్లెదుటే ఉన్నారు. వాళ్ల ఇబ్బందుల్ని చూసి, రెండో దశలో రాజధానికి ఎలా ఇవ్వాలనే ప్రశ్న రైతుల్ని వెంటాడుతోంది.
ఇటీవల మాజీ మంత్రి, రాజధాని శ్రేయోభిలాషి వడ్డే శోభనాద్రీశ్వరరావు చేసిన హెచ్చరికల్ని అక్కడి రైతులు గుర్తించుకోవాలి. ముఖ్యంగా మన కులం అనే కారణంతో కొందరు రైతులు రాజధానికి భూములివ్వడానికి సిద్ధపడితే
శాశ్వతంగా నష్టపోతారని హెచ్చరించారు.
కావున ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని, అడుగులు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కృష్ణా, గుంటూరు జిల్లాల రైతులు చాలా తెలివైన వారు. పాలకులు తమ పబ్బం గడుపుకోడానికి ఎన్నెన్నో మాయ మాటలు చెబుతుంటారు. మంచీచెడుల గురించి ఎంతో విచక్షణతో ఆలోచించాలి. మరీ ముఖ్యంగా రాజధాని విషయంలో గత పదేళ్ల అనుభవాలు కళ్లెదుటే ఉన్నాయి. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చి, అమరావతిని విస్మరించి తప్పు చేసిన ప్రభుత్వాన్ని చూశాం.
అలాగే అమరావతికి అనుకూలం పేరుతో భూములు తీసుకోవడమే తప్ప, మాట నిలబెట్టుకోలేని పాలకులు మరోవైపు. రాజధాని అనేది కొందరికి ఓట్లు తీసుకొచ్చే బంగారు బాతుగుడ్డుగా భావిస్తున్నారు. రాజధాని అనే సెంటిమెంట్ను అడ్డుపెట్టుకుని, దాన్నే రాజకీయ కవచంగా కూడా మార్చుకున్న కుట్రను స్థానికులు గుర్తించాలి. అనుకూలం పేరుతో వెన్నుపోటు పొడిచే కుట్రల్ని తిప్పి కొట్టాలి. లేదంటే అమరావతి వాసుల పరిస్థితి ముందు నెయ్యి, వెనుక గొయ్యిలా తయారు కావడం ఖాయం.
నమ్మకం ఉన్న చోటే మోసం కూడా వుంటుంది. పదేపదే తమను నమ్మాలని కోరుతున్నారంటే, అక్కడ నమ్మకం కలిగించేది జరగలేదని అర్థం చేసుకోవాలి. నమ్మకాన్ని వ్యవస్థలు కలిగించాలి. అంతే తప్ప, వ్యక్తుల్ని నమ్ముకుని భూముల్ని అప్పనంగా అప్పగిస్తే, చివరికి మునిగిపోవాల్సిందే అని వడ్డే శోభనాద్రీశ్వరరావు లాంటి పెద్దల హెచ్చరికపై లోతుగా ఆలోచించాలి. మోసగించే వాళ్ల మాటలు తియ్యగా వుంటాయి. మేలు కోరే వారి హెచ్చరికలు చేదుగా వుంటాయి.
అంతిమంగా ఎవరి మాటలతో మంచి జరుగుతుందో విజ్ఞులైన అమరావతి వాసులు అర్థం చేసుకోవాలి. నష్టపోయాక లబోదిబోమంటే కాపాడేవారు వుండరు. అంతిమ నిష్టూరం కంటే ఆది నిష్టూరమే మేలనే సామెతను అమరావతి వాసులు అర్థం చేసుకోవాలి. మునగడమా? బాగుపడడమా? ఈ రెండింటిలో దేన్ని ఎంచుకోవాలో ఆప్షన్ అమరావతి వాసుల ముందు వుంది. ఇక వారిష్టం.
15 likes
11 shares