ఏకాదశి వ్రత మహత్యం / ఏకాదశి వ్రత మహిమ 🪔🔱🕉️🙏
4 Posts • 1K views
PSV APPARAO
581 views 21 hours ago
#ఏకాదశి వ్రత మహత్యం / ఏకాదశి వ్రత మహిమ 🪔🔱🕉️🙏 #ఏకాదశి #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #పాపవిమోచని ఏకాదశి / పాప నాశని ఏకాదశి 🕉️🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత *పాపమోచనీ ఏకాదశి* *ఏకాదశీ వ్రత మహిమ* పాపమోచనీ ఏకాదశీ మహిమ శ్రీకృష్ణయుధిష్ఠిర సంవాద రూపంగా భవిష్యోత్తర పురాణంలో వర్ణించబడింది. ఒకసారి ధర్మరాజు కృష్ణునితో పలుకుతూ “కృష్ణా! ఆమలకీ ఏకాదశీ మహిమను నీవు ఇదివరకే వివరించావు. అయితే ఇపుడు వచ్చే ఏకాదశిని గురించి వివరించవలసింది. ఆ ఏకాదశి పేరేమిటి? ఆ ఏకాదశిని పాటించే పద్ధతిని, దాని ఫలితాన్ని నాకు చెప్పవలసిందిగా కోరుతున్నాను” అని అన్నాడు. అపుడు శ్రీకృష్ణుడు దానికి ప్రత్యుత్తరంగా పలుకుతూ “రాజోత్తమా! ఆ ఏకాదశి పేరు పాపమోచనీ, దాని మహిమను ఇపుడు విను. అతిపురాతన కాలంలో ఈ ఏకాదశీ మహిమను లోమశముని మాంధాతకు వివరించాడు. ఈ ఏకాదశి సకల పాపాలను హరిస్తుంది. జీవుని పిశాచ జీవనాన్ని నశింపజేస్తుంది, అష్టసిద్ధులను ప్రసాదిస్తుంది” అని అన్నాడు. లోమశముని చెప్పిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. దేవతల కోశాధిపతియైన కుబేరునికి ఒక రమ్యమైన పుష్పవనం ఉండేది. దాని పేరు చైత్రరథం. నిత్యవసంతఫలితంగా అక్కడ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేది. గంధర్వులు, కిన్నరులు వంటివారు అక్కడ క్రీడించేవారు. ఇంద్రాది దేవతలు కూడ అక్కడకు వచ్చి విహరించేవారు. అదే వనంలో మేధావి అనే శివభక్తుడు తపస్సు చేస్తుండేవాడు. ఒకసారి అప్సరసలు ఆయన నిష్ఠను భంగపరచడానికి ప్రయత్నించారు. వారిలో మంజుఘోష అనే అప్సరస మునిమనస్సును హరించడానికి ఒక పన్నాగం పన్నింది. ఆమె ముని ఆశ్రమానికి దగ్గరలోనే ఒక చిన్న కుటీరాన్ని నిర్మించుకొని తియ్యని గొంతుతో వీణను మీటుతూ గీతాలాపన చేయసాగింది. శరీరానికి చందనాన్ని అలదుకొని, మెడలో సుగంధ పుష్పమాలను ధరించి తియ్యగా పాడుతున్న మంజుఘోషను చూసి శివవైరియైన మన్మథుడు కూడ మునిని జయించడానికి యత్నించాడు. పూర్వం ఒకసారి శివుడు మన్మథుని కాల్చి భస్మం చేశాడు. పూర్వశత్రుత్వాన్ని గుర్తు చేసికొనినవాడై మన్మథుడు ప్రతీకారం తీర్చుకోవడానికి శివభక్తుడైన మునిమనస్సులో ప్రవేశించాడు. తెల్లని యజ్ఞోపవీతాన్ని ధరించి చ్యవనఋషి ఆశ్రమంలో వసిస్తున్న మేధావి ఋషి అపుడు రెండవ మన్మథునిగా గోచరించాడు. అపుడు మంజుఘోష అతని చెంతకు చేరింది. అది చూసి మేధావి కూడ కామపీడితుడై తన దైవాన్ని మరిచాడు. ఆ విధంగా అతడు శివభక్తిని విడిచి ఆ వనితాసాంగత్యంలో మునిగిపోయాడు. అనేకసంవత్సరాలు గడిచాయి. ముని తన స్థితి నుండి పతనం చెందాడని గుర్తించిన మంజుఘోష తిరిగి తన లోకానికి వెళ్ళిపోవాలని నిశ్చయించుకొంది. అదే విషయాన్ని ఆమె మేధావితో చెప్పి తన లోకానికి వెళ్ళడానికి అనుజ్ఞను కోరింది. అపుడు మేధావి ఆమెతో "రమణీ! నీవు నా దగ్గరకు వచ్చింది ఈ సాయంత్రమే కదా. ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు ప్రొద్దున్నే వెళ్ళిపో" అని అన్నాడు. మునికి భయపడిన మంజుఘోష సరేనని చెప్పి మరికొన్ని సంవత్సరాలు అక్కడే ఉండిపోయింది. ఈ రకంగా ఆ అప్సరస యాభైఏడు సంవత్సరాల తొమ్మిది నెలల మూడు రోజులు మునితో గడిపినప్పటికిని అదంతా కేవలం ఒక రాత్రిలో సగభాగం వలెనే తోచసాగింది. తిరిగి మంజుఘోష తన ఇంటికి వెళ్ళడానికి అనుజ్ఞను కోరింది. కాని ఈ సారి ముని ఆమెతో "రమణీ! నా మాటలు విను. ఇది కేవలం ప్రాతఃసమయం. నేను ప్రాతః కాలవిధులు పూర్తి చేసేంతవరకు ఇక్కడే ఉండు" అని అన్నాడు. అపుడు అప్సరస నవ్వి “మహర్షీ! మీ ప్రాతఃకాల విధులు పూర్తి కావడానికి ఇంకెంత సమయం పడుతుంది? ఇంకా మీరు అవి పూర్తి చేయలేదా? ఇప్పటికే నా సాంగత్యంలో మీరు అనేక సంవత్సరాలు గడిపారు. ఇప్పటికైనా సమయం విలువ తెలుసుకోండి” అని అన్నది. ఆ మాటలు వినగానే ఋషికి జ్ఞానోదయం కలిగింది. అపుడు ఆ ఋషి “సుందరీ! యాభైఏడేళ్ళ విలువైన కాలాన్ని నేను వృథా చేశాను. నీవే నా సమస్తాన్నీ, తపస్సును నాశనం చేశావు" అని అంటూనే ఆయన కళ్ళలో నీళ్ళు తిరిగాయి. దేహం కోపంతో కంపించింది. అదే కోపంతో మేధావి ఆమెతో పలుకుతూ “నీవు మంత్రకత్తె, పిశాచిలాగా ప్రవర్తించావు. కాబట్టి పిశాచిలాగా మారిపో. పాపిష్ఠిదానా! సిగ్గు సిగ్గు” అని అన్నాడు. మేధావి ఇచ్చిన శాపాన్ని వినగానే మంజుఘోష అతనితో “ఓ బ్రాహ్మణోత్తమా! దయచేసి ఈ శాపాన్ని ఉపసంహరించుకో. నేను నీకు అనేకసంవత్సరాల సాంగత్యాన్ని ఇచ్చాను కాబట్టి క్షమార్హురాలిని. నా మీద దయ చూపించు” అని అన్నది. ఆమె మాటలను వినిన మేధావి అపుడు ఆమెతో "సౌమ్యురాలా! నేనేం చేసేది? నీవు నా తపస్సంపదను కొల్లగొట్టావు. అయినా ఈ శాపం నుండి బయటపడే మార్గం నీకొకటి నేను చెబుతాను, చైత్రమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు పాపమోచనీ ఏకాదశి. అది సకలపాపహరం. నీవు ఆ ఏకాదశివ్రతాన్ని పాటిస్తే నీ పిశాచజీవనం పోతుంది” అని పలికాడు. తరువాత మేధావి తన తండ్రి చ్యవనఋషి ఆశ్రమానికి వెళ్ళాడు. పతితుడైన తన పుత్రుని చూసి చ్యవనఋషి అతిదుః ఖితుడై “అయ్యో! నీవెంత పనిచేశావు! సాధారణమైన వనితకు ఆకర్షితుడవై తపస్సంపదను నష్టపరచడం నీకు తగనే తగదు" అని అన్నాడు. అపుడు మేధావి పలుకుతూ "తండ్రీ! దురదృష్టవశాత్తు నేను అప్సరససాంగత్యంలో మహాపాపానికి ఒడిగట్టాను. కాబట్టి నాకు పాపపరిహారాన్ని తెలియజేయండి” అని అర్థించాడు. కుమారుడి దీనాలాపన వినిన చ్యవనఋషి అపుడు మార్గోపదేశం చేస్తూ "పుత్రా! పాపమోచని ఏకాదశీ వ్రతపాలన వలన సమస్తపాపాలు నశిస్తాయి. కాబట్టి శ్రద్ధతో దానిని పాటించు” అని అన్నాడు. తండ్రి మాటలను వినిన మేధావి పరమోత్సాహంతో ఆ ఏకాదశీ వ్రతపాలనకు సిద్ధపడ్డాడు. తరువాత ఆ ఏకాదశి వ్రతవిధానం వలన మేధావి పాపాలన్నీ నశించిపోయాయి, అతడు కూడ పరమభాగ్యవంతుడయ్యాడు. మంజుఘోష కూడ పాపమోచనీ ఏకాదశీ పాలన ద్వారా పిశాచరూపం నుండి బయటపడి తిరిగి స్వర్గానికి వెళ్ళిపోయింది. మాంధాతకు ఈ కథను వివరించిన లోమశముని చివరిగా పలుకుతూ "రాజా! ఈ పాపమోచనీ ఏకాదశీ వ్రతపాలన చేత సమస్త పాపాలు నశిస్తాయి. ఈ ఏకాదశి వ్రతమాహాత్మ్యాన్ని చదవడం వలన, వినడం వలన సహస్ర గోదానఫలం లభిస్తుంది. ఈ వ్రతపాలన ద్వారా బ్రహ్మహత్యాపాతకం, భ్రూణహత్యాపాతకం, మదిరాపాన పాతకం, గురుపత్ని సంగమపాతకం వంటి సకలపాపాలు సమూలంగా నశిస్తాయి” అని అన్నాడు. సారాంశమేమనగా ఈ ఏకాదశి పరమమంగళకరమైనది, సకల పాపహరమైనది కాబట్టి ప్రతియొక్కరు శ్రద్ధతో ఈ ఏకాదశి వ్రతపాలన చేయాలి. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
8 likes
18 shares
PSV APPARAO
631 views 16 days ago
#ఏకాదశి వ్రత మహత్యం / ఏకాదశి వ్రత మహిమ 🪔🔱🕉️🙏 #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఏకాదశి #దాన ఫలాన్ని అక్షయం చేసే అమలక ఏకాదశి *ఆమలకీ ఏకాదశి* *ఏకాదశీ వ్రత మహిమ* ఫాల్గుణమాస శుక్లపక్షంలో వచ్చే ఆమలకీ ఏకాదశి మహిమ మాంధాత వశిష్ఠుల సంవాదరూపంలో బ్రహ్మాండపురాణంలో వర్ణించబడింది. ఒకసారి మాంధాత వశిష్ఠముని దగ్గరకు చేరి “ఓ మహాభాగా! మీరు నా పట్ల ప్రసన్నులై ఉన్నచో, సకల శుభాలను పొందగలిగే ఒక వ్రతాన్ని దయతో నాకు తెలపండి" అని అడిగాడు. దానికి ప్రత్యుత్తరంగా వశిష్ఠుడు ఇలా అన్నాడు. "రాజా! అందరికీ శుభాన్ని కలుగజేసే ఒక మహావ్రతం యొక్క మహిమను, చరిత్రను నీకు వివరిస్తాను. ఆ వ్రతం పేరు ఆమలకీ ఏకాదశీ వ్రతం. ఈ వ్రతాన్ని పాటించడం వలన కలిగే ప్రభావం సకల పాపాలను నశింపజేసి ముక్తిని ఒసగడమే కాకుండ వేయి గోవులను దానం చేసిన ఫలం కూడ సిద్ధిస్తుంది.” "పూర్వం వైదిషమనే పురం ఉండేది. దానిలో మిక్కిలి సంపన్నులైన బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు నివసించేవారు. ఆ అందమైన నగరంలో నాస్తికుడు గాని, పాపిగాని ఉండేవాడు కాడు. నగరమంతా ఎప్పుడూ వేదమంత్రాలతో ప్రతిధ్వనిస్తూ ఉండేది. అట్టి సుప్రసిద్ధ నగరంలో చైత్రరథుడనే రాజు ఉండేవాడు. అతడు చంద్రవంశజుడైన పశబిందుకుని కులంలో జన్మించాడు. చైత్రరథుడు బలవంతుడు, వీరుడు, ఐశ్వర్యవంతుడు, శాస్త్ర కోవిదుడై ఉండేవాడు. అతని రాజ్యపాలనలో రాజ్యమంతట సుఖసంపదలు వెల్లివిరిసి ఉండేవి. పురప్రజలందరు విష్ణుభక్తికి అంకితులై ఉండి ఏకాదశీ వ్రతాన్ని పాటిస్తుండేవారు. హరిభక్తి కారణంగా వారందరు ఆ రాజ్యంలో సుఖంగా జీవించేవారు. రాజ్యంలో బీదవాడు గాని, పిసినారిగాని ఒక్కడైనా ఉండేవాడు కాడు. ఈ ప్రకారం ఆనందంగా అనేకసంవత్సరాలు గడచిపోయిన తరువాత ఫాల్గుణమాస శుక్లపక్షంలో ఒకసారి ద్వాదశితో కూడిన ఆమలకీ ఏకాదశి వచ్చింది. ఇటువంటి ఏకాదశి మహత్తర లాభాన్ని చేకూరుస్తుందని తెలిసిన రాజు, అతని ప్రజలు దానిని యథావిధిగా నిర్వహించాలని సంకల్పించారు. ఏకాదశిరోజు ప్రొద్దున్నే రాజు, అతని ప్రజలు నదిలో స్నానం చేసి, ఒడ్డునే ఉన్నట్టి విష్ణు ఆలయాన్ని సందర్శించారు. గుడి ప్రాంగణంలోనే ఒక ఆమలకీ వృక్షం ఉంది. రాజు ఆ చెట్టు మొదట్లో నీళ్ళు నింపిన కుండను, గొడుగును, వస్త్రాన్ని, పాదుకలను, పంచరత్నాలను పూజార్థం ఉంచాడు. తరువాత అతడు జలమును, పాదుకలను, ఛత్రాన్ని, సువర్ణమును, వజ్రములను, ముత్యాలను, వైడూర్యములను, సుగంధ ధూపమును సమర్పించి శ్రీపరశురాముని, ఆమలకీ వృక్షాన్ని పూజించాడు. పిదప అతడు ప్రజలతో, ఋషులతో గూడి పరశురాముని కీర్తించాడు”. “ఓ పరశురామా! ఓ రేణుకనందనా! ఓ ఆమలకీ వృక్షచ్ఛాయలో నిలిచినవాడా! ఓ కామమోక్షప్రదాతా! ఇవే నీకు మా వందనములు”. తరువాత అతడు ఆమలకీవృక్షాన్ని స్తుతించాడు. “ఓ ఆమలకీ! ఓ విశ్వపోషకా! బ్రహ్మతనయా! ఓ సమస్త పాపవినాశకా! నీకు మా వందనములు. దయచేసి మా అర్పణలను స్వీకరింపుము”. ఈ విధంగా భగవంతుని, ఆమలకీని పూజించిన తరువాత రాజు, అతని ప్రజలు విష్ణు ఆలయంలోనే రాత్రంతా జాగరణ చేశారు. భక్తితో పాటలు పాడారు. ఆ సమయంలో విధివశాత్తుగా ఒక వేటగాడు అక్కడకు వచ్చాడు. నానారకాలైన జంతువులను చంపి అతడు జీవికను సంపాదించే వాడు. నెయ్యిదీపంతో, ధూపంతో శోభితమైన మందిరంలోనికి ప్రవేశించిన ఆ వేటగాడు చాలామంది జనులు మేల్కొని ఉన్నవారై భగవంతుని కీర్తించడం కనిపించింది. వాడు కూడ వాళ్ళతో పాటే కూర్చొని జరుగుతున్నదేమిటో చూడసాగాడు. అదృష్టవశాత్తు అతనికి కుండపై ఉంచిన దామోదరుని దర్శనం కలిగింది. వాడు విష్ణుభగవానుని దివ్యకథలను కూడ విన్నాడు. వాడు ఆకలితో ఉన్నప్పటికిని రాత్రంతా మేల్కొని ఉన్నవాడై ఏకాదశి మహిమలను విన్నాడు. మర్నాడు ప్రొద్దున్నే రాజు తన ప్రజలతో పాటు తన పురానికి వెళ్ళిపోయాడు. వేటగాడు కూడ ఇంటికి వెళ్ళిన తరువాత భోజనం చేశాడు. తరువాత కొన్ని సంవత్సరాలకు వేటగాడు దేహాన్ని చాలించాడు. ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేసిన ఫలితంగా వాడు మరుజన్మలో అసంఖ్యాక రథగజతురగపదాతిదళంతో కూడిన రాజుగా జన్మించాడు. జయంతి పురాన్ని పాలించే విదూరథునికి అతడు వసురథునిగా జన్మించాడు. అతడు వెయ్యి గ్రామాలకు రాజు అయ్యాడు. అతడు సూర్యునితో సమానంగా తేజోమయుడు, చంద్రునితో సమానంగా ప్రకాశమానుడు, విష్ణువుతో సమానంగా శక్తిమంతుడు, భూదేవితో సమానంగా ఓర్పు కలవాడుగా ఉండేవాడు. సత్యసంధుడైన అతడు ధర్మపరుడై విష్ణుభక్తునిగా అయ్యాడు. ఒకరోజు వసురథుడు అడవిలో వేటకు పోయి దారి తప్పాడు. తీవ్రంగా అలసిపోయిన అతడు ఏ దారి తోచక ఒక చెట్టుక్రింద నడుం వాల్చి చేయినే తలగడగా పెట్టుకొని నిదురించాడు. అదే సమయంలో ఆ అడవిలో వసించే కొందరు మ్లేచ్ఛులు వచ్చి అతనిని నానా రకాలుగా హింసించారు. అతనిని తమ శత్రువుగా భావించి వారు చంపడానికి సిద్ధపడ్డారు. ఆ రాజు పూర్వం తమ తండ్రులను, తల్లులను, పుత్రులను, పౌత్రులను, మామలను నిర్దాక్షిణ్యంగా చంపి తాము దిక్కు తోచక తిరిగేటట్లు చేశాడని వారు భావించారు. ఈ విధంగా తలచి వారు ఆయుధాలనెత్తి రాజును కొట్టారు. కాని ఆశ్చర్యకరంగా వారి ఆయుధాలు ఏవీ కూడ రాజుయొక్క శరీరాన్ని తాకలేదు. అతని శరీరంపై చిన్న గాయమైనా కాలేదు. ఆ విధంగా తమ ఆయుధాలు వ్యర్థమయ్యేసరికి మ్లేచ్ఛులందరు ఖిన్నులై ప్రాణభీతి పొందారు. అడుగు ముందుకు వేసే శక్తి కూడ వారికి లేకపోయింది. ఆ సమయంలో ఒక అసాధారణ అందకత్తె గంధాభరణభూషితయై రాజుయొక్క దేహం నుండి బయటకు వచ్చింది. చక్కని పూమాలతో అలంకృతయై యున్న ఆమె కన్నులు కోపంతో ఎఱ్ఱబడి ఉన్నాయి. భ్రుకుటి ముడిచిన ఆమె చేతిలో చక్రాన్ని ధరించి క్రోధంతో మ్లేచ్చులను చంపడానికి ముందుకు ఉరికి క్షణంలో వారిని నిహతులను చేసింది. ఈ సంఘటన పూర్తి కాగానే రాజుకు మెలకువ వచ్చింది. ఘోరమైన సంఘటనను చూసి రాజు నిద్రనుండి మేల్కొని భీతుడై మ్రాన్పడిపోయాడు. తరువాత శత్రువు లందరు చచ్చిపడి ఉండటాన్ని చూసి విస్మితుడై "ఆహా! ఈ నా శత్రువులను చంపి నన్ను రక్షించిన ఆ శ్రేయోభిలాషి మిత్రుడెవ్వడు? ఈ గొప్పకార్యానికి నేను ఆతనికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను" అని అన్నాడు. “కేశవుడు తప్ప శరణాగత జీవులను రక్షించే సామర్థ్యం వేరెవ్వరికి ఉంటుంది? ఆతడొక్కడే శరణాగతులైన భక్తులకు పోషకుడు" అనే మాట ఆకాశంలో వినవచ్చింది. ఆకాశవాణి వాక్కులు వినగానే రాజు అమితాశ్చర్య చకితుడయ్యాడు. భక్తిభావంతో అతని హృదయం ద్రవించింది. తరువాత అతడు రాజ్యానికి తిరిగివచ్చి ఎటువంటి అవాంతరం లేకుండా ఇంద్రునిలాగా రాజ్యపాలన చేశాడు. వశిష్ఠముని పలుకుతూ "రాజా! ఈ పవిత్రమైన ఆమలకీ ఏకాదశీ వ్రతాన్ని పాటించేవాడు నిస్సంశయంగా విష్ణుపదాన్ని పొందగలుగుతాడు” అని తెలియజేశాడు. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
13 likes
8 shares