హిందూ దేవలయల సమాచారంతెలుసుకోండి

17 Posts • 15K views
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
785 views 2 months ago
అష్టాదశ శక్తిపీఠాలు........!! లంకాయాం శంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే అలంపురే జోగులాంబా, శ్రీశేలే భ్రమరాంబికా కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికా వారాణస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్ సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్ సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్ అంటూ ఆదిశంకరాచార్యులవారు చెప్పిన శ్లోకాన్నే అష్టాదశ శక్తిపీఠాల విషయంలో ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఆదిశంకరులు ఈ పద్దెనిమిది క్షేత్రాలనూ దర్శించి శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని ప్రతీతి. వీటిలో నాలుగు శక్తిపీఠాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి, అవి శ్రీశైలం, అలంపురం, పిఠాపురం, ద్రాక్షారామం. మిగిలిన వాటిలో పన్నెండు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉండగా దేశం వెలుపల కూడా మరో రెండు శక్తిపీఠాలున్నాయి. అందులో ఒకటి శ్రీలంకలోనూ మరొకటి ప్రస్తుత పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోనూ ఉంది. ఈ పద్దెనిమిది శక్తిపీఠాల్లో మూడు గయాక్షేత్రాలూ(గయ-శిరోగయ, పిఠాపురం-పాదగయ, జాజ్‌పూర్‌-నాభిగయ) రెండు జ్యోతిర్లింగ క్షేత్రాలూ (శ్రీశైలం, ఉజ్జయిని) ఉండటం మరో విశేషం. ఆ క్షేత్రాల గురించిన వివరాలు... 1.శాంకరీదేవి లంకాయాం శాంకరీదేవి అంటే...మునులూ రుషుల లెక్కప్రకారం ఈ క్షేత్రం శ్రీలంకలో కాదు, భూమధ్యరేఖకు సున్నాడిగ్రీల వద్ద ఉండేదట ఒకప్పుడు. ప్రస్తుతం ట్రింకోమలీ (శ్రీలంక)లోని ఒక కొండపై ఉండే శిథిల ఆలయాన్నే శాంకరీదేవి కొలువైన చోటుగా భావిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఆ శిథిలాలయం కూడా లేదు. 17వ శతాబ్దంలో పోర్చుగీసువారు దండయాత్ర చేసి ఈ గుడిని కూలగొట్టేశారని చారిత్రకాధారాలను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడొక స్తంభం మాత్రమే ఉంటుంది. 2.కామాక్షి సతీదేవి వీపుభాగం పడినట్టుగా చెప్పే చోటు కాంచీపురం. ఇక్కడ అమ్మవారు కామాక్షి దేవిగా కొలువై ఉంది. పాశాంకుశాలూ చెరకుగడ, భుజంపై చిలుకతో పద్మాసనస్థితయై కొలువుండే ఈ అమ్మవారిని పూజిస్తే సకల సిరిసంపదలూ కలుగుతాయని ప్రతీతి. స్థలపురాణం ప్రకారం... మహిషాసురుణ్ని సంహరించిన చాముండేశ్వరీదేవి ఆ పాపాన్ని తొలగించుకునేందుకు ఏంచేయాలని శివుణ్ని అడగ్గా నేటి కంచి ప్రాంతంలో అన్నపూర్ణగా వెలసి అన్నదానంతో ఆ పాపాన్ని తొలగించుకోమని చెప్పాడట. అలా ఆ దేవి కంచిలో తొలిసారి అడుగుపెట్టిన చోట అమ్మవారిని ఆదిపీఠ పరమేశ్వరిగా కొలుస్తారు భక్తులు. ఆ అమ్మవారు ఇసుకతో శివలింగాన్ని తయారుచేసి అర్చించి ఆ పుణ్యంతో కామాక్షిదేవిగా అవతరించి శివుణ్ని వివాహం చేసుకుందని ప్రతీతి. ఈ నేపథ్యంలో... ఆదిపీఠ పరమేశ్వరి ఆలయాన్ని ఆ ఆదిపరాశక్తి యోగపీఠంగానూ కామాక్షీదేవి ఆలయాన్ని భోగపీఠంగానూ భావిస్తారు భక్తులు. 3.శృంఖల అమ్మవారి ఉదర భాగం పడిన చోటు ప్రద్యుమ్నం. ఈ క్షేత్రం గుజరాత్‌లో ఉన్నదని కొందరూ కోల్‌కతకు దగ్గరలో ఉన్నదని మరికొందరూ అంటారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు సమీపాన ఉన్న సురేంద్రనగర్‌లో కొలువై ఉన్న 'చోటిల్లామాత'ను అక్కడివారు శృంఖలా(శృంగళా)దేవిగా భావిస్తారు. కానీ... పశ్చిమబెంగాల్‌లో ఉన్న 'పాండువా'నే అసలైన శక్తిక్షేత్రం అని అత్యధికులు విశ్వసిస్తారు. అయితే, పాండువా గ్రామంలో ఒకప్పుడు శృంఖలాదేవి ఆలయం ఉన్నదని చెప్పే ప్రదేశంలో ప్రస్తుతం ఒక మసీదు మినారు కనిపిస్తుంది. పురాతత్వశాస్త్రవేత్తల అధీనంలో ఉన్న ఆ ప్రాంగణంలోకి సామాన్యులకు ప్రవేశం నిషిద్ధం. ఏటా మాఘమాసంలో మాత్రం అక్కడ 'మేళతాళ' పేరుతో ఉత్సవం నిర్వహిస్తారు. ఆ వేడుకల్లో హిందూముస్లింలు కలిసే పాల్గొనడం విశేషం. 4.చాముండి హరుని రుద్రతాండవంలో అమ్మవారి కురులు వూడి ప్రస్తుత మైసూరు ప్రాంతంలోని చాముండి పర్వతాలపై పడ్డాయని స్థలపురాణం. ఈ ప్రాంత ప్రజలను హింసిస్తున్న మహిషాసురుడిని సంహరించడానికి సతి శక్తి చాముండేశ్వరిగా అవతరించిందని దేవీభాగవతం చెబుతోంది. ఈ ఆలయంలో అమ్మవారు స్వర్ణవిగ్రహ రూపంలో కొలువై భక్తుల పూజలందుకుంటోంది. 5.జోగులాంబ మనరాష్ట్రంలోని నాలుగు శక్తిపీఠాల్లో వెుదటిది ఈ క్షేత్రం. సతీదేవి ఖండితాంగాలలో పైవరుస దంతాలు/దవడ భాగం పడినట్టు చెప్పే చోటు. ఈ దేవి కొలువైన ఆలయాన్ని పద్నాలుగో శతాబ్దంలో ముస్లిం రాజులు కూల్చేశారు. అప్పట్లో అక్కడివారు అమ్మవారి విగ్రహాన్ని బాలబ్రహ్మేశ్వర ఆలయంలో ఉంచారట. 2004లో కొత్తగా గుడికట్టి జోగులాంబాదేవిని అక్కడ ప్రతిష్ఠించారు. ఈ ఆలయం చుట్టూ ఒక నీటిగుండం ఉంటుంది. జోగులాంబ ఉగ్రస్వరూపిణి కాబట్టి ఆ తల్లిని శాంతింపజేసేందుకే ఈ ఏర్పాటు అని చెబుతారు స్థానికులు. ఆలయంలోని గర్భగుడిలో ఆసీనముద్రలో కొలువై ఉంటుంది జోగులాంబ. ఆ తల్లి సమక్షంలో సప్తమాతృకలు, వీణాపాణి (సరస్వతీదేవి), వీరభద్రుల విగ్రహాలు ఉంటాయి. 6.భ్రమరాంబిక విష్ణుచక్రభిన్న అయిన సతి మెడ భాగం పడిన చోటు శ్రీశైల క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కూడా అయిన శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి. అరుణాసురుడనే రాక్షసుడు ఈ ప్రాంతంలో ప్రజలకూ మునులకూ కంటకుడుగా తయారయ్యాడట. రెండు, నాలుగు కాళ్ల జీవులతో మరణం లేకుండా వరం పొందిన అతణ్ని సంహరించేందుకు... ఇక్కడ కొలువైన సతి 'శక్తి' భ్రమర(తుమ్మెద) రూపంలో అవతరించిందట. అసురవధ అనంతరం భ్రమరాంబికగా ఈ క్షేత్రంలోనే మల్లికార్జునస్వామి గుడి వెనుక భాగంలో కొలువై ఉందని స్థలపురాణం. శంకరాచార్యులవారు ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని శ్రీచక్ర ప్రతిష్ఠాపన చేసి, భ్రమరాంబాష్టకం రచించారు. శ్రీశైలక్షేత్రంలోనే ఆయన 'సౌందర్య లహరి' కూడా రచించారని చెబుతారు. 7.మహాలక్ష్మి రజోగుణ సంపన్నురాలైన ఆదిపరాశక్తి 'అంబాబాయి'గా కొల్హాపూర్‌ క్షేత్రంలో కొలువై ఉందని ప్రతీతి. ఇక్కడ సతీదేవి నేత్రాలు పడ్డాయని చెబుతారు. కొల్హాపూర్‌ వాసులు ఈ అమ్మవారిని భవానీమాతగానూ కరవీరవాసినిగానూ కొలుస్తారు. కొల్హాపురీ మహాలక్ష్మి విగ్రహం ఒక ప్రశస్తమైన మణిశిల. అమ్మవారి తలపై ఆదిశేషుడు తన ఐదుపడగలతో ఛత్రం పడుతున్నట్టుగా ఉంటాడు. నల్లని ముఖంతో దివ్యాభరణాలతో వెలిగిపోయే ఈ దేవిని చూడటానికి రెండు కన్నులు సరిపోవంటారు భక్తులు. మహాప్రళయకాలంలిో కూడా లక్ష్మీదేవి ఈక్షేత్రాన్ని వీడదని పురాణప్రతీతి. అందుకే కొల్లాపూర్‌ను 'అవిముక్త క్షేత్రం'గా వ్యవహరిస్తారు. 8.ఏకవీరాదేవి మహారాష్ట్రలోని నాందేడ్‌ సమీపంలోని మాహోర్‌ క్షేత్రంలో వెలసిన తల్లి ఏకవీరికాదేవి. దత్తాత్రేయుని జన్మస్థలం కూడా ఇదేనని నమ్మిక. దక్షయజ్ఞంలో తనువు చాలించిన పార్వతీదేవి కుడిచేయి ఇక్కడ పడి ఏకవీరా దేవిగా భక్తుల పూజలందుకుంటోందని చెబుతారు. ఈ క్షేత్రంలో మూడు కొండలుంటాయి. అందులో ఒకదానిపై దత్తాత్రేయుని తల్లిదండ్రులైన అత్రిమహర్షి, అనసూయాదేవిని ప్రతిష్ఠించారు. మరొక కొండపై దత్తాత్రేయుడి ఆలయం ఉంటుంది. మరో కొండపై రేణుకాదేవి కొలువై ఉంది. అయితే, ఈ రేణుకాదేవినే ఏకవీరాదేవిగా పొరబడతారు బయటి నుంచి వచ్చే భక్తులు. అసలైన ఆలయం మాహోర్‌కు 15 కి.మీ. దూరంలో ఉంటుంది. ఆ గుడిలో పెద్దపెద్ద కన్నులతో గర్భగుడి పైకప్పును తాకేంత భారీగా ఉండే శిరోభాగం మాత్రమే ఉంటుంది. ఆ తల్లినే ఏకవీరికాదేవిగా కొలుస్తారు స్థానికులు. 9.మహాకాళి సప్త వోక్షదాయక పట్టణాల్లో ఒకటైన ఉజ్జయినీ నగరంలో సతీదేవి పై పెదవి పడిందని దేవీ భాగవతం చెబుతోంది. ఆ శక్తి మహంకాళిగా రూపుదాల్చి ఆ నగరాన్ని రక్షిస్తోందని ప్రతీతి. ఈ ఆలయంలో అమ్మవారు మహాలక్ష్మి, మహాసరస్వతుల నడుమ కొలువై ఉంది. పూర్వం ప్రజలను హింసిస్తున్న అంధకాసురుడనే రాక్షసుడితో మహాకాళేశ్వరుడు యుద్ధానికి తలపడ్డాడట. బ్రహ్మదేవుడి వరప్రభావంతో అంధకాసురుడి రక్తం ఎన్ని చుక్కలు నేల చిందితే అంతమంది రాక్షసులు పుట్టుకొస్తున్నారట. అప్పుడు ఆదిపరాశక్తి కాళికాదేవి అవతారం దాల్చి యుద్ధభూమిలో నిలిచి తన పొడవైన నాలుక చాచి అంధకాసురుడి రక్తం ఒక్క బొట్టు కూడా నేల చిందకుండా తాగేసిందని స్థలపురాణం. స్థానికులు ఈ దేవిని గ్రహకాళికగా కొలుస్తారు. కాళిదాసు నాలుకపై బీజాక్షరాలు రాసి మహాకవిని చేసింది ఈ తల్లేనని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఉజ్జయినీ మహానగరం ద్వాదశ జ్యోతిర్లింగక్షేత్రం కూడా. 10.పురుహూతిక పురాణ ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం పిఠాపురం. పుట్టింట పుట్టెడు అవమానం పొంది అగ్నికి ఆహుతైపోయిన దాక్షాయణి పీఠభాగం పడిన ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రానికి పిఠాపురం అనే పేరు వచ్చిందని పురాణ ప్రసిద్ధం. ఇక్కడ అమ్మవారు పురుహూతికా దేవిగా హూంకారిణిగా భక్తుల పూజలందుకుంటోంది. ఈ అమ్మవారి నాలుగు చేతుల్లో బీజపాత్ర, గొడ్డలి( కుడివైపు చేతుల్లో)... తామరపువ్వు, మధుపాత్ర (ఎడమ చేతుల్లో) ఉంటాయి. ఇది గయాక్షేత్రం కూడా. గయాసురుని పాదాలు ఉండే చోటు కాబట్టి దీన్ని పాదగయ అని కూడా అంటారు. గయాసురుని శరీర మధ్యభాగం ఒరిస్సాలోని జాజ్‌పూర్‌ ప్రాంతంలో ఉంటుంది. దాన్ని నాభిగయ అంటారు. శక్తిపీఠాల్లో ఒకటైన గిరిజాదేవి వెలసిన చోటు అదే. 11.గిరిజాదేవి గిరిజాదేవి అంటే ఒరిస్సాలోని జాజ్‌పూర్‌ జిల్లాలో కొలువైన తల్లి. ఇక్కడ అమ్మవారి నాభిభాగం పడిందని ప్రతీతి. గిరిజాదేవిని స్థానికులు బిరిజాదేవి, విరజాదేవి అనేపేర్లతో కొలుస్తారు. అమ్మవారి ముఖం మాత్రమే కనిపించేలా మిగతా విగ్రహాన్ని పూలదండలతోనూ బంగారు ఆభరణాలతోనూ అలంకరిస్తారు. సర్వాలంకృతయై మందస్మిత వదనంతో కనిపించే గిరిజాదేవిని ఎంతసేపు చూసినా తనివితీరదంటారు భక్తులు. ఇది నాభిగయా క్షేత్రం కూడా కాబట్టి ఇక్కడికొచ్చే భక్తుల్లో చాలామంది ఆలయప్రాంగణంలోని ఒక బావి దగ్గర పితృదేవతలకు పిండప్రదానం చేస్తారు. ఈ గుడికి సమీపంలోనే వైతరణీనది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది ఒడ్డునే యమధర్మరాజు ఆలయం ఉంటుంది. ఇంకొంచెం దూరంలో శ్వేతవరాహస్వామి ఆలయం కూడా ఉంటుంది. 12.మాణిక్యాంబ సతీదేవి ఖండితాంగాలలో ఎడమ చెంప పడినట్టు చెప్పే ప్రదేశం ద్రాక్షారామం. దక్షవాటికగా వ్యవహరించే ఈ గ్రామం పంచారామక్షేత్రం కూడా. సతీదేవి తండ్రి అయిన దక్షప్రజాపతి రాజ్యంలోని దక్షిణభాగమే ఈ ప్రాంతమనీ ఆ చక్రవర్తి కొన్నాళ్లు ఇక్కడ ఉన్నాడనీ స్థలపురాణం. ఒకసారి వ్యాసమహర్షి కాశీకి వెళ్తే శివుడు ఆయన్ని పరీక్షించదలచి తిండి దొరక్కుండా చేశాడట. అప్పుడు వ్యాసుడు కోపంతో కాశీ పట్టణాన్ని శపించబోగా అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమై ఆయనకూ ఆయన పరివారానికీ అన్నం పెట్టిందట. శివుడు మాత్రం వ్యాసుడిపై కోపంతో ఆయన్ను కాశీవిడిచిపెట్టి వెళ్లమన్నాడనీ అప్పుడు అన్నపూర్ణాదేవి వ్యాసుణ్ని ద్రాక్షారామంలో కొంతకాలం ఉండమని చెప్పిందనీ పురాణప్రతీతి. ఉత్తరాది నుంచి వింధ్యపర్వత శ్రేణులు దాటి దక్షిణాదికి వచ్చిన అగస్త్య మహర్షి కూడా కొన్నాళ్లు ఈ క్షేత్రంలో ఉన్నాడని విశ్వసిస్తారు భక్తులు. 13.కామాఖ్య అసోం రాజధాని గౌహతిలోని నీలాచల పర్వతశిఖరంపై సతీదేవి యోనిభాగం పడిందనీ అందుకే ఈ అమ్మవారిని కామాఖ్యాదేవిగా కొలుస్తారనీ స్థలపురాణం. అందుకు నిదర్శనమా అన్నట్టు ఈ గుడిలో విగ్రహం ఉండదు. గర్భగుడిలో యోనిభాగాన్ని తలపించే రాతి నిర్మాణం ఉంటుంది. సర్వకాల సర్వావస్థల్లోనూ ఆ భాగం నుంచి నీరు వూటలా స్రవిస్తూ ఉంటుంది. ఏటా వేసవికాలంలో మూడురోజులపాటు ఆ నీరు ఎర్రగా ఉంటుంది. ఈ సమయం దేవికి రుతుస్రావ సమయంగా పరిగణిస్తారు భక్తులు. ఈ ఆలయం కూచ్‌బేహార్‌ సంస్థానం పరిధిలోకి వస్తుంది. కానీ ఆ సంస్థానానికి చెందిన రాజవంశీకులు ఎవరూ తన ఆలయంలోకి రాకుండా అమ్మవారు శపించిందని ఒక కథనం. అందుకే ఆ వంశానికి సంబంధించిన వారెవరూ కామాఖ్యాదేవి గుడిలో అడుగుపెట్టరు. కనీసం అమ్మవారి ఆలయాన్ని తలెత్తి కూడా చూడరు. 14.మాధవేశ్వరి అమ్మవారి కుడిచేతి నాలుగువేళ్లు ప్రయాగ(అలహాబాద్‌) ప్రాంతంలో పడినట్టు చెబుతారు. సతీదేవి వేళ్లు పడిన ఈ ప్రదేశంలో కట్టిన ఈ ఆలయంలో విగ్రహం ఉండదు. నాలుగుదిక్కులా సమానంగా ఉన్న ఒక పీఠం మాత్రం ఉంటుంది. దానిపై ఒక వస్త్రాన్ని హుండీలాగా వేలాడదీసి కింద ఉయ్యాల కడతారు. భక్తులు అక్కడే దీపారాధనలు చేసి అమ్మవారిని కొలిచినట్టు తృప్తిచెందుతారు. తాము తెచ్చే కానుకలను వూయలలో ఉంచుతారు. స్థానికులు ఈ అమ్మవారిని అలోపీదేవిగా కొలుస్తారు. దేవగురువైన బృహస్పతి కృతయుగంలో బిందుమాధవీ దేవిని అమృతంతో అభిషేకించాడని ప్రతీతి. అందుకే ప్రయాగను అమృత తీర్థమనీ... సూర్యుడు అమ్మవారిని ఆరాధించిన క్షేత్రం కాబట్టి భాస్కరక్షేత్రమనీ వ్యవహరించడం కద్దు. 15.సరస్వతి పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని నేటి ముజఫరాబాద్‌కు ఇంచుమించు 150కి.మీ. దూరంలో ఒక శక్తిపీఠం ఉండేదని చెబుతారు. ఇక్కడ అమ్మవారి కుడిచేయి పడిందని చెబుతారు. ప్రస్తుతం అక్కడ ఒక శిథిల ఆలయం తప్ప మరేమీ లేదు. ఒకప్పుడు శంకరాచార్యులవారు ఈ అమ్మవారిని దర్శించి అర్చించారని శంకరవిజయకావ్యం ద్వారా తెలుస్తోంది. 16.వైష్ణవీదేవి అమ్మవారి నాలుక హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా ప్రాంతంలో పడిందని చెబుతారు. ఇక్కడ అమ్మవారు జ్వాలాముఖి. ఈ క్షేత్రంలో కూడా విగ్రహం ఉండదు. భూమిలోంచి వచ్చే సహజవాయువుల జ్వాలనే అమ్మవారి శక్తిగా భావిస్తారు భక్తులు. ఆ జ్వాలలు అవమానభారానికి గురైన సతీదేవి ఆగ్రహానికీ శక్తికీ సంకేతమని విశ్వసిస్తారు భక్తులు. మరికొందరు... 'జ్వాలాయాం వైష్ణవీదేవి' అంటే అది ఈ గుడి కాదనీ జమ్మూలోని వైష్ణోదేవి ఆలయమనీ చెబుతారు. 17.మంగళగౌరి సతీదేవి శరీరభాగాల్లో స్తనాలు పడినట్టుగా చెప్పే ప్రదేశం గయ. అమ్మవారు మంగళగౌరీదేవి. స్థలపురాణానికి తగ్గట్టుగానే వక్షోజాలను పోలిన నిర్మాణాన్ని మాంగళ్యగౌరిగా పూజిస్తారు భక్తులు. ఇక... పురాణాల ప్రకారం గయాసురుడి తలభాగం ఉండేచోటుగా భావించే ఈ క్షేత్రాన్ని శిరోగయగా కూడా వ్యవహరిస్తారు. ఇక్కడి తీర్థం ఫల్గుణీనది. ఆ నదిలో స్నానం చేసి, గయలో పితృదేవతలకు పిండప్రదానం చేసి నచ్చిన పదార్థాలను విడిచిపెట్టడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇది వైష్ణవ క్షేత్రం కూడా. మంగళగౌరీదేవిని విష్ణుమూర్తి చెల్లెలుగా పరిగణిస్తారు భక్తులు. 18.విశాలాక్షి సతీదేవి మణికర్ణిక(చెవి కుండలం) కాశీలోని విశ్వేశ్వరుడి ఆలయ సమీపంలో పడిందనీ అక్కడే అమ్మవారు విశాలాక్షిగా అవతరించిందనీ స్థలపురాణం. కాశీ విశాలాక్షి ఆలయంలో రెండు విగ్రహాలుంటాయి. ఒకటి పెద్దది, మరొకటి చిన్నది. వెనుకభాగంలో చిన్నగా కనిపించే విగ్రహమే అసలైనది. ఆ దేవిని ఆది విశాలాక్షిగా అర్చిస్తారు భక్తులు. శివుడి వైభవాన్ని కళ్లు పెద్దవి చేసి మరీ ఆశ్చర్యంగా చూసిన దేవి కాబట్టి విశాలాక్షి అని పేరు వచ్చిందని ప్రతీతి. ఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు గాని కూతురినీ, అల్లుడినీ పిలవలేదు, ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి (దాక్షాయణి) తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్ళాడింది. పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవాలేమిటి? అని సతీదేవి, శివుడు వారించినా వినకుండా, ప్రమధగణాలను వెంటబెట్టుకొని యాగానికివెళ్ళింది గాని, అక్కడ అవమానానికి గురయ్యింది. ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది. విషయం తెలుసుకున్న శివుడు వీరభద్రుణ్ని సృష్టించి దక్షయాగాన్ని ధ్వంసం చేశాడు. సతీదేవి పార్థివదేహాన్ని భుజాన వేసుకుని ప్రళయతాండవం చేశాడు. ఉగ్రశివుణ్ని శాంతింపజేసేందుకు చక్రప్రయోగం చేసి , సతీదేవి శరీరాన్ని ఖండించాడు విష్ణువు. ఆ శరీర భాగాలు పడిన ప్రాంతాలే అష్టాదశ శక్తి పీఠాలు' అని చెబుతోంది దేవీభాగవతం. కాని సతీ వియోగదుఃఖం తీరని శివుడు ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్ధనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి. ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణీ మాత భైరవుని(శివుని)తోడుగా దర్శనమిస్తుంది. #తెలుసుకుందాం #హిందూ దేవాలయాలు💐🎂 #హిందూ దేవుళ్ళు * దేవాలయాలు #hindu temples #హిందూ దేవలయల సమాచారంతెలుసుకోండి
14 likes
14 shares
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
4K views 2 months ago
❤️🩵*పంచరంగ క్షేత్రాల గురించి విన్నారా!🪭 🟠🟡రంగనాథ స్వామి ఆలయాలు🪭 💜💛జలం ఏ పాత్రలోకి ఒంపితే, ఆ రూపాన్ని పొందుతుంది. భగవంతుడు కూడా అంతే! భక్తులు ఏ రూపంలో ఆయనను కొలుచుకోవాలనుకుంటే.... ఆ రూపంలోకి ఇమిడిపోతాడు. అలా ఆదిశేషుని మీద శయనించే విష్ణుమూర్తిని, రంగనాథస్వామిగా కొల్చుకోవడం కద్దు. దక్షిణాదిన ఈ రంగనాథ స్వామి ఆలయాలు చాలానే కనిపిస్తాయి. వాటిలో పంచరంగ క్షేత్రాల గురించి చెప్పుకోవాల్సిందే. కావేరీ తీరాన వెలసిన ఈ పంచరంగ క్షేత్రాలు తమిళ, కన్నడ ప్రజలకు చాలా ప్రత్యేకం. ఆ పంచరంగ క్షేత్రాల వివరాలు ఇవిగో… 💦- 1-శ్రీరంగపట్నం💧 ఈ పేరు వినగానే మనకు టిప్పు సుల్తాన్‌ కథలే గుర్తుకువస్తాయి. టిప్పు రాజ్యానికి రాజధానిగా సాగిన ఈ పట్నానికి ఆ పేరే అందులోని రంగనాథుని ఆలయం మీదుగా వచ్చింది. ఇక్కడి శ్రీదేవి, భూదేవి సహిత రంగనాథుని ఆలయానికి వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉంది. పశ్చిమ గాంగేయుల కాలంలో నిర్మించిన ఈ ఆలయానికి టిప్పు సుల్తాన్‌ సహా కర్ణాటక ప్రాంతాన్ని ఏలిన రాజులంతా ఈ స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించినవారే! 💦-2- తిరుప్పునగర్‌💧 తమిళనాడులోని తిరుచిరాపల్లికి సమీపంలో ఉందీ గ్రామం. ఇందులోని స్వామి పేరు ‘అప్పకుడతాన్‌ పెరుమాళ్‌’. ఇక్కడ ఉభమన్యు అనే రాజుకి విష్ణుమూర్తి ఒక ముసలివాని రూపంలో దర్శనమిచ్చాడట. ఆయనకు ఎంత ఆహారాన్ని అందించినా ఆకలి తీరలేదట. చివరికి పరాశర మహర్షి సూచనతో భక్తితో అప్పాలని అందించినప్పుడే తృప్తి లభించిందట. అప్పటి నుంచి ఈ స్వామికి అప్పకుడతాన్ స్వామి అని పేరు. పంచరంగ క్షేత్రాలలోనే కాకుండా వైష్ణవుల 108 దివ్యదేశాలలో ఒకటిగా కూడా ఈ ఆలయాన్ని ఎంచుతారు. 💦-3-కుంబకోణం💧 ఒకప్పుడు హేమ రుషి అనే ఆయన సాక్షాత్తు లక్ష్మీదేవి తన కుమార్తెగా జన్మించాలని తపస్సుని ఆచరించాడట. దాంతో లక్ష్మీదేవి ఒక తటాకంలోని కలువల నుంచి ఉద్భవించింది. అలా అవతరించిన లక్ష్మీదేవిని కోమలవల్లి అన్న పేరుతో కొలుచుకున్నారు. లక్ష్మీదేవి చెంత ఆ విష్ణుమూర్తి కూడా ఉండాల్సిందే కదా! ఆయన కూడా భువికి అవతరించాడు. ఇలా అవతరించిన స్వామిని అరవముదన్ లేదా సారంగపాణి అని పిల్చుకుంటారు. 💦-4-మయిలదుతురై💧 చంద్రుని తపస్సుకి మెచ్చి ఆ విష్ణుమూర్తి అవతరించిన చోటు ఇది. పరాకల్‌ అనే ఆళ్వారుని భక్తికి మెచ్చి స్వామివారు ఇక్కడే స్థిరపడిపోయారట. అలా చూసుకున్నా ఈ ఆలయానికి వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉన్నట్లు తోస్తుంది. ఇక్కడి స్వామి పేరు ‘పరిమళ పెరుమాళ్‌’. వైష్ణవుల 108 దివ్యదేశాలలో ఒకటైన ఈ ఆలయానికి మరో విశిష్టత కూడా ఉంది. ఈ స్వామివారి అనుగ్రహంతోనే నాదస్వరం ఒక సంగీత వాయిద్యంగా రూపుదిద్దుకుందని చెబుతారు. 💦-5-శ్రీరంగం💧 పంచరంగ క్షేత్రాలలో శ్రీరంగాన్ని ఆద్యరంగం (చివరి క్షేత్రం)గా పిలుస్తారు. కానీ అన్నింటిలోకీ ప్రముఖమైనది ఈ ఆలయమే! విష్ణుమూర్తి చేతిలో ఉన్న శంఖురూపంలా తోచే ఒక చిన్న ద్వీపం మీద ఈ ఆలయం నిర్మితమైంది. ఇక్కడి మూలవిరాట్టుని సాక్షాత్తు విభీషణుడు ప్రతిష్టించినట్లు చెప్పుకొంటారు. విష్ణుభక్తిలో శ్రీరంగానికి ఉన్న ప్రత్యేకత ఎంత చెప్పుకున్నా తక్కువే! గోదాదేవి విష్ణుమూర్తిని వివాహం చేసుకున్నది ఇక్కడే! ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని నిర్మించడానికే 300 ఏళ్లకు పైగా సమయం పట్టిందని చెబుతారు. ప్రపంచంలోనే అతి ఎత్తైన గోపురంగా ప్రసిద్ధకెక్కిన ఈ ఆలయాన్ని దర్శించకుంటే సర్వశుభాలూ జరుగుతాయని నమ్మకం. 💦ఇవీ పంచరంగ క్షేత్రాల విశేషం. కొన్ని జాబితాలలో ఇందులోని కుంబకోణం బదులు వటనగరంలోని రంగనాథ పెరుమాళ్‌ ఆలయాన్ని పేర్కొంటూ ఉంటారు. 🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒 #తెలుసుకుందాం #హిందూ దేవాలయాలు💐🎂 #హిందూ దేవుళ్ళు * దేవాలయాలు #hindu temples #హిందూ దేవలయల సమాచారంతెలుసుకోండి
39 likes
37 shares
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
877 views 4 months ago
1. మహాలక్ష్మీ ఆలయం - ముంబై ముంబైలోని మహాలక్ష్మీ ఆలయం సంపద, శ్రేయస్సుకు అధిదేవత అయిన మహాలక్ష్మీ అమ్మవారి పురాతన సుప్రసిద్ధ దేవాలయం. ఇక్కడ మహాకాళి, మహాలక్ష్మీ, మహా సరస్వతి విగ్రహాలు ఉంటాయి. ఇది 1831వ సంవత్సరంలో నిర్మించనబడిని అతి పురాతన దేవాలయం. ముంబై నగరంలో అత్యంత ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణల్లో ఇదొకటి. ముఖ్యంగా నవరాత్రి, దీపావళి వంటి సమయాల్లో ఈ దేవాలయం చాలా సందడిగా ఉంటుంది. ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరడంతో పాటు సిరిసంపదలు, శ్రేయస్సు, బుద్ధి కుశలత, జ్ఞానం కలుగుతాయని భక్తుల నమ్మకం. 2. లక్ష్మీ నారాయణ టెంపుల్‌ - వెల్లూర్‌ (శ్రీపురం) వెల్లూర్‌ సమీపంలో ఉన్న శ్రీపురం స్వర్ణ దేవాలయం సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన బంగారు ఆలయం. దీనిని శ్రీనారాయణి పీఠం నిర్మించింది. ఇది లక్ష్మీదేవికి సంబంధించిన ఆలయం. దీనిని లక్ష్మీనారాయణి స్వర్ణ దేవాలయం అని కూడా అంటారు. ఈ ఆలయం శ్రీ యంత్రం ఆకారంలో ఉంటుంది. ఏడు ద్వారాలు కలిగి ఉండి వేల కిలోల (సుమారు 15 వేల) బంగారంతో నిర్మించబడి ఉంటుంది. ఇది ఆధ్యాత్మికతకు, గొప్ప శిల్ప కళకు నిదర్శనం. వెల్లూరు నుంచి సులభంగా ఇక్కడకు చేరుకోవచ్చు. జీవితంలో తప్పక చూడాల్సిన దేవాలయాల్లో ఇదీ ఒకటి. 3. నిమిషాంబ టెంపుల్‌ - శ్రీరంగపట్నం (కర్ణాటక) కర్ణాటక రాష్ట్రంలోని శ్రీరంగపట్నానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంజాం అనే చిన్న పల్లెటూరిలో పార్వతీ దేవి అవతారమైన నిమిషాంబ దేవి ఆలయం వెలసి ఉంది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో తాగునీరు, సాగునీరుకి ముఖ్య ఆధారం కావేరి నది. సాధారణంగా జీవుల దాహార్తిని తీర్చే కావేరి నది భక్తుల ఆధ్యాత్మిక ఆర్తిని కూడా తీరుస్తుంది. అందుకే శ్రీవైష్ణవులకు ఆరాధ్యమైన శ్రీరంగం క్షేత్రం మరియు శైవులకు ఇష్టమైన తంజావూర్ ఈ కావేరి నదీ తీరంలోనే ఉన్నాయి. ఇక ఈ పవిత్ర ప్రదేశంలోనే వెలసిన పార్వతీ దేవి అవతారమైన నిమిషాంబ దేవి ఆలయం కూడా ఎంతో ప్రసిద్ధి. ఈ ఆలయాన్ని 400 ఏళ్ల క్రితం కృష్ణరాజ ఒడియార్‌ అనే రాజు నిర్మించినట్లు సమాచారం. ఇక్కడ అమ్మవారి విగ్రహంతో పాటు శ్రీచక్రాన్ని కూడా ఆరాధిస్తారు. అలాగే పార్వతీ దేవి అమ్మవారి ఆలయం పక్కనే శివుడికి సంబంధించిన ఉపాలయం కూడా ఉంటుంది. ఇక్కడి పరమేశ్వరుడిని మౌక్తికేశ్వరునిగా పిలుస్తారు. 4. వైష్ణో దేవి ఆలయం - జమ్మూ హిందువులకు సంబంధించి అత్యంత పవిత్రమైన వైష్ణోదేవి ఆలయం జమ్మూ కశ్మీర్‌లోని త్రికూట కొండలపై ఉంటుంది. దీనిని శ్రీమాతా వైష్ణోదేవి మందిర బోర్డు నిర్వహిస్తోంది. ఇక్కడ అమ్మవారు మహాలక్ష్మి, మహా సరస్వతి, మహాకాళీ త్రిమూర్తుల సమ్మేళనంగా ఉంటుంది. వైష్ణో దేవి మహాలక్ష్మి యొక్క అవివాహిత రూపం. ఆమెలో మహాసరస్వతి, మహాకాళి అంశాలు కూడా ఉంటాయి. హిందూ సంప్రదాయంలో ఇదొక ముఖ్యమైన శక్తిపీఠం. భక్తులకు అత్యంత పవిత్రమైన యాత్రా స్థలం. 5. గోల్డెన్‌ టెంపుల్‌ - అమృత్‌సర్‌ అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం (Golden Temple Amritsar) సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రం. ఈ ఆలయం గోపురం స్వచ్ఛమైన బంగారంతో పూత పూయబడింది. ఇది అమృత్‌ సరోవర్‌ అనే పవిత్ర కొలను చుట్టూ నిర్మించబడి ఉంటుంది. ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక వంటశాల (లంగర్‌) కూడా ఉంటుంది. ఇది సిక్కుల సమానత్వ, సేవాభావాలకు ప్రతీకగా చెప్పొచ్చు. ఈ ఆలయాన్ని దర్శిస్తే సిక్కు సంస్కృతి, సంప్రదాయాలను దగ్గరగా చూసే అవకాశం కలుగుతుంది. ఇది మానసిక ప్రశాంతతకు ప్రతిరూపం. 6. శ్రీ బాలాజీ టెంపుల్‌ (తిరుమల) శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం (Balaji Temple Tirumala) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తిరుమల శేషాచల కొండలపై వెలసి ఉంది. ఈ పవిత్ర హిందూ దేవాలయాన్ని కలియుగ వైకుంఠం అని కూడా పిలుస్తారు. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల కోర్కెలు తీర్చే కలియుగ ప్రత్యక్ష దైవంగా పూజలందుకుంటున్నారు. దీనిని తిరుపతి బాలాజీ టెంపుల్‌ అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ప్రతి రోజూ వేల సంఖ్యలో భక్తులు ఇక్కడకు వస్తుంటారు. 7. మహాకాళేశ్వర జ్యోతిర్లింగం - ఉజ్జయిని ఉజ్జయినిలో వెలసిన ప్రసిద్ధ కృతయుగం నాటి శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. హిందూ పురాణాల ప్రకారం ఉజ్జయిని నగరానికి అవంతిక అని పేరు. సప్త మోక్ష ధామాల్లో ఒకటిగా విరాజిల్లుతోన్న ఈ ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఎన్నో రహస్యాలకు నెలవుగా ఉంది. మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలోని ఉజ్జయిని వద్ద షిప్రా నది ఒడ్డున వెలసిన ఈ మహాకాళేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రంలో వెలసియున్న శివుడిని మహాకాళుడిగా వ్యవహరిస్తారు. ఈ మహాకాళుడుని కాలానికి మరియు మరణానికి దేవుడిగా భావిస్తారు. ఈ మహాకాళేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రంలో వెలసిన లింగం స్వయంభువు లింగం. ఈ మహా క్షేత్రంలో వెలిసిన శివలింగం ఇతర లింగాల వలె కాకుండా మంత్ర శక్తులతో ఏర్పడిన శివలింగంగా భావిస్తారు. అందుకే ఇక్కడి మహాకాళేశ్వరుడి దర్శనం భయం మరియు పాపాల నుండి విముక్తిని కలిగిస్తుందని చెబుతారు. 8. సిద్ధి వినాయక టెంపుల్‌ ముంబై సిద్ధిని బుద్ధిని ప్రసాదించే వినాయకుడు ఆగ్రహ ఆవేశాలతో అసుర సంహారం చేసిన ఘట్టాలు కూడా మన పురాణాల్లో ఉన్నాయి. దేవతలకు సహాయం అందించడమే కాదు సాక్షాత్తు శ్రీమహావిష్ణువుకి సైతం కార్యసిద్ధిని కలిగించడం అనేది గణపతి యొక్క గొప్పతనం. సమస్త దేవతలచే పూజలు అందుకునే శ్రీమన్నారాయణుడే గణపతికి ఆలయాన్ని నిర్మించాడంటే వినాయకుడి విశిష్టతను అర్థం చేసుకోవచ్చు. అంతటి ఖ్యాతి కలిగిన గణపతికి దేశవ్యాప్తంగా అనేక దేవాలయాలు ఉన్నాయి. అయితే.. ముంబైలోని ప్రభాదేవిలో ఉండే శ్రీసిద్ధి వినాయక గణపతి ఆలయం ప్రత్యేకమైనది. ఈ గణపతి క్షేత్రాన్ని దర్శిస్తే మనోభీష్టాలు నెరవేరుతాయని, పనుల్లో విఘ్నాలు తొలగి విజయాలు చేకూరతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ ఆలయాన్ని దర్శించుకుంటుంటారు. ముఖ్యంగా గణేశ్‌ నవరాత్రుల వేళ ఈ ఆలయం బహు సందడిగా ఉంటుంది. 9. కాశీ విశ్వనాథ్‌ టెంపుల్‌ వారణాసి ఇది వారణాసిలో ఉన్న ప్రసిద్ధ హిందూ దేవాలయం. ఇది శివుడికి అంకితం చేయబడిన ఆలయం. ఇది పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఈ ఆలయం పవిత్రమైన గంగా నది ఒడ్డున ఉంటుంది. ఈ కాశి వారణాసి నగరం అతి పురాతన నగరాల్లో ఒకటి. ఈ కాశీ విశ్వనాథ ఆలయాన్ని విశ్వేశ్వర్ లేదా విశ్వనాథ్‌ అని కూడా అంటారు. తెలిసీ తెలియక మనం చేసిన పాపాలకు సంబంధించి ప్రాయశ్చిత్తం పొంది ఆ పాపాలను పోగొట్టుకోవడానికి కాశీ విశ్వనాథుని వద్ద ఉన్న గంగా నది పవిత్ర జలాల్లో స్నానం చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఆదిశంకరాచార్యులు, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద వంటి అనేక మంది గొప్ప వ్యక్తులు ఈ కాశీ విశ్వనాథ్‌ ఆలయాన్ని సందర్శించారని చెబుతారు. 10. సూర్య దేవాలయం కోణార్క్‌ ఒడిశాలోని కోణార్క్‌ సూర్య దేవాలయం 13వ శతాబ్దంలో నిర్మించబడింది. ఇది సూర్య భగవానుడికి అంకితం చేయబడిన ఆలయం. ఈ దేవాలయం పెద్ద రథం ఆకారంలో 24 చక్రాలు, 7 గుర్రాలతో రాతితో చెక్కబడిన అద్భుతమైన వాస్తుశిల్పం కలిగి ఉంటుంది. సూర్య దేవాలయంతో పాటు అక్కడ నుంచి 19 కిలోమీటర్ల దూరంలో ఉండే అస్తరాంగ్ బీచ్‌ కూడా అద్భుతమైన సందర్శనీయమైన ప్రాంతం. ఈ బీచ్‌లో సూర్యాస్తమయం చూడడం అనేది అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. అలాగే కోణార్క్ మ్యూజియాన్ని కూడా సందర్శించవచ్చు. ఇక్కడ అనేక శిల్పాలు, ఇతర నాగరికతల అవశేషాలను సైతం చూడవచ్చు. #హిందూ దేవాలయాలు💐🎂 #హిందూ దేవుళ్ళు * దేవాలయాలు #hindu temples #హిందూ దేవలయల సమాచారంతెలుసుకోండి #🇮🇳 Hindu Temples & Hinduism 🇮🇳
12 likes
11 shares