#సంపద సృష్టి ⁉️ #🏛️పొలిటికల్ అప్డేట్స్
*బాబు సృష్టించిన అప్పుల సంపద‼️*
JUNE 9, 2026🎯
వైఎస్ జగన్ పాలనలో సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో సంక్షేమ పథకాల లబ్దిదారులంతా మళ్లీ వైసీపీకి పట్టం కడతారని చంద్రబాబు భయపడ్డారు. వాళ్లందరినీ తన వైపు తిప్పుకునేందుకు చంద్రబాబు వ్యూహం రచించారు. వైఎస్ జగన్ కంటే రెట్టింపు సంక్షేమ లబ్ధి కలిగిస్తానని నమ్మబలికారు.
వాటన్నింటికి నిధులు ఎక్కడి నుంచి తెస్తారన్న ప్రశ్నకు చంద్రబాబు తనదైన తెలివితో సమాధానం ఇచ్చారు. సంపద సష్టించి, సంక్షేమ పథకాలను అమలు చేస్తానని చంద్రబాబు
హామీ ఇచ్చారు. ఆశ చెడ్డది. ప్రజలు నమ్మారు. బాబు నాయకత్వంలోని కూటమికి ప్రజలు పట్టం కట్టారు.
కూటమి ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లకు మూడు రోజుల సమయం వుంది. ఈ రెండేళ్లలో వెనక్కి తిరిగి చూసుకుంటే బాబు సృష్టించిన సంపద దేవుడెరుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మోయలేనంగా అప్పుల భారం. దీనంతటికి చంద్రబాబు ప్రభుత్వమే కారణం.
జూన్ నెల మొదటి మంగళవారం ఆర్బీఐ సెక్యూరిటీ వేలం ద్వారా రూ.4,400 కోట్ల అప్పును చంద్రబాబు సర్కార్ చేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆప్పులు ఈ రెండేళ్లలో రూ.3 లక్షల 44 వేల 494 కోట్లకు చేరాయి. వీటిల్లో బడ్జెటరీ అప్పులు
రూ.1.85 లక్షల కోట్లు, బడ్జెట్ బయట రూ.1,15,504 కోట్లు. అమరావతి పేరుతో రూ.47,387 కోట్ల అప్పులు.
కేవలం రెండేళ్లలోనే చంద్రబాబు సర్కార్ రూ.3.45 లక్షల కోట్లు అప్పులు చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఇదే రీతిలో పాలన సాగితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ ఏమవుతుందో అర్థంకాని పరిస్థితి. ఈ అప్పులకు ప్రతినెలా వడ్డీలకే వేల కోట్లు చెల్లించాల్సి వుంటుంది. గతంలో ఎవరూ ఈ స్థాయిలో అప్పులు చేసిన పాపాన పోలేదు.
చంద్రబాబు సీనియర్ పరిపాలన, రాజకీయ అనుభవం కలిగిన నాయకుడని పట్టం కడితే, ఇయనేమో సంపదకు బదులు అప్పులు సృష్టించారు. పోనీ సంక్షేమ పథకాలన్నింటినీ అమలు చేశారా? అంటే అదీ లేదు. కొన్నింటిని అసలు అమలు చేయలేదు. ఉదాహరణకు ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకేఉ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పింఛన్ తదితర పథకాలు.
మరోవైపు అమలు చేసినవన్నీ అరకొరే అనే విమర్శ. మహిళలకు ఉచిత బస్సు, తల్లికి వందనం, దీపం, అన్నదాత సుఖీభవ పథకాల అమలుపై విమర్శలున్నాయి. ఆర్టీసీలో 16 కేటగిరీల బస్సులుంటే, ఐదు కేటగిరీలకే ఉచిత ప్రయాణం అనే షరతు విధించారు. కూటమి ప్రభుత్వంలో రెండేళ్లలో మహిళలకు ఆరు సిలిండర్లను ఇవ్వాల్సి వుంది. అయితే మొదటి ఏడాది ఒక సిలిండర్తోనే సరిపెట్టారు.
ఇందులో కూడా భారీ కోతలు విధించడం గమనార్హం. రైతులకు మొదటి ఏడాది ఎగనామం పెట్టారు. రెండో ఏడాది ఏడు లక్షల మంది రైతులకు కోత విధించారు. తల్లికి వందనం పథకాన్ని మొదటి ఏడాది ఎగ్గొట్టారు. రెండో ఏడాది 20 లక్షల మందికి పైగా కోత విధించినట్టు చెబుతున్నారు. అలాగే కొంత మంది లబ్దిదారులకు రూ.9 వేలు, రూ. 10 వేలు చొప్పున అందించారు.
వైసీపీ హయాంలో ఇష్టానుసారం అప్పులు చేస్తున్నారని, రాష్ట్రం పాకిస్థాన్, సోమాలియా, శ్రీలంక దేశాల మాదిరిగా దివాలా తీస్తుందని టీడీపీ నేతలు గగ్గోలు పెట్టారు. ఇప్పుడు వాళ్ల అధికారంలో ఆకాశమే హద్దుగా అప్పులు చేయడం విమర్శలకు దారి తీస్తోంది. చివరికి అప్పులన్నీ రాష్ట్రాన్ని ఏ తీరానికి చేర్చుతాయో అర్థం కాని పరిస్థితి.
చంద్రబాబు అనుభవం, పరిపాలన దక్షత ఏమయ్యాయో అంతుచిక్కడం లేదు. అధికారానికి కొత్త అయిన జగన్ హయాంలో ఐదేళ్లలో చేసిన అప్పుల్ని, కేవలం రెండేళ్లలో చంద్రబాబు చేయడం ఏంటనే ప్రశ్నకు సమాధానం లేదు. అప్పు చేసి పప్పు కూడు ఎంత కాలమని పౌర సమాజం నిలదీస్తోంది. మరోవైపు ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. వాళ్లంతా రోడ్డెక్కడానికి సిద్ధపడుతున్నారు.
మరోవైపు పిల్లలే సంపద అని చంద్రబాబు కొత్త నినాదం ఎత్తుకున్నారు. అసలే బతుకు భారమవుతున్న నేపథ్యంలో ఎక్కువ మంది పిలల్ని కనాలని చంద్రబాబు చేస్తున్న ప్రచారం
నవ్వు తెప్పిస్తోంది. అంతిమంగా సంపద సృష్టి అంటే అప్పులే అని ప్రజలకు అర్థం కావడానికి రెండేళ్లు పట్టింది. తమ భవిష్యత్ ఏంటనే ప్రశ్న, పౌర సమాజానికి నిద్రలేని రాత్రుల్ని మిగుల్చుతోంది. ఇదీ చంద్రబాబు రెండేళ్లలో సాధించిన ఘనత అని చెప్పొచ్చు.