sree lalitha tripura sundari devi darshanam

4 Posts • 2K views
కదంబమంజరీక్లుప్త కర్ణపూరమనోహరా - కదంబ పుష్పగుచ్ఛాలను చెవి కమ్మలుగా ధరించి అందంగా ఉన్నది. తాటకాయుగళీభూత తపనోడుపమండలా - సూర్యచంద్రులను తాటంకములుగా (చెవి రింగులు) ధరించినది. పద్మరాగశిలాదర్శ పరిభ్రమణ శోభితా - పద్మరాగమణుల అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసి శోభిల్లేది. విద్రుమలతాజంఘా - పగడపు తీగ వంటి అందమైన పిక్కలు కలది. విధుబింబ రదచ్ఛదా - చంద్రబింబం వంటి అందమైన పెదవులు కలది. శుద్ధవిద్యాంకురాకార ద్విజపంతిద్వయోజ్జ్వలా - స్వచ్ఛమైన జ్ఞానాంకురం వంటి తెల్లని పళ్ళు కలది. కర్పూరవీటికామోద సమాకర్షద్దిగంతరా - కర్పూరం కలిపిన తాంబూల వాసనతో దిక్కులను ఆకర్షించేది. నిజసల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్ఛపీ - తన మాటల మాధుర్యంతో సరస్వతీ దేవి వీణను కూడా మించినది. మందస్మిత ప్రభాపూర మజ్జత్కమేశమానసా - చిరునవ్వుల కాంతితో కామేశ్వరుని మనస్సును ముంచెత్తేది. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీవిరాజితా - సాటిలేని అందమైన గడ్డం కలది. కామేశబద్ధ మాంగల్య సూత్ర శోభిత కంధరా - కామేశ్వరుడు కట్టిన మంగళసూత్రంతో ప్రకాశించే మెడ కలది. కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితా - బంగారు బాహుపురులు, భుజకీర్తులు ధరించినది. రత్నగ్రైవేయ చింతాక లోలముక్తా ఫలాన్వితా - రత్నాల హారాలు, ముత్యాల సరులు ధరించినది. కామేశ్వర ప్రేమరత్న మణిప్రతిపణస్తనీ - కామేశ్వరుని ప్రేమకు పాత్రమైన వక్షోజాలు కలది. నాభ్యాలవాల రోమాలతా ఫలకుచద్వయీ - నాభి నుండి బయలుదేరిన రోమరాజికి ఫలాల వంటి వక్షోజాలు కలది. లక్ష్యరోమలతాధారతా సమున్నేయ మధ్యమా - సన్నని రోమరాజి రేఖ గల నడుము కలది. స్తనభార దళన్మధ్య పట్టబంధ వళిత్రయా - స్తనాల బరువుకు వంగిన నడుముపై మూడు రేఖలు కలది. అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్కటీతటీ - ఎర్రని పట్టు వస్త్రంతో ప్రకాశించే నడుము భాగం కలది.🙏🏻🌺🔱 #తెలుసుకుందాం #🙏🏻sri lalitha devi #లలితా దేవి చైతన్యము - Lalitha Devi Chatanyam #lalitha thripurasundari devi #Lalitha sahasra namam
22 likes
15 shares
🌺 అద్భుతాల మిళితం.. లలిత సహస్రనామ స్తోత్రం.. 6 🌺 🌺 మూలాధారం నుండి సహస్రారం వరకు... కుండలినీ శక్తి దివ్య ప్రయాణం 🌺 ...వేణి కొలిపాక పంచదశాక్షరీ మంత్రమయమైన అమ్మవారిని దర్శింపజేసిన వసిన్యాది దేవతలు, మన శరీర చక్రాలలో ఆ పరాశక్తి ఉనికిని, కుండలినీ శక్తి యొక్క దివ్య ప్రయాణాన్ని 38, 39, 40వ శ్లోకాల ద్వారా మనకు తెలియజేస్తున్నారు. 38, 39 శ్లోకాల భావాన్ని జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు చదివి అర్థం చేసుకోవాల్సిందిగా మనవి. ━━━━━━━━━━━━━━━ 🌺 38వ శ్లోకం 🌺 మూలాధారైక నిలయా, బ్రహ్మగ్రంథి విభేదినీ । మణిపూరాంత రుదితా, విష్ణుగ్రంథి విభేదినీ ॥ 38 ॥ ఈ శ్లోకంలో నాలుగు నామాలు ఉన్నాయి. ప్రతి నామం ఒక మహత్తర యోగ రహస్యాన్ని మనకు తెలియజేస్తుంది. ━━━━━━━━━━━━━━━ 🌺 మూలాధారంలో అమ్మ 🌺 వెన్నుముక క్రింద మన ఆసన స్థానంలో ఉన్నదే మూలాధార చక్రం. షట్చక్రాలకు ఇది మూలాధారమై, పృథ్వీ తత్వాన్ని కలిగి, కుండలినీ శక్తి సౌధానికి పునాది లాగా ఉంది. ఇదే అమ్మవారికి ముఖ్య నివాసము. మనలోని శక్తి నిశ్శబ్దంగా, మూడున్నర చుట్లు చుట్టుకుని, సర్పాకారంలో ఇక్కడ కుండలినీ రూపంలో నిద్రిస్తూ ఉంటుంది. దీనిని యోగ సాధన ద్వారా మేలుకొలపాలి. అది గురుముఖతః జరగవలసిన సాధన. అయితే "మూలాధారైక నిలయా" అనే ఈ నామమును నిరంతరం జపం చేసి, ప్రతి ఒక్కరికి సాధించుకునే వీలును ప్రసాదించారు వసిన్యాది దేవతలు. ━━━━━━━━━━━━━━━ 🌺 బ్రహ్మ గ్రంథి విభేదినీ 🌺 మానవ శరీరంలో బ్రహ్మ, విష్ణు, రుద్ర అనే మూడు గ్రంథులు ఉంటాయి. కుండలినీ శక్తి సహస్రార చక్రమును చేరుకోవటానికి ఈ ఆరు చక్రాల గుండా చేసే ప్రయాణంలో ప్రతి రెండు చక్రాలకు ఒక గ్రంథి, అనగా ముడి అంటే బంధము ఉంటుంది. దానిని భేదించుకుని ముందుకు సాగాలి శక్తి పయనం. ముందుగా మూలాధార చక్రము దాటి స్వాధిష్ఠాన చక్రము పైన ఉన్న బ్రహ్మ గ్రంథిని చేరుతుంది కుండలినీ శక్తి. ఈ స్థూల శరీరానికి ఉండే భయం, కోరికలు, ఆందోళనలు మిక్కుటంగా కలిగి మాయతో బంధింపబడి ఉంటుంది. అదే బ్రహ్మ గ్రంథి. ఎప్పుడైతే ఈ ముడిని అమ్మవారు ఛేదించుతుందో, అప్పుడు మాయ వీడి అజ్ఞానము తొలగి, "నేను ఈ శరీరం కాదు" అనే జ్ఞానం ఏర్పడుతుంది. ━━━━━━━━━━━━━━━ 🌺 మణిపూరాంత రుదితా 🌺 మన ఆరు చక్రాలలో మూడవది మణిపూర చక్రం. శక్తి మొదటి రెండు చక్రాలను దాటుకొని ఎగసి మణిపూర చక్ర మధ్యభాగంలో అగ్ని రూపిణిగా ఉదయిస్తుంది. ఈ చక్రము సరిగ్గా మన నాభి స్థానంలో ఉంటుంది. ━━━━━━━━━━━━━━━ 🌺 విష్ణుగ్రంథి విభేదినీ 🌺 మణిపూర చక్రము దాటి అనాహత చక్రము పైనున్న విష్ణుగ్రంథిని చేరుకుంటుంది కుండలినీ శక్తి స్వరూపిణి అయిన లలితా త్రిపురసుందరి. ఈ ముడి మణిపూర, అనాహత చక్రాలను చైతన్యవంతం కాకుండా బంధించి ఉంచుతుంది. మన మనసులోని భావోద్వేగాలు, బంధాలు, అహంకారాలు, ఆలోచనలే విష్ణు గ్రంథి. ఈ విష్ణుగ్రంథి ఎప్పుడైతే విభేదన జరుగుతుందో, ఆ మనిషిలో క్రోధం, భావోద్వేగాలు, అహంకారం, ఆవేశాలు మొదలైన భవబంధాలు తొలగిపోయి, ప్రేమ, భక్తి, కష్టసుఖాల యందు సమత్వము మొదలైన సత్వగుణాలను పొంది, గాఢమైన ప్రశాంతతను అనుభవిస్తాడు. 🌺 ఆజ్ఞా చక్రం నుండి సహస్రారం వరకు... పరమానందానికి దారి 🌺 --- 39వ శ్లోకం ఆజ్ఞా చక్రాంతరాళస్థా, రుద్రగ్రంథి విభేదినీ । సహస్రారాంబుజా రూఢా, సుధాసారాభివర్షిణీ ॥ 39॥ ఈ శ్లోకంలో కూడా నాలుగు నామాలను పొందుపరిచారు వసిన్యాది దేవతలు. ఈ నాలుగు నామాలు సాధకుని ఆధ్యాత్మిక ప్రయాణంలో అంతిమ దశను అత్యంత అద్భుతంగా వివరిస్తాయి. --- 🌺 ఆజ్ఞా చక్రాంతరాళస్థా ఆజ్ఞా చక్రము మన రెండు కనుబొమ్మల మధ్య భాగంలో ఉంటుంది. వెన్నుపూసను ఆధారంగా చేసుకొని ఉన్న ఆరు చక్రాలలో ఇది ఆరవది. దీనిని జ్ఞాన ద్వారము, భ్రూమధ్య స్థానము, శక్తి కేంద్రము అని చెబుతూ ఉంటారు. మన ఆలోచనలు, నిర్ణయాలు, సంకల్పాలను నియంత్రించే విచక్షణ శక్తిని కలిగి ఉంటుంది. ఆజ్ఞా చక్రంలో మధ్య భాగంలో కొలువై ఉంటుంది అమ్మవారు. ఇక్కడ భాసిల్లుతున్న అమ్మను ధ్యానం చేయడం ద్వారా అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందవచ్చు. --- 🌺 రుద్రగ్రంథి విభేదినీ విశుద్ధ చక్రము దాటగా వచ్చే ఆజ్ఞా చక్రము పై భాగమున ఈ రుద్ర గ్రంథి ఉంటుంది. దీనిచే బంధించబడి ఉన్నప్పుడు భయాందోళనలు, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, మానసిక సమస్యలు, అయోమయ పరిస్థితులు కలుగుతాయి. అమ్మవారు శక్తి స్వరూపిణిగా విశుద్ధ చక్రం దాటి ఆజ్ఞా చక్రం చేరుకొని, ఆ పైనున్న ఈ రుద్రగ్రంథిని భేదించడం వలన 'నేను, నాది' అనే అహంకారం తొలగిపోయి, మానసిక ప్రశాంతత కలిగి, జ్ఞానం వస్తుంది. ఇది సాధకుడికి అత్యంత కష్టమైన అంతిమ దశ. ఇది సాధించాలంటే ఎంతో ఏకాగ్రతతో, అంకితభావంతో సాధన చేయాలి. ఈ గ్రంథి భేదన జరిగితే పూర్వజన్మ కర్మబంధాలు కూడా దగ్ధమై, 'నేను శరీరం కాదు... శుద్ధ చైతన్య స్వరూపుడిని' అనే జ్ఞానం కలుగుతుంది. --- 🌺 సహస్రారాంబుజా రూఢా సహస్రార చక్రము అంటే బ్రహ్మరంధ్రం కింద ఉండేదే ఈ చక్రము. ఇక్కడ వెయ్యి దళముల పద్మమును అధిష్ఠించి ఉన్నది లలితా త్రిపురసుందరి. మూలాధారము నుంచి సహస్రారం చేరుకోవడానికి అమ్మ, ఆరు చక్రాలను, మూడు గ్రంథులనే అడ్డు ముడులను, సాధకుడి సాధన ఫలితంగా విప్పుకుంటూ, సహస్రార చక్రము చేరుకొని, అక్కడ వెయ్యి దళాల పద్మములో శివునితో ఆసీనమవుతుంది. అనంత నక్షత్ర కాంతులతో శివశక్తుల దర్శనం జరుగుతుంది. అదే బ్రహ్మానంద స్థితి. సాధకునికి అంతకుమించిన ఆనందామృతం మరొకటి ఉంటుందా? --- 🌺 సుధాసారాభివర్షిణీ కుండలినీ శక్తి, ఆరు చక్రాలను, మూడు గ్రంథులను దాటుకుంటూ సహస్రార చక్రము చేరుకుని అక్కడ శివునితో కూడగా, అమృత వర్షాన్ని కురిపిస్తుంది. అది అమృత సముద్రం — అందులో మణిద్వీపం — దానియందు చింతామణి గృహం — అందు కామేశ్వరుని వామాంకముపై అమ్మ ఆసీనమై కురిపిస్తున్న అమృత వర్షానికి, తన ఆరు చక్రాలు, డెబ్బై రెండు వేల నాడులు తడిసి ముద్దవ్వడం సాధకుడు అనుభవపూర్వకంగా తెలుసుకొంటాడు. ఇప్పుడు ఆ సాధకునికి ఎటువంటి భవబంధాలు అంటవు. మనసు ప్రేమతో నిండి నిర్మలంగా ఉంటుంది. ✨ మూలాధారంలో ప్రారంభమైన కుండలినీ యాత్ర... సహస్రారంలో శివశక్తుల ఐక్యంతో పరిపూర్ణమవుతుంది. 🌺 అక్కడ ద్వైతం ఉండదు... భయం ఉండదు... బంధం ఉండదు... మిగిలేది పరమానందమే. 🙏 ఆ పరమానంద స్వరూపిణి శ్రీలలితా పరమేశ్వరి కటాక్షం సర్వజనులపై ప్రసరించాలని మనసారా ప్రార్థిద్దాం...🙏 #☘️🛑🙏sree lalitha tripura sundari devi darshanam 🛑☘️🙏 #lalitha tripura sundari #sree lalitha tripura sundari devi darshanam #లలితా దేవి చైతన్యము - Lalitha Devi Chatanyam #🙏🏻sri lalitha devi
100 likes
48 shares
🌺 అద్భుతాల మిళితం.. లలిత సహస్రనామ స్తోత్రం.. 3 🌺 ✍️ ...వేణి కొలిపాక ప్రకృతి లోని సౌందర్యం అంతా అమ్మవారి ప్రతిరూపమే !! మరి ఒక రూపాన్ని దాల్చి చిదగ్నికుండం నుంచి ఆవిర్భవించిన అమ్మవారి, పోలికలెంచలేని అసమాన అద్భుత సౌందర్యం ను వసిన్యాది వాగ్దేవతలు ఎలా వర్ణించారో ఈ భాగంలో తెలుసుకుందాం!! ఈ స్తోత్ర రచన ఆసాంతం, వాక్కులకు తల్లులయిన వసిన్యాది దేవతల కవితా పటిమ అడుగడుగునా ప్రదర్శితమవుతు ఉంటుంది. నాలుగవ శ్లోకంలో మొదలై 20వ శ్లోకం దాకా, 36 నామాలలో సాగుతుంది అమ్మవారి అద్భుత సౌందర్య వర్ణన. 👑 కిరీటం, కురులు: పద్మరాగ మణులు పొదిగిన కిరీటం కింద ఉన్న అమ్మవారి నల్లని కురులు చంపక,అశోక,పున్నాగ మొదలైన రకరకాల పుష్పాలతో అలంకరించబడి ఉన్నాయి. 🌙 నుదురు, బొట్టు: అమ్మవారి అందమైన నుదురు అష్టమి నాటి చంద్రలేఖను తలపింపచేస్తుంది అని వర్ణించడంలో ఆంతర్యం, సరిగ్గా చంద్రుడి అర్థ భాగమే అష్టమి నాడు కనపడుతుంది. మరో విశేషం ఏమిటంటే, పౌర్ణమి నుంచి అయినా, అమావాస్య నుంచి చూసినా, అష్టమి చంద్రుడి పరిణామం మారదు!! ఆనాటి చంద్రుడిలో మార్పు ఉండదు, ఏనాటికి అమ్మ కరుణలో కూడా మార్పు ఉండదు అన్న భావం అందులో ఉన్నది. ఆ రోజు తిథి దేవత పేరు త్వరిత...అంటే అమ్మవారు త్వరితగతిన మన కోర్కెలు తీర్చుతుంది అనే భావన కూడా అందులో నిక్షిప్తం అయి ఉంది. 🌹 ఆ అందమైన నుదురు పై కస్తూరి బొట్టు చక్కగా తీర్చిదిద్దబడి ఉన్నది. 👀 కనుబొమలు, కళ్లు: ఇంటికి కట్టిన మంగళతోరణాల వలె శుభప్రదంగా ఉన్నాయి ఆ కనుబొమలు. అమ్మవారి వదన సౌందర్య ప్రవాహంలో ఈదుతున్న చేపల్లా ఉన్నాయి ఆ కళ్ళు. ఎంత చక్కటి భావన చేశారు కదా!! 🌸 నాసిక, చెవులు: అప్పుడే విరిసిన సంపెంగ మొగ్గలా ఉన్న నాసికకు అమ్మ అలంకరించుకున్న ముక్కెర మెరుపులకు తారా కాంతులు చిన్నబోయాయి అంటున్నారు. సుగంధ భరితమైన కదంబ పూగుత్తులతో అలంకరింపబడిన చెవులకు, అమిత తేజస్సుతో ప్రకాశిస్తున్న సూర్యచంద్రులనే చెవి కమ్మలుగా ధరించిన అమ్మవారు మనోహరంగా భాసిస్తున్నారు. 💎 చెక్కిళ్లు, పెదవులు, పలువరస, తాంబూలం: ఎర్రటి పద్మరాగ మణులతో తయారైన అద్దం కన్నా నున్నగా ప్రకాశవంతంగా మెరిసిపోతున్నాయి అమ్మవారి చెక్కిళ్ళు. స్వచ్ఛమైన పగడము, చక్కటి దొండపండు రంగులు కూడా వెలవెలబోతున్నాయి అమ్మవారి పెదవుల ఎరుపుదనం ముందు అని ఆనందంగా చెబుతున్నారు. శుద్ధ జ్ఞానానికి ప్రతీకలు లాగా పలువరసలు ప్రకాశిస్తున్నాయి. కర్పూరం మొదలైన సుగంధ ద్రవ్యాలతో కూడిన అమ్మ తాంబూల పరిమళం దశ దిశలా గుబాళిస్తోంది. జ్ఞానాన్ని ప్రసాదించి మూగ వాడిని మహా కవిని చేయగల గొప్ప శక్తి కలది అమ్మ తాంబూలం. 🎵 వాక్కు, నవ్వు, చుబుకం: ఆ తల్లి మాటలోని మాధుర్యానికి, సృష్టిలోనే అత్యంత మధురమైన నాదం పలికించే వాగ్దేవి వీణ కూడా చిన్నబుచ్చుకుంది. మాత మందహాసాల మధురిమలలో మహేశుడి మనసు చిక్కుకుంది!! అమ్మ చుబుకాన్ని పోల్చటానికి సృష్టిలోనే లేదు సరిజోడు!! అంటే అమ్మవారి అవయవ సౌందర్యం కానీ, ఆభరణాల అందాలను గానీ పోల్చడానికి తగినవి ఈ సృష్టి లోనే ఏవీ లేవని ఖచ్చితంగా చెబుతున్నారు వసిన్యాది వాగ్దేవతలు. 📿 కంఠం, బాహువులు, హారములు: కామేశుడు కట్టిన మంగళ సూత్రంతో శోభాయమానంగా ఉంది జనని కంఠం. దివ్యమైన స్వర్ణాభరణాలతో అమ్మవారి బాహువులు ఆకర్షణీయంగా ఉన్నాయి. రత్నాలు, చింతామణులు, ముత్యాలు పొదగబడిన హారాలు అలంకరించుకుని అద్భుతంగా ప్రకాశిస్తున్నది ఆ తల్లి!! కామేశ్వరుడి ప్రేమకు ప్రతీకలుగా ఉన్న తల్లి స్తనద్వయం, అమ్మ నాభి అనే పాదు నుంచి వచ్చుచున్న రోమాలతీగకు పండిన ఫలాలులా అమర్చబడి ఉన్నాయి. కొద్దిగా వంగి సన్నని తీగ వలె ఉన్న నడుము అత్యంత శోభాయమానంగా ఉంది. ❤️ వస్త్రం, ఊరువులు, పిక్కలు: ఎర్రటి పట్టు వస్త్రంలో సూర్యతేజంతో వెలిగిపోతున్న ఆ తల్లి, రత్నాలు పొదిగి సన్నని మువ్వలు కలిగిన వడ్డాణం అలంకరించుకుంది. కామేశ్వరుడికి మాత్రమే తెలిసిన మృదువైన ఊరువులు కలిగిన అమ్మ మోకాళ్ళు, మణులు పొదిగిన కిరీటాల వలే ప్రకాశిస్తున్నాయి. ఆర్ద్ర పురుగుల నుంచి వచ్చే ఎర్రని వెలుగు వంటి కాంతులతో మిరుమిట్లు గొలుపుతూ, మన్మథుడి అమ్ములపొదలా చక్కటి ఆకృతిలో ఉన్నాయి అమ్మవారి పిక్కలు. 🪷 మడిమలు, మీగారు, గోళ్లు, చరణాలు: అమ్మవారి మడిమలు కనబడకుండా ఉన్నాయి అంటున్నారు వసిన్యాది దేవతలు. అంటే ఆ తల్లి వస్త్రముతో అవి కప్పబడి ఉన్నాయన్నమాట. అమ్మ వారి పాదాల పై భాగము కొద్దిగా ఊబికి నున్నగా గుండ్రంగా తాబేలు డిప్ప వలె ఉండి భక్తులను అనుగ్రహిస్తున్నాయి ఆ దివ్య చరణాలు. ఆ బంగారు తల్లి యొక్క గోళ్ల కాంతులు, తనకు నమస్కరిస్తున్న భక్తుల జీవితాలలోని చీకట్లను పారద్రోలుతున్నాయి. తామర పువ్వుల సౌందర్యాన్ని తలదన్నుతున్నాయి ఆ తల్లి చరణాల నుండి వచ్చుచున్న కిరణాల వెలుగులు. సవ్వడి చేసే మువ్వలు కలిగిన అందియలతో అమ్మ దివ్య మంగళ పాదాలు అలంకరింపబడి ఉన్నాయి. రాశిపోసిన లావణ్య నిధిలా ఉన్న అమ్మ, హంస నడకలతో మెల్లగా వయ్యారంగా నడుచుతూ హోమగుండం నుండి బయటకు వచ్చిన వైనాన్ని, ఆ తల్లి సౌందర్యాన్ని మన హృదయాలకు హత్తుకుపోయేలా వర్ణించిన వసిన్యాది వాగ్దేవతలకు వందనాలు అర్పించుకుందాం. 🌹🌹🙏 శ్రీ మాత్రే నమః 🙏🌹🌹 #లలితా దేవి చైతన్యము - Lalitha Devi Chatanyam #🙏🏻sri lalitha devi #lalitha thripurasundari devi
27 likes
30 shares