#తిరుమల లడ్డు #ఏపీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ 🎯
*ఏపీ రాజకీయాల్లో కోవా – నెయ్యి – పెరుగు – ప్రతిదీ గాయిగత్తరే…⁉️*
February 18, 2026🎯
ఒక జాతర… అదీ తెలంగాణలోని ప్రముఖ జాతర… అక్కడ అన్ని మతాల చిన్న వ్యాపారులు నాలుగు డబ్బులు సంపాదించుకుందామని వస్తారు… సహజం… పొట్టపోసుకునే ప్రయత్నం…
కానీ ఏం జరిగింది..? కోవా బన్ను అమ్ముకునే ఎవరో చిన్న వ్యాపారిని ఎవరో ఓ చానెల్ వాళ్లు గెలికారు, ఏదో ఆరోపించారు… అదంతా ఒక కోణంలో నాన్సెన్స్… అమానవీయం… మరీ దానికి ఫుడ్ జిహాద్ అని పేరుపెట్టి మరీ కొందరు రచ్చ చేయడానికి ప్రయత్నించారు… వ్యక్తుల నడుమ రచ్చను మతాలకు ముడిపెట్టడం దేనికి..? వోటు బ్యాంకు రాజకీయాల వైపు మళ్లించడం దేనికి..
ఆ బన్ను కల్తీయా, మరొకటా అనేది ఇక్కడ చర్చ కాదు, జాతరలో రకరకాల వ్యాపార వస్తువులు అమ్ముతారు, వాటి నాణ్యత, వాటి ధర కొనేవాడి ఇష్టం… సరే, సదరు చిరు వ్యాపారికి ఎస్డీపీఐ వంటి నిషిద్ద, ప్రమాదకర సంస్థ మద్దతు అనేది కొంత ఆలోచించాల్సిన విషయం…
దాన్ని అంతటితో వదిలేయలేదు ఏపీ పాలిటిక్స్… విషయం ఏదైనా గాయిగత్తర చేయడమే కదా ఏపీ పాలిటిక్స్ నైజం… రాజకీయాలు పులుముతారు కదా… ఇక్కడా అంతే..,. లోకేష్ ట్వీట్, నేను నీ కోవా బన్ను తింటాను అని… ఎందుకు..? ఏం చెప్పదలుచుకున్నాడు..? ఇష్యూను మరింత సీరియస్ చేయాలనేనా ఉద్దేశం..? లేక ఇది మైనారిటీ హక్కులు, మనోభావాల ఇష్యూగా చిత్రీకరించాలనా..?
నాగబాబు… పేరుకు నాస్తిక చక్రవర్తి… తనేం మాట్లాడతాడో తనకూ తెలియదు చాలాసార్లు… ఇప్పుడు సదరు వ్యాపారిని పిలిచి, ఆ కోవా బన్ను తిని ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు… ఏం చెప్పదలుచుకున్నాడు..? దాని నాణ్యతకు, పవిత్రతకు సర్టిఫికెట్ ఇస్తున్నాడా..? చూశావా, మేమెంత మానవతావాదులమో అని ఓ ఓ చిత్రీకరణా…?
మరి హిందూ గుళ్ల మీద దాడులు జరిగినప్పుడు, విగ్రహాల తలలు నరికేసినప్పుడు, ఏమయ్యాయి ఈ గొంతులు..? ఒక్క కోవా బన్ను మీద ఎందుకింత ఓవరాక్షన్..? సదరు వ్యాపారికి మద్దతుగా బోలెడు పోస్టులు, లక్షల వసూళ్లు, విరాళాలు.., చివరకు దీన్ని ఏమని చిత్రీకరిస్తున్నారు అందరూ కలిసి..?
సదరు చానెల్ చేసింది తప్పే, మత విద్వేషం పెంచుతున్నారు అని భావిస్తే చర్యలు తీసుకొండి… సదరు వ్యాపారికి నష్టం వాటిల్లితే మానవతా కోణంలో ఏదైనా పథకంలో ఇన్క్లూడ్ చేసి, సాయం చేయండి, నిలబెట్టండి… అంతేతప్ప ప్రతిదానికీ రాజకీయాలను పులమడం దేనికి..? పొలిటికల్ షో దేనికి..?
(తెలంగాణ ప్రభుత్వం దీన్ని లైట్ తీసుకుంది, తన పరిధిలో జరిగిన వివాదమే అయినా సరే… దీన్ని మరింత రచ్చ చేయడం సొసైటీకి అంతిమ నష్టం కాబట్టి… టీడీపీ, జనసేనల నుంచి ఈ సోయి కనిపించడం లేదు…)
చివరకు దీన్ని తిరుమల లడ్డూకు ముడిపెట్టి చర్చలు, రాద్ధాంతం చేస్తున్నారు… అసలు దానికీ దీనికీ లింకేమిటి..? సరే, తిరుమల లడ్డూ సంగతికే వద్దాం… గతంలో ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్టు స్పష్టంగా చెప్పింది… జంతువుల కొవ్వుల గురించి… కానీ సీబీఐ సిట్ మాత్రం కేవలం ‘నెయ్యి కాని నెయ్యి’ దగ్గరే ఆగిపోయింది… అంటే కేంద్రం కూడా ఇంకా ఇంకా లడ్డూ మీద దుష్ప్రచారం జరగకూడదని..! దాని విశిష్టతకు ఇంకా భంగం వాటిల్లకూడదని..! కేంద్రం భావన టీడీపీ క్యాంపుకి అర్థం కాలేదు…
అందుకే పదే పదే తన సోషల్ మీడియా, మీడియా ద్వారా గాయిగత్తర వరుస కథనాలకు, పోస్టులకు దిగారు… అసలు ఈ జంతు కొవ్వుల గురించి ప్రస్తావన తెచ్చిందే చంద్రబాబు… పొలిటికల్ ఫాయిదా కోసం… అదేదో దర్యాప్తు చేయిస్తే అయిపోయేది, కానీ కావాలని జగన్ను హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించడం కోసం… ఎస్, జగన్ క్యాంపు తిరుమలను భ్రష్టుపట్టించింది నిజమే… కానీ సిస్టమాటిక్గా చంద్రబాబు ఎక్స్పోజ్ చేసి, ఎస్టాబ్లిష్ చేసింది ఎక్కడ..?
(ఏమాటకామాట… ఏపీబీజేపీ సంయమనం పాటిస్తోంది… ) ఈలోపు వైసీపీ క్యాంపు హెరిటేజ్ పెరుగు, పాలపై ప్రచారానికి దిగింది… అది మరో బ్లండర్… నెయ్యి కాని నెయ్యి కీ హెరిటేజ్ పెరుగుకూ ఏం లింక్..? చంద్రబాబు హెరిటేజ్ ద్రోహం చేస్తే, జగన్ లడ్డూకు చేసిన ద్రోహాలు బారాఖూన్ మాఫ్ అనుకోవాలనా..?
ఈ ప్రచారంపై హెరిటేజ్ లీగల్ ఫైట్కు రెడీ కాగానే, తాజాగా ఇందాపూర్ సంస్థ హెరిటేజ్ అనుబంధమేననీ, ఆ నెయ్యిలో టాయిలెట్ క్లీనర్ల అవశేషాల మాటేమిటీ అని చట్టసభలో ప్రస్తావనకు తీసుకొచ్చారు… ఇదే కాదు, గతంలో చంద్రబాబు హయాంలోనే సదరు అక్రమ డెయిరీల నుంచి కోట్ల రూపాయల నెయ్యి కొన్నట్టు, టీటీడీ బ్లాక్ లిస్టు చేసినా సరే, అనతికాలంలోనే ఆ నిషేధం తొలగించినట్టు కూడా ప్రచారం మొదలెట్టారు… వెరసి టీడీపీ క్యాంప్ ఫుల్ డిఫెన్సులో పడినట్టు కనిపిస్తోంది… అబ్బే, అవి కంట్రాక్టు మాన్యుఫాక్చరింగ్ ఒప్పందాలు మినహా సదరు డెయిరీ నెయ్యి సరఫరాలతో తమకేమీ సంబంధం లేదని హెరిటేజ్ క్లారిటీలు ఇస్తోంది…
అంతేకాదు, ఢిల్లీ నుంచి కూడా స్పష్టమైన సంకేతాలు అందినట్టున్నాయి… తిరుమల లడ్డూ యవ్వారాన్ని కంపు చేయడం ఇక మానేయాలని..! ప్చ్, ఏపీ రాజకీయాల్లో కాదేదీ రాజకీయాలకనర్హం… బన్ను కోవా, లడ్డూ నెయ్యి, పట్టు శాలువా, హెరిటేజ్ పెరుగు… ఎటెటో తిప్పుతున్నారు… ఏం రాజకీయాలురా బాబూ..!!