Satya Vadapalli
1.3K views
నాయనార్ల చరిత్రలు - 11 వ భాగం 🚩 భార్య మంగళసూత్రాన్ని త్యాగం చేసి.. వాలిపోయిన శివలింగాన్ని సరిచేసిన మహనీయుడు: గుగ్గులు కలశ నాయనారు 🚩 శివారాధనలో 'ధూపం' (సాంబ్రాణి/గుగ్గులం) వేయడానికి తన సర్వస్వం అర్పించిన ఆ మహా భక్తుడు గుగ్గులు కలశ నాయనారు పూర్తి చరిత్ర.. తమిళనాడులోని 'తిరుక్కడవూరు' (అమృతఘటేశ్వరుడు - అభిరామి అమ్మవారి ఆలయం) క్షేత్రంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవారు.స్వామివారికి సుగంధ పరిమళాలు వెదజల్లే "గుగ్గులం" (సాంబ్రాణి) ధూపం వేయడం ఆయనకు ప్రాణం. అందుకే ఆయనకు "గుగ్గుల కలశ నాయనారు"అని పేరు వచ్చింది.ఆ సేవ చేయడం లో తనకున్న ఆస్తినంతా ఖర్చు చేశాడు, కటిక పేదరికం లో కూడా శివయ్యకు ధూప సేవ ఆపలేదు. శివుడు తన భక్తుడిని పరీక్షించాలనుకున్నాడు. క్రమంగా నాయనారు ఆస్తి కరిగిపోయింది.తినడానికి తిండి లేని దుస్థితి. పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. అది చూడలేక ఆయన భార్య, కన్నీటితో తన మెడలోని పవిత్రమైన "మంగళసూత్రాన్ని" (తాలిబొట్టు) తీసి భర్త చేతిలో పెట్టింది. "నాథా! ఇది తప్ప మన దగ్గర ఏమీ లేదు. దీన్ని అమ్మి కాస్త బియ్యం తీసుకురండి, పిల్లల ఆకలి తీరుద్దాం" అని చెప్పింది. భారమైన గుండెతో మంగళసూత్రాన్ని తీసుకుని మార్కెట్‌కు వెళ్తుండగా.. దారిలో ఒక వర్తకుడు అత్యంత శ్రేష్టమైన గుగ్గులాన్ని అమ్మడం చూశాడు. అంతే! ఆ క్షణం ఆయనకు పిల్లల ఆకలి, భార్య త్యాగం అన్నీ మర్చిపోయాడు. ఆయన కళ్లకు కేవలం శివుడే కనిపించాడు. "ఇంత మంచి గుగ్గులం స్వామికి ధూపం వేస్తే ఎంత బాగుంటుంది!" అనుకుని, ఆ మంగళసూత్రాన్ని ఇచ్చి, బదులుగా గుగ్గులం తీసుకున్నాడు. నేరుగా ఆలయానికి వెళ్లి స్వామికి ధూపం వేసి పరవశించిపోయాడు. రాత్రి అయ్యాక స్పృహలోకి వచ్చాడు. "అయ్యో! బియ్యం తేకుండా ఇంటికి ఎలా వెళ్ళాలి?" అని భయపడుతూ ఇంటికి వెళ్లేసరికి అద్భుతం జరిగింది! ఇల్లు ధనధాన్యాలతో, బంగారు ఆభరణాలతో నిండిపోయి ఉంది. సాక్షాత్తు పరమేశ్వరుడే కుబేరుని పంపి ఆ ఇంట సిరులు కురిపించాడు. భార్య సంతోషంతో స్వామి లీలను వివరించింది. నాయనారు ఆ సంపద ను శివ ప్రసాదంగా భావించి, శివ సేవకు, శివ భక్తులకు వినియోంచాడు. వాలిపోయిన శివలింగం - తిరుప్పనందల్ క్షేత్రం కొన్నాళ్లకు నాయనారు 'తిరుప్పనందల్' అనే క్షేత్రానికి వెళ్లారు. అక్కడ శివలింగం (అరుణజటేశ్వరుడు) ఒక పక్కకు వాలిపోయి ఉంది. ❓ అసలు లింగం ఎందుకు వాలిపోయింది? పూర్వం "తాటకై" అనే ఒక భక్తురాలు స్వామికి పూలమాల వేస్తుండగా, ఆమె చీర కొంగు జారిపోయే పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో ఆమె పడుతున్న ఇబ్బందిని గమనించిన శివుడు, ఆమె మాల వేయడానికి వీలుగా, తన లింగాన్ని పక్కకు వంచి ఆ మాలను స్వీకరించాడు. భక్తురాలి కోసం భగవంతుడు తల వంచాడు! అప్పటి నుండి ఆ లింగం అలాగే ఉంది. రాజుగారి విఫల ప్రయత్నం: కొంత కాలము గడిచి పోయింది,ఆ దేశపు రాజు ఆ వాలిపోయిన లింగాన్ని సరిచేయాలని పట్టుబట్టాడు. ఏనుగులను, మల్లయోధులను తెప్పించి, గొలుసులతో లింగాన్ని లాగించాడు. కానీ శివలింగం ఇసుమంత కూడా కదలలేదు. రాజు నిరాశలో కూరుకుపోయాడు. 🙏 భక్తి పాశం - అద్భుత దృశ్యం: ఇదంతా చూసిన గుగ్గుల కలశ నాయనారు.. "నా స్వామిని బలంతో సరిచేయలేరు, భక్తితోనే బంధించగలరు" అని గ్రహించారు. వెంటనే, ఏనుగులకు కట్టిన గొలుసులను పక్కన పెట్టించి.. తన మెడకు ఒక తాడును (పాశాన్ని) గట్టిగా బిగించుకుని, రెండో చివరను శివలింగానికి కట్టారు. "శివయ్యా! నీ భక్తుల ప్రేమకు లొంగిపోతావని నాకు తెలుసు. దయచేసి సరిగా నిలబడు తండ్రీ!" అని ప్రార్థిస్తూ, కన్నీళ్లతో ఒక్కసారి బలంగా లాగారు. అంతటి ఏనుగులకు కదలని ఆ శివలింగం.. భక్తుడి మెడకు బిగుసుకున్న తాడు లాగగానే, చకచకా కదిలి యథాస్థానంలో నిటారుగా నిలబడింది! ఆకాశం నుండి పూలవాన కురిసింది. ఆ రాజు, ప్రజలు నాయనారు పాదాలపై పడ్డారు. అతని భక్తి లోక ప్రకటన అయింది. ముగింపు: గుగ్గుల కలశ నాయనారు జీవితాంతం శివసేవలో గడిపి, చివరికి శివసాయుజ్యం పొందారు. నీతి: భగవంతుడికి కావాల్సింది సంపదో, శారీరక బలమో కాదు.. "నిష్కల్మషమైన భక్తి". తాటకై భక్తికి తలవంచిన శివుడు.. కలశ నాయనారు భక్తికి తల ఎత్తాడు. అదే శివుని లీల! #🕉️హర హర మహాదేవ 🔱 #🙏ఓం నమః శివాయ🙏ૐ #😇శివ లీలలు✨ #🙏🏻భక్తి సమాచారం😲 #🙏🏻సోమవారం భక్తి స్పెషల్