#దుష్టశిక్షణ శిష్టరక్షణ చేయు అత్యంత శక్తివంతమైన వారాహి మంత్రం!! #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #ఆషాఢమాసం - శ్రీ వారాహి నవరాత్రి #వారాహి నవరాత్రులు (ఆషాడ గుప్త నవరాత్రి) 🛕🔱🕉️🙏 #త్రిమూర్తుల శక్తి స్వరూపిణి శ్రీ వారాహి అమ్మవారి ఆషాఢ గుప్త నవరాత్రులు - 2023 (జూన్ 19-28)
*దివ్య శక్తులను ప్రసాదించే వారాహీ అమ్మవారు*
*జూన్ 26 నుండి వారాహి నవరాత్రి ప్రారంభం...*
వారాహ స్వరూపిణి వారాహి, వరాహస్వామికి ప్రియమైనది వారాహి, వారాహి అంటే భూమి అని మరో అర్థం. హరి అవతారమైన యజ్ఞవరాహుని శక్తి. వరాహముఖంతో వెలిగే తల్లి. ఈ యజ్ఞ వరాహశక్తి, అన్నప్రదాయిని. చేతిలో ధరించిన నాగలి, రోకలి వంటి ఆయుధాలు, అన్నోత్పత్తినీ, అన్నపరిణామాన్నీ తెలియజేసే సంకేతాలు. దేవతలకు హవ్యాన్నీ, మానవాది జీవులకు యోగ్యమైన అన్నాన్నీ అందించే ఆహార శక్తి.
'సర్వం శక్తిమయం' అనే భావనే భక్తి. ఆ భక్తి ముక్తి అవుతుంది. అదే మానవ జీవిత సార్థకత. ఆ అమ్మ అనుగ్రహమే అసలైన వరం. ఆ వరమే అందరం అర్ధించాలి.
బ్రాహ్మీ మాహేశ్వరీ చైవ
కౌమారీ వైష్ణవీ తథా
వారాహీ చైవచేంద్రాణీ
చాముండా సప్త మాతరః
శివుడికి పరిచర్యలు చేసే దేవతలు వీరు. సప్త మాతృకలలో ఒక శక్తి ఈమె. భూసంబంధ దేవత. ప్రత్యంగిరాదేవి అని ఈమెకు మరొక పేరు. భూ సంపాదన, భూ సంబంధ వివాదాలకు పరిష్కారానికి మార్గనిర్దేశనం చేసే దేవత. కాశీ క్షేత్రాన్ని రక్షించే దేవత. రాత్రంతా కాశీ సంచారం చేస్తుంది అని ప్రసిద్ధి.
అమ్మవారు కాశీలో గ్రామ దేవతగా ప్రసిద్ధి. ఈ అమ్మవారి దర్శనం వేకువన మాత్రమే లభిస్తుంది. వారాహీని శైవ, వైష్ణవులు, బౌద్ధులు కూడా కొలిచారు. అమ్మ ప్రకృతి శక్తి, కాశీలో ఉన్న రూపానికి శంఖు, చక్రాలు విష్ణుమూర్తికి ఉన్నట్లు ఉంటాయి. ఆవిడ గ్రామ సంచారానికి వెళ్లిన సమయంలో మాత్రమే ఆవిడను దర్శించే అవకాశం ఆ పూజా పద్ధతిలో ఉంది. వామాచార విధానంలో సాయంత్రం సూర్యాస్తమయం తరువాత మాత్రమే పూజించేవారు.
వారాహి నవరాత్రి
మనకు నాలుగు రకాల నవరాత్రులు ఉన్నాయి. వాటిలో ఆషాఢ మాసంలో వచ్చేవి వారాహి నవరాత్రులు అంటారు. ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు ఈ నవరాత్రులు జరుపుకుంటారు. రాత్రి సమయంలో వారాహీ అమ్మవారిని పూజిస్తారు. వీటిని గుప్తనవరాత్రులు అని అంటారు. శరన్నరవాత్రులు, మాఘ గుప్త నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటూ అమ్మవారిని పూజించినట్టే ఆషాఢ మాసంలో వచ్చే వారాహీ నవరాత్రుల్లోనూ అమ్మవారికి తొమ్మిదిరోజుల
పాటూ ప్రత్యేక పూజలు చేస్తారు. నైవేద్యాలు సమర్పిస్తారు. ఉపవాసాలుంటారు, దీక్షలు చేపడతారు. లలితా దేవి నుంచి ఉద్భవించిన వారాహీని పూజిస్తే అహంకారం తగ్గుతుంది.
వారాహి దేవి లలితా పరాభట్టారిక సేనాని. లలిత రథ, గజ, తురగ సైన్యబలాలు అన్నీ వారాహి ఆధీనంలో ఉంటాయి. అందుకే ఆవిడను దండనాథ అన్నారు. లలితా పరమేశ్వరి ఐదు పుష్పబాణాల నుంచి ఉద్భవించిన శక్తుల వరాహ ముఖంతో ఆవిర్భవించిన శక్తి శ్రీ మహా వారాహీ దేవి. లలితా దేవి సైన్యానికి ఆమె సర్వ సైన్యాధ్యక్షురాలు. ఆమెకు ప్రత్యేక రథం ఉంది. దానిపేరు కిరి చక్రం. ఆ రథాన్ని 1000 వరాహాలు లాగుతాయి. రథసారథి పేరు స్థంభిని దేవి. ఆమె రథంలో దేవతా గణమంతా కొలువై ఉంటుంది. ఈ అమ్మవారిని ఆజ్ఞా చక్రంలో ధ్యానిస్తారు.
హిరణ్యాక్షుడు భూదేవిని జలాల్లోకి తీసుకువెళ్ళినప్పుడు, శ్రీమహావిష్ణువు వరాహరూపంలో అవతరించి, వాడిని సంహరించి, భూదేవిని రక్షిస్తాడు. స్వామి మీద ప్రేమతో అప్పుడు అమ్మవారు వారాహీ రూపం తీసుకుందని, అందువలన ఈమె వరాహస్వామి స్త్రీ రూపమని కొన్ని ధ్యాన శ్లోకాల్లో కనిపిస్తుంది. వారాహీ అమ్మవారు అంటే ఎవరో కాదు సర్వసంపదలను ఇచ్చే
శ్రీమహాలక్ష్మీ. అందుకే శ్రీలక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహీ ధరణీ ధ్రువా అని కనిపిస్తుంది. కాబట్టి ఈ అమ్మవారిని పూజిస్తే వరహాస్వామిలాగే అన్ని కోరికలను నెరవేర్చుతుంది. భూ తగాదాలను నివారిస్తుంది లేదా పరిష్కరిస్తుంది.
అమ్మ స్వరూపాన్ని గమనిస్తే వరాహ ముఖంతో, అష్ట భుజాలతో, శంఖ, చక్ర, హల, ముసల, పాశ, అంకుశ, వరద, అభయ హస్తాలతో ప్రకాశిస్తూ దర్శనం ఇస్తుంది. ఇది మహావారాహి స్వరూపం. ఇంకా లఘువారాహి, స్వప్నవారాహి, ధూమ్రవారాహి, కిరాతవారాహిగా అమ్మ ఉపాసకుల పూజలు అందుకుంటుంది.
అమ్మవారి చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే హలం, ముసలం ధరించి కనిపిస్తుంది. నాగలిని భూమిని దున్నడానికి ఉపయోగిస్తే, రోకలిని ధాన్యం దంచడానికి వాడతారు. దీనినిబట్టి అమ్మవారు సస్యదేవత అని గ్రహించాలి. అంటే పాడిపంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లీ శ్రీవారాహీ మాత. అందుకే అమ్మవారిని ఆషాఢ మాసంలో పూజించమన్నారు. నిజానికి రైతు గోఆధారిత వ్యవసాయం ద్వారా భూమిని శుద్ధి చేసి, సాగు చేస్తే అది కూడా ఒక రకమైన వారాహీ ఉపాసనే అవుతుంది. ఎందుకంటే వారాహీ అంటే ఎవరో కాదు సాక్షాత్తు భూమాత.
పరాశక్తిలోని సౌమ్యం శ్యామల అయితే, ఉగ్రం వారాహి, శ్రీవిద్యా గద్యంలో అహంకార స్వరూప దండనాథా సంసేవితే, బుద్ధి స్వరూప మంత్రిణ్యుపసేవితే అని లలితను కీర్తిస్తారు. దేవీ కవచంలో అయూ రక్షతు వారాహి అన్నట్టు ఈ తల్లి ప్రాణ సంరక్షిణి. ఆజ్ఞాచక్రం ఆవిడ నివాసం. ప్రకృతి పరంగా చూసినట్లైతే ఈ సమయంలో వర్షం కురుస్తుంది. రైతులు భూమిలో విత్తనాలు చల్లడానికి తయారవుతారు. దేశం ధాన్యంతో సుభిక్షంగా ఉండాలని ధాన్యలక్ష్మీ స్వరూపమైన వారాహిని ప్రార్ధన చేస్తారు.
వారాహీ అమ్మవారిని ఉగ్రదేవతగా భ్రమపడతారు. కానీ వారాహీ చాలా శాంత స్వరూపిణి. వెంటనే అనుగ్రహిస్తుంది. కరుణారస మూర్తి అని గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. వారాహీ అమ్మవారిని స్మరిస్తే శత్రు నాశనం జరుగుతుంది. కష్టాల్లో ఉన్నవారు, భూ సంబంధిత తగాదాలున్నవారు, కోర్టు కేసుల్లో చిక్కుకున్నవారు వారాహీ అమ్మను పూజిస్తే పరిష్కారం దొరుకుతుంది. వారాహీ అమ్మవారి ధ్యానం దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వ్యక్తిలో ఉన్న అంతఃశ్శత్రువులైన కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, అహంకారం, అజ్ఞానం నశిస్తాయి. అంతఃశ్శత్రువులను జయించినవాడికి బయట శత్రువులు ఉండరు. కనిపించరు, అంత విశాలమైన దృష్టి కలుగుతుంది. అలాంటి దివ్యస్థాయిని ప్రసాదిస్తుంది వారాహీ మాత.
సర్వం శ్రీవారాహి చారణారవిందార్పణమస్తు.
*🚩 ┈┉┅━❀꧁ॐ డైలీ విష్ ॐ꧂❀━┅┉┈ 🚩*