Mahbubnagar Police
520 views
5 days ago
మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి లక్ష్యంపై దృష్టి పెట్టాలి వేసవి శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ సందేశం విద్యార్థులు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి, తమ లక్ష్య సాధన కోసం అంకితభావంతో కృషి చేస్తే జీవితంలో విజేతలుగా నిలుస్తారని జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి అన్నారు. డ్రీమ్ ఫోర్స్ ఫౌండేషన్, ఏపీజే అబ్దుల్ కలాం సైన్స్ ల్యాబ్ ఆధ్వర్యంలో వాగ్దేవి జూనియర్ కళాశాలలో నిర్వహించిన వేసవి శిక్షణా శిబిరం ముగింపు సమావేశానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, మొబైల్ ఫోన్లకు బానిసలైతే సృజనాత్మకత దెబ్బతింటుందని తెలిపారు. తాను బీటెక్ పూర్తయ్యాకే ప్రముఖ సంస్థలను సందర్శించే అవకాశం దొరికిందని, కానీ ఇప్పుడు డ్రీమ్ ఫోర్స్ ఫౌండేషన్ కలాం ల్యాబ్ కృషి వల్ల తొమ్మిదో తరగతి విద్యార్థులకే డిఆర్డీఓ వంటి ప్రఖ్యాత సంస్థలను సందర్శించే అవకాశం లభించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. విద్యార్థులు సానుకూల దృక్పథంతో కొత్త విషయాలను నేర్చుకోవాలని, మంచి అలవాట్లను అలవరచుకోవాలని సూచించారు. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రతిరోజూ యోగా సాధన చేయాలని సూచించారు. ఈ సందర్భంగా వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులతో పాటు పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎస్పీ బహుమతులు అందజేశారు. తెలంగాణలోని ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట్, వికారాబాద్ జిల్లాలతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల నుండి మొత్తం 110 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ శిబిరం 12 రోజుల పాటు విజయవంతంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో ల్యాబ్ కమిటీ అధ్యక్షులు జనార్ధన్, కోశాధికారి నర్సప్ప, డ్రీమ్ ఫోర్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు టి.ఎన్. వెంకటేశ్వర్లు, టి.ఎన్. శ్రీధర్, వాగ్దేవి జూనియర్ కళాశాల కరస్పాండెంట్ వెంకట్ రెడ్డి, కలాం ల్యాబ్ సభ్యులు మల్లప్ప, గుముడాల చక్రవర్తి గౌడ్, ఆంజనేయులు, అనురాధ, శ్రావణి, శోభారాణి, సురేఖ తదితరులు పాల్గొన్నారు. #MahabubnagarPolice #📰 వార్తలు