డిఫెన్సివ్ డ్రైవింగ్ ద్వారా సురక్షిత ప్రయాణం – యువతకు అవగాహన కల్పించిన జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి.
తెలంగాణ రాష్ట్ర డిజిపి శ్రీ శివధర్ రెడ్డి గారూ తలపెట్టిన “అర్రైవ్ అలైవ్” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం మహబూబ్నగర్ టౌన్ నందు వాసవి డిగ్రీ కళాశాలలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి ఐపీఎస్ యువతను ఉద్దేశించి రోడ్డు భద్రతపై సమగ్ర అవగాహన కల్పించారు. యువతలో సరైన అవగాహన ఉంటే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని, సమాజం మొత్తం సురక్షిత దిశగా ముందుకు సాగుతుందని తెలిపారు.
డిఫెన్సివ్ డ్రైవింగ్ అనేది ప్రమాదాలను ముందుగానే ఊహించి జాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం అని ఎస్పీ గారు వివరించారు. డ్రైవింగ్ సమయంలో చుట్టూ ఉన్న పరిస్థితులను గమనించడం, ఇతరుల తప్పిదాలను ముందుగానే అంచనా వేయడం, వేగ నియంత్రణలో ఉంచడం, సురక్షిత దూరం పాటించడం వంటి అలవాట్లు ప్రాణాలను కాపాడతాయని తెలిపారు. మొబైల్ ఫోన్ వినియోగం, అలసట లేదా నిద్రాహార స్థితిలో డ్రైవింగ్ చేయడం ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు.
ద్విచక్ర వాహనదారులు మరియు వెనుక ప్రయాణికులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ స్ట్రాప్ సరిగా బిగించుకోవాలని సూచించారు. కారులో ప్రయాణించే ప్రతి ఒక్కరూ సీట్ బెల్ట్ ధరించడం ద్వారా ప్రమాద సమయంలో ప్రాణ రక్షణ పొందవచ్చని చెప్పారు. ఓవర్ స్పీడ్, ట్రిపుల్ రైడింగ్, నిర్లక్ష్య డ్రైవింగ్ వంటి అలవాట్లు యువత ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయని ఆమె పేర్కొన్నారు.
మద్యం సేవించి వాహనం నడపడం శిక్షార్హ నేరమే కాకుండా ప్రాణాలకు ప్రమాదకరమని, స్పందన వేగం తగ్గి ప్రమాదాల అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం, స్టాప్ లైన్ దాటకపోవడం, జీబ్రా క్రాసింగ్ వద్ద పాదచారులకు మార్గం ఇవ్వడం వంటి నియమాలు ప్రతి డ్రైవర్ తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
భారీ వాహనాల సమీపంలో ప్రయాణించేటప్పుడు బ్లైండ్ స్పాట్స్ను గుర్తుంచుకోవాలని, ఎడమ వైపు నుంచి ఓవర్టేక్ చేయకూడదని, ముందుకు అకస్మాత్తుగా ప్రవేశించవద్దని చెప్పారు. పాఠశాలలు, మార్కెట్లు, కాలనీలు వంటి ప్రాంతాల్లో వేగం తగ్గించి పిల్లలు, వృద్ధులు రోడ్డు దాటేటప్పుడు సహాయం చేయడం ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు.
కార్యక్రమ ప్రారంభంలో కళాబృందం సభ్యులు రోడ్డు ప్రమాదాల తీవ్రతను వివరించగా, అనంతరం ఎస్పీ గారు పిపిటి ప్రజెంటేషన్ ద్వారా ఇటీవల జరిగిన ప్రమాదాలు, వాటి కారణాలు, డ్రైవింగ్ సమయంలో చేసిన తప్పిదాలను విద్యార్థులకు వివరించారు. ఇకముందు ఓవర్ స్పీడ్, ట్రిపుల్ రైడింగ్, ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనలు చేయకుండా హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం మరియు డిఫెన్సివ్ డ్రైవింగ్ అలవాటు చేసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు.
యువత రోడ్డు భద్రత నియమాలను పాటిస్తే ఒక తరం మొత్తం సురక్షిత జీవన విధానాన్ని అలవరచుకుంటుందని, మీ జాగ్రత్తే మీ కుటుంబానికి రక్షణ అని ఎస్పీ గారు సందేశం ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, టూ టౌన్ ఇన్స్పెక్టర్ అజాజుద్దీన్, ఉమెన్ పీఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపాల్ కొండా స్వామి, అకాడమిక్ డైరెక్టర్ రజినీకాంత్, కరస్పాండెంట్ శ్రీనివాసయ్య, షీ టీం సభ్యులు, కళాబృందం సభ్యులు, ఐటీ కోర్ టీం, ఎస్ఐ రవి మరియు సుమారు 400 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
#MahabubnagarPolice #vasavidegreecollege #📰 వార్తలు
రోడ్డు ప్రమాదాలు, ఆర్థిక నేరాలు, ఆన్లైన్ మోసాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలి
ప్రతి పోలీస్ స్టేషన్లో విలేజ్ హిస్టరీ షీట్స్ అప్డేట్ చేయాలి
నైట్ బీట్ & పెట్రోలింగ్ విధుల్లో నాణ్యత పెంచాలి
చట్ట ఉల్లంఘనలపై కఠిన చర్యలు – ఎన్ఫోర్స్మెంట్ వేగవంతం చేయాలి
నెలవారీ నేర సమీక్ష సమావేశంలో అధికారులకు పలు సూచనలు చేసిన మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ డి. జానకి
మహబూబ్నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో గురువారం జిల్లా ఎస్పీ డి.జానకి గారి ఆధ్వర్యంలో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో జిల్లాలోని అన్ని సర్కిల్స్, పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల స్థితిగతులు, పెండింగ్ కేసుల పరిష్కారం, దర్యాప్తులో నాణ్యత, నేరాల నియంత్రణ తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉండేలా దర్యాప్తు చేపట్టి నేరస్తులకు శిక్షపడే విధంగా చట్టపరమైన బలమైన ఆధారాలు సమర్పించాలని సూచించారు. బాధితులకు న్యాయం అందేలా త్వరితగతిన కేసులను పూర్తి చేయాలని ఆదేశించారు. కేసుల విచారణలో జాప్యం చేస్తే సహించేది లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు.
జిల్లాలో రోడ్డు ప్రమాదాలు, ఆర్థిక నేరాలు, ఆన్లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు తరచూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి, ఆధునిక సాంకేతికతను వినియోగించి నేరాలను చేధించాలని సూచించారు.
అన్ని పోలీస్ స్టేషన్లలో విలేజ్ హిస్టరీ షీట్స్ను అప్డేట్ చేయాలని, గ్రామాల వారీగా నేర చరిత్రపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆదేశించారు. విలేజ్ పోలీస్ అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకమై సామాజిక అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఎస్హెచ్ఓలు తమ పరిధిలోని ప్రతి గ్రామాన్ని సందర్శించి స్థానిక సమస్యలను తెలుసుకొని ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
నైట్ బీట్ మరియు పెట్రోలింగ్ విధులను మరింత సమగ్రంగా నిర్వహించాలని, సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేసేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. దొంగతనాల కేసుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి లాంగ్ పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి, దొంగిలించిన సొత్తును బాధితులకు తిరిగి అందించాలన్నారు.
చట్ట ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటూ ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని, శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి అలసత్వం ఉండకూడదని స్పష్టం చేశారు.
అంతేకాకుండా సిబ్బంది సమస్యలను సమయానికి పరిష్కరించేందుకు ఎస్ఐలు సరైన విధంగా ఎండార్స్ చేసి ఉన్నతాధికారులకు పంపాలని సూచించారు. ఇటీవల నిర్వహించిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తిచేసినందుకు జిల్లా పోలీస్ అధికారులను, సిబ్బందిని ఎస్పీ గారు అభినందించారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పీ NB రత్నం, డీఎస్పీలు, వెంకటేశ్వర్లు, రమణారెడ్డి సీఐలు, అప్పయ్య, అయిజజుద్దీన్, కమలాకర్, రామకృష్ణ, ఆర్ఐలు, కృష్ణయ్య, నగేష్, అశోక్ కుమార్, అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. #📰 వార్తలు
ఇంటర్మీడియట్ పరీక్షల కేంద్రాల బందోబస్తు పరిశీలించిన జిల్లా ఎస్పీ డి.జానకి.
మహబూబ్నగర్ జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా ఈ రోజు రెండవ సంవత్సరం (సెకండ్ ఇయర్) పరీక్ష నిర్వహణ జరుగుతున్న నేపథ్యంలో, మహబూబ్నగర్ టౌన్లోని ప్రభుత్వ బాలుర కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపిఎస్ గారు సందర్శించారు.
జిల్లా ఎస్పీ గారు పరీక్ష కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా జరిగేలా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
పరీక్ష కేంద్ర పరిసర ప్రాంతాలలో 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలు చేయడం, అనధికార వ్యక్తులు గుంపులుగా గుమికూడకుండా చర్యలు తీసుకోవడం, మొబైల్ ఫోన్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగంపై కఠిన నిబంధనలు పాటించేలా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
అలాగే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పరీక్ష సమయాల్లో ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని ట్రాఫిక్ అధికారులకు సూచించారు. విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకునేలా సహకరించాలని తెలిపారు.
విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రశాంత వాతావరణాన్ని కాపాడాలని, అపోహలు లేదా రూమర్లు నమ్మవద్దని జిల్లా ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత సర్కిల్ ఇన్స్పెక్టర్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
#MahabubnagarPolice #📰 వార్తలు
రోడ్డు భద్రతే జీవ భద్రత – మద్యం డ్రైవింగ్పై ట్రాఫిక్ పోలీసుల కఠిన హెచ్చరిక & అవగాహన
మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (TTI) లో రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వ్యక్తులను, మైనర్ డ్రైవింగ్ చేసిన వారి తల్లిదండ్రులకు పోలీస్ స్టేషన్కు పిలిపించి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పీపీటీ) ద్వారా రోడ్డు ప్రమాదాలపై వీడియోలు ప్రదర్శిస్తూ ప్రమాదాల తీవ్రతను వివరించారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ —
* మద్యం సేవించి వాహనం నడపడం ప్రాణాంతక ప్రమాదాలకు ప్రధాన కారణమని తెలిపారు.
* మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల డ్రైవర్ నిర్ణయ సామర్థ్యం తగ్గి ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పారు.
* హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం చిన్న విషయం కాదు – అది ప్రాణరక్షణ కవచమని వివరించారు.
* అధిక వేగం ప్రాణాలకు ముప్పు అని, వేగం నియంత్రణ అత్యవసరమని సూచించారు.
* మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవింగ్ చేయడం ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు.
* ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డు గుర్తులు, ట్రాఫిక్ నియమాలు ప్రజల భద్రత కోసం రూపొందించబడినవని తెలిపారు.
* ప్రమాదం జరిగిన తరువాత కుటుంబ సభ్యులు పడే మానసిక, ఆర్థిక కష్టాలను గుర్తు చేశారు.
* కుటుంబం మనపై ఆధారపడి ఉందనే బాధ్యతతో జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు.
* చిన్న నిర్లక్ష్యం జీవితాంతం పశ్చాత్తాపానికి కారణమవుతుందని హెచ్చరించారు.
* యువత ట్రాఫిక్ నియమాలను పాటించి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని కోరారు.
* మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు.
* రోడ్డు భద్రత ప్రతి పౌరుడి బాధ్యత అని, పోలీసులే కాక ప్రజల సహకారం కూడా అవసరమని పేర్కొన్నారు.
* “సురక్షిత ప్రయాణం – కుటుంబ సంతోషం” అనే సందేశాన్ని అందరికీ చేరవేయాలని సూచించారు.
చివరగా, అందరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటించి తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడాలని కోరడం జరిగింది. #📰 వార్తలు
తెలంగాణ రాష్ట్ర 4వ పోలీస్ గేమ్స్ మరియు స్పోర్ట్స్ మీట్లో జిల్లా పోలీసుల మెరుగైన ప్రతిభ13 పతకాలతో జిల్లాకు గౌరవం
క్రీడాస్ఫూర్తితో జాతీయ స్థాయిలో రాణించాలని ఎస్పీ డి.జానకి పిలుపు
సైబరాబాద్ కమిషనరేట్ వేదికగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర 4వ పోలీస్ స్పోర్ట్స్ మరియు గేమ్స్ మీట్లో జిల్లా పోలీసు క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచి మొత్తం 13 పతకాలు (02 గోల్డ్, 03 రజతం, 08 కాంస్యం) సాధించేరని జిల్లా ఎస్పీ డి.జానకి, ఐపీఎస్ గారు సంతోషం వ్యక్తం చేశారు.
ఎస్పీ కార్యాలయం నందు నిర్వహించిన కార్యక్రమంలో విజేతలకు ప్రశంసాపత్రాలు అందజేస్తూ ఎస్పీ మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. గెలుపోటములు సహజమని, విజేతలు జాతీయ స్థాయిలో మరింత ప్రతిభ కనబరచాలని, ఓటమి చెందిన వారు నిరాశ చెందకుండా తమ లోపాలను సరిదిద్దుకొని మరింత కృషితో ముందుకు సాగాలని సూచించారు. జిల్లాకు కీర్తి తీసుకువచ్చిన క్రీడాకారులందరినీ ప్రత్యేకంగా అభినందించారు.
పతక విజేతలు
మహిళల ఆర్మ్స్ రెజ్లింగ్ & వెయిట్ లిఫ్టింగ్లో గోల్డ్ మెడల్ – అడ్డకల్ పోలీస్ స్టేషన్ మహిళా పీసీ 2405 రాధిక.
బ్యాడ్మింటన్ 55+ ఏజ్ గ్రూప్ సింగిల్స్ & డబుల్స్ – టూ టౌన్ పీఎస్ హెడ్ కానిస్టేబుల్ 1532 శేఖర్.
బ్యాడ్మింటన్ 55+ డబుల్స్ – ఏఆర్ హెచ్సీ 2128 పురేందర్.
బాడీ బిల్డింగ్ 90+లో సిల్వర్ & లాన్ టెన్నిస్లో బ్రోంజ్ – ఏఆర్ హెచ్సీ 373 ఇమ్రాన్.
స్విమ్మింగ్ 200 మీటర్స్ ఫ్రీ స్టైల్లో సిల్వర్, 200 మీటర్స్ ఇండివిడ్యువల్ & 100 మీటర్స్ బటర్ఫ్లైలో బ్రోంజ్ – ఏఆర్పీసీ 2758 బిక్షం.
స్విమ్మింగ్ బ్రెస్ట్ స్ట్రోక్లో బ్రోంజ్ – ఏఆర్పీసీ 525 నర్సింహారెడ్డి.
బాక్సింగ్లో బ్రోంజ్ – ఏఆర్పీసీ 2908 రఘునాయక్.
టీమ్ ఈవెంట్లో బ్రోంజ్ – పీసీ 93 విష్ణువర్ధన్ రెడ్డి, భూత్పూర్ పీఎస్.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎన్.బి. రత్నం, ఏఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్, DCRB DSP రమణా రెడ్డి, ఆర్ఐలు కృష్ణయ్య, నగేష్, అశోక్ కుమార్, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య తదితర సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా పోలీస్ సిబ్బంది క్రీడల్లో చురుకుగా పాల్గొని శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, జట్టు భావనను పెంపొందించుకోవాలని ఎస్పీ గారు ఆకాంక్షించారు.
#MahabubnagarPolice #📰 వార్తలు
మహబూబ్నగర్ జిల్లా పోలీస్ డాగ్ స్క్వాడ్కు కొత్త శునకం “సింధు” చేరిక – మర్యాదపూర్వకంగా జిల్లా ఎస్పీని కలిసిన సందర్భం
మహబూబ్నగర్ జిల్లా పోలీస్ డాగ్ స్క్వాడ్కు ప్రత్యేక శిక్షణ పొందిన ఎక్స్ప్లోసివ్ గుర్తింపు శునకం *“సింధు”*ను కేటాయించిన సందర్భంగా, డాగ్ హ్యాండ్లర్ పీసీ 2752 కిషోర్ జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
మొయినాబాద్లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ లో 8 నెలల కఠిన శిక్షణ పూర్తి చేసిన “సింధు” పేలుడు పదార్థాల గుర్తింపులో ప్రత్యేక నైపుణ్యం సాధించి జిల్లా భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయనుంది.
ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్, ఆర్ఐ అడ్మిన్ కృష్ణయ్య పాల్గొన్నారు. జిల్లా పోలీస్ బలగాల సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా డాగ్ స్క్వాడ్ బలోపేతం కీలకమని అధికారులు పేర్కొన్నారు.
“సింధు” చేరికతో భద్రతా చర్యలు మరింత సమర్థవంతంగా అమలవుతూ ప్రజల రక్షణలో పోలీస్ శాఖకు అదనపు బలం చేకూరనుంది.
#MahabubnagarPolice #DogSquad #PublicSafety #📰 వార్తలు
మహబూబ్నగర్ జిల్లా పోలీసు – “ప్రజా భద్రత పోలీసు బాధ్యత”
జిల్లా ఎస్.పి. శ్రీమతి డి. జానకి IPS గారి ఆదేశాల మేరకు,
19.02.2026 తేదీన జడ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని
కస్తూర్బా గాంధీ విద్యాలయంలో
సురక్ష పోలీసు కళాబృందం, AHTU టీం, మరియు శ్రీరామ చారిటబుల్ ట్రస్ట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో
విద్యార్థుల భద్రతపై సామాజిక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
విద్యార్థులు చదువుపై పూర్తి దృష్టి పెట్టి క్రమశిక్షణతో జీవిస్తే మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందని తెలిపారు. టీనేజ్ వయసులో అనవసరపు ఆకర్షణలకు, మొహా వ్యామోహాలకు లోనై విలువైన జీవితాన్ని, బంగారు భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకోవద్దని హితవు పలికారు.
చదువుకోవాల్సిన వయసులో చదువుపైనే దృష్టి పెట్టాలని, బాల్య వివాహాల వల్ల బాలికల జీవితం దుర్భరంగా మారుతుందని, అలాంటి ఘటనలు ఎక్కడైనా గమనిస్తే వెంటనే 1098 చైల్డ్ హెల్ప్లైన్ కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
అలాగే గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, పోక్సో చట్టం – 2012, సైబర్ భద్రత గురించి వివరించి, సోషల్ మీడియా ద్వారా అపరిచితుల ఫ్రెండ్ రిక్వెస్టులు, వీడియో కాల్స్, ఫోటోలు షేర్ చేయడంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఆన్లైన్ వేధింపులు, బెదిరింపులు ఎదురైతే వెంటనే తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు లేదా పోలీసులకు తెలియజేయాలని సూచించారు.
బాలికలు ఆత్మవిశ్వాసంతో మాట్లాడడం, అవసరమైతే “నో” అని స్పష్టంగా చెప్పడం, ఒంటరిగా ఉన్నప్పుడు అనుమానాస్పద పరిస్థితుల్లో సహాయం కోరడం చాలా ముఖ్యమని తెలిపారు. మహిళలు, బాలికలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ Dial 100 లేదా షీ టీం నంబర్ 8712659365, AHTU నంబర్ 8712680066 ను నిర్భయంగా సంప్రదించాలని అన్నారు.
కార్యక్రమంలో
SO శ్రీమతి తబస్సుం,
శ్రీమతి సుజాత ఎస్ఐ,
శ్రీరామ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి బండి వేణు
ఉపాధ్యాయులు, విద్యార్థినులు, AHTU టీం, సురక్ష పోలీసు కళాబృందం సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
#MahabubnagarPolice #📰 వార్తలు
హెల్మెట్ వినియోగంపై అవగాహన – “అలైవ్ అర్రైవ్” కార్యక్రమం విజయవంతం
రోడ్డు భద్రత కోసం అడ్డాకల్ టోల్ ప్లాజా వద్ద అడ్డకల్ పోలీసుల చొరవతో 100 హెల్మెట్ల ఉచిత పంపిణీ
మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని జాతీయ రహదారి–44 పై రోడ్డు భద్రతను బలోపేతం చేయడం లక్ష్యంగా చేపట్టిన “అలైవ్ అర్రైవ్” కార్యక్రమంలో భాగంగా ఈరోజు అడ్డాకల్ టోల్ ప్లాజా వద్ద ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.
అడ్డాకల్ పోలీసుల ఆధ్వర్యంలో, వెస్ట్రన్ ఆంధ్ర టోల్ వేస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సహకారంతో హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించి, భద్రతా చర్యల ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా హెల్మెట్ లేని వాహనదారులకు 100 హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అడ్డాకల్ ఎస్సై శ్రీనివాస్ గారు, అడ్డాకల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, అడ్డాకల్ టోల్ ప్లాజా ప్రతినిధి రఘునందన్ మరియు వారి సిబ్బంది, వెస్ట్రన్ ఆంధ్ర టోల్ వేస్ ప్రైవేట్ లిమిటెడ్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అడ్డాకల్ ఎస్సై శ్రీనివాస్ మాట్లాడుతూ —
రోడ్డు ప్రమాదాలలో తల గాయాలు ప్రధాన కారణంగా ప్రాణనష్టం జరుగుతున్నదని, హెల్మెట్ ధరించడం వాహనదారుల ప్రాణాలను రక్షించే అత్యంత ముఖ్యమైన భద్రతా చర్య అని తెలిపారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ నియమాలను పాటించి సురక్షిత ప్రయాణాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు.
మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారు ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన వెస్ట్రన్ ఆంధ్ర టోల్ వేస్ ప్రైవేట్ లిమిటెడ్ అధికారులకు మరియు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. అడ్డాకల్ పోలీసుల చొరవతో ప్రజల భద్రత దృష్ట్యా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ, ఇటువంటి రోడ్డు భద్రతా చర్యలు కొనసాగించాలని సూచించారు.
ప్రజలు రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ, తమ ప్రాణాలను మరియు ఇతరుల ప్రాణాలను కాపాడుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
#MahabubnagarPolice #helmetawareness #📰 వార్తలు
ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు శాంతియుతంగా నిర్వహించండి – నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలుఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపిఎస్ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా జిల్లాలో నిర్వహించబడే ఉత్సవాలు, ర్యాలీల దృష్ట్యా శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ మరియు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు జిల్లా ఎస్పి శ్రీమతి డి.జానకి, ఐపిఎస్ గారు నిర్వాహకులకు క్రింది కఠిన సూచనలు జారీ చేశారు.జిల్లా ఎస్పి గారి సూచనలు – తప్పనిసరిగా పాటించవలసినవి1. ర్యాలీలు, కార్యక్రమాలు నిర్వహించడానికి ముందుగా పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి.2. పోలీసులు సూచించిన మార్గాల్లోనే ర్యాలీ నిర్వహించాలి.3. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా సమయపాలన పాటించాలి.4. ప్రధాన రహదారులను దిగ్బంధం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.5. డీజేలు, అధిక శబ్ద పరికరాలు ఉపయోగించరాద.6. శబ్ద కాలుష్య నియంత్రణ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.7. అశాంతి లేదా ఉద్రిక్తతలకు దారితీసే నినాదాలు, ప్రవర్తన చేయరాదు.8. ర్యాలీ భద్రత కోసం నిర్వాహకులు స్వచ్ఛంద సేవకులను నియమించాలి.9. మహిళలు, పిల్లలు, వృద్ధులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలి.10. ర్యాలీలో పాల్గొనే వాహనాలు నియంత్రిత వేగంతో నడపాలి.11. ప్రజా ఆస్తులకు నష్టం కలిగితే నిర్వాహకులపై బాధ్యత ఉంటుంది.12. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.13. మద్యం సేవించి ర్యాలీలో పాల్గొనడం పూర్తిగా నిషేధం.14. అత్యవసర వాహనాల రాకపోకలకు మార్గం ఖాళీగా ఉంచాలి.15. పోలీసు సిబ్బంది సూచనలు తప్పనిసరిగా పాటించాలి.16. అనుమతి నిబంధనలు ఉల్లంఘించినా, ట్రాఫిక్కు అంతరాయం కలిగించినా చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి.17. డీజేలు లేదా నిషేధిత శబ్ద పరికరాలు ఉపయోగించినట్లయితే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి.18. చట్టవ్యతిరేక చర్యలు, శాంతి భద్రతలకు భంగం కలిగించే కార్యక్రమాలపై కఠిన చర్యలు తీసుకోబడతాయి.19. పోలీసుల ఆదేశాలను పాటించని నిర్వాహకులపై సంబంధిత చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయబడతాయి.శాంతియుత వాతావరణం కాపాడేందుకు నిర్వాహకులు పోలీసులకు పూర్తి సహకారం అందించాలి.జిల్లా ఎస్పి గారు నిర్వాహకులు నిబంధనలు పాటించి శాంతియుతంగా ఉత్సవాలు నిర్వహించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని హెచ్చరించారు.#MahabubnagarPolice #📰 వార్తలు
రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల్లో జిల్లాకు, జోగులాంబ జోన్కు మంచి పేరు తీసుకురావాలి – జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్
క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణతో ఉత్తమ ప్రతిభ కనబరచాలని క్రీడాకారులకు ప్రేరణ
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ స్పోర్ట్స్ గేమ్స్ మీట్లో పాల్గొనబోయే మహబూబ్ నగర్ జిల్లా క్రీడాకారులు మహబూబ్నగర్ జిల్లాకు మరియు జోగులాంబ జోన్కు మంచి పేరు తీసుకురావాలని జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారు ఆకాంక్షించారు.
ఫిబ్రవరి 17 నుండి హైదరాబాద్లో ప్రారంభమయ్యే రాష్ట్ర స్థాయి పోలీస్ స్పోర్ట్స్ గేమ్స్ మీట్కు ఎంపికైన క్రీడాకారులను ఉద్దేశించి ఎస్పీ గారు మాట్లాడుతూ, క్రీడలు కేవలం పోటీలు మాత్రమే కాకుండా పోలీస్ శాఖలోని క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, సహనశక్తి మరియు నాయకత్వ లక్షణాలను ప్రతిబింబించే వేదిక అని తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు జిల్లా ఎస్పీ గారు స్పోర్ట్స్ కిట్లు, ట్రాక్ సూట్లు మరియు స్పోర్ట్స్ షూస్ అందజేశారు. క్రీడాకారులు సరైన సాధనతో, పూర్తి నిబద్ధతతో పోటీల్లో పాల్గొని మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు.
రాష్ట్ర స్థాయి వేదికపై పాల్గొనే ప్రతి క్రీడాకారుడు తన వ్యక్తిగత ప్రతిభతో పాటు జిల్లా మరియు జోన్ ప్రతిష్ఠను ప్రతిబింబిస్తాడని స్పష్టం చేశారు. గెలుపు లక్ష్యంగా కఠిన సాధన చేయాలని, నిరంతర శిక్షణ, క్రమశిక్షణ, మానసిక దృఢత్వం విజయానికి మూలాధారాలని పేర్కొన్నారు.
మైదానంలో చూపే ప్రతీ ప్రదర్శన పోలీస్ శాఖ ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొంటూ, క్రీడాస్ఫూర్తితో, సంపూర్ణ నిబద్ధతతో పోటీల్లో పాల్గొనాలని సూచించారు.
క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలలో మెరుగైన ఫలితాలు సాధించి జిల్లాకు మరియు జోన్కు మంచి పేరు తీసుకురావాలని ఎస్పీ గారు పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో AR అదనపు ఎస్పీ సురేష్ కుమార్, RI లు అడ్మిన్ కృష్ణయ్య, నగేశ్, RSI సత్యం మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.
#MahabubnagarPolice #📰 వార్తలు










