జ్ఞానం ఉన్నవాళ్లే ఈ సమాజంలో బాగుపడుతున్నారా?! జ్ఞానం లేనివాళ్లు ఈ సమాజంలో బతకడం లేదా?!
ఈ ప్రశ్నలు అప్పుడప్పుడు మనకు వినిపిస్తూ ఉంటాయి. సరే సమాధానం నేను చెప్పడం కాదు కానీ మహాభారతంలో ఒక సందర్భం ఉంది అది మీకు ఇప్పుడు చెప్తాను.
అది
సాయంకాల సమయం
పాండవులు వనవాసం చేస్తున్న సమయం
తమ కుటీరానికి బయట ప్రశాంతంగా
సుఖంగా కూర్చున్న ధర్మనందనుని కడకు,
ఒక విప్రుడు తత్తరపాటుకు లోనై పరిగెత్తుకుంటూ వచ్చాడు
ఇలా అన్నాడు
" ధరణీశ్వర ధర్మరాజా !
నా అరణిని ( అగ్ని కొయ్యను ) ఒక చెట్టుకు వ్రేలాడ గట్టాను...
ఇంతలో ఒక పెద్ద లేడి పరిగెత్తుకొని వచ్చి చెట్టును ఒరుసుకుంటూ వెళ్ళింది.
తీరా చూస్తే నా అరణి దాని కొమ్ములకు తగలుకొని ఉంది . విడిపిద్దామని చూసే లోపల
అది మహా వేగంతో పారిపోతుంది.
ధర్మరాజా! అరణి లేకపోతే నేను అగ్ని కార్యాలను చేయలేను .. దయచేసి ఆ జింకను పట్టుకొని ,నా అరణి నాకు ఇప్పించవలసిందిగా ప్రార్ధన అని ధర్మరాజును అడిగాడు ఆ మిత్రుడు.
ఆలస్యం చేయకుండా వెంటనే
ధర్మరాజు విల్లంబులు పట్టుకుని తమ్ములతో కలసి ఆ లేడిని వెంబడించాడు
. కాని అతను వేసిన బాణములు ఆశ్చర్యంగా ఒక్కటి కూడా ఆ లేడికి తగల లేదు.
అలా ఆ లేడి పరిగెత్తి పాండవులను చాలా దూరం తీసుకెళ్లి ఒక భయంకరమైన అడవిలో మాయం అయింది.
పాండవులు అలసి పోయి ఒక చెట్టుకింద విశ్రాంతి తీసుకుంటున్నారు.
అప్పుడు నకులుడు అన్నాడు ధర్మరాజును చూసి
" అన్నయ్యా ! మనం ఉన్నత వంశంలో పుట్టాము. ధర్మశాస్త్రాలు చదువుకున్నాము. అందరి ఎడల కరుణ కలిగి ఉన్నాము. కాని ఇంతటి దుర్గతి రావడానికి గల కారణం ఏమిటి? " అని అడిగాడు.
గొప్ప వివేకం గల ధర్మరాజు నవ్వి " నకులా! సుఖం కాని దుఃఖం కాని మనకు కలగడానికి కారణం మన చేసుకున్న కర్మే... వేరే ఏమి చెప్పిన కుదరదు " అన్నాడు.
ధర్మము కర్మము అని అంటున్న అన్నగారి మాటలు విని భీముడు నకులుని చూసి " తమ్ముడా ! ఆ రోజు ప్రాతిగామి ద్రౌపదిని కొలువు కూటమికి తీసుకుని వచ్చినప్పుడే ఆ దృతరాష్ట్రుని కొడుకులను నరికి ఉంటే ఈ కష్టాలు తప్పేవి " అన్నాడు.
భీముడు అలా పలకగానే అర్జునుడు అందుకుని నకులా ! అదియును కాక ఆ రోజు ఆ సూతుని కొడుకు నిండు కొలువులో పలికిన మాటలకు మనం ఆగ్రహించక ఇలా పిరికి వారి వలె అడవులకు వచ్చామే. అదే అసలు మనకు అంతులేని కష్టాలకు కారణం.
జరుగుతున్న సంభాషణను విని రోషంతో సహదేవుడు సోదరులారా ! చెడు నడత కలవాడు, మాయాజూదం ఆడే ఆ గాంధార సుతుని శకునిని అడ్డంగా నరికి ఉంటే ఈ దుర్దశ తప్పేది కదా " అన్నాడు సహదేవుడు.
ఈ రీతిగా అవగాహన లేక తన తమ్ముళ్లు అందరూ తమకు తోచిన రీతిగా మాట్లాడుతుంటే అజాత శత్రువైన ధర్మరాజు నకులు ని చూసి ఇలా అన్నాడు "
సరేగాని నకుల! ప్రస్తుతం నీ అన్నయ్యలు అందరూ చాలా దాహంతో ఉన్నారు. నీళ్ళు ఎక్కడైనా ఉన్నాయేమో చూడు " అన్నాడు
అప్పుడు
నకులుడు చెట్టు ఎక్కి నలువంకల పరిశీలించాడు. కొంచం దూరంలో కనిపిస్తున్న కొలను కనిపించింది , ఆ విషయాన్ని అన్నలతో చెప్పాడు.
ధర్మరాజు " అయితే నీవు పోయి నీరు త్రాగి మాకు కొంత నీరు తీసుకురా " అన్నాడు.
నకులుడు రమణీయమైన ఆ కొలను వద్దకు వెళ్ళి నీళ్ళు త్రాగబోయే సమయంలో శరీరం లేని ఒక భూతం ఇలా పలికింది. " అన్నా! ఈ తటాకము నాది. నీవు ఈ తటాకములో నీరు త్రాగాలంటే ... నీవు బుద్ధిమంతుడవై నా ప్రశ్నలకు ప్రత్యుత్తరం ఇవ్వాలి " అని చెప్పింది.
వెంటనే నకులుడు శరీరం లేని దాని మాటలను పట్టించుకోకుండా రుచికరమైన ఆ జలాలను త్రాగాడు పిదప ఒడ్డుకు వచ్చి చైతన్యం లేని వాడై పడి పోయాడు.
నీళ్ళకు వెళ్ళిన నకులుడు ఎంతకీ రాకపోయే సరికి ధర్మరాజు సహదేవుని చూసి " సహదేవా! నీ అన్నయ్య నకులుడు నీళ్ళు తీసుకు రావటానికి వెళ్ళి చాలాసేపు అయింది. నీవు వెళ్లి నకులుని వెంటబెట్టుకుని నీరు తీసుకుని రా " అని చెప్పి పంపించాడు.
సహదేవుడు నకులుడు వెళ్ళిన దిశగా వేగంగావెళ్ళి .. ఆకొలను వద్ద సృహ తప్పి పడిపోయిన నకులుని చూసి ఆశ్చర్యపడి... దుఃఖంతో మునిగి ఏం జరిగిందో అని ఆలోచిస్తూ... దాహం ఎక్కువగా ఉండటం చేత నీరు తాగడానికి ఉద్యుక్తుడయ్యాడు. ఆ సమయంలో ఇదివరకు లాగే శరీరం లేని ఆ భూతం ఇలా అన్నది " మహానుభావా! ఈ కొలను నాది. సాహసంతో ఇందులో దిగవద్దు. నా ప్రశ్నలకు సమాధానం చెప్పి ఆ తరువాత నీరు త్రాగు " అని పలికింది.
సహదేవుడు ఆ మాటలు లక్ష్యపెట్టక కొలనులో దిగి నీరు త్రాగాడు. వెంటనే సహదేవుడు విషం త్రాగిన వాడు సృహ తప్పి పడిపోయినట్లు,నరకబడిన పెద్ద మద్ది చెట్టు నిలువుగా పడిపోయినట్లు పడిపోయాడు.
పోయిన ఇద్దరూ ఎంతకీ రాక పోయే సరికి ధర్మరాజు కు హృదయంలో బాధ అతిశయించగా... అర్జునిని చూసి " నాయన ! నీ ప్రియమైన తమ్ములు నీళ్ళకు వెళ్ళి ఇంతవరకు రా లేదు...ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఏం జరిగిందో ఏమో అర్థం కావడం లేదు. నీవు వెంటనే బయలుదేరి వెళ్లి నీ తమ్ములిద్దరి ని వెంట పెట్టుకొని నీళ్లు తీసుకుని రా. " అని చెప్పి పంపించాడు.
అర్జునుడు చాలా వేగంతో కొలను సమీపించి అక్కడ గట్టు పై పడి ఉన్న తన తమ్ముళ్ళు.
నకుల సహదేవులను చూచి ఆశ్చర్యపడి... దుఖం తో నిండి పోయాడు.
అర్జునుడు నలుదిక్కుల చూశాడు అక్కడ అతనికి ఏమీ కనిపించలేదు దాహం అధికమవడం చేత కొలనులోకి దిగాడు.
అర్జునుడు అలా నీరు త్రాగడానికి కొలన్ల్లోకి దిగగానే ఆ శరీరం లేని భూతం ఇలా అన్నది.....
ఈ నీటి కొలను నాది, నా వశములో ఉన్నది. ఎవరైనా నీరు త్రాగదలిస్తే నేను అడిగే ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పాలి అలా చెప్పకుండా నీరు త్రాగడానికి ప్రయత్నిస్తే అదిగో చూసావు కదా వారిలాగానే పడిపోతారు అని ఆ భూతం హెచ్చరించింది.
శరీరం లేని ఆ భూతం పలికిన మాటలు విని అర్జునునికి ఎక్కడలేని కోపం వచ్చేసింది ... నలు వంకలు చూస్తూ ఇలా అన్నాడు ఒక దొంగ వలె మాటున దాగి నీ ఇష్టం వచ్చినట్లు పలుకు తున్నావు నీ మాటలు ఇక సహింప జాలను. అని అర్జునుడు హెచ్చరించి తన ధనుస్సును ఎక్కుపెట్టి, ఆ భూతం పలికిన వైపుగా లక్ష్యాన్ని ఎంచుకొని తీవ్రమైన బాణాలను , దిక్కులు అదిరే టట్లుగా సంధించాడు.
అర్జునుడు అలా శబ్ద భేది బాణాలను విడిచి నప్పటికీ కూడా మునుపటిలా గానే ఆ శరీరం లేని భూతం"మంచిగా చెప్తే మీకు అర్థం కాదు" అని పలికింది.
బాణాలు సంధించి సంధించి అలసిపోయి అర్జునుడు దాహం తట్టుకొనలేక నీరు త్రాగి వెంటనే కొయ్య బొమ్మ లాగా పడిపోయాడు.
వెళ్ళిన ముగ్గురూ రాక పోయే సరికి ధర్మరాజు ఆందోళన చెంది భీముని చూసి " భీమా వెళ్ళిన ముగ్గురూ తిరిగి రాలేదు. ఏమి జరిగిందో చూసిరా " అని పంపాడు.
భీముడు కొలను సమీపించి నిదుర చెందినవారి వలె పడి ఉన్న ముగ్గురు తమ్ముళ్లను చూచి ఏం జరిగిందో అర్థం కాక దుఃఖంలో మునిగి పోయాడు.
వెంటనే భీముడు దుఃఖం నుండి తేరుకుని ఇది మనుషులు చేసిన పని కాదు ఏదో అతీతమైన శక్తి ఇలా చేస్తున్నది ...సరే ఏదేమైనా తర్వాత ఆలోచిస్తాను ఈ దాహాన్ని నేను భరించ లేకపోతున్నాను అని తలచి నీరు త్రాగడానికి కొలను లోకి దిగాడు.
మరలా అదే అశరీరవాణి " ఎందుకయ్యా ఇంత సాహసానికి పూనుకుంటావు నీకు శక్తి ఉంటే నాప్రశ్నలకు సమాధానం చెప్పి నీళ్ళు త్రాగు " అన్నది.
విపరీతమైన దాహంతో ఉన్న భీముడు ఆ మాటలు వినిపించుకోకుండా కొలనులో నీళ్ళు త్రాగి స్పృహతప్పి పడి పోయాడు.
వెళ్ళిన తమ్ము ల్లెవరూ రాకపోవడం చూసి , ఆవేదన చెందిన ధర్మరాజు .. లోగడ వారు వెళ్లిన మార్గాన్ని అనుసరిస్తూ నడవసాగాడు .
భయంకరమైన అడవిలో ధర్మరాజు నడవసాగాడు ఆయనకు నర సంచార వినికిడి ఏమీ వినిపించ లేదు.
దారి తెన్నులు తెలియటం లేదు.ఎచ్చట చూసిన నడవడానికి వీలు లేని రాళ్ళు రప్పలు కొండకోనలు చెట్ల పొదలు తీగలు అడ్డు తగులుతున్నాయి. గజ సింహ శార్దూల సూకర ఎనుబోతు లు తిరుగాడుతున్నాయి.
పెక్కు రకాల భయంకరమైన పక్షుల కలకలా రాగాలు వినిపిస్తున్నాయి.
అలా ఆ దట్టమైన అడవిలో పుణ్యాత్ముడు అయిన ధర్మరాజు తమ్ముళ్ళను వెతుక్కుంటూ కొలను వద్దకు చేరాడు.
పరిసరాలను పరిశీలించగానే స్పృహతప్పి పడిపోయిన తమ్ములు - పూరువంశ శ్రేష్టులు... మిక్కుటమైన బలం కలిగిన వారు... నిర్మలమైన బుద్ధి కలిగిన వారు... గొప్ప పుణ్యాన్ని ఆర్జించిన ధర్మాత్ములు ఆయన భీమసేన అర్జున నకుల సహదేవులను చూశాడు.
ప్రళయకాలంలో పడిపోయిన దిక్పాలకుల వలే వారు కొలను గట్టుపై సృహ తప్పి పడి ఉన్నారు.
తమ్ముళ్ళను చూచిన ధర్మరాజు కొయ్యబారిపోయి కదలక మెదలక నిశ్చేష్టుడై చిత్రంలోని బొమ్మ మాదిరిగా నిలబడిపోయాడు.
ఆ దృశ్యం చూసేసరికి ధర్మరాజు యొక్క హృదయం తల్లడిల్లిపోయింది. ముఖం పాలిపోయింది వేడి నిట్టూర్పులు వదులు తున్నాడు.
కొంతసేపటికి తేరుకుని చుట్టూ కలయ చూసాడు. అక్కడ ఏమీ ఇతరుల అడుగుజాడలు కనిపించ లేదు. " వారికై వారు అలా కూలి పోవడానికి కారణం తెలియడం లేదు.
ఈ కొలనులో నీరు విషపూరితం అనడానికి.. వారి ముఖ ములు కాంతి తగ్గలేదు వారి శరీరంలో విష ప్రయోగం జరిగిన లక్షణాలు కనిపించ లేదు.
ఒక వేళ సుయోధనుడు అతని మిత్రు లెవరైనా ఇలా చేసారా అని అనుకుంటే ఇతరుల జాడలు ఏమియు అక్కడ గోచరించడం లేదు. మరి ఇదేమీ మాయ నా ఊహకు అంతుచిక్కడం లేదు.
తండ్రి అయిన నేరానికి ధృతరాష్ట్రుని మాటలు గౌరవించి మాయాజూదం అని తెలిసి కూడా ధర్మాన్ని తప్పక శకునితో జూదమాడి ఓడిపోయి రాజ్యసంపద పోగొట్టుకుని అమాయకులైన నా తమ్ముల్లను , సుకుమారియగు ద్రౌపదినివెంటబెట్టుకొని, వారిని ఈ అరణ్య వాసానికి బలి చేశాను... ఓ దైవమా ! మా రాతలు ఇలా ఎందుకు రాశావు నీకు ఇది న్యాయమా అని ధర్మరాజు విలపించాడు.
అధికమైన దాహం కలవాడు అయిన ధర్మరాజు నీరు తాగాలని కొలనులోకి దిగగానే
అప్పుడు ఆశరీరవాణి " ధర్మరాజా! నేను ఒక కొంగను ఈ కొలను నాది నీ తమ్ములు నా మాట వినక ఈ కొలనులో నీరు త్రాగి ఇలా స్పృహతప్పి పడి పోయారు. నీవూ నా మాట వినక కొలనులో నీరు త్రాగితే వారికి పట్టిన గతే నీకు పడుతుంది కనుక నా ప్రశ్నలకు జవాబు చెప్పి ఈ కొలనులో నీళ్ళుత్రాగు " అని పలికింది.
నీరు తాగాలని కొలనులోకి వంగిన ధర్మరాజు , ముఖము తిప్పి ఆకాశం వైపు చూసి.. అయ్యా! కొంగ రూపం ధరించిన నీవు రుద్రుడవో, అగ్నిదేవుడవో, వాయుదేవుడివో అయి ఉంటావు కానీ కొంగవు మాత్రం కాదు
అత్యంత పరాక్రమవంతులైన నా తమ్ములు ఇలా పడి పోరు.
నీవు ఎవరు? నీ తలపు ఏమిటి, చెప్పు " అని వచిస్తున్నంత లో... ఆ యక్షుడు ధర్మరాజు ముందు ప్రత్యక్షమయ్యాడు.
కొలను చివర తాటి చెట్టు వలె ఎత్తైన శరీరం కలిగి, దేదీప్య మైన కాంతితో ప్రకాశిస్తూ గొప్ప భయంకరుడై తీవ్ర శబ్దం చేస్తూ ఉన్న అతనిని చూచి మిగతా భూతాలన్నీ బెదిరి పారిపోయాయి..
ఈ విధంగా నిలబడి యక్షుడు ధర్మరాజుతో " వాస్తవానికి నేను కొంగను కాను యక్షుడను. నీ తమ్ములు నన్ను అవమానించి పడి పోయారు. నా అనుమతి లేకుండా నీరు త్రాగితే ఎవరైనా ఇలా పడిపోతారు.
నీవు తెలివి కలవాడవు కనుక నీరు త్రాగలేదు. కనుక నేను వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పు " అన్నాడు.
అప్పుడు ధర్మరాజు " అయ్యా! సర్వజ్ఞుడైన నీ వంటి వారికి సమాధానం చెప్పటం - అల్ప జ్ఞుడనైనా నా తరమా. అయినను నాకు తెలిసిన విధంగా సమాధానాలు చెప్తాను " అన్నాడు.
యక్షుడు:- సూర్యుని ఎవరు నడుపుతున్నారు?
సూర్యుని ఎవరు కొలుస్తున్నారు? సూర్యుడు అస్తమించడం
అంటే ఏమిటి?
సూర్యునికి ఆధారభూతం ఏమిటి?.
ధర్మరాజు;- సూర్యుని బ్రహ్మం నడుపుతుంది.
దేవతలు సూర్యుని కొలుస్తారు.
సూర్యుడు తన ధర్మాన్ని అనుసరిస్తూ అస్తమిస్తాడు.
సూర్యునికి సత్యమైన సాక్షి తత్వమే ఆధారం.
యక్షుడు:-
పురుషుడు శ్రోత్రియుడు ఎలా ఔతాడు?
పురుషునికి మహిమలు ఎలా సిద్ధిస్తాయి?
పురుషునికి సాయం ఎవరు?
పురుషుడు బుద్ధిమంతుడు ఎలా ఔతాడు?
ధర్మరాజు;- శ్రుతం వలన శ్రోత్రీయుడు ఔతాడు.
అనగా వేదాధ్యయనం వలన. తపస్సు వలన మహిమలు సిద్ధిస్తాయి.
పురుషునకు అతని ధైర్యమే
అతని సాయం.
గొప్పవారికి, జ్ఞానులకు సేవచేయడం
వలన బుద్ధిమంతుడు ఔతాడు.
యక్షుడు;- బ్రాహ్మణుడు అంటే ఎవరు ?
బ్రాహ్మణుడు దైవత్వం ఎలా పొందుతాడు? అతనికి సాధుభావము ఎలా ఏర్పడుతుంది?
అతడు దుష్కృతుడు ఎలా ఔతాడు?
బ్రాహ్మణుడు ఎలా పతనం ఔతాడు?
.
ధర్మరాజు;- " సమత్వ భావనతో అంతటా బ్రహ్మమును వీక్షించే వాడే బ్రాహ్మణుడు." అనే వేద వాక్యాన్ని ఆచరిస్తూ పురుషుడు బ్రాహ్మణుడు అవుతాడు.
ధర్మ నిష్ఠ వలన సాధు స్వభావం ఏర్పడుతుంది.
అట్టి పురుషుడు ఇంద్రియ భోగాల చేత నిష్టను కోల్పోయినప్పుడు బ్రాహ్మణ పదవి నుండి పడిపోయి చండాలుడు అవుతున్నాడు.
అంతర్ బహిర్ సుచిత్వం తప్పినవాడు పతితుడౌతున్నాడు
యక్షుడు;- జీవన్మృతుడు అనగా ఎవరు?
ధర్మరాజు :-దేవతలకు, అతిథులకు, పితృదేవతలకు, తన వద్ద సేవకులకు పెట్టకుండా తినేవాడు జీవించి మరణించినట్లే.
యక్షుడు;- భూమికంటే బరువైనది ఏది? ఆకాశం కంటే పొడవైనది ఏది? గాలి కంటే వేగమైనది ఏది? గడ్డికంటే వేగంగా పెరిగేది ఏది?
ధర్మరాజు;- భూమికంటే బరువైనది కన్నతల్లి. ఆకాశంకంటే పొడవైన వాడు కన్న తండ్రి. గాలి కంటే వేగ మైనది మనసు. మనసులో కలిగిన చింత గడ్డికంటే వేగంగా పెరుగుతుంది.
యక్షుడు;- కన్నులు తెరిచి నిద్రించేది ఏది? పుట్టిన తరువాత కూడా కదలలేనిది ఏది? రూపం ఉండి కూడా హృదయం లేనిది ఏది? వేగం వలన వర్ధిల్లేది ఏది?
ధర్మరాజు ;- కన్నులు తెరిచి నిద్రించేది చేప. పుట్టిన తరువాత కదలలేనిది అండము. రూపం ఉండి హృదయం లేనిది పాషాణం. వేగం వలన వర్ధిల్లునది ఏరు.
యక్షుడు;- బాటసారికి, రోగగ్రస్తునకు, గృహస్తునకు, చనిపోయిన వారికి ఎవరు బంధువు?
ధర్మరాజు;- బాటసారికి తోటి ప్రయాణీకుడు, రోగ గ్రస్తునకు వైద్యుడు, గృహస్తునకు మంచి భార్య, చని పోయిన వారికి అతను ఆచరించిన ధర్మములు బంధువులు.
యక్షుడు;- ధర్మమునకు ఆధారం ఏది? కీర్తికి ఆశ్రయం ఏది? దేవలోకమునకు పోవు మార్గం ఏది? సుఖించుటకు మూలం ఏది?
ధర్మరాజు;- కరుణ స్వభావం ధర్మమునకు మూలం. దానం చేయుట వలన కీర్తి వస్తుంది. సత్యం పలుకుటయే దేవలోకము పోవుటకు మార్గం. మంచి ప్రవర్తన అన్ని సుఖములకు మూలం.
యక్షుడు;- నరునకు ఆత్మ ఏది? దైవీకమైన చుట్టము ఎవరు? అతడు ఏ ఆధారంగా జీవిస్తాడు? నరుడు ఎందువలన మంచితనం పొందుతాడు?
ధర్మరాజు;- సంతానమే నరునకు ఆత్మ.
భార్య దేవుడిచ్చిన చుట్టము.
అతనికి జీవనం మేఘములు కల్పిస్తాయి. దానం వలన నరుడు మంచితనం పొందుతాడు.
యక్షుడు;- ధర్మములలో గొప్ప ధర్మం ఏది?
ఏది మనకు పరిపూర్ణ ఫలితం ఇస్తుంది?
ఏది వదిలి పెడితే మనకు ఆనందం కలుగుతుంది?
ఎవరితో స్నేహం ఎప్పుడూ చెడిపోదు?
ధర్మరాజు;- అహింస పరమ ధర్మము.
యజ్ఞ యాగాదులు మనకు
పూర్తి ఫలితాలు ఇస్తాయి
. అహంకారం వదిలి పెడితే
ఆనందం కలుగుతుంది.
మంచి వారితో స్నేహంమనకు ఎప్పుడూ చెడిపోదు.
యక్షుడు;- ఈ లోకములకు దిక్కు ఎవరు?
అన్నం, జలం ఎందు వలన
సంభవిస్తాయి?
విషము అనగా ఏమి?
శ్రాద్ధ కర్మలకు ఏది సమయము?
ధర్మరాజు;- మంచివారే ఈ లోకమునకు దిక్కు.
నీరు, అన్నం మేఘం వలన
సంభవిస్తాయి. బ్రాహ్మణు( గురు)ని ధనం
విషతుల్యం.
బ్రాహ్మణుడు వచ్చినప్పుడే శ్రాద్ధమునకు మంచి సమయం
.
యక్షుడు;- మనుజుడు ఏది వదిలి పెడితే సర్వజన ప్రియుడు, శోకము లేని వాడు,ధనం కలవాడు, సుఖి ఔతాడు?
ధర్మరాజు;- గర్వం వదిలి పెడితే సర్వజన
ప్రియుడు ఔతాడు
. కోపం వదిలి పెడితే దుఃఖం ఉండదు
. లోభి కాని వాడు సంపన్నుడుఔతాడు.
అత్యాశను వదిలి పెడితే
సుఖాన్ని పొందుతాడు.
యక్షుడు;- పురుషుడు ఎవరు?
అత్యంత ధనంకలవాడు ఎవరు?
ధర్మరాజు;- ఎవడు కీర్తివంతుడో అతడే
పురుషుడు
. ప్రియము, అప్రియము,
సుఖదుఃఖములు
, జరిగినవి, జరగబోవునవి
, ఏవరు సమముగా చూచునో
అతడే అత్యంత ధనవంతుడు.
ధర్మరాజు చెప్పిన సమాధానాలు విని యక్షుడు తృప్తి చెందాడు. " ధర్మరాజా! నా ప్రశ్నలకు సమయోచితంగా బదులు చెప్పి నన్ను తృప్తి పరిచావు. నీ తమ్ములలో ఒకరి ప్రాణం తిరిగి ఇచ్చెదను కోరుకొనుము " అన్నాడు.
ధర్మరాజు "మహాత్మా! నా తమ్ముడు నకులునకు ప్రాణములు తిరిగి ఇమ్ము " అన్నాడు
. యక్షుడు " అదేమిటి భీమార్జునులను వదిలి నకులుని కోరుకున్నావు " అని అడిగాడు.
ధర్మరాజు " అయ్యా! నా తల్లికి కుంతీదేవి కుమారులలో నేను జీవించి ఉన్నాను.
మా తండ్రి రెండవ భార్య మాద్రి పుత్రులలో నకులుడు పెద్దవాడు. అందుకని అతనిని కోరుట ధర్మం కదా? " అన్నాడు.
యక్షుడు " ధర్మరాజా నీ ధర్మ నిరతికి మెచ్చాను.
నీ తమ్ములు అందరూ పునరుజ్జీవితులు కాగలరు " అని వరం ఇచ్చాడు
. వెంటనే భీమార్జున నకుల సహదేవులు నిద్ర నుండి లేచినట్లు లేచారు.
ధర్మరాజు " మహాత్మా! నీవు మామూలు యక్షుడవు కావు. నీ వెవరో ఎరిగింపుము " అని ప్రార్థించాడు.
యక్షుడు " ధర్మరాజా ! నేను యమధర్మరాజును. నిన్ను చూడవలెనని కోరిక కలిగి వచ్చాను. సత్యము, సౌచము, దానము, తపము, శమము, కీర్తి, వివేకము నా యొక్క మూర్తులు. పైగుణములను ఆశ్రయించిన వారు దుర్గతిని పొందరు. నీవు కోరిన వరాలు ఇస్తాను కోరుకో " అన్నాడు యమధర్మరాజు.
ధర్మరాజు " యమధర్మరాజా ! నా ఆశ్రమంలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణుని అరణిని ఒక లేడి అపహరించింది. దానిని తిరిగి ప్రసాదింపుము " అని అడిగాడు.
యమధర్మరాజు " ధర్మరాజా ! నేనే ఆ లేడిని, నీ మనస్సు ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకోవడానికి ఆ అరణిని నేనే తీసుకు వచ్చాను, ఇదిగో అరణి తీసుకో " అని అరణిని తిరిగి ఇచ్చాడు.
యమధర్మరాజు " పాండవులారా ! మీకు పన్నెండేళ్ళు అరణ్యవాసం పూర్తి అయింది. ఇక ఒక సంవత్సరం అజ్ఞాత వాసం మిగిలి ఉంది. అజ్ఞాత వాస సమయంలో మీకు ఏరూపాలు కోరితే ఆరూపాలు వస్తాయి. మిమ్మలిని ఎవరూ గుర్తింపకుండా వరం ఇస్తాను. మరొక వరం కోరుకో " అన్నాడు. ధర్మరాజు
" దేవతలలో ఆది దేవుడవు - సాక్షాత్ పరమ శివుడు అట్టి నీ దర్శనం కంటే నాకు కావలసినది ఏముంది.
నా మనస్సు ఎల్లప్పుడూ ధర్మమార్గాన చరించేలా, క్రోధము, మోహం వంటి దుర్గుణాలు నా దరి చేరకుండా వరం ప్రసాదించు " అన్నాడు.
యమధర్మరాజు అలాగే వరం ఇచ్చి అంతర్ధానం అయ్యాడు.
ధర్మరాజు అరణిని బ్రాహ్మణునికి ఇచ్చి అతని ఆశీర్వాదం పొందారు ఆ ప్రకారం పాండవులు తమ అరణ్యవాసం పూర్తి చేసారు.
#🗣️జీవిత సత్యం #😃మంచి మాటలు #తెలుసుకుందాం