#తమిళనాడు రాజకీయాలు 🚩🥱
*స్టాలిన్ విచక్షణ❗*
MAY 12, 2026🎯
ఆదివారం విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడంటే దానికి కారణం స్టాలిన్ చూపిన రాజకీయ విచక్షణ! ఫలితాలు వెలువడిన రాత్రి నుంచి ప్రారంభమైన సస్పెన్స్ థ్రిల్లర్కు శనివారం తెరదించడమైంది. స్టాలిన్ స్వల్పకాలిక ప్రయోజనాలను కాకుండా దీర్ఘకాలిక రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని, టివికెకు మద్దతిచ్చే నిర్ణయంలో తన కూటమి భాగస్వాములకు స్వేచ్ఛ నిచ్చి ఏదో ఒకలా ప్రభుత్వం ఏర్పడేట్లు చూశాడు. ఆ విధంగా బిజెపి నుంచి తనను తాను కాపాడుకోవడంతో పాటు, ప్రజాగ్రహానికి గురి కాకుండా కూడా చూసుకున్నాడు. దాంతో పాటు ద్రవిడ వాదంలో తన పోటీదారైన ఎడిఎంకెను క్షీణింప చేసి, ఆ వాదానికి ఏకైక
వారసుడిగా తన పార్టీనే నిలిపే ప్రయత్నమూ చేస్తున్నాడు.
గవర్నరు విన్యాసాలు
టివికె అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీగా నిలిచినప్పుడు సంప్రదాయం ప్రకారం గవర్నరు దాని నాయకుణ్ని ఆహ్వానించి, ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి, రెండు, మూడు వారాలు గడువిచ్చి, బలాన్ని కూడగట్టుకుని అసెంబ్లీ ఫ్లోర్పై నిరూపించుకో అంటారు. నిరూపించుకుంటే ముఖ్యమంత్రిగా కొనసాగుతాడు, లేకపోతే రాజీనామా చేసి దిగిపోతాడు.
అప్పుడు మా దగ్గర తగినంత సంఖ్యాబలం వుందంటూ ఏ కూటమైనా ముందుకు వస్తే వాళ్లకీ ఛాన్సిచ్చి చూస్తారు. దీనికి ఎన్నో ఉదాహరణలున్నాయి. అవసరమైన సంఖ్య కంటే 110 సీట్లు తక్కువ వున్నా, ప్రధాన ప్రతిపక్షం కంటే 9% ఓట్లు తక్కువ తెచ్చుకున్నా, వాజపేయికి ఛాన్సిచ్చి 13 రోజుల పాటు దేశాన్ని పాలించ నిచ్చారు. ఇప్పుడు కూడా గవర్నరు రాజేంద్ర ఆర్లేకర్ విజయ్ను ఆహ్వానించి ప్రభుత్వ ఏర్పాటుకై ప్రయత్నించమని చెప్పాలి. అతని తరహా చూస్తే ప్రభుత్వం ఏర్పడకుండా వుండాలని చూసినట్లుంది. మే 4 రాత్రి కల్లా ఫలితాలు వచ్చి, టివికె సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన తర్వాత కూడా గవర్నరు పిలవలేదు. చివరకు విజయ్ మే 6 మధ్యాహ్నం 3.30కి తనంట తనే వెళితే 10 సీట్లు తక్కువయ్యాయి, నీకు అవకాశం యివ్వనన్నాడు.
తర్వాత కూడా మీకు 108 ఎలా వుంటాయి? నువ్వొక సీటు వదులుకోవాలి కదా, ఒకటి తగ్గుతుంది కదా, (తగ్గితే మాత్రం, మళ్లీ వాళ్ల పార్టీ సభ్యుడే గెలిచే అవకాశం వుంది), లేఖ వుంది కానీ దానిపై సంతకాలు లేవు, ఇంకో లేఖపై సంతకం వుంది కానీ అది ఫోర్జరీట, యిలా ఎన్ని మడత పేచీలు పెట్టాలో అన్నీ పెట్టాడు. అవన్నీ చూసుకోవలసిన వ్యవస్థలు వేరే ఉన్నాయి. చివరకు చిల్లర పార్టీలు నానా మల్లగుల్లాలు పడి, ఒక తాటి మీదకు వచ్చాక తప్పనిసరై పిలిచాడు. అధికార పార్టీకి మెజారిటీ వుందో లేదో తేలవలసినది అసెంబ్లీలో తప్ప, రాజభవన్లో కాదని ఎన్నో సార్లు కోర్టులు చెప్పడం జరిగింది. అయినా గవర్నర్లు తమ చిత్తం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. అది అన్యాయమని గోలపెడితే కావాలంటే కోర్టుకి వెళ్లు అంటారు. ఈలోగా పుణ్యకాలం గడిచిపోతుంది. ప్రభుత్వం పడిపోతుంది. మద్దతిచ్చిన పార్టీలు జారిపోతాయి.
బిజెపి విముఖత
గవర్నర్లు తమ యిష్టప్రకారం కాక కేంద్రంలో వున్న అధికార పార్టీ చిత్తానికి అనుగుణంగా, వారి ప్రయోజనాలను కాపాడడానికి పని చేస్తారనేది బహిరంగ సత్యం. తమిళనాడులో విజయ్ పార్టీ అధికారంలో రావడం బిజెపి సుతరామూ యిష్టం లేదన్నది కూడా సర్వవిదితం. తమిళనాడు ఓటర్లపై సినిమా నటుల ప్రభావం వుందని గ్రహించిన బిజెపి, అక్కడ వ్యాపించడానికి రజనీకాంత్ను దువ్వింది. అతను తాత్సారం చేసి, చేసి అందరికీ విసుగెత్తించాడు. పివి హయాంలో కాంగ్రెసు
వాళ్లూ అలాగే ప్రయత్నించారని పివిఆర్కె తన పుస్తకంలో రాశారు. తర్వాత బిజెపి అందుకుంది. రజనీకాంత్కు తెగింపు లేక వ్యవహారం ఎప్పటికీ తెగలేదు. ఆ తర్వాత బిజెపి విజయ్ను కలుపుకుందామని చూశారు. అతను ససేమిరా అనడంతో మోదీ గారు ‘జోసెఫ్' అంటూ ఒత్తి పలికి విజయ్ పేరు ప్రస్తావిస్తూ ఉపన్యాసాలు యిచ్చారు.
ఏం చేసినా విజయ్ యిటు రాలేదు. చివరకు యీ ఎన్నికల ముందు కూడా పవన్ కళ్యాణ్ చేత రాయబారం పంపించారు. ఇద్దరం కలిసి ఉమ్మడి శత్రువైన డిఎంకెను ఓడిద్దాం అని. విజయ్ కుదరదన్నాడు. ఈ స్థాయి విజయం వస్తుందని ఊహించాడని అనుకోవడానికి మనకు మనసు ఒప్పదు కాబట్టి, యీ సారి ఒంటరిగా నిలబడితే, తన సొంత బలమెంతో అందరికీ తెలిసి, వచ్చేసారి ఎవరితోనైనా కూటమి కట్టేటప్పుడు సీట్ల సంఖ్యపై బేరమాడడానికి పనికి వస్తుందని లెక్క వేశాడని అనుకుందాం. బిజెపితో పొత్తు పెట్టుకున్న ఎడిఎంకెను పెద్దగా ఏమీ అనలేదు, ప్రతిపక్షంలో వుందని కాబోలు. కానీ బిజెపిని మాత్రం తన సైద్ధాంతిక శత్రువుగా ప్రకటించాడు. ఇలాటి వాణ్ని బిజెపి అధికారం లోకి రానిస్తుందా?
కాంగ్రెసు ఓవరాక్షన్
పైగా కాంగ్రెసు ఓవరాక్షన్ చేసి, వ్యవహారాన్ని చెడగొట్టింది. ఎన్నికలకు ముందు టివికె పార్టీ కాంగ్రెసును భాగస్వామిగా చేసుకుందామని ప్రయత్నించింది. కానీ దానికి నెగ్గే ఛాన్సు లేదనుకున్న కాంగ్రెసు డిఎంకెతో మాది దశాబాల బంధం. గత
20 ఏళ్లగా ఏకధాటిగా సాగుతోంది. మేం అడిగినన్ని సీట్లు యివ్వకపోయినా మేం వాళ్లను వదిలి రాము అంటూ నీతులు చెప్పింది. డిఎంకెతో హోరాహోరీ పోట్లాడి 28 సీట్లు తీసుకుని 5 గెలిచింది. ఎడిఎంకె-బిజెపిల మధ్య ఓట్ల బదిలీ జరగలేదు కానీ డిఎంకె-కాంగ్రెసు మధ్య జరిగినట్లే వుంది. అందుకే కాంగ్రెసు అవైనా గెలిచింది. అలాటిది ఫలితాలు వచ్చిన మరుక్షణం 20 ఏళ్ల బంధాన్ని పుటుక్కున తెంపి, మాటమాత్రమైనా డిఎంకెతో చెప్పకుండా టివికెకే మా మద్దతు అని ప్రకటించేసింది.
వీళ్లకు తోడు విజయ్ తండ్రి చంద్రశేఖర్ ఒకడు. అతనూ ఓవరాక్షన్లో దిట్ట. కొడుక్కి తెలియకుండా అతని పేర పార్టీ పెట్టేసి, తన జనరల్ సెక్రటరీ అయిపోయాడు. చివరకు విజయ్ అమ్మానాన్నలపై కేసు పెట్టి దాన్ని ఆపించాల్సింది. ఈ ఎన్నికలలో చంద్రశేఖర్ ప్రచారం చేసిందీ లేదు, పెట్టిందీ లేదు. అయినా గెలవగానే ‘కాంగ్రెసు మద్దతివ్వాలి' అంటూ పబ్లిగ్గా ఓ స్టేటుమెంటు పడేశాడు. ఇక తమిళనాడు మేమే గెలిచేశాం, దక్షిణాదిన మరో కాంగ్రెసు రాష్ట్రం, 5గురు ఎమ్మెల్యేల మద్దతిచ్చి, రెండు మంత్రి పదవులు తీసుకున్నాం కాబట్టి కామరాజ్ పాలన తిరిగి తెస్తాం అనడం మొదలెట్టారు. ప్రమాణస్వీకారానికి రాహుల్ గాంధీ కూడా వచ్చేశాడు, విజయ్ గెలుపులో ఆవగింజంతైనా పాత్ర లేకపోయినా!
ఏమిటిది, ఘోరం కదా అని అడిగితే కాంగ్రెసు 'మేం డిఎంకె కూటమిలో భాగమే. డిఎంకెకు ప్రభుత్వం ఏర్పాటు చేసే బలం వుండి వుంటే మద్దతిచ్చేవాళ్లం. కానీ లేదు. అలాటప్పుడు, ప్రజల
తీర్పుని శిరసావహించి, వారి కోసం టివికెకు మద్దతు ప్రకటించాం' అని సమర్థించుకున్నారు. డిఎంకెకు ప్రభుత్వం ఏర్పాటు చేసే సొంత బలం లేకపోయినా, ఎడిఎంకెతో కలిసి ఏర్పాటు చేసే ఉద్దేశం వుందేమో! ఎడిఎంకె బిజెపి పొత్తు విడిచి వస్తే కాంగ్రెసుకు అభ్యంతరమేముంటుంది? ఎడిఎంకె కూడా కొంతకాలం వాళ్లకు మిత్రపక్షమే కదా! అసలు ఏదైనా కూర్చుని మాట్లాడి డిఎంకె వ్యూహమేమిటో కనుక్కోవాలి కదా! బ్రదర్ బ్రదర్ అంటూనే బొంద పెడితే ఎలా? కాంగ్రెసు చూపించే యిలాటి బుద్ధి వలనే ఇండియా కూటమి విచ్ఛిన్నమైంది.
వేలాడే కత్తి – రాష్ట్రపతి పాలన
కాంగ్రెసు మద్దతుతో విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకి ప్రయత్నిస్తున్నాడనగానే బిజెపికి కాంగ్రెసుపై కోపం విజయ్పై చూపింది. అందుకే గవర్నరు చేత ముప్పుతిప్పలు పెట్టించింది. దానికి తోడు డిఎంకె కూటమిలో భాగస్వాములుగా పోటీ చేసిన నాలుగు పార్టీలు కలిసి రామని కొన్ని రోజులు, వస్తామని కొన్ని రోజులు, ఎటూ తేల్చక కొన్ని రోజులు తాత్సారం చేశాయి. దాంతో ప్రభుత్వం ఏర్పడుతుందా లేదా? అనే సందిగ్ధత ఏర్పడింది. అది బిజెపికి ఎడ్వాంటేజి అయింది. గవర్నరు నానా తిరకాసులు పెట్టి ప్రభుత్వం ఏర్పడకుండా చూస్తే మే 10 నాటికి లెక్క ప్రకారం ఐదేళ్లూ నిండిన ప్రభుత్వం రద్దవుతుంది. వెంటనే రాష్ట్రపతి పాలన విధించ బడుతుంది. ఆర్నెల్ల దాకా నోరెత్తడానికి లేదు. ఆ తర్వాత కూడా దాన్ని పొడిగించే అధికారం కేంద్రానికి వుంది. ఈలోగా రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మారవచ్చు.
ఎమ్మెల్యేలు పార్టీలు ఫిరాయించవచ్చు. చివరకు తమ పార్టీకో, తమ భాగస్వామికో అనుకూల వాతావరణం ఏర్పడ్డాకనే ఎన్నికలకు వేళ అయిందని ప్రకటించవచ్చు.
రాష్ట్రపతి పాలన అనేది పేరుకే తప్ప జరిగేది కేంద్రంలోని అధికార పార్టీ పాలన. ఈ విషయం అందరి కంటె బాగా స్టాలిన్కు తెలుసు. తమిళనాడులో ఐదు సార్లు విధించారు. 1976-7755 183, 1988-89 2, 1991 ఆర్నెల్లు యిలా! రాష్ట్రపతి పాలన రోజుల్ని అతను చవి చూశాడు. ఎమర్జన్సీ టైములో 23 ఏళ్ల వయసులో ఏడాది పాటు జైలుపాలయ్యాడు. రాష్ట్రపతి పాలన వస్తే బిజెపి తనను ఓ ఆట ఆడుకుంటుందని, ఫైళ్లన్నీ తవ్వి తీసి, తనపై, తన మంత్రివర్గ సహజరులపై అవినీతి ఆరోపణలు గుప్పిస్తుందని తెలుసు. గవర్నరును యిప్పుడెలా వాడుకుందో చూశాక ఆ విషయం అతనికి రూఢి అయి వుంటుంది. లార్జెస్ట్ సింగిల్ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకై ఎందుకు ఆహ్వానించరు? అని అడిగితే 'హార్స్ ట్రేడింగ్'ను ప్రోత్సహించినట్లవుతుంది' అని చెప్తున్నాడు గవర్నరు. ఫిరాయింపులు ఎప్పుడైనా జరగవచ్చు.
ఫిరాయింపుదార్లు లేని పార్టీ ఇండియాలో వుందా? చట్టవిరుద్ధంగా ఫిరాయిస్తే వాళ్ల సంగతి చూసుకోవడానికి కోర్టులున్నాయి. ఈయన కెందుకు బాధ?
డిఎంకె-ఎడిఎంకె పొత్తు వలన లాభముంటుందా?
రాష్ట్రపతి పాలన నివారించడానికై విజయ్ ప్రభుత్వం ఏర్పడేట్లు సహకరించాలని సాలిన్కు తెలుసు. కానీ అలా చేస్తే తన పార్టీ భవిష్యత్తు ఏమిటి? విజయ్ బాగా పాలించేసి, పేరు తెచ్చుకుంటే, అతని పార్టీ తమిళనాడులో పాతుకుపోతుంది. స్టాలిన్ కుమారుడు 48 ఏళ్ల ఉదయనిధి యువతరానికి ప్రతినిథిగా ఎదుగుదామనుకున్నాడు. ఇప్పుడు 51 ఏళ్ల విజయ్ వచ్చి ఆ ఓటు బ్యాంకుని కొల్లగొట్టాడు. వచ్చే ఎన్నికలకు ఉదయనిధి విజయ్ తలపడాల్సి వస్తుంది. తలపడగలడా? ఇదే భయం స్టాలిన్ కుటుంబ సభ్యులకు వుందని, ఆ కారణంగా అవసరమైతే ఎడిఎంకెతో చేతులు కలిపైనా విజయ్ ప్రభుత్వం ఏర్పడకుండా చూడమని వాళ్లు స్టాలిన్పై ఒత్తిడి తెచ్చారని వార్తలు వచ్చాయి. దీనికి తోడు బిజెపి రజనీకాంత్ కాంత్ ద్వారా రాయబారం పంపింది. 'ఎడిఎంకెతో జత కట్టనని విజయ్ బాహాటంగా చెప్పాడు కాబట్టి 55 ఏళ్లగా శత్రువులుగా వున్న మీ యిద్దరూ కలిసిపోండి. ఇది జయలలిత, కరుణానిధిల యుగం కాదు. మీ యిద్దరూ కలిసి విజయ్ను అధికార పీఠానికి అవతల ఆపేయవచ్చు' అని చెప్పి వుంటాడు.
రజనీకి కానీ, తన కుటుంబసభ్యులకు కానీ లేని రాజకీయ పరిజ్ఞానం స్టాలిన్కు ఉంది. తన పాలనకు వ్యతిరేకంగా ఓటు వేసి విజయ్ను గెలిపించారనేది స్పష్టంగా కనబడుతున్న వాస్తవం. తమపై యీ ఆగ్రహం తగ్గాలంటే కొంత విరామం యివ్వాలి. విజయ్ను ఆపడానికి డిఎంకె, ఎడిఎంకెలు ఎంతకైనా తెగించాయి అని ప్రజలు అనుకుంటే వారు తామిద్దరినీ అసహ్యించు కుంటారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఆ
అసహ్యాన్ని ఓట్ల రూపంలో చూపిస్తారు. తమ కంటె ఎడిఎంకెను ఎక్కువగా శిక్షించారు. ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ప్రధాన ప్రతిపక్షమైన ఎడిఎంకెకు వెళ్లాలి. కానీ వెళ్లలేదంటే అర్థమేమిటి? అనుభవజ్ఞుడైన పళనిస్వామి కంటె అనుభవశూన్యుడైన విజయ్ను ఆదరించారంటే అర్థమేమిటి? అలాటి పళనిస్వామితో చేతులు కలపడంలో విజ్ఞతేముంది? ప్రస్తుతం విజయ్్ను ఆపడానికి బిజెపి దగ్గరుండి యీ ద్రవిడ జంట పెళ్లికి పౌరోహిత్యం వహించినా, యీ కాపురాన్ని ఎక్కువకాలం నడవనివ్వక పోవచ్చు.
జనతా పార్టీ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఇందిరా గాంధీ మద్దతిస్తామని చరణ్ సింగ్కు ఆశ చూపి, మొరార్జీ నుంచి విడిగా లాక్కుని వచ్చింది. విడిగా వచ్చాక, మద్దతివ్వను పో అంది. దెబ్బకి చరణ్ సింగ్ పార్లమెంటుకి రాకుండానే రాజీనామా చేయాల్సి వచ్చింది. అలాగే విపి సింగ్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి రాజీవ్ గాంధీ చంద్రశేఖర్ని బయటకు లాగి, సిల్లీ రీజన్ చూపించి, మద్దతు ఉపసంహరించి, మళ్లీ ఎన్నికలు వచ్చేట్లు చేశాడు. ఇప్పుడు ఎడిఎంకెని పంపించి, విజయు ఆవలకు నెట్టించి, ఆ తర్వాత ఏదో సిల్లీ రీజన్తో ఎడిఎంకె బయటకు వచ్చేట్లుగా ఆ పార్టీపై ఒత్తిడి తేవచ్చు. నిజం చెప్పాలంటే బిజెపికి పళనిస్వామికి బుద్ధి చెప్పాలనే కోరిక కూడా వుండవచ్చు. ఈ ఎన్నికలలో అతను బిజెపిని దాదాపుగా శాసించాడు. అన్నామలైను అనామకుణ్ని చేశాడు. వాళ్లు గెలవని సీట్లు యిచ్చాడు. తన పార్టీ వాళ్లు వాళ్లకు ప్రచారం
చేయకపోయినా ఏమీ అనలేదు. ఓట్ల బదిలీకి ప్రయత్నించ లేదు. తమిళనాడు బిజెపి కార్యకర్తలు అధినాయకత్వాన్ని తిట్టుకునేట్లు చేశాడు. అందువలన డిఎంకె-ఎడిఎంకె ప్రభుత్వం కూలితే బిజెపి కంటి నుంచి ఒక్క బొట్టయినా రాలదు.
విజయ్్న ఆపితే జరిగే పరిణామాలు
కానీ యీ లోపున ప్రజల్లో ఏ సందేశం వెళుతుంది? ఇన్ని దశాబ్దాలుగా పాలించినా, యీ ద్రవిడ పార్టీలకు అధికార దాహం తీరలేదు. ఒక కొత్తవాడు రాగానే అతనికి ద్రోహం చేశారు – అని. విజయ్ ద్రవిడేతరుడు. ప్రమాణస్వీకారం జరగగానే పెరియార్ విగ్రహానికి దణ్ణం పెట్టినా, అది సామాజిక న్యాయం ఖాతాలోకి వెళుతుంది. అణ్ణాదురైకి పెడితే ద్రవిడవాదంలోకి వెళ్లేది. అతని తండ్రి క్రైస్తవుడు. తల్లి బ్రాహ్మణి అంటున్నారు. అయితేగియితే త్రిషతో పెళ్లయితే ఆమె కూడా బ్రాహ్మణియే. ద్రవిడ పార్టీలు బ్రాహ్మణులకు టిక్కెట్లివ్వవు. మేము బ్రాహ్మణిజానికి వ్యతిరేకం కానీ, బ్రాహ్మలకు కాదు అంటూ పైకి చెప్పినా, జనాభాలో వాళ్లు 3% వున్న వాళ్లకు ఒక్క టిక్కెట్టూ యివ్వరు. డిఎంకె యీ విషయంలో మరీ పట్టుదలగా వుంటుంది. ఎమ్జీయార్ డా. హండే అనే వైద్యుణ్ని మంత్రిగా చేశాడ. వెన్నిరాడై నిర్మలను ఎమ్మెల్సీ చేశాడు. వాళ్లిద్దరూ బ్రాహ్మణులే. జయలలిత స్వయంగా బ్రాహ్మణి ఐనా బ్రాహ్మణులకు టిక్కెట్లివ్వలేదు. ఇలాటి తమిళనాడు రాజకీయ వాతావరణంలో విజయ్ యిద్దరు బ్రాహ్మణులకు టిక్కెట్లిచ్చాడు. వాళ్లిద్దరూ గెలిచారు కూడా. తక్కిన ఏ పార్టీ టిక్కెటివ్వలేదు.
ద్రవిడ అనగానే బిసి జపమే తప్ప మరోటి వుండదు. అయినా మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీలు, కులకోణాన్ని పట్టించుకోని అగ్రకులాలు రాజకీయ కారణాల చేత వారికి ఓట్లేస్తూ వచ్చాయి. ఈ సారి వారిలో వచ్చిన చీలిక విజయ్కు లాభం చేకూరినట్లుంది. పైగా ఏ ద్రవిడ ముఖ్యమంత్రీ చేయనట్లుగా విజయ్ సూటూ, బూటూలో ప్రమాణస్వీకారం చేసి, అసెంబ్లీకీ అలాగే హాజరయ్యాడు. ద్రవిడవాదంతో విసుగెత్తిన జనాలకు యిది రిలీఫ్ గా అనిపించింది. ఇప్పుడు విజయ్ ప్రభుత్వం ఏర్పడకుండా వీళ్లందరూ కలిసి కుట్ర చేశారన్న భావం ప్రజల్లో బలంగా పడిందంటే, వీళ్ల కొంప మునిగిందే. వాజపేయి 13 రోజుల, 13 నెలల ప్రభుత్వాలు వరుసగా పడిపోగానే, ప్రజలు సింపతీ చూపి ఐదేళ్లు పాలించే అవకాశం యిచ్చారు. విజయ్ విషయంలో కూడా అలాగే జరగవచ్చు. అస్థిర ప్రభుత్వంలో అంతఃకలహాలతో, పాలనానుభవ లేమితో విజయ్ ప్రభుత్వం తనంతట తానే పడిపోవచ్చు. అప్పుడు తమపై నింద రాదు. ఈ ప్రాసెస్కు ఆర్నెల్లో, ఏడాదో పడితే ఆ పాటికి డిఎంకె పట్ల వ్యతిరేకత తగ్గుముఖం పట్టవచ్చు.
స్టాలిన్ వ్యూహం
ఇన్ని లెక్కలేసి, ప్రస్తుతానికి విజయ్ ప్రభుత్వం ఏర్పడితేనే మంచిది అనుకున్న స్టాలిన్ తన భాగస్వాములకు మీరు కావాలంటే విజయ్కు మద్దతిచ్చుకోవచ్చు, నేనేమీ ఆగ్రహించను అని చెప్పాడు. కావాలంటే.. అన్నాడు కానీ, మీరు మద్దతిచ్చి తీరాలని చెప్పలేదు. అందుకే తన భాగస్వామి, విజయ్కాంత్
భార్య ప్రేమలత (డిఎండికె పక్షాన ఏకైక శాసన సభ్యురాలు) విజయ్ వైపు వెళ్లను అంటే సరే అని ఊరుకున్నాడు. విసికె విజయ్ను ఓ ఆట ఆడిస్తూ వుంటే చూస్తూ ఊరుకున్నాడు, విజయ్కు కూడా సంకీర్ణ ప్రభుత్వాల తలనొప్పి తెలిసి రావాలిలే అనుకుని. అయితే ఎడిఎంకెలో ఒక వర్గం యిటువైపు చూస్తోందని బలమైన సంకేతాలు రావడంతో విసికె తగ్గింది, ప్రభుత్వ ఏర్పాటుకి సహకరించింది. దళితులు, మైనారిటీలతో కూడిన దాని ఓటు బ్యాంకు ఆగ్రహిస్తుందని కూడా భయపడి వుండవచ్చు.
స్టాలిన్కు యీ ఎడిఎంకె చీలిక గురించి ముందే సమాచారం వచ్చి వుంటుంది. వ్రతం చెడినా, ఫలం దక్కదని కూడా అనుకుని వుండవచ్చు. ఇప్పుడు ఎడిఎంకెలో 30 మంది పళనిస్వామి మా నాయకుడు కాదని చెప్పేశారు. రేపోమాపో విజయ్ పార్టీలో విలీనం కావడమో, మద్దతివ్వడమో చేయవచ్చు. అప్పుడు విజయ్ విసికె, ఐయుఎమ్ఎల్, కాంగ్రెసు వంటి చిల్లర పార్టీలకు బెదర నక్కరలేదు. ఎడిఎంకె చీలిక వర్గంతో సఖ్యంగా వుండి, వారికి కావలసినది చేసి పెడితే చాలు. కొంతకాలమైనా ప్రభుత్వం నడుస్తుంది. పవర్ యీజ్ ద గ్రేటెస్ట్ సిమెంటింగ్ ఫోర్స్ అంటారు. బయటకు వెళితే మళ్లీ కష్టాలే అనే భయంతోనైనా ఓ ఏడాది, రెండేళ్లు బండి నడపవచ్చు. దీనివలన జరిగేదేమిటి? పళనిస్వామి పాతాళానికి పడడం! ఇవాళ 17 మంది అతనితో వున్నారు. బిజెపి అతనంటే ఆగ్రహంగా వుంది. రేపు అన్నామలైను తిరిగి
తీసుకుని వచ్చి, అతనిపై దుమ్మెత్తి పోయించవచ్చు. తక్కిన నాయకుల యింటికి వెళ్లిన విజయ్ పళనిస్వామిని పట్టించుకోలేదు. ఈ 17 మందిలో మళ్లీ మూడింట రెండు వంతుల మంది చీలితే పళనిస్వామి, ఎవరికీ స్వామి కాకుండా పోతాడు.
ఇది స్టాలిన్కు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరుస్తుంది. గత 50 ఏళ్లగా చీలిపోతూ వచ్చిన ద్రవిడ ఓటు యిప్పుడు స్టాలిన్ నాయకత్వంలో కన్సాలిడేట్ అవుతుంది. ఈ ఎన్నికలలో కూడా రెండు ద్రవిడ పార్టీలకు కలిపి 58% ఓట్లు వచ్చాయి. తక్కిన పార్టీలవి 8% అనుకున్నా ద్రవిడ ఓటు 50% ఉంటుందని అనుకోవచ్చు. విజయ్కు వచ్చినది 35% మాత్రమే! తమిళనాడులో విజయ్ పార్టీ, డిఎంకె రెండే ప్రధాన ప్రత్యర్థులుగా నిలుస్తాయి. పళనిస్వామితో చేతులు కలిపి విజయ్ను ఆపి వుంటే భవిష్యత్తులో ముక్కోణపు పోటీలు ఎదుర్కోవలసి వచ్చేది. ఆ విధంగా స్టాలిన్ విచక్షణ అతనికి తక్షణ రక్షణను, దీర్ఘకాలిక ప్రయోజనాన్ని చేకూర్చబోతోంది. దీన్ని అర్థం చేసుకోలేని ఉదయనిధి తొందరపాటును నిలవరించ గలగడం తండ్రిగా స్టాలిన్ విజయం! అందుకే కాబోలు విజయ్ అతని యింటికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపి మంచి సంప్రదాయానికి శ్రీకారం చుట్టాడు.
(ఫోటో - స్టాలిన్ యింట్లో విజయ్, పళనిస్వామి, ఉదయనిధి, ప్రమాణస్వీకార వేళ విజయ్)
- ఎమ్బీయస్ ప్రసాద్