#🟡తెలుగుదేశం పార్టీ #ఏపి న్యూస్ ఏపీ పాలిటెక్స్🎯
*టీడీపీలో తీవ్ర అసహనం.. దేనికి సంకేతం❓*
MAY 25, 2026🎯
మరో రెండువారాల్లో కూటమి ప్రభుత్వo రెండేళ్ల పాలనకు చేరుకుంటుంది. ప్రభుత్వంలో టీడీపీ పెద్దన్న పాత్ర పోషిస్తోంది. సీఎంగా చంద్రబాబునాయుడు నాలుగో సారి బాధ్యతలు నిర్వర్తించిన నాయకుడిగా రికార్డుకెక్కారు. కూటమిలో మూడు పార్టీలున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ. ప్రభుత్వ ఏర్పాటులో ఏ పార్టీని తక్కువ చేసి చూడలేం.
వ్యవస్థల సహకారం కోసం కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీతో చంద్రబాబు పొత్తు కుదుర్చుకున్నారనేది వాస్తవం. అందుకు తగ్గట్టుగానే గత ఎన్నికల్లో సహాయ సహకారాలు బీజేపీ నుంచి టీడీపీకి అందాయి. జనసేన పాత్రేమీ తక్కువ
కాదు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాపు సామాజిక వర్గ నేత. బీసీల తర్వాత అత్యధిక జనాభా తమదే అని వారు అంటున్నారు.
రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో వారిని ఒక్కో రకంగా పిలుస్తుంటారు. పవన్తో పొత్తు వల్ల కూటమికి గంపగుత్తగా ఆయన సామాజిక వర్గ ఓట్లు పడ్డాయి. అందుకే అపరిమితమైన అధికారం దక్కింది. ఇందులో రెండు మాటకే చోటు లేదు. ఇంత వరకూ ఓకే.
సీఎంగా చంద్రబాబు, అనధికార సీఎంగా లోకేశ్ పెత్తనం చెలాయిస్తున్నారు. మంచీచెడులకి వాళ్లిద్దరూ బాధ్యత వహించాల్సి వుంటుంది. ఎందుకనో ఈ మధ్య కాలంలో టీడీపీలో తీవ్ర అసహనం కనిపిస్తోంది. ఇది దేనికి సంకేతం? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
పరిపాలనకు సంబంధించి చిన్న విమర్శని కూడా పాలకులు తట్టుకోలేకపోతున్నారు. వెంటనే కేసులు పెట్టి, అరెస్ట్ చేసి జైళ్లకు పంపుతున్నారు. అంతెందుకు, రాజకీయ విశ్లేషకుడిగా, సీనియర్ జర్నలిస్టుగా లబ్ది ప్రతిష్టుడైన ప్రొఫెసర్ కె. నాగేశ్వర్పై ఏకంగా మూడు చోట్ల కేసులు పెట్టడం కూటమి అసహనానికి నిదర్శనం.
ప్రొఫెసర్ నాగేశ్వర్ను ఉద్దేశించి సోకాల్డ్ జర్నలిస్ట్ అని మంత్రి నారా లోకేశ్ కామెంట్ చేయడం గమనార్హం. దానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఘాటుగా స్పందించారు. ఎలాగైతే ఫ్రొఫెసర్ పేరు ఎత్తకుండా లోకేశ్ తప్పు పట్టారో, అందుకు తగ్గట్టుగానే నాగేశ్వర్ కూడా మంత్రి పేరు ప్రస్తావించకుండానే దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు. ఇలాంటివన్నీ అనవసర రచ్చ.
టీడీపీ తీరు ఎలా తయారైందంటే, తాము ఎవరినైనా, ఎంత మాటైనా అనేస్తాం, కానీ తమనెవరూ ఏమీ అనకూడదన్న నియంతృత్వ పోకడలు ఆ పార్టీలో రోజురోజుకూ పెరుగుతున్నాయి. అధికారం తీసుకొచ్చిన అహంకారంగా చాలా మంది చూస్తున్నారు. చివరికి ఎలా తయారయ్యారంటే, ఎవరైనా సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులను షేర్ చేసినా కేసు పెడుతున్నారంటే, పరిస్థితి ఎక్కడికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చు.
టీడీపీలో ఎందుకింత అసహనం? పరిపాలనపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోందని భయపడుతోందా? భయంతో అందరి నోళ్లు మూయించాలనే తాపత్రయమా? సుదీర్ఘ రాజకీయ, పరిపాలన అనుభవం ఉన్న చంద్రబాబు ఎప్పుడూ ఈ రీతిలో
వ్యవహరించలేదన్న మాట వినిపిస్తోంది. ఇప్పుడే ఎందుకీ చెడు సంప్రదాయానికి శ్రీకారం చుట్టారనేదే ప్రశ్న.
సమాధానం లేనప్పుడు, తప్పులు జరుగుతున్నప్పుడే ఎవరిలోనైనా అసహనం, భయం కనిపిస్తాయి. ప్రభుత్వంలో పెద్దన్న పాత్ర పోషించే టీడీపీలో ఎందుకనో ఈ లక్షణాలు మెండుగా ఉన్నాయి. ప్రభుత్వంపై సాగుతున్న వ్యతిరేక ప్రచారాన్ని మొగ్గ దశలోనే తుంచేయకపోతే, అది అంతకంతకూ పెరిగి నష్టం కలిగిస్తుందనే ఆందోళన టీడీపీలో కనిపిస్తోంది. దీంతో పోలీసులతో కేసులు, అలాగే అనుకూల మీడియాతో ప్రత్యర్థులు, తటస్థ మేధావులపై దాడి చేయించడానికి టీడీపీ ప్రాధాన్యం ఇస్తోంది. ఇలాంటి చర్యలతో మరింత చెడ్డ పేరు వస్తోందనే గ్రహింపే లేకుండా పోతోంది.
భయంతో ఏ ఒక్కరి నోళ్లు మూయించలేమని మొదట టీడీపీ గుర్తించుకోవాలి. ఎక్కువ భయపెట్టడం ద్వారా, దాన్ని పోగొట్టిన వారవుతామనే వాస్తవాన్ని ఎందుకో గ్రహించలేదో ఆ పార్టీకే తెలియాలి. వైసీపీ నాయకులు, కార్యకర్తల విషయంలోనూ కేసులు, దాడులతో ఎక్కువ భయపెట్టింది. చివరికి కేసులు, జైళ్లు అంటే రెడీ అని వైసీపీ నాయకులు, కార్యకర్తలు అన్నారు, అంటున్నారు. ఘోరంగా ఓడిపోయిన వైసీపీ చాలా తక్కువ సమయంలోనే కోలుకుని తిరుగుబాటు బావుటా ఎగురవేయడానికి టీడీపీ చర్యలే కారణం.
ఇప్పుడు చేతులు కాలాక టీడీపీ ఆకులు పట్టుకున్నా ప్రయోజనం లేదు. ఈ రెండేళ్లలో చేయకూడని పనులన్నీ టీడీపీ నేతృత్వంలోని ప్రభుత్వం చేసింది. నష్టం జరుగుతోందని
గ్రహించి, దిద్దుబాటు చర్యలకు బదులు, మళ్లీమళ్లీ అవే పనులు చేస్తోంది. టీడీపీ భయపడుతోందంటేనే, తమకు వ్యతిరేకంగా ఏదో జరుగుతోందన్న ఆందోళన చెందుతోందని అర్థం చేసుకోవచ్చు. అదేంటో అందరికంటే టీడీపీ నాయకులకే బాగా తెలుసు. అయితే అధికారంలో ఉన్నోళ్లకు అహం అడొస్తుంది.
తప్పులు సరి చేసుకోడానికి బదులు, వాటిని ప్రశ్నించిన వారిని అధికారంతో వెంటాడాలని అనిపిస్తుంది. చివరికి అలా చేసి, అధికారాన్నే పోగొట్టుకుంటామని తెలిసినా, తప్పులు చేయడమే పవర్ ప్రత్యేకత. అసహనం అన్ని తప్పులకు మూలం. దాని నుంచి బయటపడడం చిన్న విషయం కాదు. చాలా సంస్కారం, సంయమనం వుంటే తప్ప, తప్పుల్ని అంగీకరించి, వాటిని సరిదిద్దుకోలేరు. ఇక ప్రభుత్వంలో వుంటే, అధికారం తలకెక్కి ఎలా నడుచుకుంటారో చూస్తూనే వున్నాం. అసహనం……… అనర్థదాయకం. అదే ఇప్పుడు టీడీపీకి నష్టం చేస్తున్నది కూడా.