Follow
RAJENDRAPRASAD, M.Com.
@raajendraprasad
9,661
Posts
11,470
Followers
RAJENDRAPRASAD, M.Com.
508 views
4 hours ago
#ఈ రోజు 🌧️🌛🌔🌠 *🚩 ┈┉┅━❀ ॐ ❀━┅┉┈ 🚩* *వైశాఖ పురాణం 22 వ రోజు పారాయణం* నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం | దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్.. *దంతిల కోహల శాపవిముక్తి* నారదమహర్షి అంబరీష మహారాజునకు వైశాఖమాస మహిమనిట్లు వివరించుచున్నాడు. శ్రుతదేవుని మాటలను విని శ్రుతకీర్తిమహారాజు యిట్లు అడిగెను. మహామునీ యిహపరసౌఖ్యముల నిచ్చు వైశాఖమహిమల నెంత విన్నను నాకు తృప్తి కలుగుటలేదు. నెపములేని ధర్మము, శుభకరములగు విష్ణుకథలు, చెవులకింపైన శాస్త్రశ్రవణము యెంతవిన్నను తృప్తి కలుగదు. ఇంకను వినవలయుననిపించును. నేను పూర్వజన్మలో చేసిన పుణ్యము ఫలించుటచే మహాత్ముడవైన నీవు అతిధివై నా యింటికి వచ్చితివి. నీవు చెప్పిన యీ అమృతోపదేశమును విని బ్రహ్మపదవిని ముక్తిని నా మనసుకోరుట లేదు. కావున నా యందు దయయుంచి యింకను శ్రీహరికి ప్రియములగు దివ్యములగు ధర్మములను వివరింపగోరుచున్నాను అని ప్రార్థించెను. శ్రుతకీర్తి మాటలను విని శ్రుతదేవమహాముని మిక్కిలి సంతసించి యిట్లనెను. వైశాఖ ధర్మముల మహిమను వివరించు మరియొక కథను చెప్పుదును వినుము. పంపాతీరమున శంఖుడను పేరుగల బ్రాహ్మణుడుండెను. అతడొకప్పుడు బృహస్పతి సింహరాశియందుండగా గోదావరీ ప్రాంతమునకు వచ్చెను. అతడు భీమరధీనదిని దాటి ముళ్లురాళ్లు గల అడవిలో ప్రయాణము చేయుచు వైశాఖ మాసపు యెండకు బాధితుడై మధ్యాహ్న సమయమున నలసి యొక వృక్షము నీడలో కూర్చుండెను. అప్పుడొక బోయవాడు వింటిని పట్టుకొని అచటకు వచ్చెను. అతడు దయా హీనుడు. సర్వప్రాణులను హింసించువాడు. సూర్యునివలె ప్రకాశించుచు రత్నకుండలములను ధరించిన శంఖుని పీడించి వాని వద్దనున్న కుండలములను గొడుగును, పాదుకలను కమండలమును లాగుకొనెను. తరువాత నా బ్రాహ్మణుని పొమ్మని విడిచెను. శంఖుడును అచటినుండి కదలెను. ఎండకు కాళ్లు కాలుచుండగా త్వరగా గడ్డియున్న ప్రదేశమున నిలుచుచు, చెట్లనీడలయందు వెదకి నిలుచుచు త్వరగా పోవుచు మిక్కిలి బాధపడుచు ప్రయాణమును కొనసాగించెను. అతడు బాధపడుచు వెళ్లుచుండగా బోయవానికి వానియందు దయకలిగెను. వాని పాదుకలను తిరిగి వానికీయవలెనను ఆలోచన కలిగెను. దొంగతనముచే గ్రహింపబడినవైనను శంఖుని పాదుకలు తనవేయని వాని యభిప్రాయము. ఆ కిరాతుడు దయావంతుడై శంఖుని నుండి తాను దొంగలించిన పాదుకలను వానికి తిరిగి యిచ్చెను. ఇట్లుచ్చుటవలన నాకు కొంతయైన పుణ్యము కలుగునుకదాయని భావించెను. శంఖుడును కిరాతుడిచ్చిన పాదుకలను ధరించి మిక్కిలి సంతృప్తిని పొందెను. సుఖీభవయని వానిని ఆశీర్వదించెను. వీని పుణ్యము పరిపక్వమైనది. వైశాఖమున నితడు దుర్బుద్దియగు కిరాతుడైనను పాదుకలనిట్లిచ్చెను. వీనికి శ్రీహరి ప్రసన్నుడయి వైశాఖమున యిట్టి బుద్ధికలిగించెనని పలికెను. ఇప్పుడీ పాదుకలను ధరించి మిక్కిలి సుఖించితిని. నా కిట్టి సంతృప్తిని కలిగించిన నీవు సుఖముగ నుండుమని వానిని యాశీర్వదించెను. కిరాతుడును శంఖుని మాటలను విని ఆశ్చర్యపడెను. నీనుండి దోచుకున్నదానిని నీకు తిరిగి యిచ్చితిని. ఇందువలన నాకెట్లు పుణ్యము వచ్చును. వైశాఖము శ్రీహరి సంతోషించుననియనుచున్నావు. నీవీ విషయమును వివరింపుమని శంఖుని ప్రార్థించెను. శంఖుడును కిరాతుని పలుకులకాశ్చర్యపడెను. లోభముగల యీ కిరాతుడు నీవిట్లు నానుండి దొంగలించిన పాదుకలను తిరిగి యిచ్చి యిట్లు వైశాఖమహిమ నడుగుట శ్రీహరి మహిమయేయని వైశాఖమును మరలమెచ్చెను. దుర్బుద్దివై నా వస్తువులను లాగుకొన్నను యెండలో బాధపడునాయందు దయ కలిగి నా పాదుకలను యిట్లు యిచ్చుట మిక్కిలి విచిత్రమైన విషయము. ఎన్ని దానములు ధర్మములు ఆచరించినను వాని ఫలము జన్మాంతరమున కలుగును. కాని వైశాఖమాసదాన ధర్మములు వెంటనే ఫలించును సుమా! పాపాత్ముడవైనను, కిరాతుడవైనను దైవవశమున నీకిట్టిబుద్ది కలిగినది. నీకింత మంచిబుద్ది కలుగుటకు వైశాఖమాసము శ్రీహరి దయకారణములు సుమా.  శ్రీహరికిష్టమైనవి, నిర్మలము సంతుష్టికరము అయినచో అదియే ధర్మమని మనువు మున్నగువారు చెప్పిరి. వైశాఖమాసమునకు చెందిన ధర్మములు శ్రీహరికి ప్రీతిదాయకములు మిక్కిలి యిష్టములు. వైశాఖమాస ధర్మములకు సంతోషించినట్లు శ్రీహరియే ధర్మకార్యములకు సంతుష్టినందడు. తపస్సులు, యజ్ఞములు వానికి వైశాఖ ధర్మములంత యిష్టములు కావు. ఏ ధర్మము వైశాఖధర్మమునకు సాటిలేదు. వైశాఖధర్మముల నాచరించినచో గయకు, గంగానదికి ప్రయాగకు, పుష్కరమునకు, కేదారమునకు కురుక్షేత్రమునకు ప్రభాసమునకు శమంతమునకు గోదావరికి కృష్ణానదికి సేతువునకు యెచటికిని యేపుణ్యక్షేత్రమునకు పవిత్రనదికి యెచటికిని పోనక్కరలేదు. వైశాఖవ్రత వివరణ ప్రసంగము గంగానది కంటె పవిత్రమైనది. ఈ నదిలో స్నానము చేసినవారికి యీ ప్రసంగమును విన్నవారికి శ్రీహరి ప్రత్యక్షమగును. ఎంత ధనము ఖర్చు పెట్టినను యెన్ని దానములు చేసినను యెన్ని యాగాదులను చేసినను స్వర్ణములు భక్తిపూర్ణములగు వైశాఖధర్మముల వలన వచ్చు పుణ్యమునకు సాటిగావు. కావుననే యీ పవిత్రమైన వైశాఖ మాసమునకు నాకు పాదుకల నీయవలెనని నీకు అనిపించినది. ఈ మాసమంత గొప్పది కావుననే దీనికి మాధవమాసమని పేరు వచ్చినది. పాదుకలనిచ్చుటచే నీకు పుణ్యము కలుగును. నిశ్చయము అని శంఖుడు వ్యాధునకు వివరించెను. ఇంతలోనొక సింహము పులిని చంపుటకై వేగముగ బోవుచు మార్గమధ్యమున కనిపించిన మహాగజముపై బడెను. సింహమునకు, గజమునకు భయంకరమగు యుద్దము జరిగెను. రెండును యుద్దము చేసి చేసి అలసి నిలుచుండి శంఖుడు కిరాతునికి చెప్పుమాటలను వినుట జరిగెను. వారు వెంటనే వైశాఖమహిమను వినుట చేతను గజసింహరూపములను విడిచి దివ్యరూపముల నందిరి. వారిని దీసికొని పోవుటకై దివ్యములైన విమానములు వచ్చినవి. దివ్యరూపమును ధరించిన వారిద్దరును కిరాతునికి వైశాఖవ్రతమహిమను చెప్పుచున్న శంఖునికి నమస్కరించిరి. కిరాతుడు శంఖుడును ఆశ్చర్యపడి మీరెవరు మాకేల నమస్కరించుచున్నారని ప్రశ్నించిరి. గజసింహములుగా నున్న మీకీ దివ్యరూపములు కలుగుటయేమనియు ప్రశ్నించిరి. అప్పుడు వారిద్దరును మేము మతంగ మహర్షి పుత్రులము. దంతిలుడు, కోహలుడునని మా పేర్లు. అన్ని విద్యలను నేర్చి యౌవనములోనున్న  మా యిద్దరిని జూచి మా తండ్రియగు మతంగ మహర్షి 'నాయనలారా! విష్ణుప్రియకరమైన వైశాఖ మాసమున చలివేంద్రముల నేర్పరచుడు. జనులకు విసనకఱ్ఱలతో అలసటవోపునట్లుగా విసరుడు. మార్గమున నీడనిచ్చు మండపములను యేర్పాటు చేయుడు. చల్లని నీటిని అన్నమును బాటసారులకిచ్చి వారి యలసటను పోగొట్టుడు. ప్రాతఃకాలమున స్నానము చేసి శ్రీహరి పూజింపుడు. శ్రీహరికథలను వినుడు, చెప్పుడు అని మాకు బహువిధములుగ జెప్పెను. ఆ మాటలను విని మేము కోపగించితిమి. అతడు చెప్పిన ధర్మముల నాచరింపలేదు. పైగా మా తండ్రి మాటలను తిరస్కరించుచు మాకు తోచినట్లు నిర్లక్ష్యముగ సమాధానముల నిచ్చితిమి. ధర్మలాలసుడగు మా తండ్రి మా అవినయమునకు నిర్లక్షమునకు కోపించెను.  ధర్మవిముఖుడైన పుత్రుని, వ్యతిరేకమున బలుకు భార్యను, దుష్టులను శిక్షింపని రాజులను వెంటనే విడువవలయును. దాక్షిణ్యము వలన, ధనలోభము చేతను పైన చెప్పిన అకార్యములను చేసినచో సూర్యచంద్రులున్నంత కాలము నరకముననుందురు. కావున నా మాటను వినక క్రోధావేశములతో వ్యవహరించుచున్న మీరు దంతిలుడు సింహముగను, కోహలుడు గజముగను చిరకాలము అడవిలో నుండుడని మమ్ము శపించెను. పశ్చాత్తాపమునందిన మేము ప్రార్థింపగా జాలిపడిన మా తండ్రి కొంతకాలమునకు మీరిద్దరును ఒకరినొకరు చంపుకొనబోదురు. అప్పుడే మీరిద్దరును కలిసికొందురు. ఆ సమయమున కిరాతుడు శంఖుడను బ్రాహ్మణునితో వైశాఖధర్మములను గూడి చర్చించుటకు విందురు. దైవికముగా మీరును వారి మాటలను విందురు. అప్పుడే మీకు శాపవిముక్తి, ముక్తి కలుగునని శాపవిముక్తిని అనుగ్రహించెను. శాపవిముక్తిని పొంది నా యొద్దకు వచ్చి వెళ్లుదురనియు మా తండ్రిగారు చెప్పిరి. ఆయన చెప్పినట్లుగనే జరిగినది. కృతజ్ఞులమై నమస్కరించుచున్నామని దంతిల కోహిలలు చెప్పి తమ తండ్రి యొద్దకు విమానముల నెక్కి వెళ్ళిపోయిరి. వాని మాటలను విని కిరాతుడు మిక్కిలి విస్మితుడయ్యెను. శంఖుడును కిరాతునితో ఓయీ! వైశాఖ మహిమను ప్రత్యక్షముగ జూచితివి గదా! వైశాఖమహిమను వినుటవలననే దంతిలకోహలులకు శాపవిముక్తి ముక్తి కలిగినవి కదాయని పలికెను. కిరాతునిలోనున్న హింసాబుద్ది నశించెను. వాని మనస్సు పరిశుద్దమయ్యెను. అతడు పశ్చాత్తప్తుడై శంఖునకు నమస్కరించి యిట్లనెను. అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ విషయమును వైశాఖ మహిమను అంబరీషునకు వివరించుచు నారదుడు చెప్పెను. *వైశాఖ పురాణం 22,వ అధ్యాయం సమాప్తం.* *🚩 ┈┉┅━❀ ॐ ❀━┅┉┈ 🚩*
RAJENDRAPRASAD, M.Com.
407 views
4 hours ago
#ఈ రోజు 🌧️🌛🌔🌠 🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 🍁పంచాంగం🍁 శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు, తేదీ ... 09 - 05 - 2026, వారం ... స్థిరవాసరే ( శనివారం ) శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళ పక్షం తిథి : *సప్తమి* ఉ9.27 వరకు, నక్షత్రం : *శ్రవణం* రా7.11 వరకు, యోగం : *శుక్లం* రా10.51 వరకు, కరణం : *బవ* ఉ9.27 వరకు, తదుపరి *బాలువ* రా9.47 వరకు, వర్జ్యం : *రా11.22 - 1.02* దుర్ముహూర్తము : *ఉ5.34 - 7.15* అమృతకాలం : *ఉ8.05 - 9.48* రాహుకాలం : *ఉ9.00 - 10.30* యమగండం : *మ1.30 - 3.00* సూర్యరాశి : *మేషం* చంద్రరాశి : *మకరం* సూర్యోదయం : 5.34, సూర్యాస్తమయం : 6.17, *_నేటి మాట_* *ఈ దైనందిన జీవితంలో - నిత్యం జప,ధ్యానములు సలపడం అవసరమా???* లోకమున సద్గుణములున్న వారినే అందరూ ప్రేమింతురు, దుర్గుణములుంటే దూరమగుదురు... " సద్గుణ ములను చూసి, సర్వేశ్వరుడు కూడా ప్రేమించును సంతోషించును"... లోకుల ప్రేమకు లొంగవద్దు, లోకుల ప్రేమ క్షణక్షణమునకూ మారుతునే ఉండును, అది వారి ఇష్టాఇష్టాలపై ఆధారపడి యుండును... కానీ భగవంతుని ప్రేమ కేవలము సద్గుణ ముల పైనే ఆధారపడి యుండును... _" జప ధ్యాన ముల ఫలమే సద్గుణ సంపద..."_ లోకమును ఎవరైనా పాప కార్యము చేస్తే, దానిని గురించి కూడను సద్గుణ వంతులు ప్రసంగించ కూడదు. ఆ చింతలో వీరూ దిగవలసిన వచ్చును, కాన అందులో భాగము వహించిన వారల మగుదుము, పవిత్రుల యొక్క చరిత్ర లు తెలుసుకోవడమంటే, సత్కార్యము ఆచరించి నట్లే!!... ధృవుడు ప్రహ్లాదుని కధలు వింటే పుణ్యము వచ్చును, సద్గుణ వంతులను నిందించువారు పాపులవుతున్నారు... వారికి, కొద్ది పాటి పాప మేదైనా ఉంటే, వారిని వీరు విమర్శించుటవలన , వారు పాపమునుండి విముక్తు లౌతారు... విమర్శించిన వారు మాత్రము పాపఫలమును పొందవలసి యుండును... కనుక ఎదుటివాని దుర్మార్గమును గురించి గానీ, చెడ్డ ను గురించి గానీ ఎప్పుడూ తలంచరాదు... *ఇటువంటి సద్గుణ సంపద పొందవలెనన్న, భక్తులకు జప ధ్యాన ములు అవసరము!!...* *_🍁శుభమస్తు🍁_* 🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏
RAJENDRAPRASAD, M.Com.
596 views
18 hours ago
#🌸మదర్స్ డే త్వరలో రాబోతోంది🎉 అమ్మతో అవార్డు ఆనందంగా అనిపిస్తుంది / వుంది
RAJENDRAPRASAD, M.Com.
474 views
23 hours ago
#ఈ రోజు 🌧️🌛🌔🌠 *🚩 ┈┉┅━❀ ॐ ❀━┅┉┈ 🚩* *వైశాఖ పురాణం - 21 ,వ రోజు పారాయణం* పాంచాలరాజు సాయుజ్యము.. నారదుడంబరీషునితో తరువాతి వృత్తాంతము నిట్లు చెప్పసాగెను. శ్రుతదేవమహాముని శ్రుతకీర్తి మహారాజుతో నిట్లనెను. పాంచాలరాజు శ్రీహరిని జూచి సంతోషపడినవాడై వెంటనే లేచి శ్రీహరికి నమస్కరించెను. ఆనంద బాష్పములను విడుచుచుండెను. సర్వజగములను పావనము చేయు గంగానది పుట్టుకకు కారణములగు శ్రీహరి పవిత్ర పాదములను కడిగి ఆ పవిత్ర పాదములను కడిగి ఆ పవిత్రజలమును తనపై జల్లుకొనెను. విలువైన వస్త్రములు ఆభరణములు, గంధ పుష్పాదులు, పుష్పమాలలు, ధూపములు, అమృతప్రాయములగు నివేదనలు, తన శరీరము, తన ధనము, తన సర్వస్వమును శ్రీహరికి సమర్పించెను. ప్రాచీన పురుషుడు నిర్గుణుడు సాటిలేనివాడునగు  శ్రీమహావిష్ణువును యిట్లు స్తుతించెను. నిరంజనం విశ్వసృజామధీశం వందేపరం పద్మభవాదివందితం | యన్మాయయా తత్త్వవిదుత్తమాజనాః విమోహితావిశ్వసృజామధీశ్వరం || 1 ముహ్యంతిమాయా చరితేషు మూఢా గుణేషు చిత్రం భగవద్విచేష్టితం | అనీహఏతద్ బహుధైక ఆత్మనా సృజ త్యవత్యత్తిన సజ్జతేప్యధ || 2 సమస్తదేవాసుర సౌఖ్య దుఃఖ ప్రాప్త్యై భవాన్ పూర్ణమనోరథోపి | తత్రాపికాలే స్వజనాభిగుప్త్యైబిభర్షిసత్త్వం  ఖలనిగ్రహాయ || 3 తమోగుణం రాక్షస బంధనాయ రజోగుణం నిర్గుణ విస్వమూర్తే | దిష్ట్యాదంఘ్రిః ప్రణతాఘనాశన స్తీర్దాస్పదంహృదిధృతః సువిపక్వయోగైః || 4 ఉత్సిక్త భక్త్యుపహృతాశయ జీవభావాః ప్రాపుర్గతింతవ పదస్మృతిమాత్రతోయే | భవాఖ్యకాలోరగపాశబంధః పునఃపునర్జన్మజరాది దుఃఖైః || 5 భ్రమామి యోనిష్వహమాఖు భక్ష్యవత్ ప్రవృద్ధతర్షస్తవ పాదవిస్మృతేః | నూనం న దత్తం న చతే కధాశ్రుతా నసాధవో జాతు మయాసిసేవితాః || 6 తేనారి భిర్ద్యస్త పరార్ధ్య లక్ష్మీర్వనం ప్రవిష్టః స్వహరూహ్యగుం స్మరన్ | స్మతౌ చ తౌమాంసముపేత్య దుఃఖాత్ సంబోధయాం చక్రతురార్త బంధూ || 7 వైశాఖధర్మ్రైః శ్రుతిచోదితైః శుభైః స్వర్గాపవర్గాది  పుమర్ధహేతుభిః | తద్భోధతో హంకృతవాన్ సమస్తాన్ శుభావహాన్ మాధవమాసధర్మాన్ || 8 తస్మాదభూన్మేపరమః ప్రసాదః తేనాఖిలాః సంపద ఊర్జితా ఇమాః | నాగ్నిర్నసూర్యోన చ చంద్రతారకా నభూర్జలంఖంశ్వసనో ధవాఙ్మనః || 9 ఉపాసితాస్తేపి హరంత్యఘంచిరాద్విపశ్చితో ఘ్నంతి ముహూర్త సేవయా | యన్మన్యసేత్వంభవితాపి భూరిశఃత్యక్తేషణాన్ త్వద్పదన్యస్తచిత్తాన్ || 10 నమస్స్వతంత్రాయ విచిత్రకర్మణే నమః పరస్మై సదనుగ్రహాయ | తన్మాయయోమోహితోహం గుణేషు దారార్థరూపేషు భ్రమ్యామ్యనర్ధదృక్ || 11 త్వద్పాద పద్మే సతిమూలనాశనే సమస్త పాపాపహరే సునిర్మలే | సుఖేచ్ఛయానర్ధ నిదాన భూతైః సుతాత్మదారైర్మమతాభియుక్తః || 12 నక్వాపినిద్రాంలభతే న శర్మప్రవృద్దతర్షః పునరేవతస్మిన్ | లబ్ద్వాదురాపం నరదేవజన్మత్వం యత్నతః సర్వపుమర్ధహేతుః || 13 పదారవిందం న భజామి దేవ సమ్మూఢ చేతావిషయేషు లాలసః | కరోమి కర్మాణి సునిష్ఠితః సన్ ప్రవృద్ధతర్షః తదపేక్షయాదద్ || 14 పునశ్చభూయామహమద్యభూయామిత్యేన చింతాశత లోలమానసః | తదైవ జీవస్య భవేత్కృపావిభో దురంతశక్తేస్తవ విశ్వమూర్తే || 15 సమాగమః స్యాన్మహతాంహి పుంసాం భవాంబుధిర్యేనహి గోష్పదాయతే | సత్సంగమోదేవయదైవ భూయాత్తర్హీశదేవేత్వయిజాయతేమతిః || 16 సమస్త రాజ్యాపగమహిమన్యేహ్యనుగ్రహం తేమయి జాత మంజసా | యధార్ధ్యతే బ్రహ్మసురాసురాద్యైః నివృత్త తర్షైరపిహంసయూధైః || 17 ఇతః స్మరామ్యచ్యుతమేవ సాదరం భవాపహం పాదసరోరుహం విభో | అకించన ప్రార్ధ్యమమందభాగ్యదం నకామయేన్యత్తవ పాదపద్మాత్ || 18 అతోన రాజ్యం నసుతాదికోశం దేహేన శశ్వత్పతతారజోభువా | భజామినిత్యం తదుపాసితవ్యం పాదారవిందం ముని భిర్విచింత్యం || 19 ప్రసీదదేవేశ జగన్నివాస స్మృతిర్యధాస్యాత్తవ పాదపద్మే | సక్తిస్సదాగచ్ఛతు దారకోశ పుత్రాత్మచిహ్నేషు గణేషు మే ప్రభో || 20 భూయాన్మనః కృష్ణ పదారవిందయోః వచాంసితే దివ్యకధానువర్ణనే | నేత్రేమమేతేతన విగ్రహేక్షణే శ్రోత్రేకధాయాం రసనాత్వదర్పితే || 21 ఘ్రూణంచత్వత్పాద సరోజ సౌరభే త్వద్భక్త గంధాది విలేపనే సకృత్ | స్యాతాంచ హస్తౌ తవమందిరేవిభో సమ్మర్జనాదౌ మమనిత్యదైవ || 22 కామశ్చమే స్యాత్తవసత్కధాయాంబుద్ధిశ్చమే స్యాత్తవచింతనేనిశం | దినానిమేస్యుస్తవ సత్కధోదయైః ఉద్గీయమానైః మునిభిర్గృహా గతైః || 23 హీనః ప్రసంగస్తవమేనభూయాత్ క్షణం నిమేషార్థ మధాపి విష్ణో | న పారమేష్ఠ్యం న చ సార్వభౌమం న చాపవర్గం స్పృహయామి విష్ణో || 24 త్వత్పాదసేవాంచ సదైవకామయే ప్రార్ద్యాంశ్రియా బ్రహ్మభవాదిభిః సురైః || 25 అని స్తుతించెను.. పాంచాలరాజు చేసిన యీ స్తుతి అర్ధవంతము శక్తిమంతమునగుటచే దీనికి భావము వ్రాయబడుచున్నది. మనమందరమును పాంచాలరాజువలె పూర్వ కర్మననుసరించి ఉన్నదానిని పోగొట్టుకొని గురువు, పెద్దల వలన తరణోపాయము నెరిగి పాటించిన పాంచాలరాజు వలెనే కష్టములను దాటి సర్వసుఖములనంది పాంచాలరాజువలె భగవంతుని దర్శనమును పొందగోరువారమే కదా! అందుకని యీ స్తోత్రమునకు భావము చదివినచో వేలాది పాఠకులలో నొకరైన భగవంతుని దర్శనానుగ్రహమును పొందవచ్చునేమోయని తలచి భావమునిచ్చుచున్నాము. *సహృదయతతో భక్తులు దీనిని ఉపయోగించకొనగలరు వైశాఖపురాణం 21,వ అధ్యాయము సమాప్తం.* *🚩 ┈┉┅━❀ ॐ ❀━┅┉┈ 🚩*
RAJENDRAPRASAD, M.Com.
1.7K views
23 hours ago
#ఈ రోజు 🌧️🌛🌔🌠 🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 🌹పంచాంగం🌹 శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు, తేదీ ... 08 - 05 - 2026, వారం ... భృగువాసరే ( శుక్రవారం ) శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళ పక్షం, తిథి : *షష్ఠి* ఉ8.20 వరకు, నక్షత్రం : *ఉత్తరాషాఢ* సా5.36 వరకు, యోగం : *శుభం* రా11.10 వరకు, కరణం : *వణిజ* ఉ8.20 వరకు తదుపరి *భద్ర* రా9.54 వరకు, వర్జ్యం : *రా9.52 - 11.34* దుర్ముహూర్తము : *ఉ8.07 - 8.58* మరల *మ12.21 - 1.12* అమృతకాలం : *ఉ10.40 - 12.24* రాహుకాలం : *ఉ10.30 - 12.00* యమగండం : *మ3.00 - 4.30* సూర్యరాశి : మేషం, చంద్రరాశి : మకరం సూర్యోదయం : 5.35, సూర్యాస్తమయం : 6.17, *_నేటి మాట_* *ఆ దివ్యశక్తి ని దర్శించాలంటే ? - ఎలా??...* ఈరోజుల్లో చాలా మంది భక్తులు దేవుడు ఎక్కడ వున్నాడు, దేవుడు వుంటే నాకు ఇది జరగాలి, అది జరగాలి అని చాలా చాలా మాటలు చెబుతుంటారు, ఇంకొందరు తిడుతూ శాపనార్థాలు పెడుతుంటారు ... !! అసలు ఆ భగవంతుడే లేకుంటే !!... పూవు లోని పరిమళములు, గ్రుడ్డులోని పిట్ట, చెఱకులోని తీపి, మిరప లోని కారము, వేప లోని చేదు... ఇవన్నీ ఎక్కడనుండి ప్రారంభ మయ్యాయి? వీటిని అర్థం చేసుకోవడానికే మానవునికి సాధ్యం కావట్లేదు, కానీ ఇవన్నీ దైవసృష్టి లోని విచిత్ర ములే! మానవుడు దైవాన్ని గుర్తించడం కోసం ఈ రకమైన సృష్టి ఏర్పడింది. ఎత్తైన పర్వతాలు, నదీ ప్రవాహాలు, ఉప్పొంగే సముద్రాలలో ఎంతటి అందమున్నది! ఇవన్నీ దైవము యొక్క పరమాద్భుత మైన సౌందర్యము నకు ప్రతీకలు. దైవము యొక్క సౌందర్యము ను వర్ణింప ఎవరికీ సాధ్యము కాదు. అలాగే ... దైవము యొక్క శక్తి సామర్థ్యము లను గుర్తింప వీలుకాదు. అల్ప బుద్ధి గలవారు అనంతమైన దైవ స్వరూపాన్ని ఏరీతిగా అర్ధము చేసుకోగలరు? దైవత్వమును పొందాలంటే, తగిన అర్హతను మనము పొందాలి. ఉపనిషత్తుల సారమిదే!! ... రాముడా, కృష్ణుడా, ?గోవిందుడా? నారాయణుడా? అసలు ఆ దివ్య శక్తి కి రూపమే లేదు. అందులో పరిపూర్ణ మైన జ్ఞానము, ఆనందము తప్ప అన్యములేదు. స్థిరమైన భక్తి, నిర్మల త్వము, నిస్వార్థ మును సాధించాలి అప్పుడే దివ్య శక్తి గోచర మౌతుంది. *_🌹శుభమస్తు🌹_* 🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏
RAJENDRAPRASAD, M.Com.
540 views
1 days ago
#ఈ రోజు 🌧️🌛🌔🌠 *🚩 ┈┉┅━❀ ॐ ❀━┅┉┈ 🚩* *వైశాఖ పురాణం - 20 వ రోజు పారాయణం*  *పాంచాలరాజు రాజ్యప్రాప్తి* నారదమహర్షి అంబరీష మహారాజుతో వైశాఖమహాత్మ్యము నిట్లు వివరింపసాగెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తిమహారాజా! వినుము. శ్రీహరికి మిక్కిలి యిష్టమైన వైశాఖమాస వ్రతమును దాని మహిమను వెల్లడించు మరియొక కథను చెప్పుదును వినుము. పూర్వము పాంచాలదేశమున పురుయశుడను రాజు కలడు. అతడు పుణ్యశీలుడను మహారాజు పుత్రుడు. అతడు తండ్రి మరణించిన పిదప రాజయ్యెను. అతడు ధార్మికుడు మహావీరుడు తన శక్తియుక్తులచే విశాల భూమిని పరిపాలించెను. పూర్వజన్మ దోషముచేనతడు కొంతకాలమునకు సంపదను కోల్పోయెను. వాని యశ్వములు, గజములు మున్నగు బలము నశించెను. వాని రాజ్యమున కరవు యేర్పడెను. ఈ విధముగా వాని రాజ్యము, కోశము బలహీనములై గజము మ్రింగిన వెలగపండువలె సారవిహీనములయ్యెను. వాని బలహీనతనెరిగి వాని శత్రువులందరును కలసి దండెత్తి వచ్చిరి. యుద్దములో నోడిన రాజు భార్యయగు శిఖినితో గలసి పర్వతగుహలో దాగుకొని యేబదిమూడు సంవత్సరముల కాలము గడపెను. ఆ రాజు తనలో నిట్లు విచారించెను. "నేను ఉత్తమ వంశమున జన్మించితిని. మంచి పనులను చేసితిని. పెద్దలను గౌరవించితిని. జ్ఞానవంతుడను. దైవభక్తి, యింద్రియజయము కలవాడను. నావారును నావలెనే సద్గుణవంతులు. నేనేమి పాపము చేసితినని నాకిట్టి కష్టములు కలిగినవి? నేనిట్లు అడవిలో నెంతకాలముండవలయునో కదా! అని విచారించి తన గురువులగు యాజుడు ఉపయాజకుడను గురువులను తలచుకొనెను. సర్వజ్ఞులగు వారిద్దరును రాజు స్మరింపగనే వానివద్దకు వచ్చిరి. రాజువారిద్దరికి నమస్కరించి యధాశక్తిగనుపచారములను చేసెను. వారిని సుఖాసీనులగావించి దీనుడై వారి పాదములందుపడి నాకిట్టి స్థితియేల వచ్చెను? నాకు తరణోపాయమును చెప్పుడని వారిని ప్రార్థించెను. వారు రాజును లేవదీసి కూర్చుండబెట్టి రాజు చెప్పినమాటలను వినిరి. వాని మనోవిచారమును గ్రహించిరి. క్షణకాలము ధ్యానమగ్నులై యిట్లనిరి. రాజా! నీ దుఃఖమునకు కారణమును వినుము. నీవు గత పదిజన్మలలో క్రౌర్యము కలిగిన కిరాతుడవు. నీయందు ధర్మప్రవృత్తి కొంచమైనను లేదు. సద్గుణము లేవియును లేవు. శ్రీహరికి నమస్కరింపలేదు. శ్రీహరిని కీర్తింపలేదు. శ్రీహరి కథలను వినలేదు. గత జన్మమున నీవు సహ్యపర్వతమున కిరాతుడవైయుంటివి. అందరిని బాధించుచు, బాటసారులను దోచుకొనుచు నింద్యమగు జీవితమును గడుపుచుంటివి. నీవు గౌడ దేశముననున్నవారికి భయంకరుడవై యుంటివి. ఇట్లు అయిదు సంవత్సరములు గడచినవి. బాలురను, మృగములను, పక్షులను, బాటసారులను వధించుటచే నీకు సంతానము లేదు. నీకీజన్మయందును సంతానము లేకపోవుటకును నీపూర్వకర్మయే కారణము. నీ భార్య తప్ప నీకెవరును అప్పుడును లేకుండిరి. అందరిని పీడించుట చేతను దానమన్నది లేకపోవుటచేతను నీవు దరిద్రుడవుగా నుంటివి. అప్పుడు అందరిని భయపెట్టుటచే నీకిప్పుడు యీ భయము కలిగెను. ఇతరులను నిర్దయగా పీడించుటచే నిప్పుడు నీ రాజ్యము శత్రువులయధీనమైనది. ఇన్ని పాపములను చేసిన నీవు రాజకులమున పుట్టుటకు కారణమును వినుము. నీవు గౌడదేశమున అడవిలో కిరాతుడవై గత జన్మలోనుండగా ధనవంతులగు యిద్దరు వైశ్యులు కర్షణుడనుముని నీవున్న యడవిలో ప్రయాణించుచుండిరి. నీవు వారిని అడ్డగించి బాణమును ప్రయోగించి ఒక వైశ్యుని చంపితివి. రెండవ వైశ్యుని చంపబోతివి. అతడును భయపడి ధనమును పొదరింటదాచి ప్రాణరక్షణకై పారిపోయెను. కర్షణుడను మునియు నీకు భయపడి ఆ యడవిలో పరిగెత్తుచు, యెండకు, దప్పికకు అలసి మూర్ఛిల్లెను. నీవును కర్ష్ణణుని సమీపించి వాని మొగముపై నీటిని జల్లి ఆకులతో విసరి వానికి సేవచేసి వానిని సేదతీర్చితివి. అతడు తేరుకున్న తరువాత నీవు మునీ! నీకు నా వలన భయములేదు. నీవు నిర్ధనుడవు. నిన్ను చంపిననేమి వచ్చును. కాని పారిపోయిన వైశ్యుడు ధనమునెక్కడ దాచెనో చెప్పుము. నిన్ను విడిచెదను చెప్పనిచో నిన్నును చంపెదను అని వానిని బెదిరించితివి. ఆ మునియు భయపడి ప్రాణ రక్షణకై వైశ్యుడు ధనమును దాచిన పొదరింటిని చూపెను. అప్పుడు నీవు ఆ మునికి అడవి నుండి బయటకు పోవు మార్గమును చెప్పితిని దగ్గరలోనున్న నిర్మల జలము కల తటాకమును చూపి నీటిని త్రాగి మరింత సేద తీసిపొమ్ము. రాజభటులు నాకై రావచ్చును కావున నేను నీవెంబడి వచ్చి మార్గమును చూపజాలనని చెప్పితివి. ఈ ఆకులతో విసురుకొనుము. చల్లనిగాలి వీచునని వానికి మోదుగ ఆకులనిచ్చి పంపి నీవు అడవిలో దాగుకొంటివి. నీవు పాపాత్ముడవైనను వైశ్యుని ధనమెచటనున్నదో తెలిసికొనుటకై ఆ మునికి సేవలు చేయుటవలన వానిని అడవి నుండి పోవు మార్గమును జలాశయమార్గమును చెప్పుట వలన ఆ కాలము వైశాఖమాసమగుటచే నీవు తెలియకచేసినను స్వార్థముతో చేసినను మునికి చేసిన సేవ ఫలించినది. ఆ పుణ్యము వలన నీవిప్పుడు రాజ వంశమున జన్మించితివి. నీవు నీ రాజ్యమును పూర్వపు సంపదలను వైభవములను కావలెనని యనుకున్నచో వైశాఖ వ్రతమును చేయుము. ఇది వైశాఖమాసము. నీవు వైశాఖశుద్ద తదియ యందు ఒకసారి యీనిన ఆవును దూడతో బాటు దానమిచ్చినచో నీ కష్టములు తీరును. గొడుగునిచ్చిన నీకు రాజ్యము చేకూరును. ప్రాతః కాల స్నానము చేసి అన్ని ప్రాణులకు అందరికి సుఖమును కలిగింపుము. *వైశాఖ పురాణం 20,వ అధ్యాయం సమాప్తం..* *🚩 ┈┉┅━❀ ॐ ❀━┅┉┈ 🚩*
RAJENDRAPRASAD, M.Com.
525 views
1 days ago
#ఈ రోజు 🌧️🌛🌔🌠 🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 🥀పంచాంగం🥀 శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు, తేదీ ... 07 - 05 - 2026, వారం ... బృహస్పతివాసరే ( గురువారం ) శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళ పక్షం, తిథి : *పంచమి* ఉ6.46 వరకు, నక్షత్రం : *పూర్వాషాఢ* మ3.36 వరకు, యోగం : *సాధ్యం* రా11.08 వరకు, కరణం : *గరజి* రా7.27 వరకు, వర్జ్యం : *రా12.16 - 2.00* దుర్ముహూర్తము : *ఉ9.48 - 10.39* మరల *మ2.53 - 3.44* అమృతకాలం : *ఉ10.20 - 12.05* రాహుకాలం : *మ1.30 - 3.00* యమగండం : *ఉ6.00 - 7.30* సూర్యరాశి : మేషం, చంద్రరాశి : ధనుస్సు సూర్యోదయం : 5.35, సూర్యాస్తమయం : 6.17, *_నేటి మాట_* *అహంకారం* 'అహంకారం పతనానికి మొదటి సోపానమని, చికిత్సకు లొంగని జబ్బని’ పెద్దలు చెప్పిన మాటలు అమృత తుల్యమైనా నిరహంకారులై చరిస్తున్న వారు అత్యల్పం. అహంకారం మనిషి పతనానికి కారణ భూతమని పురాణాలు, ఇతిహాసాలు వివరించినట్టే ప్రవర్తించిన వారున్నారు. అహంకారులకు ఈర్ష్య, అసూయ వంటి అదనపు దుర్లక్షణాలు తోడవుతాయి. అలాంటి వ్యక్తిత్వం కలిగిన దుర్యోధనుడు పాండవులను మించిన సంపద, అధికారం పొందాలన్న వాంఛలతో అనైతికంగా ప్రవర్తించి వినాశనం పొందినట్టు భారతం తెలిపింది. రావణుడికి తనంతటి శక్తిశాలి, శివభక్తుడు లేరన్న గర్వం అధికం. తక్షణమే శివ దర్శనమివ్వలేదన్న ఆగ్రహంతో కైలాసాన్ని కదిలించబోగా, ఒక వ్రేలుతో కైలాసాన్ని పరమశివుడు తొక్కిపట్టేసరికి ముచ్చెమటలు పోసి, ముల్లోకాలు దద్ధరిల్లేలా అరచి గర్వభంగం పొందిన రావణుడి చరితను పురాణాలు వర్ణించాయి. అధికార, ఐశ్వర్యాలున్నాయన్న అహంకారంతో ఒకసారి సభ లోపలకు ప్రవేశిస్తున్న దేవగురువును ఎదురేగి ఆహ్వానించక, సింహాసనం నుండి లేవక అలక్ష్యం చేసాడు ఇంద్రుడు. స్వర్గాధిపతి ప్రవర్తనకు ఖిన్నుడైన బృహస్పతి సభ నుండి వెనుదిరిగాడు. ఇదే సరైన తరుణమని దేవతలపై దండెత్తి దేవలోకాన్ని దానవులు జయించినట్టు భాగవతం తెలిపింది. భక్తులు అహంకారులైనప్పుడు దేవుడే కనువిప్పు కలిగించిన సంఘటనలు ఉన్నాయి. ఆకాశరాజు సోదరుడైన తొండమానుడికి తనంతటి విష్ణుభక్తుడు లేడన్న గర్వం ఆవహించగా కుమ్మరి భీముడి వద్దకు పంపి కనువిప్పు కలిగించిన వేంకటేశ్వరుని కథను భవిష్యోత్తర పురాణం తెలిపింది. తపోశక్తిచే కొంగను నేలకూల్చిన కౌశికుడిని ఆవరించిన అహంకారాన్ని పోగొట్టి, ధర్మవ్యాధుడి వద్దకు శిష్యరికానికి సాగనంపిన గృహిణి కథను, శత సహస్ర వర్షములు తపమాచరించి స్వర్గాన్ని చేరిన యయాతి అహంకారియై మహర్షుల తపస్సును కించపరచిన ఫలితంగా తపశ్శక్తి కోల్పోయిన ఘటనను మహాభారతం తెలిపింది. అహంకారం వలన ప్రయోజనం పొందినట్టు విశ్వామిత్రుడి చరిత్ర తెలుపుతుంది. వశిష్ఠుడిని జయించాలన్న లక్ష్యంతో తపస్వియై బ్రహ్మర్షిగా ఎదిగి సృష్టికి ప్రతిసృష్టి చేసినట్టు పురాణాలు తెలిపాయి. ‘మనిషిని సర్వనాశనం చేసేది అహంకారమనీ, దాన్ని వీడినప్పుడే సద్బుద్ధిగలవారై దైవకృపకు పాత్రులు కాగలరని” కబీరుదాసు చెప్పినట్టు మెలిగినప్పుడు చుట్టూ ఉన్న ఆనందం దర్శనమిస్తుంది. జీవితం సుందరమయమై అనుబంధాలతో అల్లుకుపోతుంది. “నేను, నా అనే భావన సర్వజనులను, దేవుడిని దూరం చేస్తుందన్న” అబ్దుల్ కలాం మాటల్లోని సారాంశం గ్రహించి వినయంతో ప్రవర్తించడం అలవరచుకోవాలి. నేటి తరంలో సర్దుకుపోయే తత్త్వం కొరవడుతోంది. ఆవేశంతో కూడిన పరుష వాక్కుల ప్రభావంతో ప్రశాంతతను కోల్పోతున్నారు. పరుల హృదయాలను కరిగించే మాటతీరుతో ఆకట్టుకుని జీవించడం అలవరచు కున్నప్పుడు జీవితం పూలబాటగా మారుతుంది *_🥀శుభమస్తు🥀_* 🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏