RAJENDRAPRASAD, M.Com.
597 views 1 days ago
#ఈ రోజు 🌧️🌛🌔🌠 *శ్రావణమాస మహాత్మ్యము – 06 షష్ఠాధ్యాయము* (శ్రీమదష్టాదశ మహాపురాణాలలో ఒకటైన శ్రీ స్కాంద పురాణాంతర్గతం) నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం! దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్!! సనత్కుమార ఉవాచ: ఓ సాంబమూర్తీ! సంతోషమును కలుగజేసెడి ఆదివార వ్రతమును వింటిని. శ్రావణమాసములో సోమవారమునకు ఉండెడి మహిమను కూడ చెప్పుమని సనత్కుమారుడు అడిగెను. ఈశ్వర ఉవాచ: సాంబమూర్తి చెప్పుచున్నాడు. సూర్యుడు నాకు నేత్రము కాబట్టి, అట్టి సూర్యుని సంబంధమైన ఆదివారమునకు ఇట్టి మహిమ కలిగెను. ఇక సోమవార మహిమను గురించి చెప్పెదను. “ఉమయాసహితః – సోమః” అని చెప్పబడును. అనగా పార్వతీ దేవితో కూడినవాడు సోముడు అని చెప్పబడెను. కాన సోమ శబ్దము నా యందే వర్తించుట వలన సోమవారమనగా నా సంబంధమైన వారమే అగును కాబట్టి, దాని మహిమను చెప్పుటకు నలవియే కాదు. ఈ సోమవారమును గురించి చెప్పదగిన యావత్తు మహిమ నీకు చెప్పెదను. సోమ శబ్దమునకు ఇంద్రుడనియు, బ్రాహ్మణోత్తముడనియు, యజ్ఞమునందు ఉపయోగించు సోమలత అనియు అనేక అర్థములు కలవు. దానియొక్క యథార్థమునంతయు సవిస్తరముగా చెప్పెదను, వినుము. నా స్వరూపమైనది కాబట్టి సోమవారమని చెప్పబడెను. ఈ వ్రతమును చేసినవాడు సమస్త రాజ్యమును ఇచ్చునట్టివాడును, శ్రేష్ఠుడును, సమస్త యజ్ఞముల ఫలమును ఇచ్చునట్టివాడును అగును. అనగా దైవత్వమును పొంది సమస్తమును ఇచ్చువాడగును. ఓ బ్రాహ్మణోత్తమా! ఆ వ్రతమును సవిస్తరముగా చెప్పెదను, వినుము. పండ్రెండు మాసముల యందును సోమవారము మిక్కిలి శ్రేష్ఠమైనదిగా చెప్పబడెను. ఈ పండ్రెండు మాసముల యందును సోమవార వ్రతమును చేయలేని వాడు ఒక్క శ్రావణమాసములో చేసినను సంవత్సరమంతయు చేసిన ఫలము నొందును. శ్రావణ శుద్ధములో మొదటిదియగు సోమవారము నందు వ్రతమును ఆరంభించుచు, “సాంబమూర్తి నా యందు అనుగ్రహము కలవాడై యుండుగాక” అని సంకల్పము చేసి ఆరంభించవలెను. ఇట్లు శ్రావణమాసములో నాలుగుగాని, ఐదుగాని వచ్చెడి సోమవారముల యందు ప్రాతఃకాలంబున సంకల్పము చేసి, రాత్రులయందు షోడశోపచారములచే శివుని పూజించి, నిశ్చలమైన మనస్సుతో శ్రేష్ఠమైన సోమవార వ్రతకథను వినవలయును. కాబట్టి ఈ చెప్పబోవు సోమవార వ్రత విధానమును వినుము. శ్రావణమాసములో మొదటి సోమవారమున ప్రారంభింపవలెను. ప్రాతఃకాలంబున స్నానము చేసి పరిశుద్ధుడై తెల్లని వస్త్రములను ధరించి, కామము, క్రోధము, అహంకారము, ద్వేషము, పిశునతనము మొదలగు దుష్టగుణములను విడువవలయును. మాలతీ, మల్లిక మొదలగు తెల్లని పువ్వులను తెచ్చి, త్ర్యంబక మంత్రచే పూజించి, పిమ్మట షోడశోపచారముల చేతను శివునకు ముందు చెప్పబోవు రీతిని పూజ చేయవలయును. శర్వాయ, భవనాయ, మహాదేవాయ, ఉగ్రాయ, ఉగ్రనాథాయ, భవాయ, శశిశేఖరాయ, రుద్రాయ, నీలకంఠాయ, శివాయ, భవహారిణే — ఈ మొదలైన రుద్రుని నామములచే తన శక్తికొలది షోడశోపచారాలు చేసి సాంబమూర్తిని పూజించినయెడల వారికి కలుగు ఫలము చెప్పెదను, వినుము. పార్వతీసహితుడైన సాంబమూర్తిని సోమవారము నందు పూజించిన వారు ఎప్పుడును నశింపనివియు, పునరావృత్తిరహితమైన లోకములను పొందుదురు. ఈ మాసములో నక్త భోజనము చేసినందువలన కలిగెడు పుణ్యమును సంక్షేపముగా చెప్పెదను, వినుము. ఏడు జన్మములందు చేయబడినదియు, దేవతలు, రాక్షసులు మొదలగు వారిచేతనైనను పోగొట్టబడుటకు సాధ్యముకాని పాపమైనను శ్రావణమాసములో నక్త భోజనము వలన నశింపగలదు. ఈ విషయమై సందేహమేమియు లేదు. శ్రేష్ఠమైన ఈ సోమవార వ్రతమును ఉపవాసముండి చేసిన యెడల పుత్రులను కోరినవాడు పుత్రులను, ధనమును కోరినవాడు ధనమును, మరియు ఏయే కోరికలను కోరుచున్నాడో వానినన్నిటిని పొందగలడు. ఈ లోకమున తాను కోరిన కోరికలనన్నియు అనుభవించి, చిరకాలము జీవించి, జన్మాంతమున శ్రేష్ఠమైన దేవతా విమానమునెక్కి కైలాసము చేరగలడు. బుద్ధి, ధనము, ప్రాణము ఇవియన్నియు స్థిరములు కానివి. కాబట్టి ఎప్పుడు నశించిపోవునో అని తెలిసికొని సమస్త విధముల త్వరలోనే ఈ వ్రతమునకు ఉద్యాపనము చేయవలయును. వెండితో వృషభ వాహనమును, బంగారముతో పార్వతీ-పరమేశ్వరుల ప్రతిమలను తన శక్తికొలది చేయించవలయును. శక్తి యుండగా లోభించకూడదు. శ్రేష్ఠమైనదియు, శుభప్రదమైనదియు, లింగాకారముగా ఒక మండపమేర్పరచి, అచ్చట రెండు తెల్లని వస్త్రములతో చుట్టబడిన కలశమును ఉంచవలయును. దాని పైన రాగి పాత్రగాని, వెదురు పాత్రగాని ఉంచి, పార్వతీ సహితుడైన శివప్రతిమను ఉంచవలయును. పుష్పములు మొదలగు వానిచే మండపమును శుభప్రదముగా అలంకరించి, వేదమంత్రములు, స్మృతులు, పురాణములు మొదలగు వానిచే చెప్పబడిన మంత్రములచే సాంబమూర్తిని యథావిధిగా పూజింపవలయును. గీత, వాద్యము మొదలగు వానిచే రాత్రి జాగరణము చేయవలయును. తమ శాఖయందు చెప్పబడిన ప్రకారముగా అగ్ని ప్రతిష్ఠాపన చేసి, శర్వాయ మొదలగు పదకొండు నామములతోను, మోదుగ సమిధలను ఉంచుచు నూట ఎనిమిది పర్యాయములు హోమము చేయవలయును. “ఆప్యాయస్వ” అను మంత్రమును ఉచ్చరించుచు యవలు, వ్రీహులు, నువ్వులు మొదలగు వానితోను, “త్ర్యంబకం” అను మంత్రమును గాని, ఆరు అక్షరములు గల శివ పంచాక్షరీ మంత్రమును గాని పఠించుచు మారేడు దళములతో హోమము చేసి, స్విష్టకృత్ మొదలగునవియు చేసి, పిమ్మట పూర్ణాహుతి హోమము గావించి, పిమ్మట ఆచార్యుని పూజించి, గోదానము మొదలగు దానములు ఇవ్వవలయును. అనంతరం సద్గుణములు గల పదకొండు మంది బ్రాహ్మణులను భోజనం పెట్టి, వారికి వెదురు పాత్రలతో కూడిన పదకొండు కలశములను ఇవ్వవలయును. అనంతరం పూజింపబడిన శివుని ప్రతిమను అక్కడ ఉంచబడిన ఉపకరణములతో కూడ ఆచార్యునకు దానమిచ్చి, అనంతరం “ఆ వ్రతము సంపూర్తియగుగాక, శివుడు నా యందు అనుగ్రహము కలవాడై యుండుగాక” అని ప్రార్థింపవలయును. అనంతరం సంతోషమైన మనస్సుగలవాడై బంధువులు మొదలగు వారితో కూడి భుజింపవలయును. ఈ ప్రకారముగా ఎవడీ వ్రతమును చేయుచున్నాడో వాడు తాను కోరిన కోరికలన్నియు పొందగలడు. అనంతరం కైలాసమును చేరి, అచ్చట శాశ్వతముగా ఉండగలడు. ఈ సోమవార వ్రతమును పూర్వము కృష్ణమూర్తి మరియు ధర్మమార్గమునందు ఆసక్తిగల అనేక రాజులు ఆచరించిరి. కాబట్టి ఈ కథను విన్నవారు సోమవార వ్రతమును చేసిన ఫలము పొందువారగుదురు. || ఇతి శ్రీ స్కాందపురాణే శ్రావణమాస మాహాత్మ్యే ఈశ్వర-సనత్కుమార సంవాదే సోమవార వ్రతకథనం నామ షష్ఠోధ్యాయః సమాప్తః ||
4 shares

More like this