భారత్ - పాక్ టీ 20 వరల్డ్ కప్ మ్యాచ్...
భారత్-పాక్ క్రికెట్ వార్కి లైన్ క్లియర్....
ఫిబ్రవరి 15న మహాసంగ్రామమే!
కొలంబోలో బిగ్ ఫైట్ గ్యారెంటీ!!...
టీ20 వరల్డ్కప్ 2026లో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్కు చివరికి క్లియరెన్స్ లభించింది. ఫిబ్రవరి 15న శ్రీలంక రాజధాని కొలంబోలో జరగాల్సిన ఈ కీలక పోరు యథావిధిగా జరుగుతుందని అధికారికంగా తేలింది.పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ మ్యాచ్ ఆడేందుకు అనుమతి ఇవ్వడంతో, బాయ్కాట్ వివాదానికి ముగింపు పలికినట్టయింది.
ఇటీవల ఐసీసీ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) మధ్య లాహోర్లో జరిగిన సమావేశం అనంతరం ఈ కీలక నిర్ణయం వెలువడింది. ఈ సమావేశంలో భారత్తో మ్యాచ్పై పాకిస్తాన్ వైఖరిపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. సమావేశం తర్వాత పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీ ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో భేటీ అయ్యారు. పరిస్థితిని వివరించిన అనంతరం, మ్యాచ్ ఆడేందుకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీనిని పీసీబీ ప్రతినిధి అమిర్ మీర్ అధికారికంగా ప్రకటించారు. ఫిబ్రవరి 15న భారత్తో మ్యాచ్ ఆడాలని ప్రధాని ఆదేశించినట్లు తెలిపారు.
ఈ నిర్ణయాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం శ్రీలంక ప్రభుత్వానికి కూడా తెలియజేసింది. షెహబాజ్ షరీఫ్ శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సానాయకేతో ఫోన్లో మాట్లాడి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఈ మ్యాచ్ జరగాలని శ్రీలంక క్రికెట్ బోర్డు గతంలోనే పీసీబీకి విజ్ఞప్తి చేసింది. మ్యాచ్ రద్దయితే శ్రీలంకకు భారీ ఆర్థిక నష్టం జరుగుతుందని చెప్పింది.
శ్రీలంక క్రికెట్ బోర్డు తన లేఖలో గతంలో భద్రతా సమస్యల కారణంగా పాకిస్తాన్ ఒంటరిగా ఉన్న సమయంలో తాము వారికి మద్దతుగా నిలిచామని గుర్తు చేసింది. ఇప్పుడు అదే విధంగా సహకరించాలని కోరింది. ఈ వివాదానికి ప్రధాన కారణం బంగ్లాదేశ్ వ్యవహారమే. భద్రతా కారణాలు చూపుతూ భారత్కు వెళ్లేందుకు నిరాకరించడంతో బంగ్లాదేశ్ జట్టును టోర్నీ నుంచి తొలగించారు. దీనికి నిరసనగా పాకిస్తాన్ భారత్ మ్యాచ్ను బాయ్కాట్ చేస్తామని ప్రకటించింది.
అయితే తాజాగా ఐసీసీ బంగ్లాదేశ్ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుపై ఎలాంటి ఆర్థిక, పరిపాలనా లేదా క్రీడాపరమైన శిక్షలు విధించబోమని ప్రకటించింది. అంతేకాదు, 2031 వరల్డ్కప్కు ముందు ఒక ఐసీసీ టోర్నీని బంగ్లాదేశ్లో నిర్వహించేందుకు అంగీకరించింది. అలాగే బంగ్లాదేశ్కు వివాద పరిష్కార కమిటీ (డీఆర్సీ) వద్ద న్యాయం కోరే హక్కు ఉందని కూడా ఐసీసీ స్పష్టం చేసింది. తాము నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామని వెల్లడించింది.
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ప్రపంచ క్రికెట్లో అత్యధిక ఆదాయం తెచ్చే మ్యాచ్గా గుర్తింపు పొందింది. ఈ ఒక్క మ్యాచ్ ద్వారా వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. టికెట్లు, టీవీ హక్కులు, ప్రకటనల ద్వారా ఐసీసీతో పాటు హోస్ట్ దేశాలకు భారీ లాభం లభిస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్ జరగకపోతే ఐసీసీ, బ్రాడ్కాస్టర్లు, శ్రీలంక క్రికెట్ బోర్డుకు భారీ నష్టం వాటిల్లి ఉండేది.
ఇక భారత జట్టు ఇప్పటికే షెడ్యూల్ ప్రకారం కొలంబోకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. శిక్షణ, మీడియా సమావేశాలు, ప్రాక్టీస్ సెషన్లు అన్నీ ప్లాన్ ప్రకారమే కొనసాగనున్నాయి. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ టీ20 వరల్డ్కప్లోనే హైలైట్గా నిలవనుందని ఇప్పటికే భారీ అంచనాలు కొనసాగుతున్నాయి. #🌅శుభోదయం #🆕Current అప్డేట్స్📢 #🏏క్రికెట్ 🏏