#భారతీయ జనతా పార్టీ bjp
*అశాంతి రగిల్చిన ప్రశాంత్ గెలుపు‼️*
08.08.2026🎯
బిహార్లోని బాంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉపయెన్నికలో 19 వేల ఓట్ల మెజారిటీతో ప్రశాంత్ కిశోర్ గెలుపు బిజెపిలో అశాంతి రగిలిస్తోంది. మామూలుగా చూస్తే ఒక అసెంబ్లీ సీటు గురించి యింతదిగా చర్చించుకోనక్కర లేదు. కానీ అది – దేశంలోనే అత్యంత బలమైన రాజకీయ పార్టీ ఐన బిజెపికి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ దిల్లీ రావడానికై ఖాళీ చేసిన సీటు, 30 ఏళ్లకు పైగా కుటుంబ వారసత్వంగా నిలుపుకుని వస్తున్న సీటు, బిజెపి కోర్ ఓటు బ్యాంకు పుష్కలంగా వున్న సీటు, డబుల్ ఇంజన్ సర్కారు నడుస్తున్న రాష్ట్రంలో 9 నెలల కితం 63% ఓట్లతో, 52 వేల ఓట్ల మెజారిటీతో గెలిచిన సీటు. ‘‘అక్కడ కుక్కను నిలిపినా బిజెపి గెలుచుకుంటుంది.’’ అన్నాడు పట్నా ఎంపీ రవిశంకర్ ప్రసాద్. అలాటి సీటులో ఎప్పణ్నుంచో పాతుకుపోయిన ఆర్జెడి వంటి పార్టీ చేతిలో ఓడిపోతే అదో ముచ్చట. కానీ 9 నెలల కితం కేవలం 3% మాత్రమే ఓట్లు తెచ్చుకున్న పార్టీ నాయకుడి చేతిలో బిజెపికి యీసారి 34.4% ఓట్లు మాత్రమే వచ్చి, ఓటమి ఎందుకు సంభవించింది అనే దానికి పలు కారణాలు చెపుతున్నారు విశ్లేషకులు. కాక్రోచ్ పోరాట ఫలితమే యిది అని కొందరు సింపుల్గా చెప్పేస్తూంటే, అది ఒక ఫ్యాక్టరే కానీ, యింకా కారణాలున్నాయి అని ఏకరువు పెడుతున్నారు.
అగ్రకులస్తుల అడ్డా
బాంకీపూర్ పట్నా నగరంలోని వెస్ట్ నియోజకవర్గంగా వుండేది. 2008 డిలిమిటేషన్లో బాంకీపూర్గా మారింది. పూర్తి అర్బన్ ప్రాంతం, అగ్రకులాలు అధిక సంఖ్యలో వుండే ప్రాంతం. అందువలన 1995 నుంచి అక్కడ కాషాయపతాకం ఎగురుతూ వచ్చింది. నితిన్ తండ్రి అక్కణ్నుంచి గెలిచాడు. ఆయన వారసుడిగా (బిజెపిలోనూ వారసత్వ రాజకీయా లున్నాయండోయ్) నితిన్ ఐదు సార్లుగా గెలుస్తూ వస్తున్నాడు. 3.80 లక్షల ఓటర్లుంటే వారిలో 1.60 లక్షల మంది అగ్రకుల ఓటర్లున్నారు. వారిలో కాయస్థులు 14%. నితిన్ (ఇంటిపేరు సిన్హా) కాయస్థుడే. బ్రాహ్మణులు 8%, భూమిహార్లు 8%, రాజపుత్రులు 7% వీరంతా బిజెపికే వేసేవారు. వీరికి తోడుగా 5% వున్న కుర్మీలు, 3% వున్న కుశవహాలు కూడా తోడయ్యేవారు. ఇప్పుడు బిజెపి అభ్యర్థిగా నిలిపిన వ్యక్తి కూడా కాయస్థుడే. కానీ జన సురాజ్ పార్టీ తరఫున నిలబడిన ప్రశాంత్ కిశోర్ బ్రాహ్మణుడు కావడంతో అగ్ర కులస్తుల్లో చీలిక వచ్చింది.
దానికి తోడు ఆర్జెడికి ఓటు బ్యాంకుగా వుండే ముస్లింలు, యాదవులు బిజెపిని ఓడించాలంటే యిదే తరుణం అనుకుని, తమ అభ్యర్థికి కాకుండా ప్రశాంత్కు వేశారు. అందువలన 9 నెలల కితం 46 వేలు తెచ్చుకున్న ఆర్జెడి అభ్యర్థి రేఖా కుమారి, యీసారి కూడా తనే నిలబడినా 14 వేలు మాత్రం తెచ్చుకుంది. కొన్ని ఓట్లు జెడియుకు కూడా వున్నాయి. నీతీశ్ను ముందు పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడి, అధికారం చేజిక్కాక 5 నెలల్లోనే అతన్ని తప్పించి వేసిన బిజెపికి బుద్ధి చెప్పడానికి యిదే అవకాశం అనుకుని ఆ ఓటు బ్యాంకు కూడా ప్రశాంత్కు వేసిందట. ఒబిసి, దళిత ఓట్లలో కూడా చీలిక వచ్చిందని చెప్తున్నారు.
కాక్రోచ్ నిరసనలపై బిజెపి ప్రభుత్వ తీరు
ఈ అంశాల మాట ఎలా వున్నా కాక్రోచ్ ఆందోళన ప్రభావం బాగా కనబడిందని చెప్పాలి. దిల్లీ జంతర్ మంతర్ నిరసనల ప్రతిధ్వని అతి తీవ్రంగా పట్నాలోనే వినబడింది. ఎందుకంటే అక్కడే యూనివర్శిటీ వుంది. కోచింగ్ సెంటర్లు అధికంగా వున్నాయి. కాలేజీల్లో, హాస్టళ్లల్లో వున్న వేలాది విద్యార్థులు ఊరేగింపులు జరిపారు. ఇతర జిల్లాల్లో కూడా నిరసన హింసాత్మకంగా మారింది. దిల్లీలో లాగానే యిక్కడా పోలీసులు దౌర్జన్యంతో అణచి వేయబోయారు. ఒక పోలీసు ఏకె 47తో కాల్పులు కూడా జరిపాడు. అతన్ని సస్పెండ్ చేశారు కానీ అతనికి అనుమతి ఎవరిచ్చారో వారి పేరు బయటకు రానీయలేదు. పోలీసులు బాంకీపూర్లో వున్న ప్రైవేటు హాస్టళ్లలోకి చొరబడి కోచింగ్ కోసం వచ్చిన విద్యార్థులను చితకబాదారు. జులై 25న యిచ్చిన బిహార్ బంద్ సందర్భంగా ఒక్క రోజే దాదాపు 700 మందిని నిర్బంధించారు. అనేక మందిపై హత్యానేరం కేసులు మోపారు. ఇంతలో వాళ్లకు గుర్తుకు వచ్చింది. జులై 30న ఉపయెన్నిక అని. 27న విద్యార్థులపై వున్న కేసులన్నీ ఎత్తి వేశారు. అయినా ప్రజల ఆగ్రహం చల్లార లేదు.
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, నీట్ పరీక్ష నిర్వహణా లోపం వలన నష్టం కలిగింది విద్యార్థులకు మాత్రమే కాదు, వారి తల్లిదండ్రులకు, యితర కుటుంబసభ్యులకు కూడా. చదువు అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిన యీ రోజుల్లో, ఒక విద్యార్థి విద్యావంతుడు కావడానికి కుటుంబం ఎన్నో త్యాగాలు చేయాల్సి వస్తోంది. ఎన్ని చేసినా ప్రభుత్వ అసమర్థత వలన అతను పరీక్ష యివ్వలేక పోతే మొత్తమంతా బూడిదలో పోసిన పన్నీరే. ఒకసారి, రెండుసార్లయితే దురదృష్టమని తమకు తాము సర్దిచెప్పుకుంటారు. కానీ అదే కథ పునరావృతమౌతూ వుంటే…? ప్రభుత్వం విద్యార్థుల గోడు వినడానికి సిద్ధంగా లేకపోతే..? పొరపాట్లకు బాధ్యత వహిస్తున్నామని చేతల్లో చూపకపోతే…? ఉపయెన్నిక జరిగేనాటికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం జరిగిపోయింది. కానీ బిజెపి నాయకులు అతనేదో ఘనకార్యం చేసినట్లు పార్లమెంటులో ఘనస్వాగతం పలికి, జిందాబాద్ నినాదాలతో హోరెత్తించడంతో బిజెపి ఓటర్లకు కూడా చికాకు వేసినట్లుంది.
దానికి తోడు తాము యిన్నాళ్లూ గెలిపించిన నబీన్ ఉద్యమకారులను ‘వైరస్లు, బొద్దింకలు, దేశాన్ని ముక్కలు చేయడానికి పూనుకున్న అల్లరి మూకలు’ అని తిట్టడం వారిని మండించి వుంటుంది. బాంకీపూర్ ఓటర్లలో జెన్జీ వారి శాతం 30 మాత్రమే. కానీ వారి తల్లిదండ్రుల శాతం కూడా దీనికి కలపాలి. అందుకే యీ ఉపయెన్నికలో 34% మంది మాత్రమే ఓటేశారు. 9 నెలల కితం 41% ఓటింగు జరిగిందక్కడ. ఈసారి యింట్లో వుండిపోయినవారు బిజెపి ఓటర్లే అనుకోవాలి. తాము వరుసగా గెలుస్తూ రావడంతో బిజెపికి అహంకారం పెరిగిందని, నియోజకవర్గం అభివృద్ధిని పట్టించుకోలేదని ఓటర్లలో వున్న ఫీలింగుని ప్రశాంత్ పట్టుకున్నాడు. ‘నేను జవాబుదారీతనం తెస్తాను. నేను గెలవడంతో బాంకీపూర్ బెంగుళూరు అయిపోదు. అయినా 3, 4 నెలల్లో మార్పు తెచ్చేందుకు కృషి తెస్తాను.’ అని చెప్పాడు.
బిజెపి తడబాటు
అదెలాగూ తమ సీటేననీ, ప్రశాంత్ చేసేదేమీ లేదని అనుకున్న బిజెపి మొదట అభిషేక్ కుమార్ అనే ఓ అభ్యర్థిని నిలిపింది. అతను లాలూ ప్రసాద్ దాణా కుంభకోణంలో భాగస్వామి అని ప్రజలు ఎత్తి చూపారు. వెంటనే నాలిక కరుచుకుని నీరజ్ కుమార్ సిన్హా అనే అతన్ని పెట్టారు. ప్రశాంత్ను చూసి భయపడి, అభ్యర్థిని మార్చింది అనే సందేశం జనాల్లోకి వెళ్లింది. పార్టీ అధ్యక్షుడు తన సొంత నియోజక వర్గంలోనే యిలాటివి చూసుకోకపోతే ఎలా? ముఖ్యమంత్రి, అతని కాబినెట్ సహచరులు, యితర బిజెపి నాయకులు మొత్తం 40 మంది ప్రచారం చేసినా ప్రశాంత్ను ఓడించలేక పోయారు అనే అపఖ్యాతి మూటగట్టుకోవడం తప్ప సాధించింది ఏమీ లేకపోయింది. సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రి అయ్యాక తొలి ఎన్నిక యిదే. దీని ఫలితం యిలా రావడానికి ముఖ్య కారణం అతనే అంటున్నారు. నీతీశ్కు వారసుడిగా తెచ్చిన వ్యక్తి విషయంలో బిజెపి ఎంత జాగ్రత్తగా వుండాలి? రాజకీయ పవనాల దిశ బట్టి గాలికోడిలా తిరుగుతాడనే నింద తప్ప నీతీశ్ అంటే బిహార్ ప్రజల్లో గౌరవం వుంది. మరి యితనో? సమతా పార్టీతో మొదలుపెట్టి, ఆర్జెడి, జెడియులను చుట్టబెట్టి 9 ఏళ్ల కితం బిజెపిలోకి వచ్చాడు. కుశవహా కులానికి చెందినవాడు కాబట్టి ఒబిసి ఓట్లు కూడగట్టగలడని భావించి బిజెపి యితన్ని చేర్చుకుని, దరిమిలా రాష్ట్ర అధ్యక్షుణ్ని చేసింది. నీతీశ్ కింద ఉప ముఖ్యమంత్రిని చేసింది.
ముఖ్యమంత్రిపై అసంతృప్తి
ఇతను ఏం చదివాడో ఎవరూ చెప్పలేకున్నారు కానీ వానాకాలం చదువనే అనుకోవాలి. క్రిమినల్ కేసులు కూడా వున్నాయి. నీతీశ్ని దింపాక, అతని స్థానంలో తమకు శాశ్వత మద్దతుదారులైన అగ్ర కులస్తుల లోంచి ఎవరినైనా ముఖ్యమంత్రిని చేయడానికి దడిసిన బిజెపి ఒబిసి కదాని యితనికి అవకాశ మిచ్చింది. ఇది బిజెపి ఓటు బ్యాంకులోని అగ్రకులస్తులను మండించింది. 1990 నుంచి ఏ పార్టీ నుంచైనా సరే, ఒబిసిలే బిహార్ను పాలిస్తున్నారు. ఇప్పటికైనా మనకు ఛాన్సు వస్తుందనుకుంటే మళ్లీ ఒబిసియేనా అనుకున్నారు. బాంకీపూర్లో అగ్రకులస్తుల అలకకు యిది కూడా ఒక కారణమంటున్నారు. వారితో పాటు రాష్ట్రంలోని బిజెపి నాయకులనేకులకు సామ్రాట్ నచ్చలేదు. ఇతర పార్టీల నుంచి వచ్చినవాడికి యింత ముఖ్యమైన పదవిని కట్టబెట్టినందుకు వాళ్లకు ఆగ్రహంగా వుండి, బాంకీపూర్ విజయానికి సహకరించ లేదట.
కులం గోల ఎలా వున్నా, అతని పరిపాలన బాగా లేదట. తన గెలుపు తర్వాత ప్రశాంత్ అతనికే గురి పెట్టి మాట్లాడాడు. ‘‘ముఖ్యమంత్రిని మార్చవలసిన అవసరం వుందని యీ ఎన్నిక సందేశమిస్తోంది. బిజెపి వాళ్లు కుశవహా కులస్తుణ్నే పెట్టుకోమనండి. కానీ కాస్త చదువూ, సంధ్య వున్నవాణ్ని, మంచివాణ్ని ఎంచుకోండి. బిహార్ను బాగుపడనీయండి. 26 మంది ఎంపీలను లోకసభకు పంపిస్తున్న గుజరాత్కి లక్ష కోట్ల బుల్లెట్ ట్రెయిన్ యిచ్చుకుంటున్నారు సరే, 40 ఎంపీల బిహార్కు కనీసం పాసింజరు రైలయినా యివ్వండి. ఇక్కడి యువతకు నాణ్యమైన విద్య గరపి, ఉపాధి కోసం యితర రాష్ట్రాలకు వలస వెళ్లే కర్మ తప్పించగల ముఖ్యమంత్రిని నియమించండి.’’ అని బిజెపి అధినాయకత్వానికి సలహా యిచ్చాడు.
సామాజిక కార్యకర్త భరత్ తివారీ ఉదంతం
నీట్ పరీక్షల లీక్కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లోనే కాదు, బిహార్ ప్రభుత్వం నిరసనకారుల పట్ల ఎంత క్రూరంగా వ్యవహరిస్తుందో బిలౌటీ గ్రామంలో భరత్ తివారీ ఉదంతం చాటి చెప్పింది. కితం ఏడాది వరదలు వచ్చినప్పుడు జవానియా గ్రామంలో యిళ్లు పోయిన 70 కుటుంబాలవారికి పునరావాసం కల్పిస్తున్నామంటూ ప్రభుత్వం బిలౌటీ అనే గ్రామం దగ్గర్లో గుడారాలకు తరలించింది. కానీ అక్కడ వసతులేమీ కల్పించలేదు.
భరత్ భూషణ్ తివారీ అనే 28 ఏళ్ల సామాజిక కార్యకర్త ఫేస్బుక్ ద్వారా తమ గ్రామం అవస్థలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి, నెలల తరబడి ఆందోళన చేస్తున్నాడు. కానీ ప్రభుత్వం చలించలేదు. ఇతను ఆందోళన ఉధృతం చేసి ఫేస్బుక్లో వీడియోలు పోస్ట్ చేయడంతో జూన్ 16న స్పెషల్ టాస్క్ ఫోర్స్ తరఫున కొందరు అతని యింటికి వచ్చి అదుపులోకి తీసుకోబోయారు. అతను తుపాకీ బయటకు లాగి, నన్ను అరెస్టు చేస్తే కాలుస్తానన్నాడు. పోలీసులకు జంకి, యితనికి మతిస్థిమితం లేనట్లుంది, అతని దగ్గర్నుంచి తుపాకీ స్వాధీనం చేసుకోండి అని కుటుంబ సభ్యులకు చెప్పి, మర్నాడు మళ్లీ చర్చలకు వస్తామన్నారు. మర్నాడు ఉదయం 6 గంటలకు తివారీ పిస్టల్తో తన గుమ్మంలో నిలబడి తనను పట్టుకోవడానికి వచ్చి దూరంగా నిలబడిన పోలీసుల వైపు గాలిలో కాల్చిన వీడియోను అప్లోడ్ చేశాడు.
9 గంటల ప్రాంతంలో వచ్చి పోలీసులు దగ్గరకు వచ్చి అధికారులు మరమ్మత్తు పనులు చేపడతారట. నువ్వు స్వయంగా వచ్చి ఎక్కడక్కడ గోతులు పూడ్చాలో చెప్పు అంటూ పిలుచుకుని వెళ్లారు. అతని వెంట పోలీసులు కార్లలో వెళ్లారు. గ్రామస్తులు వారిని వెంబడించారు. పోలీసులు లాఠీచార్జి చేసి గ్రామస్తులను దూరంగా తరిమివేశారు. 10 గంటలకు తివారీ మరో వీడియో పోస్టు చేశాడు. బుల్లెట్ప్రూఫ్ జాకెట్ ధరించిన పోలీసులు అతని దగ్గరకు వచ్చారు. ‘నేనేమీ టెర్రరిస్టును కాను. నా డిమాండ్లు నెరవేరితే అంతే చాలు’ అంటూ అతను తుపాకీ కింద పడేశాడు. వెంటనే పోలీసులు అతనిపై తుపాకీ గుళ్లు కురిపించారు. మూడు గుళ్లు అతని శరీరంలోకి దూసుకుపోయాయి. ఆ రోజు సాయంత్రం ఆసుపత్రిలో మరణించాడు. ‘అతను మమ్మల్ని కాల్చబోయాడు. ఆత్మరక్షణకై మేం కాల్చాం.’ అన్నారు పోలీసులు. కానీ ఎవరూ నమ్మలేదు. జనం నిరసనలు చేయడంతో ప్రభుత్వం అనేక మంది పోలీసు వారిని సస్పెండ్ చేసింది, కేసులు పెట్టింది. జుడిషియల్ ఎంక్వయిరీకి ఆదేశించింది. సుప్రీం కోర్టులో పిల్ పడింది.
ఈ సంఘటన యువతను చాలా కలవరపరిచింది. ఎన్నికల వాగ్దానాలు నెరవేర్చమని అడిగినందుకు ఉసురు తీస్తారా? అని అడగసాగారు. దీని ప్రభావం కూడా ఉపయెన్నికపై పడిందనుకోవచ్చు. ఇప్పటిదాకా బిజెపి-జెడియుకి పాజిటివ్ ఓటు కంటె ఆర్జెడిని, లాలూ కుటుంబాన్ని నిలవరించడానికి ఓట్లు వేసే వారే ఎక్కువ అని ప్రశాంత్ అంటూ వచ్చాడు. ఇప్పుడు ప్రశాంత్ గెలుపుతో అలాటి ఓటర్లకు ఒక ప్రత్యామ్నాయం దొరికినట్లయింది. కాక్రోచ్ జనతా పార్టీ ఒక కెరటంలా వచ్చింది కానీ, దాని నాయకులు ఎంతకాలం కలిసి వుంటారో తెలియదు. ప్రశాంత్కైతే ఒక ట్రాక్ రికార్డు వుంది. అతను తన వాయిస్ను గట్టిగా వినిపించి, తన చర్యల ద్వారా యువతను ఆకట్టుకోగలిగితే, కులాల సమీకరణాలకు అతీతంగా యువత అతని వెంట నడవవచ్చు. ఆ విధంగా అతను బిజెపికే కాదు, ఆర్జెడికి కూడా ముప్పుగా మారతాడు. నీతీశ్ నిష్క్రమణ కారణంగా అనాథలైన జెడియు ఓటర్లు యితనికి మద్దతిస్తే, యితను యింకా బలపడతాడు. బిజెపి ముఖ్యమంత్రిని మార్చి, దిద్దుబాటు చర్యలు చేపడితే, అతను పుంజుకోవడం ఓ మేరకే జరుగుతుంది. ఏం జరగబోయేది రాబోయే రోజులు చెప్తాయి.
(ఫోటో – ప్రశాంత్ కిశోర్, పైన నితిన్ నబీన్, సామ్రాట్ చౌదరి, కింద పోలీసుల చేతిలో హతుడైన సామాజిక కార్యకర్త భరత్ తివారీ, విద్యార్థి నిరసనకారులపై ఎకె 47తో కాల్చిన పోలీసు)
– *ఎమ్బీయస్ ప్రసాద్*