గణపతి తత్వము - 1
మనము ఏ కార్యాన్ని ప్రారంభించినా మొదట విఘ్నేశ్వరుని యొక్క స్తుతితో అధవా విఘ్నేశ్వరుని యొక్క పూజతో ప్రారంభం చేస్తాం.ఆయన పేరు విఘ్నరాజు. విఘ్నరాజు, వినాయకుడు అని నామములు. విఘ్నరాజు ఏమి చేస్తాడో వినాయకుడు అది చేయడు.వినాయకుడు ఏమి చేస్తాడో విఘ్న రాజు అది చేయడు. పేర్లు అయితే రెండూ ఒకరికే అన్వయం.అవి అలా అన్వయమవటానికి కారణమేమి అంటే ఈశ్వరతత్వమందు నామములు ఏమైనా గౌణములు. ఆయా గుణములను ఆధారం చేసికొని ఆ నామముతో పిలుస్తారు.అందుచేత ఏ గుణం ప్రకాశిస్తోంది అని మీరు అర్ధం చేసికొన్నారో,అర్ధం చేసికొన్న విషయాన్ని ఆలంబనంగా స్వీకరించి ఉపాసనా క్రమాన్ని దిద్దుకొనే ప్రయత్నం చేస్తారు సాధకులు.అందుకొరకు నామములు వచ్చాయి తప్ప అన్ని నామములు ఉంటే ఈశ్వరునికి ప్రఖ్యాతి అనో,అన్ని నామములుతో ఆయన సరదాగా పిలిపించుకుంటాడనో మనం అనుకోకూడదు. నామములు గౌణములు.వినాయకుని విషయములో కూడా ఆయనని వినాయకుడు అనీ పిలుస్తాము, విఘ్నరాజు అనీ పిలుస్తాము. ఎందుకు అలా పిలవవలసి వచ్చింది అంటే ఆయనని ఆరాధించక పోతే విఘ్నములు కలుగుతాయి అనీ. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండీ! ఆయనని ప్రార్ధించక పోతే విఘ్నాన్ని కల్పించగలిగిన శక్తిని పొంది వున్నాడనుకోండీ ! ఆ శక్తికి ఒక నమస్కారం. కానీ ఆ తత్వములో ఒక పైశాచికత్వము ఉన్నదా ! లేదా!నాకు పూజ చెయ్యాలి,నాకు నమస్కారం చెయ్యాలి,అది చెయ్యక పోతే నీ కార్యము భగ్నము అయ్యే ప్రతిబంధకాన్ని సృష్టిస్తాను.ఇప్పుడు ఎందుకు నమస్కరించాలి అంటే కేవలం భయంతోనే.ఏదో కోరిక వుండి ఆ కోరిక చెడిపోతుందేమో, ఎందుకు గొడవ ఓ నమస్కారం చేసేద్దాము అను అనుకునేటటువంటి వాడు, కామ్యముతో ఒక కార్యమునకు బయలుదేరిన వాడు.ఒక పిల్లవాడు వున్నాడు వాడికి ఏమి కామ్యము వుంటుంది? వాడికి ఏమి కామ్యము వుండదు.వాడు చదువుకుంటున్నాడు కదండీ అని మీరు అనచ్చు.ఏదో ఒకటో తరగతి చదువుకుంటున్న పిల్లవాడికి తల్లిదండ్రులు చదువుకోమంటున్నారని చదువుకోవటమే తప్ప అప్పటికి వాడికి అంత పరిణితి కూడా వుండదు. ఏదో నేను బాగా చదివేసుకోవాలి,చదువు వలన అంత వున్నతికి వెళిపోతాను అన్న భావన 90 శాతం మందిలో వుండదు.మరి అప్పుడు ఆబాలగోపాలమునూ ఆయన రక్షించవలసిన అవసరము ఎందుకు వస్తుంది? నాల్గొవ ఆశ్రమము వాళ్ళు వుంటారు. సన్యాస ఆశ్రమము . ఆ సన్యాస ఆశ్రమములో ఏవిధమైన కోరికా వుండే అవకాశమే లేదు. మరి అటువంటప్పుడు ఆయనెందుకు విఘ్నేశ్వరుని ఆరాధన చేస్తున్నదెందుకు అని. దీనిని జాగ్రత్తగా మీరు గమనిస్తే దీనికి ఏదో బలమైన కారణము వున్నది అని అర్ధమవుతుంది. ఆ బలమైన కారణమేది అని విచారణ చేస్తే, ఆయనకి వినాయకుడు,విఘ్నరాజు అన్న పేర్లు ఎందుకొచ్చాయో అర్ధమవుతుంది. అసలు ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్ధి నాడు వినాయక వ్రతం మనమెందుకు చెయ్యాలి అన్న విషయము మనకు అవగతమవుతుంది.అది తెలియకుండా చేస్తే ప్రయోజనం రాదు అని నేను అనను కానీ తెలిసి చెయ్యడం వలన ప్రయోజనం చాలా అధికముగా కలుగుతుంది.లేనినాడు అది యాత్రికముగా చేసినటువంటి క్రతువు కనుక దాని వలన కలుగు ఫలం చాలా తక్కువ స్థాయిలో వుంటుంది. విఘ్నము అన్నమాటకి అర్ధమేమి చెపుతామంటే ఒక కార్యమును పూర్తిగా పాడుచేయగలిగినటువంటి ప్రతిబంధకమైవచ్చి నిలబడిన స్థితికి విఘ్నము అని పేరు.నేను ఏదో కార్యము చేద్దామని బయలుదేరాననుకోండి,నేను ఆ కార్యమును ఇక చేయను,ఇక నేను ఆ పనిని చెయ్యలేను.ఎందుకు చెయ్యలేను అంటే వచ్చిన ప్రతిబంధకమటువంటిది.అది, ఆ కార్యక్రమం జరపడంలో నేను దానిని అతిక్రమించి చెయ్యగలిగినటువంటి స్థితి నాకు లేదు.నేను దాటలేను కాబట్టి ఇక నేను ఆ కార్యక్రమాన్ని చెయ్యలేను అని, సంకల్పం చేసిన కార్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను.ఆ కార్యము నశించినది.అంటే ఏది సంకల్పించానో అది నెరవేరలేదు.దీనినే విఘ్నము అని పిలుస్తారు శాస్త్రములో.అసలు ఈ విఘ్నము అనేదానిని ఎందుకు కలిపిస్తాడు ఈశ్వరుడు!విఘ్నము అందరికీ ఒకటే విఘ్నము కాదు. ఒకరికి విఘ్నము మోదమునకు కారణమవుతుంది ఒకరికి విఘ్నము ఖేదమునకు కారణమవుతుంది.ఒక ఉదాహరణ చెప్పాలంటే సంక్రాంతి పండగకి కూతురు,అల్లుడు,మనవలు,మనవరాళ్ళు వచ్చారట.తాతగారికి అయ్యో!రైలు బయలుదేరిపోతుందే,మనవలు వెళ్ళిపోతారే అని బాధగా వుంది. రైలు ఆగిపోయింది.వెళ్ళవలసిన ప్రధానమైన భాగమేదుందో దానికి ఏదో మరమత్తు కలిగింది.ఓ గంట దాకా వెళ్ళదండీ అన్నారు.ఆయనకి చాలా సంతోషం. తాతగారికి చాలా సంతోషం.ఇంకో గంట సేపు మనవడితో గడపవచ్చు.అల్లుడు గారికి బాధ కలిగింది.రైలు ఆలస్యముగా వెళుతుంది.నేను కార్యాలయానికి వెళ్ళలేను.ఇప్పుడు ఎవరికి అది విఘ్నము అని చెప్పవలసి వుంటుంది.అందరికీ విఘ్నమెందుకు అయినది.ఒకరికి మోదమునకు కారణమయినది,ఒకరికి ఖేదమునకు కారణమయినది.ఇప్పుడు రైలు ఆగటం ఓ గంట సేపు విఘ్నము అని విచారించటము కుదరదు.ఇప్పుడు విఘ్నము అన్న మాట అన్వయములోకి వచ్చేటప్పటికి ఎలా వస్తుందంటే వ్యక్తి స్తాయిలోకి వస్తుంది.సమిస్టి స్థాయిలో చాలా తక్కువ అన్వయమవుతుంది.ఎక్కువ అన్వయమయేది వ్యక్తిగత స్థాయిలోనే.ఇప్పుడు విఘ్నము కలగటమనేది భగవంతుని యొక్క శాసనముగా వచ్చిందనుకోండి! ఇక మీరు దానిని తొలగించుకోవటము అన్న సమస్య రానే రాదు.అది ఈశ్వర నిర్ణయం. అది తొలగదిక.ఒకసారి ఈశ్వర శాసనమయిపోయి ఒక విఘ్నము వచ్చిందంటే ఇక ఆ విఘ్నము తొలగుతుంది అని మీరు ఊహ చేయలేరు.ఈశ్వర శాసనముగా విఘ్నాలు వస్తాయి అని నేను అన్నాననుకోండీ! ఇక తొలగించుకొనే మార్గం మూతబడిపోయింది అని చెప్పాలి ఎవరో మహాభక్తులకి తప్ప.కాబట్టి విఘ్నము అన్న మాటకి ఉత్పత్తి మార్గము ఎక్కడ వున్నది అన్నది విచారణ చెయ్యాలి. అసలు విఘ్నము పుట్టటానికి కారణము ఎక్కడ వుంటుంది అంటే మనస్సులోనే. ఎందుకు ఎప్పుడూ మనస్సు రెండిటినీచూస్తూవుంటుంది.అదిస్తుతి,నింద,చల్లదనం,వెచ్చదనం,కీర్తి,అపకీర్తి,సుఖం,దుఃఖం,ఎత్తు,పల్లం,ఎప్పుడూ ద్వందాలు చూస్తుంది.అది దానికి అలవాటు.అది అలవాటు కాబట్టి దాని కదలికలయందు రెండిటిని పట్టుకుంటుంది.అందుకే "ప్రవేశే నిర్గమే తధా సంగ్రామే సర్వ కార్యేషు విఘ్న స్తస్య న జాయితే". ప్రవేశే నిర్గమే తధా అంటే -ప్రవేశే అంటే లోపలికి రావటము,నిర్గమే అంటే బయటికి వెళ్లటము, సంకల్ప వికల్పములు,ఆలోచన పుట్టటము,ఆలోచన వదిలివేయటము,అది మనస్సు యొక్క పని.ఎప్పుడూ సంకల్ప,వికల్పములను చేసేది ఏది అంటే మనస్సు.మనస్సు ఎప్పుడూ రెండిటిని దృష్టిలో పెట్టుకుంటుంది. ఒకటి మోదము,రెండు ఖేదము. ఈ పని జరుగుతుంది నాకు చాలా సంతోషము.అమ్మయ్య.ఇది ఇలా వుంటే బావుంటుంది అంటుంది.ఇది ఇలా వుంది దాని వలన నాకు చాలా ఇబ్బందిగా వుంది అంటుంది మనస్సు తప్ప ఏది ఎలా వుంటే నాకెందుకు అనదు మనస్సు.అలా అన్నాడనుకోండి ద్వంద్వాతీతుడయిపోయాడని గుర్తు.మోదమునకో,ఖేదమునకో వశుడవుతాడు.మోదమునకు వశమయినపుడూ మీ కార్యము నశిస్తూ వుంటుంది,ఖేదమునకు వశమయినపుడూ కార్యము నశించిపోతుంది.సంకల్ప, వికల్పములు, మనస్సు యొక్క ప్రబోధములు,మనస్సు ఒకటి చూసినపుడు అబ్బో! ఎంత బాగుందో ఇక్కడ కాసేపు వుందాము అంటుంది.ఇంకో చోటికి వెళ్ళినప్పుడు అబ్బ! విసుగు వచ్చేస్తోంది,ఎంత తొందరగా వెళ్ళిపోదామా ఇక్కడ నుంచి అని అనిపిస్తుంది. ఒకసారి దానికి మోదం, ఒకసారి దానికి ఖేదం.మోదం కానీ,ఖేదం కానీ రెండూ కూడా మీరు తలపెట్టిన కార్యమునకు ప్రతిబంధకములని మీరు గ్రహించాలి. ఈ రెండిటినీ దాటగలిగిన శక్తికి మీ బుద్ధి ప్రభావితమైతే మీరు విఘ్నమును దాటగలిగిన శక్తిని పొందారని గుర్తు.మనస్సు యొక్క ప్రబోధాన్ని ఎదిరించగలిగిన శక్తి ఎవరికి వుంటుంది?ఒక్క బుద్ధికే వుంటుంది. అంతర్గతంగా బుద్ధి నిర్ణయం చేస్తుంది.మనస్సుకి నిర్ణయం చేసే శక్తి లేదు.మనస్సు ఏమో సంకల్ప,వికల్పములను అలా పెడుతూ వుంటుంది బుద్ధి దగ్గరకు పట్టుకువెళ్ళి .బుద్ధి సక్రమమైన నిర్ణయం చేయగలిగితే మీరు మంచి పని చేయగలుగుతారు.
బుద్ధి సక్రమమైన పని చేయక మనస్సు చెప్పిన ప్రబోధానికి లొంగిపోయారనుకోండి అది ఎప్పుడూ మోదము,ఖేదమునూ చెప్పుతుందే తప్ప మూడవది చెప్పదు. ఇప్పుడు మీరు వశుడైపోయి ప్రతిబంధకం నందు నిలబడిపోయారు.మీరు దీనిని దాటగలగాలి అంటే ఒకే ఒక ప్రయత్నం చేత దాటగలరు. అదే మోదము, ఖేదము అన్న మనస్సు యొక్క రెండు పార్శ్వములు నుండి విఘ్నమును దాటగలగటం. ఈ దాటగలగటం అన్న శక్తిని ఎవరు ఇస్తారు మనకి? అంటే విఘ్నరాజు. మీ మనస్సు అటువంటి స్థితి నుండి దాటి బుద్ధి నిశ్చయం చేయగలిగినటు వంటి స్థితికి వెళ్ళిపోతే ,ఇప్పుడు బుద్ధి అంగీకరించదు కనుక , బుద్ధి అంగీకరించని ఏ మాటనీ కూడా ఇక మనస్సు ప్రతిపాదించని స్థితిని దాటి పోతే అదే సాత్వికమైన మనస్సు. అటువంటి స్థితిని పొందిన మనస్సు ని చూసి త్యాగరాజ స్వామి పొంగిపోయి ఓహో! మనసా ! ఎంత మంచిదానవే అని కీర్తన చేశాడు. ఆ మనస్సే బుద్ధికి తప్పు ఆలోచన చెపుతూ వుంటే దుష్టమైన మనసా! ఎంత పాడు చేస్తున్నావే అని అన్నాడు. అయితే కేవలంగా ఒక మనిషి బంధనమునకు కానీ, మోక్షమునకు కానీ కారణం ఎవరు అవుతున్నారు అంటే బుద్ధి అని అనరు.మనస్సే అంటారు.కారణం దాని సంకల్పములను బట్టి బుద్ధి నిర్ణయం చేస్తుంటుంది. ఈ బుద్ధి బలపడాలి.ఈ బుద్ధి బాగా శక్తివంతమైతే ,ఈ రెండు స్థితులను దాటి, సంకల్పిత కార్యం మీద కూర్చోగలుగుతుంది.
#🕉️ గణపతి బప్పా మోరియా #🙏వినాయక చవితి త్వరలో🎉 #దేవుళ్ళ స్టేటస్ #🙏🏻భక్తి సమాచారం😲 #🌹ఓం గం గణపతయే నమః 🙏🙏