#రాజకీయాలు #ఏపీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ 🎯
*ఉప ప్రధానిగా బాబు⁉️*
MARCH 10, 2026🎯
మార్చి 3న యీ సబ్జక్టుపై జర్నలిస్టు వైయన్నార్ చేసిన వీడియో చూసినప్పుడు నవ్వుకున్నాను - వాట్ ఏన్ ఔటేరేజియస్ థాట్ అంటూ! సమయానికి సబ్జక్టేదీ దొరక్క యిది మొదలెట్టి వుంటారు అనుకున్నాను. తర్వాత చూస్తే ఎవిరీ వ్యాఖ్యాత వర్త్ హిజ్ సాల్ట్ (తెలుగులో ఉప్పూ, పత్రీ వున్న.. అనవచ్చా?) దాని గురించే మాట్లాడసాగారు. వాళ్లకీ కంటెంట్ లేమి సమస్యే కదా అనుకుని వూరుకున్నాను. నీతీశ్ రాజ్యసభకు వెళుతున్నాడని తెలిశాక చివరకు ఎబిఎన్ కూడా డిస్కషన్ పెట్టడంతో ఉలిక్కిపడ్డాను. 'ముఖ్యమంత్రి పదవికి లోకేశ్ అర్హుడు, పార్టీలో కొందరు సీనియర్లు మొహం ముడుచుకుంటే
ముడుచుకోనివ్వండి, క్యాడర్ అంతా అతన్నే కోరుకుంటోంది, జాతీయ స్థాయిలో బాబు దేశానికి దిగ్దర్శనం చేయగలరు' వంటి కామెంట్స్తో ఎబిఎన్ ప్రోగ్రాం నడిచింది. ఈ కాంపెయిన్ దేనికి? అని ఆలోచిస్తే ఒక ఆలోచన తట్టింది. దాన్ని మీతో పంచుకోవడానికే యీ వ్యాసం. క్రికెట్లో లాగ రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు కాబట్టి నా థాట్ ప్రాసెస్ మాట ఎలా వున్నా బాబును ఉప ప్రధాని చేస్తే చేయవచ్చు కానీ యీ లోపుగా మనం తర్కించుకుంటే తప్పేమీ లేదు.
వైయన్నార్ చెప్పినప్పుడు ఉపప్రధాని కావడానికి బాబు స్వామీజీల నుంచి బడా వ్యాపారవేత్తల దాకా అందరి ద్వారా మోదీకి రికమెండ్ చేయిస్తున్నారని చెప్పారు. ఇదంతా నాకు వింతగా తోచింది. మోదీ ఎవరి సిఫార్సూ పట్టించుకోని రకమని తోస్తుంది. ఆయనకో ప్రణాళిక వుంటుంది. దాన్ని చాలా ఓపిగ్గా, క్షుణ్ణంగా అమిత్ షా ద్వారా అమలు చేయిస్తాడు. పార్టీలో సీనియర్లందరినీ మార్గదర్శక మండలి పేరుతో మూల కూర్చోబెట్టాడు. ఒకప్పటి గురువు, సంరక్షకుడు ఆడ్వాణీకి కూడా అదే గతి. పార్టీలో ఎవరో ఒకరు తప్పకుండా చెప్పి వుంటారు - ఆయనకో మంచి పోస్టు యివ్వండి అని. ఈయన విన్నాడా? ఇక స్వామీజీలు చెప్తే మోదీ వింటాడా? గుజరాత్ ముఖ్యమంత్రిగా వుండగా ఆరెస్సెస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్లను దగ్గరకు రానిచ్చేవాడా? రోడ్ల విస్తరణకు అడ్డు వస్తే గుళ్లు కొట్టేసేవాడు. వీళ్లందరూ వచ్చి గోల చేస్తే పట్టించుకునే వాడు కాదు. వాళ్లకు యీయన మీద మంటగా వుండేది.
2014 ఎన్నికలలో జాతీయ స్థాయిలో ప్రధాని పోస్టుకి వెళదామని అనుకున్నప్పుడే మోదీ వాళ్లతో రాజీ పడ్డాడు. వాళ్లు కూడా యింతకంటే మంచి ప్రత్యామ్నాయం లేదు అనుకుని చేతులు కలిపారు. వాజపేయి హయాంలో నాగపూరు ఆరెస్సెస్ హెడ్క్వార్టర్స్ నుంచి ఆదేశాలు వెళ్లేవనేవారు. ఇప్పుడు అవేమీ లేవు. అప్పటి జనసంఘ కాదు, అప్పటి బిజెపీ కాదు, నేటి బిజెపి మోదీ-అమిత్ల బిజెపి. పేరుకే బిజెపి, లోపలంతా కాంగ్రెస్సే, ఉన్నవాళ్లంతా కాంగ్రెసు వాళ్లే అంటే అనవచ్చు. అధినాయకత్వం మాత్రం వీరిద్దరిదే. స్వామీజీలు కాదు, పీఠాధిపతులు కాదు, నాగపూరు వారు కాదు, ఎవరికైనా పైపై మర్యాదలే తప్ప, వారు చెప్పినట్లు మోదీ వినే ప్రశ్నే లేదు. అతని కాలిక్యులేషన్స్ అతనివి.
ఇక వ్యాపారవేత్తలు చెపితే వింటాడా? ఎవరు వారు? అదానీ, అంబానీలా? చెప్పేటంత దమ్ముందా వాళ్లకు? అంబానీలకైతే ఒరిజినల్ స్ట్రెంగ్త్ వుంది కానీ, అదానీ బలమంతా మోదీ పుణ్యమేగా! తమకేదైనా కావలసి వస్తే వాళ్లు అడిగి తీసుకోవచ్చు, ప్రతిగా ఏదైనా చేసిపెట్టవచ్చు తప్ప రాజకీయంగా యిలా చేయండి, ఫలానా నాయకుణ్ని మీ డిప్యూటీగా వేసుకోండి అని చెప్పేటంత ధైర్యం వుంటుందా? అసలు తక్కిన మంత్రుల కార్యాలయాలన్నిటిని పిఎంఓయే శాసిస్తోందని, మంత్రులు తమ కిష్టమైన వారిని సెక్రటరీలుగా వేసుకోవడానికి కూడా అవకాశం లేదని చెప్తూ వుంటారు. ఈ పరిస్థితుల్లో ఎవరి తరఫునా రాయబారాలు చేసే సీను యీ వ్యాపారవేత్తలకు ఉంటుందని అనుకోలేము.
ఇక బాబు సీనియర్ పొలిటీషియన్ కాబట్టి.. అనే వాదనకు అర్థమే లేదు. తన పార్టీలో సీనియర్లయిన రాజనాథ్, నితిన్ వగైరాలకే దిక్కూదివాణం లేదు. వారందరూ మోదీ ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటున్నారు. బాబు సీనియారిటీ తన పార్టీలోనే కదా! అది ఒక ప్రాంతీయ పార్టీ.
పార్లమెంటులో దాని సీట్ల సంఖ్య మారుతూ వస్తోంది. వందల సంఖ్యలో సీట్లున్న జాతీయ పార్టీలో సీనియారిటీతో దీన్ని పోల్చలేము. రాష్ట్రస్థాయి నాయకులలో కూడా 80 పార్లమెంటు సీట్లున్న యుపి వంటి రాష్ట్రాధిపతికి వున్న వేల్యూ 25 సీట్లున్న రాష్ట్రాధిపతికి వుంటుందా? ఈయనకున్న పాలనానుభవాన్ని ఉపయోగించు కోవడానికి.. అనుకుందామంటే, ఏ అనుభవం మందవి విరులా సీతారామను ఆర్థిక శాఖ వంటి కీలకమైన
పదవి నిచ్చారు? పైనుంచి అన్నీ చూసుకోవడానికి మేమున్నాంగా అనే ధీమా మోదీది.
దక్షిణాదిన బిజెపి బలపడాలంటే ఎవరో ఒక సౌత్ ఇండియన్ వెటరన్ను తీసుకోవాలి కాబట్టి.. అని కొందరన్నారు. బిజెపి ముఖ్య బలమంతా ఉత్తరం, పశ్చిమంలో వుంది. తూర్పున వ్యాపిస్తోంది. బిహార్, ఒడిశాలను గెలిచింది. దక్షిణాదిన బలం పుంజుకోలేక పోతోంది. 2029 నాటికి మూడు టెర్మ్లు వరసగా పాలించడం చేత ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం పడి సీట్లు 2024 కంటె తగ్గుతాయనుకుంటే నార్త్, వెస్ట్లను కన్సాలిడేట్ చేసుకోవాలి. వెస్ట్ నుంచి మోదీ, అమిత్లు ఎలాగూ వున్నారు. నార్త్ నుంచి యోగి లాటి వాణ్ని తీసుకుని వస్తే, అక్కడ సీట్లు పెరుగుతాయి. ఎంబిసిలకు హితుడు, స్వయంగా బిసి ఐన నీతీశ్ను తెస్తే తూర్పు, ఉత్తర ప్రాంతాలలో సీట్లు పెరగవచ్చు.
అబ్బే, దక్షిణాది నుంచి తేవాలి అనుకుంటే యెడియూరప్పను తెస్తే కర్ణాటకలో మళ్లీ అధికారం రావచ్చు. కానీ ఆ ప్రభావం పక్క రాష్ట్రాలపై పడదు. తమిళనాడు, కేరళలలో పార్లమెంటు సీట్లు సింగిల్ డిజిట్ దాటే పరిస్థితి లేదు. తెలంగాణ నాయకుణ్ని తీసుకుంటే ఆ రాష్ట్రంలో కొంత మేలుండవచ్చేమో కానీ అక్కడున్న సీట్లు 17 మాత్రమే! ఇక ఆంధ్ర నుంచి తీసుకుంటే ఏ లాభమూ కలగదు. అక్కడ యిప్పట్లో బిజెపి బలపడే అవకాశమే కనబడటం లేదు. అది ప్రతిపక్షమా అంటే ప్రతిపక్షమూ కాదు, పోనీ అధికార పక్షమా అంటే అదీ కాదు.
టిడిపి చేసే ఏ పనికీ అది క్రెడిటూ తీసుకోదు, డిస్క్రెడిటూ తీసుకోదు. కెటలిస్టు చూడండి, రసాయనిక చర్యను వేగవంతం చేస్తుంది కానీ అది స్వయంగా ఏ మార్పుకీ గురవదు. కూటమి అధికారంలోకి రావడానికి బిజెపి, ఇసి ద్వారా సహకరించింది కానీ యిప్పటికీ దాని బలంలో ఎదుగుదల, తరుగుదల ఏమీ లేదు. గొంగళీ అక్కడే వుంది. మంచీచెడూ ఏం జరిగినా టిడిపి పేరే జరుగుతోంది.
బాబుని ఉపప్రధానిగా చేస్తే దాన్ని బాబు ఘనతగానే తెలుగు మీడియా ప్రచారం చేస్తుంది, ఆంధ్ర జనాలూ అదే నమ్ముతారు కానీ బిజెపి దక్షిణాది వారిని ఫేవర్ చేసిందనే కోణం ఎక్కడా ప్రొజెక్ట్ కాదు. పైగా బాబుది అగ్రకులం. తక్కిన రాష్ట్రాల్లో పెద్దగా ప్రభావం చూపని కులం. ఇక బిజెపి బావుకునేదేముంది? ఇక వ్యక్తిగతంగా తీసుకుంటే బాబును అంత కీలకమైన పదవిలోకి మోదీ తీసుకుంటారా అనేది ప్రధానమైన ప్రశ్న. తక్కిన ఆంధ్రనాయకుల సంగతి వేరు, బాబు సంగతి వేరు. ఆయనకు కుడిఎడమా లేదు. లెఫ్టాట్, రైట్ లెఫ్ట్, ఎబౌట్ టర్న్, రైట్లెఫ్ట్ యిలా ఆయన ప్రయాణం సాగింది. యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గానూ, ఎన్డీఏ కన్వీనర్ గానూ అప్పట్లో వున్న జాతీయ, ప్రాంతీయ నాయకులందరితోనూ ఆయనకు సంబంధబాంధవ్యా లున్నాయి. ఆ విషయంగా మోదీ కంటె ఎక్కువ ఎక్స్పోజరుంది.
ఈయన్ని దిల్లీ తీసుకుని వచ్చి పక్కన కూర్చోబెట్టుకుంటే..
యీయన ఎవరితోనైనా సరసాలాడి, తనకు ఎసరు పెట్టగలడు అనే భయం మోదీకి వుండదా? మోదీకి అస్సలు పడని వ్యక్తి రాహుల్ గాంధీ. కాంగ్రెసు వ్యతిరేకత అనే ప్రాతిపదికపై పుట్టిన పార్టీ ఐనా, తెలుగుదేశాన్ని 2018 ఎన్నికలలో తెలంగాణలో కాంగ్రెసుతో బాహాటంగా, 2023లో చాటుగా ముడి పెట్టిన వ్యక్తి చంద్రబాబు. ఇప్పుడు కూడా బాబు-రేవంత్-రాహుల్ బంధం నడుస్తోందని నమ్మవచ్చు. జగన్ అన్నాడని కాదు. ఆంధ్రలో 12శాతం ఓటింగు పెంచేసిన ఇసి అక్రమాలపై రాహుల్ ఎందుకు నోరు విప్పడు? గతంలో సరే, యిప్పుడు పరకాల ప్రభాకర్ రచ్చరచ్చ చేసిన తర్వాతైనా రాహుల్ అంది పుచ్చుకోవాలి కదా! ఆంధ్రకు వచ్చేసరికి రాహుల్ కిమ్మనడు.
మోదీ వద్ద ఉపప్రధాని అనగానే నాకు ‘నరేంద్రుడి వద్ద ఉపేంద్రుడా!?' అనిపించింది. నరేంద్ర మోదీ సాక్షాత్తూ ఇంద్రుడి వంటి వాడు. దేవాధిదేవుడు. ఆరుద్ర గారు 'ఇంటింటి పజ్యాలు'లో రాస్తారు - 'జపాన్లో దేవుడంత గొప్పవాడు హీరోహిటో, మా యింట్లో నా పరిస్థితి డిటోడిటో' అని. మోదీది కూడా ప్రస్తుతం అదే స్థాయి. మోదీని కాస్త విమర్శించినా మీదపడి కరిచేసే వాళ్లు కోట్లలో వున్నారు. ఆయన వద్ద ఉప పోస్టు అంటే ఉపేంద్రుడన్నమాట. ఉపేంద్రుడంటే విష్ణువు మరో పేరు. వామనావతారంలో ఇంద్రుడి తల్లి అదితికి పుట్టటం చేత ఇంద్రుడికి తమ్ముడయ్యాడు. శంకరుడంటే బోళావాడు. కానీ విష్ణువు
టక్కరి. సమయానికి తగు మాటలాడి, తగు వేషం కట్టగలడు. జగన్మోహిని అవతారం ఎత్తి రాక్షసులనూ, దేవుళ్లనూ కూడా ఆకట్టుకోగలడు. బాబు ఉపప్రధాని అయితే సాక్షాత్తూ ఉపేంద్రుడవుతాడన్న భయం మోదీ కుండదా? అలాటి భయం ఆయనకుంటుందని బాబు ఊహించలేరా?
ఈ కారణాల చేత ఇదంతా ఉత్తుత్తిదే అనుకుని వూరుకున్నాను. కానీ తర్వాత ప్రతి వారూ యీ సబ్జక్టుపై మాట్లాడసాగారు. లోకేశ్ను ముఖ్యమంత్రి చేయడం అనివార్యం కాబట్టి, ఆరోగ్యంగా, చురుగ్గా వున్న బాబు ఖాళీగా కూర్చోలేరు కాబట్టి జాతీయ రాజకీయాలకు వెళతారని అనసాగారు. ఎబిఎన్ ప్రోగ్రాంలో లోకేశ్కు పార్టీలో కొందరు సణుగుడు సీనియర్లు తప్ప అందరూ మద్దతిస్తున్నారని, ముఖ్యమంత్రి కావడం తథ్యమని చెప్పేశారు. ఇక బాబు మార్గదర్శకత్వం మోదీకి ఆవశ్యకమనే టోన్లో కూడా మాట్లాడారు. గతంలో వాజపేయి - ఆడ్వాణీ హయాంలో బాబు చక్రం తిప్పిన సంగతులన్నీ ఏకరువు పెట్టారు. కానీ ఆ ద్వయం హయాం వేరు, యీ ద్వయం హయాం వేరు. ఈ ద్వయానికి మొహమాటాలు లేవు.
మొన్న 2024 ఎన్నికలకు ముందు కూడా చూడండి. పొత్తు అవసరం తమకుండి కూడా సై అనడానికి ఎంతకాలం టిడిపిని వెయిట్ చేయబెట్టారో! అలాటిది బిజెపి సీనియర్లందరినీ పక్కన పెట్టి బాబుకి యింత పెద్ద పీట వేస్తారా? ఉప ప్రధాని పోస్టు అంటే ఆరో వేలు లాటి ఉప
ముఖ్యమంత్రి పోస్టు లాటిది కాదు. జనతా పార్టీ హయాంలో మొరార్జీ, చరణ్ యిద్దరూ చెరో వైపు లాగుతూ, ముఖాముఖీ సమావేశమయ్యేవారు కాదు. వాజపేయి, ఆడ్వాణీ దశాబ్దాలుగా మిత్రులు కాబట్టి గొడవలు రాలేదు. చివర్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లడం, 'ఇండియా షైనింగ్' నినాదాన్ని ఎత్తుకోవడం విషయంలో మనస్పర్ధలు వచ్చాయి కానీ బయట పడలేదు. బాబు- మోదీల మధ్య వైరుధ్యాల గురించి యిప్పుడు మళ్లీ రాయడం అనవసరం. ప్రస్తుతం మోదీ టిడిపి ఎంపీల మద్దతుపై ఆధారపడ్డారు కాబట్టి బాబు అడిగినది యివ్వక తప్పదు.. అనే వాదనకూ బలం లేదు. ఈడీ వంటి బ్రహ్మాస్త్రం తూణీరంలో వున్న మోదీ తలచుకుంటే 16 మందిలో 12 మంది యిటు వచ్చేసి పార్టీ చీల్చేయగలరు. 2019 జూన్లో 6గురు టిడిపి రాజ్యసభ ఎంపీల్లో నలుగురు బిజెపిలోకి దుమికేస్తే బాబు ఏం చేయగలిగారు?
బాబుపై చర్చ నడుస్తూండగానే నీతీశ్ స్థానచలనం న్యూస్
వచ్చింది. కిక్డ్ అప్లైయిర్స్ అంటారే అలాటిది జరిగి, ముఖ్యమంత్రి పదవి వూడగొట్టి రాజ్యసభకు పంపించారు. మీ అబ్బాయికి ఉప ముఖ్యమంత్రి పదవి యిస్తాంలే అన్నారట. నీతీశకు ఏ పదవి యిస్తారో క్లారిటీ లేదు. 'బాబుకీ అలాగే చేస్తారు. ఎటొచ్చీ లోకేశ్కు ముఖ్యమంత్రి పదవి యిస్తారు' అనసాగారు. నీతీశ్కు సొంత బలం తక్కువ. పైగా అనారోగ్యం. అతన్ని తప్పిస్తే బిజెపి మనిషి ముఖ్యమంత్రి అవుతాడు. ఆంధ్రలో పరిస్థితి అది కాదు. బాబును తప్పించినా
బిజెపికి ఏమీ దక్కదు. తప్పించి లాభమేమిటి? కేంద్రంలో మంత్రి పదవి అన్నా, ఏదైనా రాష్ట్రానికి గవర్నరు గిరీ అన్నా బాబు స్టేచర్కు అది తక్కువ. ఆయన స్థాయి దించినట్లే! ఇస్తే ఉపప్రధాని పదవి యివ్వాలి. నీతీశ్కి కూడా బాబు వంటి లెఫ్ట్ట్, ఇన్ ద పాండ్- ఆన్ ద బ్యాంక్, ట్రాక్ రికార్డే! ముఖ్యమంత్రిగా నీతీశ్ బాబు కంటె నాలుగేళ్లు ఎక్కువ వున్నాడు. అతనికి ఆ పోస్టు యివ్వకుండా బాబుకిస్తే ఆయనూరుకుంటాడా? లేక యిద్దరికీ యిస్తారా? ఇద్దరికీ యిస్తే బిజెపి ఆశావహులు వూరుకుంటారా? ఆంధ్రలో డిప్యూటీ సిఎంల లాగ అక్కడా ఐదారుగురు డిప్యూటీ పిఎంలను పెడతారా?
ఇన్ని ప్రశ్నలుండగా బాబు గురించిన యీ న్యూస్ ఎలా, ఎవరు చర్చకు వచ్చింది? నీతీశ్కి జరిగింది చూశాక నాకొక వైల్డ్ థాట్ వచ్చింది. బిహార్ నుంచి నీతీశ్ను తప్పించినట్లుగా ఆంధ్ర నుంచి బాబుని తప్పించాలని బిజెపి చూస్తోందేమో! బాబు వంటి మఱి చెట్టు నీడ ఆంధ్రలో బిజెపి ఎదగడం కల్ల. అందుకని ‘లోకేశ్ను సిఎంగా చూడడం మీ కల కాబట్టి, అది నెరవేర్చుకుని, మీరు దిల్లీ వచ్చేయండి.' అని బిజెపి చంద్రబాబుకి కబురంపిందేమో! 'నేను దిల్లీ రావడమంటూ జరిగితే, ఉపప్రధాని పదవి చేపట్టడానికే రావాలి కానీ అల్లాటప్పా మంత్రి పదవి తీసుకోవడానికి రావడం కుదరదు.’
అనే సందేశం బిజెపి కేంద్ర నాయకత్వానికి యివ్వడానికే బాబు యిలాటి న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారేమో!
లేకపోతే యిది అసలు చర్చించదగిన విషయమే కాదు. 2029 లోగా బాబు లోకేశ్ను సిఎం చేస్తారనేది అందరూ అనుకునే మాటే! దానికి పవన్ కళ్యాణ్ అడ్డు చెప్పరని కూడా సులభంగా గ్రహించవచ్చు. కాపు కులస్తుడు సిఎం కావాలని కాపు నాయకులు, పవనే సిఎం కావాలని అతని అభిమానులూ ఎంత గాఢంగా అనుకున్నా పవన్కి అంత పట్టింపు లేదు. స్క్రిప్టు ప్రకారం నడుచుకునే నటుడాయన. స్థానిక బిజెపి పన్నెత్తి పలికే పరిస్థితి లేదు. లోకేశ్ను గద్దెపై కూర్చోబెట్టి ఎక్కడికైనా వెళ్లిపోదామని బాబు అనుకోరు. పిల్లాణ్ని సైకిలు మీద కూర్చోబెట్టిన తండ్రి అలా వదిలేసి వెళ్లిపోడు. వాడికి సరిగ్గా బాలన్సింగ్ వచ్చేవరకూ కారేజి పట్టుకుని కాసుకుంటూ, దారిలో అవరోధాలను తప్పిస్తూ వుంటాడు. టిడిపి సైకిలు మీద లోకేశ్ను కూర్చోబెట్టాక, బాబు పార్టీ వ్యవహారాలు చూసుకుంటూ, లోకేశ్కు పాలనానుభవం కలిగేట్లా, సొంత యిమేజి ఏర్పరచుకునేట్లా పర్యవేక్షిస్తారు. ప్రధానిగా దిగాక కర్ణాటకలో దేవెగౌడ చేసినదదేగా !
ఇప్పుడు బిజెపి యీయన్ని ఢిల్లీకి మకాం మార్చమంటే, లోకేశ్ డైరక్టుగా జగన్తో పోటీ పడాల్సి వుంటుంది. పర్యవసానాలు ఎలా వుంటాయో ఎవరూ చెప్పలేరు కానీ, ప్రయాణమైతే సాఫీగా సాగదని అనవచ్చు. అందువలన బాబు దగ్గరే వుండి కాపు కాసుకోవాలనే చూస్తారు. అలా అయితే టిడిపి స్థానంలోకి తాము ఎప్పటికీ రాలేమని భయంతోనే బిజెపికి యీ ఆలోచన వచ్చి వుండవచ్చు. దాన్ని మొగ్గలో తుంచడానికి
బాబు యీ అస్త్రం సంధించి వుండవచ్చు. చివరకు ఏమౌతుందో తెలియదు. వెంకయ్యనాయుణ్ని ఉపరాష్ట్రపతిగా చేస్తారట అనే పుకారు వచ్చినప్పుడు, యాక్టివ్ రాజకీయాలు వదులుకోవడానికి యిష్టపడని వెంకయ్య 'నేను ఉషాపతినే తప్ప, ఉపరాష్ట్రపతిని కాను' అని స్టేటుమెంటు యిచ్చారు. మోదీ చిరునవ్వు నవ్వి, ఆయనకు రెండోదీ ప్రసాదించారు. వెంకయ్యకు గత్యంతరం లేకపోయింది. నరేంద్రజాలాన్ని తట్టుకోవడం ఆ నాయుడికైనా, యీ నాయుడికైనా కష్టమే!
(ఫోటో – మోదీ, బాబు, నీతీశ్)
*ఎమ్బీయస్ ప్రసాద్*


