P.Venkateswara Rao
510 views • 1 days ago
#ఏపీ స్థానిక ఎన్నికలు #ఏపీ అప్డేట్స్ 🎯 #ఏపి న్యూస్ ఏపీ పాలిటెక్స్🎯
*స్థానిక పోరుకు.. ఆ రెండే అడ్డంకులు❗*
04.09.2026🎯
ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబర్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయని కూటమి నేతలు అంటున్నారు. అయితే స్థానిక పోరుకు తాము కూడా సై అని వైసీపీ నేతలు చెబుతున్నారు. మరి ఎన్నికలకు ఇబ్బంది ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగకూడదని వైసీపీ కోరుకుంటోందని, తద్వారా రాష్ట్రానికి వచ్చే నిధుల్ని అడ్డుకోవాలని ఆ పార్టీ చూస్తోందని టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది
దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు ఎవరు అడ్డంకో అర్థంకాని అయోమయ స్థితిలో ఏపీ ప్రజలున్నారు. స్థానిక సంస్థల్లో డీలిమిటేషన్పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఆ విషయంలో దాఖలైన పిటిషన్లను న్యాయస్థానం రద్దు చేస్తూ, ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మరోసారి స్థానిక పోరు అంశం తెరపైకి వచ్చింది.
అయితే స్థానిక సంస్థలకు సకాలంలో ఎన్నికలు జరగాలంటే , మరికొన్ని కోర్టు అడ్డంకుల్ని అధిగమించాల్సిన అవసరం వుంది. పాత ఓటర్ల జాబితాతో ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించడాన్ని సవాల్ చేస్తూ వైసీపీ కోర్టును ఆశ్రయించింది. సర్ ప్రక్రియలో లక్షలాది బోగస్ ఓటర్లను గుర్తించి, తొలగింపు ప్రక్రియ చేపట్టారని, ఆ జాబితా కాదని, పాత వాటితో వెళ్లాలనే ఎస్ఈసీ నిర్ణయం సరైంది కాదని వైసీపీ వాదిస్తోంది. నిజమైన ప్రజాతీర్పు రావాలంటే, సర్ ప్రక్రియ ద్వారా వెలువడే ఓటర్ల జాబితాతోనే వెళ్లాలని హైకోర్టులో వైసీపీ బలంగా వాదిస్తోంది. ఈ పిటిషన్పై హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారించాల్సి వుంది.
అలాగే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన రెండు వేర్వేరు జీవోలను సవాల్ చేస్తూ ఒక న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదనే సుప్రీంకోర్టు ఆదేశాల్ని కోర్టు ముందు ఉంచి, ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో ఉల్లంఘిస్తున్నట్టు అవుతోందనేది సదరు పిటిషనర్ వాదన. ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా పోరాడుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఈ రెండింటికి సంబంధించి హైకోర్టులో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకుంది. బీసీల రిజర్వేషన్లకు సంబంధించి రాజకీయ పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం మభ్యపెడుతున్నాయనేది బహిరంగ రహస్యమే. నాడు వైసీపీ కూడా ఇలాంటి రాజకీయ వికృత క్రీడకు తెరలేపింది. నేడు బాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ కూడా అదే కొనసాగిస్తోందన్న విమర్శ వెల్లువెత్తుతోంది.
చంద్రబాబు సర్కార్ తీరు చూస్తుంటే, రిజర్వేషన్లపై సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించే అవకాశాలున్నాయి. ఎక్కడికెళ్లినా, ఏమీ కాదనే వాదన వినిపిస్తోంది. ఇదే సందర్భంలో ఓటర్ల జాబితాపై న్యాయస్థానాల నిర్ణయం ఎలా వుంటుందో అనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. సర్ ప్రక్రియ ద్వారా, నిఖార్సైన ఓటర్ల జాబితా వెలువడడానికి పెద్ద సమయం తీసుకోదు. అయినప్పటికీ, పాత జాబితాతోనే ఎన్నికలకు వెళ్లాలని కూటమి ప్రభుత్వం కోరుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీనికి ఎన్నికల సంఘం వంత పాడుతుండడం విచిత్రంగా వుంది.
అసలే మన దేశంలో ఎన్నికల వ్యవస్థపై తీవ్ర విమర్శలున్నాయి. పాలకుల అక్రమాలకు వత్తాసు పలికేలా ఎన్నికల అధికారులు వ్యవహరిస్తున్నారనే విమర్శ వుంది. దాన్నే నిజం చేసేలా జాతీయ స్థాయి మొదలుకుని, రాష్ట్ర స్థాయి వరకూ ఎన్నికల అధికారులు పని చేస్తున్నారు. కనీసం న్యాయస్థానాలైనా ఎన్నికల అధికారుల ఆగడాలను అడ్డుకట్ట వేస్తారనే చిన్న ఆశ.
10 shares