PSV APPARAO
#శ్రావణ మాసం ప్రత్యేకత #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #శ్రావణమాసంలో ముఖ్యమైన పండుగలు #సర్ప రక్షకురాలు మానస దేవి... నాగుల చవితి / నాగ పంచమి 🙏
*నాగులచవితి*
శివుని కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామివారిది సర్పరూపమే. వినాయకుడికి జందెం పాము. దుర్గాదేవి పరివారంలోకూడా సర్పజాతి ఉండటం విశేషం.
చీనాబ్, రావి నదుల మధ్య, అస్సాం దక్షిణప్రాంతంలోని నాగాయ్ కొండలలో, కాశ్మీరంలో ఎప్పటి నుంచో నాగజాతివారు నివసిస్తున్నారు. అమరావతి, నాగార్జునకొండ శిల్పాలలో నాగరాజులూ, నాగినులూ, నాగాలూ కనబడతాయి. కటిభాగంపైన మానవరూపం, క్రిందిభాగం సర్పరూపంగా ఉన్న శిల్పాలు దర్శనమిస్తాయి.
జ్యోతిషం ప్రకారం రాహుగ్రహం సర్పప్రతినిధి. రాహుదోషం కారణంగా సర్పదోషం కలిగి సంతానోత్పత్తికి అటంకం ఏర్పడుతుంది. అందుకే పిల్లలు లేనివారు, సంతాననష్టం కలిగినవారూ నాగప్రతిష్ఠ చేస్తారు. మనదేశంలో చాలాచోట్ల నాగప్రతిమలు కనిపిస్తాయి. శ్రీశైల ఆలయంలో ఉత్తరదిక్కున ఉన్న 'నాగులకట్ట' ఎంతో సుప్రసిద్ధమైనది.
సనాతనధర్మంలో నాగబంధమనేది భార్యాభర్తల సంబంధానికి ఒక ప్రతీక. భార్యాభర్తలు ఆధ్యాత్మిక మార్గంలో పయనించి జయం పొందడం దాని ధ్యేయం. నాగబంధమనేది కంటికీ, చెవికీ ఎలాంటి సమస్యలు రాకుండా రక్షిస్తుంది.
యోగశాస్త్రం ప్రకారం మానవుని మానసికశక్తికి సర్పం ఒక గుర్తు. మానవశరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలున్నాయి. అయితే అనేక నాడులతో నిండి ఉన్న వెన్నుబాములోని కుండలినీశక్తి మూలాధారచక్రంలో సర్పాకారంతో నిద్రావస్థలో ఉండి కామక్రోధాది అరిషడ్వర్గాలను ప్రకోపింపచేస్తుంది. దానివల్ల మనలో ఉండే సత్త్వగుణం అడుగంటుతుంది. నిద్రావస్థలో ఉన్న కుండలినీశక్తిని మేలుకొలిపి, వెన్నెముక మధ్యన ఉండే సుషుమ్నానాడిగుండా సహస్రారం వరకూ తీసుకుపోవడమే సర్పాన్ని పూజించడంలోని ఆంతర్యం.
అంతేకాదు వృశ్చికరాశిలోని జ్యేష్ఠానక్షత్రం సర్పనక్షత్రం. విషజంతువులవల్ల బాధలూ, మృత్యువూ కలగడానికి వృశ్చికరాశి అధిష్ఠానం. అందుకే ఈ సర్పనక్షత్రంలో సూర్యుడు. ప్రవేశించినప్పుడు ఈ పండుగ నాడు అంటే నాగులచవితి రోజున పాములను పూజించి, పుట్టలో పాలు పోస్తే మానవుడిలో ఉన్న విషతుల్యపు ఆలోచనలు శాంతిస్తాయని ఒక నమ్మకం. కుజదోషం, కాలసర్పదోషం ఉన్నవారు. సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి పూజిస్తూ, నాగుపాము ఉండే పుట్టకు పూజ చేస్తే కళత్రదోషాలు తొలగుతాయని ఒక విశ్వాసం.
నాగులచవితి పండుగను దీపావళి అమావాస్య తరువాత, కార్తికమాసం శుక్లపక్ష చవితినాడు చేసుకుంటారు. కొందరు శ్రావణమాసంలో కూడా జరుపుకోవడం కనిపిస్తుంది. ఈ పండుగను ముఖ్యంగా గ్రామీణప్రాంతాలలో ఉండేవారు ఉదయాన్నే లేచి, తలస్నానం చేసి, నూతన వస్త్రాలు కట్టుకొని, పూజామందిరంలో నాగదేవత విగ్రహాన్ని నెలకొల్పి పూజిస్తారు. లేదా పాముపుట్ట దగ్గఱకు పోయి అందులో పాలు పోసి, నువ్వుల ఉండలు, పప్పుతో చేసిన వంటకం, బియ్యపుపిండి -బెల్లంతో చేసిన తీపి పదార్థం నాగదేవతకు నైవేద్యంగా సమర్పిస్తారు. పూలు, ఆవుపాలు, పసుపు, కుంకుమ, అరటిపళ్లు, తాంబూలం సమర్పించి, పూజిస్తారు.
*తరువాత ఆ పుట్టచుట్టూ ప్రదక్షిణం చేస్తూ -*
'సర్ప సర్ప భద్రాంతే దూరం గచ్ఛ మహావిషమ్
జనమేజయ యాగాంతే ఆస్తీకవచనమ్
అనంతాయ నమస్తుభ్యం సహస్రశిరసే నమ:
నమోస్తు పద్మనాభాయ నాగనాంపతయే నమః
అనంతో వాసుకిం శేషాం తక్షకః కాళియస్తథా'
అని చదువుతూ. పుట్టమన్నును పుట్టబంగారంగా భావించి చెవిదోషాలు పోవడానికి చెవులకు ధరిస్తారు. వస్త్రాలను పుట్టమీద పెట్టి ధరిస్తే కోరికలు తీరతాయని ఒక నమ్మకం. ఈ పండుగను ప్రధానంగా తమ పిల్లల శ్రేయస్సుకోసం వివాహిత స్త్రీలు తప్పక జరుపుకుంటారు. ఆనాడు ఉపవాసం కూడా ఉంటారు.
*నాగుల చవితి పూజామంత్రం కూడా పఠించడం ఒక ఆచారంగా కనబడుతుంది.*
'సర్వే నాగా: ప్రీయతాం మే యే కేచిత్ పృథ్వీతలే
యే చ హేలిమరీచిస్థా యేయంతరే దివి స్థితా:
యే నదీషు మహానాగా యే సరస్వతీగామినః
యే చ పీతంగేషు సర్వేషు వై నమః'
("భువిలో, స్వర్గంలో, సరస్సులలో, బావులలో, గుంటలలో నివసించేపాములన్నీ మమ్ములను ఆశీర్వదించుగాకు వాటికి మేమంతా నమస్కరిస్తాం")
'అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబలమ్
శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళీయం తథా
ఏతాని నవనామాని నాగానాం చ మహాత్మనామ్
సాయంకాలే పఠేన్నిత్యం ప్రాతఃకాలే విశేషతః
తస్యవిషభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్'
అనంత, వాసుకి, శేష, పద్మనాభ, కంబల, శంఖపాల, ధృతరాష్ట్ర, తక్షక, కాళీయ అనే తొమ్మిది సర్వనామాలను ప్రతినిత్యం ఉదయం, సాయంకాలం చదివినవారికి విషభయం అనేది లేకుండా సర్వత్రా విజయం కలుగుతుంది. ఉదయం అయితే చాలా మంచిది
అలాగే సర్పసూక్తం, నాగరాజగాయత్రీమంత్రం, నాగేంద్ర అష్టోత్తరశతం పఠిస్తే విశేషఫలితం పొందవచ్చు. అదేవిధంగా జానపదాలలో 'దిగు దిగు నాగా', 'నాగా నాగా యెన్నియలో', 'ఓం' నాగరాజాయ', 'శరణు శరణు నాగరాజా' వంటి భక్తిగేయాలు ఎన్నో కనబడతాయి. వాటన్నింటినీ భక్తితో చదువుకోవచ్చు.
దేవతలూ, రాక్షసులూ అమృతంకోసం పాలసముద్రాన్ని మథించిన సందర్భంలో మందరపర్వతం కవ్వంగా, పామును తాడుగా ఉపయోగించబడింది. మొట్టమొదట ఆ సముద్రంనుండి హాలాహలం వెలువడింది. దానిని పరమేశ్వరుడు మ్రింగి నీలకంఠుడయ్యాడు. ఆ సమయంలో కొన్ని విషపు చుక్కలు నేలమీద పడ్డాయి. ఆ విషప్రభావంనుండి రక్షించుకోడానికి ప్రజలు సర్పారాధన నిత్యపూజాప్రక్రియగా ఆచరించేవారు. అదే క్రమంగా ఈ ఆరాధన సనాతన సంస్కృతిలో ఒక ఆచారంగా మారింది.
*🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*