P.Venkateswara Rao
528 views 11 hours ago
#ఏపి న్యూస్ ఏపీ పాలిటెక్స్🎯 * #లోకేష్ పంథాపై క‌మ్మ వాళ్ల‌లో ఆందోళ‌న‌❗* 12.08.2026🎯 టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, కూట‌మి ప్ర‌భుత్వంలో అత్యంత ముఖ్య‌మైన మంత్రి నారా లోకేశ్ రాజ‌కీయ పంథాపై క‌మ్మ సామాజిక వ‌ర్గంలో ఆందోళ‌న క‌నిపిస్తోంది. ప్ర‌భుత్వాలు శాశ్వ‌తం కాద‌ని, కానీ అధికారంలో ఉన్నామ‌ని విద్వేష‌పూరిత రాజ‌కీయాలు చేస్తే, భ‌విష్య‌త్‌లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తుంద‌నే భ‌యం ఆ సామాజిక వ‌ర్గాన్ని వెంటాడుతోంది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు కేవ‌లం రాజ‌కీయాలు మాత్ర‌మే చేసేవారు. ఇందులో భాగంగా అనుకూల మీడియాను అడ్డు పెట్టుకుని స్వ‌ప‌క్షంలోనూ , విప‌క్షంలోనూ గిట్ట‌ని వారిని టార్గెట్ చేయించడం బాబు నైజం. ఇందుకు టీడీపీ వ్య‌వ‌స్థాపక అధ్య‌క్షుడు ఎన్టీఆర్ కూడా అతీతం కాలేదు. ఇవ‌న్నీ కూడా జ‌నానికి చాలా వ‌ర‌కు అర్థ‌మ‌య్యేవి కావు. కానీ లోకేశ్ రాజ‌కీయ పంథా, ఆయ‌న తండ్రి చంద్ర‌బాబు నైజానికి పూర్తి విరుద్ధంగా సాగుతోంద‌న్న చ‌ర్చ విస్తృతంగా సాగుతోంది. అలాగ‌ని లోకేశ్‌ను అంద‌రూ వ్య‌తిరేకిస్తున్నారా? అంటే …అదేం లేదు. లోకేశ్ తీరే క‌రెక్ట్ అనేవాళ్లు కూడా ఉన్నారు. అలాంటి వాళ్లంతా రాజ‌కీయాల‌కు కొత్త అని చెప్పొచ్చు. రాజ‌కీయాల్లో త‌ల‌పండిన నాయ‌కులు మాత్రం, లోకేశ్ డేంజ‌ర్ గేమ్ ఆడుతున్నార‌నే అభిప్రాయం బ‌లంగా వుంది. త‌న‌కు న‌చ్చ‌క‌పోతే సొంత పార్టీ నాయ‌కుల్ని సైతం వెంటాడి, వేధించి ప‌క్క‌న ప‌డేయడం లోకేశ్ నైజంగా టీడీపీ నేత‌లే చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇందుకు తాజా ఉదాహ‌ర‌ణ‌గా విజ‌యా డెయిరీ చైర్మ‌న్ ప‌ద‌వికి చ‌ల‌సాని ఆంజ‌నేయుల‌తో రాజీనామా చేయించ‌డ‌మే అంటున్నారు. చ‌ల‌సాని ఆంజ‌నేయులు నిఖార్పైన టీడీపీ నాయ‌కుడు. ఆ పార్టీ గెలుపు కోసం ప్ర‌తి ఎన్నిక‌లోనూ ఆయ‌న శ్ర‌మించార‌ని గుర్తు చేస్తున్నారు. అయితే చ‌ల‌సానితో బ‌లవంతంగా రాజీనామా చేయించ‌డం వెనుక‌, ప్ర‌ధాన అదృశ్య శ‌క్తి ఎవ‌రంటే లోకేశ్ పేరే వినిపిస్తోంది. గ‌తంలో ఎప్పుడూ ఇలాంటి దుష్ప‌రిణామాల్ని టీడీపీలో చూడ‌లేద‌ని సీనియ‌ర్ నాయ‌కులు వాపోతున్నారు. అలాగే రెడ్‌బుక్ పేరుతో లోకేశ్ వికృత రాజ‌కీయ క్రీడ‌కు తెర‌లేపార‌ని టీడీపీ నాయ‌కులు విమ‌ర్శిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు అతి చేసిన నాయ‌కుల‌కు త‌గిన శిక్ష విధించ‌డాన్ని ఎవ‌రూ త‌ప్పు ప‌ట్ట‌డం లేదు. ప్ర‌తి రాజ‌కీయ పార్టీలోనూ అధికారాన్ని అడ్డం పెట్టుకుని చెల‌రేగిపోయే నాయ‌కులుంటారు. అలాంటి వాళ్ల‌కు క‌ఠిన శిక్ష‌లు విధించ‌డం ద్వారా, మ‌రొక‌రు అలాంటి త‌ప్పుడు ప‌నులు చేయ‌కుండా ఒక హెచ్చ‌రిక‌లా వుంటుంది. కానీ లోకేశ్ తీరుతో ప్ర‌తిప‌క్ష నాయ‌కులంద‌రిపై కేసులు పెట్ట‌డం, జైళ్ల‌కు పంపడం, ఇదేమీ బాగాలేద‌ని టీడీపీ సీనియ‌ర్ నాయ‌కులు అంటున్నారు. ఎందుకంటే, ఏ ప్ర‌భుత్వం శాశ్వ‌తం కాద‌ని టీడీపీ సీనియ‌ర్ నాయ‌కులు ప‌దేప‌దే గుర్తు చేస్తున్నారు. ప్ర‌స్తుతం కూట‌మి ప్ర‌భుత్వంలో సాగుతున్న అరాచ‌కాల్ని చూస్తూ, రేపు వైసీపీ అధికారంలోకి వ‌స్తే అనే ప్ర‌శ్న‌కే నిలువెల్లా వ‌ణికిపోయే దుస్థితి ఏర్ప‌డింద‌ని అంటున్నారు. ప్ర‌భుత్వంలోనూ, పార్టీలోనూ లోకేశ్ పెత్త‌నం ఎక్కువ కావ‌డం వ‌ల్లే, గ‌తంలో ఎప్పుడూ చూడ‌ని అరాచ‌కాల్ని నేడు చూడాల్సి వ‌స్తోంద‌న్న అభిప్రాయం బ‌లంగా వుంది. అలాగే రాజ‌కీయ నాయ‌కుల‌తో పాటు వంద‌లాది మంది ప్ర‌భుత్వ ఉద్యోగుల్ని కూడా శ‌త్రువులుగా చేసుకున్న ఘ‌న‌త లోకేశ్‌కే ద‌క్కుతుంది. ముఖ్యంగా పోలీస్‌శాఖ‌లో ఎస్ఐ, సీఐ, డీఎస్పీ, ఏఎస్పీ, ఎస్పీ స్థాయి అధికారుల‌కు రెండేళ్లుగా ఎలాంటి పోస్టింగ్‌లు ఇవ్వ‌కుండా ఏరికోరి శ‌త్రుత్వం పెంచుకోడానికి లోకేశ్ తీరే కార‌ణ‌మంటున్నారు. సీనియ‌ర్ ఐపీఎస్ అధికారుల్ని లేని కేసుల్లో జైలుకు పంపడం ద్వారా శాశ్వ‌త శ‌త్రుత్వాన్ని ఏర్ప‌రచుకున్న ఘ‌న‌త లోకేశ్‌కే ద‌క్కుతుంద‌ని వారు అంటున్నారు. గ‌తంలో వైఎస్ జ‌గ‌న్ క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించార‌ని, ఆయ‌న‌కు త‌గిన నాయ‌కుడు లోకేశ్ మాత్ర‌మే అని ఆయ‌న్ను పొగిడే టీడీపీ నాయ‌కులు లేక‌పోలేదు. అయితే అధికారం లేన‌ప్పుడు లోకేశ్‌, ఆయ‌న్ను ఆకాశానికి ఎత్తుతున్న వాళ్లు ఏ మేర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వుంటారో చూడాల‌ని వుంద‌ని టీడీపీ నాయ‌కులు అంటున్నారు. ప్ర‌స్తుతం లోకేశ్ రాజ‌కీయం టీడీపీకే కాదు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ భ‌విష్య‌త్‌కు కూడా మంచిది కాద‌నే వాళ్లే ఎక్కువ‌. క‌క్ష‌లు, కార్ప‌ణ్యాల‌తో సాధించేది ఏమీ లేక‌పోగా, మ‌న‌శ్శాంతిని , ఆస్తుల్ని, ఒక్కోసారి ప్రాణాల్ని పోగొట్టుకోవాల్సి వ‌స్తుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. కేవ‌లం లోకేశ్ విద్వేష రాజ‌కీయం వ‌ల్లే, కూట‌మి ప్ర‌భుత్వం రెండేళ్లకే తీవ్ర వ్య‌తిరేక‌త‌ను సంపాదించుకుంద‌న్న చెడ్డ‌పేరు వ‌చ్చింద‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా అతి త‌క్కువ స‌మ‌యంలో వైసీపీ కోలుకోడానికే, లోకేశ్ రెడ్‌బుక్కే కార‌ణ‌మ‌ని టీడీపీ నేత‌లు అంటున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో టీడీపీ మ‌న‌ద‌ని భావించే క‌మ్మ సామాజిక వ‌ర్గంలో ఒక ర‌క‌మైన అల‌జ‌డి రేపుతోంది. ఇంత కాలం చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో అధికారం ఉన్నా, లేక‌పోయినా అంతా సాఫీగా సాగిపోయింద‌నే వాళ్ల సంఖ్య ఎక్కువ‌. అయితే అధికారం కోల్పోతే, లోకేశ్ చ‌ర్య‌ల వ‌ల్ల తాము ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌స్తుందో అని క‌మ్మ సామాజిక వ‌ర్గంలోని వ్యాపారులు, రాజ‌కీయ ప్ర‌ముఖులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఎందుకంటే, లోకేశ్ చ‌ర్య‌ల వ‌ల్ల‌, మిగిలిన సామాజిక వ‌ర్గాలు త‌మ‌ను శ‌త్రువుగా చూస్తున్నార‌న్న ఆందోళ‌న వాళ్లను వెంటాడుతోంది. ఇవ‌న్నీ లోకేశ్‌కు తెలుసో, లేదో మ‌రి!
14 likes
12 shares

More like this