P.Venkateswara Rao
702 views 12 days ago
#చంద్రబాబు నాయుడు *లెఫ్ట్ కెనాల్ నీళ్లు.. బతుకంతా వాయిదాలేనా❓ 22.08.2026🎯 ఉత్తరాంధ్ర ప్రజలంటే చంద్రబాబు నాయుడుకు ఎంత చులకనో తాజా ప్రకటనను చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అనే ప్రాజెక్టు ఎప్పటిది? ఎన్ని దశాబ్దాలుగా.. యావత్ ఉత్తరాంధ్ర ప్రజలు ఆ ప్రాజెక్టు ద్వారా రాగల నీళ్లకోసం ఎదురుచూస్తున్నారు. ఇదే చంద్రబాబునాయుడు ఎన్ని రకాలుగా మాటలు చెబుతూ.. నీళ్లు అదిగో ఇదిగో అంటూ.. ఇంకా ఎంతకాలం పాటు ఉత్తరాంధ్ర ప్రజలను మభ్యపెట్టాలని అనుకుంటున్నారు.. అనే బాధ కలుగుతుంది. ఉత్తరాంధ్ర ప్రజలు కేవలం తను చెప్పే మాటలను నమ్ముతూ ఎప్పటికీ తన పార్టీనే గెలిపిస్తూ ఉంటారనే అతి నమ్మకమే ఆయనను ఇన్ని రకాలుగా మాట మారుస్తుండడానికి కారణమవుతున్నదా? అనే అభిప్రాయం కూడా ప్రజల్లో కలుగుతోంది. ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాలోని చివరి ఎకరాకు కూడా సాగునీళ్లు ఇవ్వాలనేదే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు లక్ష్యం. పోలవరం లెఫ్ట్ కెనాల్ నుంచి నీళ్లు ఇస్తాం అని పాలకులు ప్రతిసారీ ఊరిస్తుంటారే తప్ప అది ఆచరణలోకి మాత్రం రాలేదు. ప్రభుత్వాలు మారినా.. ఉత్తరాంధ్ర వాసుల దుర్గతి మారలేదు. మధ్యలో భోగాపురం ఒకటి వచ్చింది. భోగాపురం ఎయిర్ పోర్టు ద్వారా.. యావత్ ఉత్తరాంధ్ర ముఖచిత్రం మొత్తం మారిపోతుందంటూ.. చంద్రబాబునాయుడు విపరీతంగా ఊదరగొట్టారు. భోగాపురంలో ఎయిర్ పోర్ట్ ఉంటే చాలు.. ఉత్తరాంధ్ర పేద ప్రజల కడుపులు మొత్తం నిండిపోయినట్టే.. ఇక వారికి తిండీ నీళ్లు కూడా ఇవ్వక్కర్లేదు అనే స్థాయిలో ఆయన అతిశయ ప్రకటనలు సాగిపోయాయి. కానీ లెఫ్ట్ కెనాల్ ద్వారా నీళ్ల సంగతి మాత్రం ఆయనకు పట్టని వ్యవహారంగానే మిగిలింది. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే.. ఈ విషయంలో ఎన్నిసార్లు, ఎన్ని రకాలుగా మాటలు మారుస్తూ వచ్చారో గమనిద్దాం. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో మంత్రి నిమ్మల రామానాయుడు లెఫ్ట్ కెనాల్ పనులను పరిశీలించారు. అన్నవరం సమీపంలోని అక్విడక్టు, తుని సమీపంలోని ఒక గ్రామం వద్ద పనులను పరిశీలించి.. అధికార్లను వేగంగా పూర్తిచేయించాలని పురమాయించారు. ఆ సందర్భంలో జూన్ లోగా.. లెఫ్ట్ కెనాల్ ద్వారా.. అనకాపల్లికి పోలవరం నుంచి నీళ్లు ఇస్తాం అని ప్రకటించారు. జూన్ దాటిపోయింది.. జూలై కూడా దాటిపోయింది. భోగాపురం విమానాశ్రయం పూర్తిచేసిన సందర్భంలో సాక్షాత్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అంతకంటే గొప్ప హామీలు ఇచ్చారు. ఆగస్టు 14వ తేదీన అనకాపల్లికి నీళ్లు చేరుతాయని, ఆరోజు తాను అక్కడ అఖండ జలహారతి ఇస్తానని కూడా ఆయన చాలా ఘనంగా చెప్పారు. తర్వాత నీళ్లు విడుదల చేసినట్టు కూడా వార్తలు వచ్చాయి. ఆగస్టు 14 గడచిపోయింది. తాజాగా అనకాపల్లి జిల్లాలో స్వచ్ఛాంధ్రలో పాల్గొన్న చంద్రబాబునాయుడు.. సెప్టెంబరు మొదటి వారంలో అనకాపల్లికి నీళ్లు ఇస్తాం అని ప్రకటించారు. ఎన్నిసార్లు మాట మారుస్తారు. కనీసం ఆగస్టు 14న జలహారతి ఇస్తానని చెప్పిన మాట నిలబెట్టుకోలేకపోయాననే పశ్చాత్తాపం కూడా లేదు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం పెద్దలు.. అనకాపల్లి వరకు నీళ్ల సంగతి, విశాఖకు కూడా నీరు అందించే సంగతి మాత్రమే మాట్లాడుతున్నారు. సుజలస్రవంతి ప్రకారం.. శ్రీకాకుళం చివరి ఎకరా వరకు నీళ్లు ఇవ్వడం గురించి ఊసే ఎత్తడం లేదు. అనకాపల్లిలో మిత్తల్ ఉక్కు పరిశ్రమ, విశాఖలో డేటా సెంటర్ లాంటి అవసరాలకోసం ప్రభుత్వం ఇప్పటికైనా అక్కడి దాకా నీళ్లు తెస్తున్నట్టుగా ఉన్నదే తప్ప.. ప్రజల మీద శ్రద్ధతో.. సాగు మీద మమకారంతో నీళ్లు అందించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నట్టుగా అర్థమవుతోంది.
13 shares

More like this