P.Venkateswara Rao
616 views • 18 days ago
#చంద్రబాబు #రెండు కళ్ళ సిద్ధాంతం 👀
*ఆచరణకు దూరంగా దార్శనికుడి ఆదర్శం❗*
16.08.2026🎯
చంద్రబాబునాయుడు
తనను తాను విజనరీగా చెప్పుకుంటారు. దార్శనికుడు గనుకనే తాను ప్రపంచానికంటె యాభయ్యేళ్లు ముందుండి ఆలోచిస్తానని ఆయన చెబుతుంటారు. అలాంటి నాయకుడు.. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన ప్రసంగంలో మరో గొప్ప ఆదర్శాన్ని ప్రవచించారు. అయితే ఈ ఆదర్శం ఆచరణ సాధ్యమయ్యేదేనా అనే అనుమానం ప్రజలకు కలుగుతోంది.
మహిళలకు ఏపీ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణావకాశం కల్పించి ఏడాది గడిచింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబునాయుడు మాట్లాడారు. ‘ఎన్ని పనులు చేసినా, ఎన్ని పథకాలు అమలు చేసినా, తాత్కాలిక ప్రయోజనం వస్తే ప్రజలు అటు వెళ్లిపోతుంటారు.
ఎన్నికలు పది రూపాయలు ఎక్కువ ఇస్తామంటే వాళ్లకు ఓటేస్తున్నారు. దీనిపై ప్రజలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. నేతలు డబ్బులు ఇస్తోంటే మాకు నీతి ఉందని చెప్పండి. డబ్బులు తీసుకోకుండా ఓటేయండి. మిగిలిన వారిలోనూ దీనిపై అవగాహన కల్పించండి. దీనివల్ల మీకు నాలుగు రెట్లు ఫలితం వస్తుంది’ అని చంద్రబాబు మహిళలకు ఉద్బోధించారు.
ఆదర్శం చాలా బాగానే ఉంది. సోషల్ మీడియాలో ఇలాంటి సూక్తులు ప్రతిరోజూ వెల్లువలా వస్తూనే ఉంటాయి. కానీ.. ఇలాంటి ఆదర్శానికి శ్రీకారం చుట్టాల్సింది ఎవరు? అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడు ఆ పని ఎందుకు చేయకూడదు.. అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
తాము అద్భుతమైన పరిపాలన అందిస్తున్నాం గనుక, అద్భుతమైన సంక్షేమ పథకాలను ప్రజలకు ఇస్తున్నాం గనుక, అమరావతిని అద్భుతంగా నిర్మిస్తున్నాం గనుక.. ప్రజలు మళ్లీ మళ్లీ తమనే గెలిపిస్తారనే నమ్మకం గనుక చంద్రబాబునాయుడుకు ఉంటే.. ఎన్నికల్లో డబ్బులు పంచే వాళ్లకు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టికెట్లు ఇవ్వబోదని స్పష్టంగా తేల్చిచెప్పాలి.
ఒకవేళ టికెట్లు పొందిన తర్వాత.. ఎవరైనా డబ్బులు పంచుతున్నట్టు తెలిస్తే.. అప్పటికప్పుడు ఆ అభ్యర్థిని బహిష్కరించి.. ఆ అభ్యర్థితో తమకు సంబంధం లేదని ప్రకటిస్తామని ముందుగానే హెచ్చరించాలి. అంత ఖచ్చితంగా పార్టీ వ్యవహరించగలిగితే.. ఇక ప్రజలు ఎవరినుంచి డబ్బులు తీసుకుంటారు?
వైసీపీ వాళ్లు మాత్రమే డబ్బులు ఇస్తే గెలుస్తారు కదా అనే భయం చంద్రబాబుకు రాకూడదు. తాను చేసిన అభివృద్ధి గెలిపిస్తుందని నిజంగా నమ్మితే.. డబ్బు ఇవ్వని అభ్యర్థులను మాత్రమే ప్రోత్సహించాలి. పార్టీ పరంగా అలాంటి పని చేయకుండా.. డబ్బులిస్తే తీసుకుని అటు మళ్లుతున్నారని ప్రజలను నిందించడం నాయకుడికి తగని పని.
జగన్ కూడా చాలా సంక్షేమ పథకాలు అమలు చేశారు. వేలం పాటలాగా వాటన్నింటికీ వెయ్యీ రెండు వేలూ అదనంగా జోడించి ఆశ పెట్టడం ద్వారా మాత్రమే తాను అధికారంలోకి వచ్చానని కూడా చంద్రబాబునాయుడు తెలుసుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు చెబుతున్న ఆదర్శాన్ని ఏపీ ప్రజలు 2024 లో పాటించి ఉంటే ఆయన కూడా అధికారంలోకి వచ్చి ఉండగలిగే వాళ్లు కాదు!
14 shares