Satya Vadapalli
4K views 9 hours ago
#🚩జగన్నాథ రథయాత్ర🛕 సుభద్రా బలభద్రా సమేత శ్రీజగన్నాథస్వామినే నమః! భజే శ్రీచక్ర మధ్యస్థాం దక్షిణోత్తరయోస్సదా! శ్యామావార్తాళిసంసేవ్యాం భవానీం లలితాంబికాం!! వైదిక సంస్కృతిలో సృష్టిస్థితిలయలకు కారణమైన పరబ్రహ్మయే జగన్నాథుడుగా చెప్పబడింది. ఆ జగన్నాథుడైన పరబ్రహ్మ త్రిమూర్త్యాత్మకుడై త్రిమూర్త్యాత్మక శక్తితో ఈ అనంతకోటి బ్రహ్మాండాలను నడిపిస్తున్నాడు. ఆ పరబ్రహ్మయే జగన్నాథుడుగా పురుషోత్తమ క్షేత్రమైన పూరీలో నెలకొని ఉన్నాడు. షణ్మతాలైన శైవ, వైష్ణవ, శాక్తేయ సౌర, గాణాపత్య, స్కాందములలో ఏ సాంప్రదాయానికైనా జగన్నాథుడు ఒకరే కనుక ఆ శక్తులన్నిటి కలబోత పూరీలోనున్న జగన్నాథుడు. స్కాందపురాణం ప్రకారం ఆదిలో నీలమాధవుడిగా నున్న నారాయణుడే జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శన రూపాలుగా భక్తులను వివిధ విధాలుగా అనుగ్రహించడానికి కొలువయ్యారు. ఆషాఢమాసం జగన్నాథస్వామి వారి రథోత్సవంతో ప్రారంభమై 9 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. వారాహీదేవి నవరాత్రులు కూడా ఆషాఢశుద్ధ పాడ్యమినుండి నవమి వరకు అనేది శాస్త్రములో చెప్పబడింది. రెండింటికీ చాలా సంబంధం ఉన్నది. పూరీలో జరిగే అర్చనా పద్ధతులు గమనించినా ఆ విషయం స్పష్టం అవుతోంది. పూరీలో అధివసించియున్న శ్రీ సుభద్రాదేవి భువనేశ్వరి అయిన లలితమ్మే. సుభద్రాదేవి భువనేశ్వరీ యంత్రముపై ప్రతిష్ఠితమై ఉండడం మరో విశేషం. ఆ యంత్రమునందు అధివసించిన దేవతల నామాలు అనంగమదన, మదనాతుర.. ఈవిధంగా ఖడ్గమాలలో వివరింపబడిన దేవతలే. ‘శ్రీకృష్ణః శ్యామలాదేవీ’ అనే ప్రామాణికతను బట్టి శ్రీకృష్ణుడైన జగన్నాథుడే నీలివర్ణంతో ప్రకాశించే శ్యామలా దేవి. నాగలి, ముసలం ఆయుధాలుగా ధరించిన బలభద్రస్వామియే సాక్షాత్తూ శ్రీవారాహీదేవి. వీరి ఇద్దరి ఆయుధాలు అవే. అంతేకాక రథోత్సవంలో సుభద్రాదేవి రథంపై గల దేవతలలో ప్రధాన దేవత వారాహిగా చెప్పబడింది. బలభద్రునియొక్క మరోశక్తి రూపం వారాహిగా సుభద్రాదేవి రథములో నున్నదని అర్థం. లలితా శ్యామలా వారాహీల వలె సుభద్రాదేవి ఇచ్ఛాశక్తిగా, బలభద్రుడు క్రియాశక్తి, జగన్నాథుడు జ్ఞానశక్తి. వరాహావతారమును దాల్చిన నారాయణుని శక్తియే వారాహి కనుక ఆమె సాక్షాత్తూ లక్ష్మీదేవిగా కూడా చెప్పబడింది. వారాహీదేవి భూమిపై నుండే జీవులకోసం భూమిని ఉద్ధరించి, నాగలితో ఆ భూమిని దున్ని వచ్చిన ఆహారాన్ని ఉపయోగకరంగా పరిణామమొనర్చడానికి రోకలి (ముసలం)ని ఉపయోగించి, సిద్ధమైన ఆహారాన్ని బిడ్డలకు అందిస్తుంది. కృతజ్ఞతను ప్రకటించుకోవడానికైనా ఈ తల్లిని ప్రతిరోజూ నమస్కరించుకోవాలి. ఈమె శ్రీ లలితా పరాభట్టారికకు అభిన్న కనుక లలితాదేవికి సంబంధించిన అష్టోత్తర, సహస్రనామ స్తోత్రాదులను వారాహీదేవి ప్రీతికై చదువవచ్చును. వారాహీదేవి గురించి మార్కండేయ, వామన, దేవీభాగవత, వరాహ, మత్స్య, అగ్నిపురాణాదులలోనే కాక విష్ణుధర్మోత్తర పురాణమువంటి ఉపపురాణాలలో కూడా చెప్పబడింది. అంతేకాక ఎన్నో మంత్ర తంత్ర గ్రంథాలు కూడా విస్తృతంగా వర్ణించాయి. వైష్ణవ, శంకర, శాక్త సాంప్రదాయాలన్నింటిలోనూ వారాహీ ఆరాధన ఉన్నది. సప్తమాతృకలలో వైష్ణవి, కౌమారీలతో పాటుగా వారాహీ ఉన్నది. సప్తమాతృకలలో అయిదవ శక్తిగా ‘పంచమి’గా కూడా కొలువబడుతోంది. మనలోనూ, ప్రపంచంలోనూ గల పంచభూతాలకు అధిదేవత కనుక ఈ దేవతను అర్చించే తిథులలో పంచమీతిథి ప్రధానమైనది. అంతేకాక శ్రీచక్రంలో పంచావరణలతో కూడిన యంత్ర స్వరూపమే వారాహి కనుక ఈమెకు పంచమి అని పేరు. పంచకోశాలతో నిండిన దేహచక్రాన్ని నడిపే తల్లిగా కూడా ఈమెను భావించాలి. లలితా ఉపాసనలో సేనాధ్యక్షురాలిగా, క్రియాశక్తిగా ప్రముఖస్థానం వహించింది. ఇచ్ఛా, జ్ఞానశక్తులు కూడా క్రియాశక్తిలో అంతర్భాగాలే కనుక వారాహీదేవి అనుగ్రహం ఉంటే ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు కూడా ఉన్నట్లే. వారాహీదేవిగా వరాహవదనంతో శక్తినంతటినీ నాసిక (ముక్కు)లో నిబిడీకృతం చేసింది. అదే ప్రాణశక్తి, సమస్త బ్రహ్మాండాలను ఆ ఊపిరితోనే నిర్వహించే క్రియాశక్తి. షట్చక్రాలలో మణిపూర (జలతత్త్వం), స్వాధిష్ఠాన(అగ్నితత్త్వం), మూలాధార చక్రము (భూతత్త్వం)లకు అధిష్ఠాతృదేవిగా యోగశాస్త్రంలో చెప్పబడింది. అదేవిధంగా లలితమ్మ ఆజ్ఞాచక్రస్థానమైన భృకుటినుండి హల, ముసలాలను తీసి వారాహీదేవికి ఇచ్చిన కారణమున ఆజ్ఞాచక్రాధిష్ఠాన దేవతగా కూడా వారాహీదేవి చెప్పబడుతోంది. లలితాదేవి భక్తులను ఆ అమ్మదగ్గరకు చేర్చడంలో కరుణామయి, ధైర్య వీర్య విజయాలకు ప్రతీక. భూమిని హిరణ్యాక్షుడు బాధించినపుడు ఈ శక్తియే వరాహస్వామిగా భూమిని ఉద్ధరించింది. ముఖ్యంగా భూరక్షణకు, భూమిపై జీవించే మనందరినీ రక్షించేశక్తి శ్రీవారాహీ దేవి. ఆత్మన్యూనతా భావం గలవారు రోజూ వారాహీదేవికి నమస్కరిస్తే చాలు ఆత్మస్థైర్యం వస్తుంది. వారాహీ పంచకంలో చెప్పినట్లు వారాహి కరుణారస హృదయ. అనేక జన్మలకొద్దీ సంసారాదులలో కూరుకుపోతున్న వారిని ఉద్ధరించడానికే అమ్మవారు రెండు కోరలతోనున్న వరాహ వదనముతోనున్న రూపాన్ని దాల్చింది. జగద్గురు శ్రీ ఆదిశంకరులు ఈ విషయాన్నే సౌందర్యలహరిలో ‘జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపు వరాహస్య భవతి” అని చెప్పారు. వారాహి ఆయుధాలను పరిశీలిస్తే వారాహీదేవిలోనే పూరీలోగల జగన్నాథ, సుభద్రా బలభద్రులను దర్శించవచ్చు. శంఖచక్రములు జగన్నాథస్వామికి ప్రతీకలు కాగా నాగలి, రోకలి బలభద్రస్వామి చేతిలోని ఆయుధాలు. ముందుగా చెప్పినట్లు భువనేశ్వరీ దేవి రూపమైన సుభద్రాదేవి శక్తులే పాశము, అంకుశము. ఒకే పరమాత్మ జగన్నిర్వహణ కోసం విభిన్న రూపాలైనట్లు సనాతన సాంప్రదాయం. ‘జ’కారస్తు జగన్నాథః, బలభద్రో ‘గ’కారకః, ‘న’కారో సుభద్ర రూపా చ; ‘థ’కారోపి సుదర్శనః. పరబ్రహ్మ అయిన జగన్నాథుడే ఈ నాలుగు రూపములలో వ్యక్తమయ్యారు. వారాహీ మంత్రములో ‘గ’కారం ప్రధానమైనది. ఆ రూపమైన బలభద్రుడు ‘గ’కార శబ్దవాచ్యుడన్నది శాస్త్రం. అనాదిగా భారతీయ సంస్కృతి సమన్వయాత్మకంగా చెప్తున్న త్రిమూర్త్యాత్మక శక్తికి వందనములు. #🌅శుభోదయం ##🛕జగన్నాథ రథయాత్ర🙏 #🙏జై జగన్నాథ ✊ #🙏🏻భక్తి సమాచారం😲
38 likes
97 shares

More like this