P.Venkateswara Rao
625 views • 20 days ago
#తెలంగాణా రాజకీయాలు 🚩🚩😁
*అక్కడ పవన్ వేగం పెంచితే.. బీఆర్ఎస్ నెత్తిన పాలు❗*
20.06.2026🎯
తెలంగాణలో జనసేన అధినేత పవన్కల్యాణ్ సరికొత్తగా అడుగు పెట్టారు. హైదరాబాద్లో పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు.
తెలంగాణలో ఇకపై ఉధృతంగా రాజకీయాలు చేస్తానని ఆయన అంటున్నారు. జనసేన ఎన్నికల బరిలో నిలుస్తుందని చెప్పారు.
కేరళ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనే విస్తరిస్తున్నామని చెబుతున్నప్పుడు, సాటి తెలుగు రాష్ట్రమైన తమిళనాడులో రాజకీయం చేయడం పెద్ద విషయమేమీ కాదు.
అయితే తెలంగాణలో పవన్ రాజకీయ అడుగులు వేయడం అంటే బీఆర్ఎస్ నెత్తిన పాలు పోయడమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇదే సందర్భంలో తెలంగాణలో అధికారంలోకి రావాలని కలలు కంటున్న బీజేపీని నీట ముంచడమే. మిత్రపక్షమైన బీజేపీని రాజకీయంగా దెబ్బతీయడానికి పవన్ పరోక్షంగా దోహదం చేస్తారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
తాజాగా హైదరాబాద్లో జనసేన కార్యాలయాన్ని పవన్ ప్రారంభించడం ఎలాంటి వివాదానికి చోటు లేకుండా సాగిపోయింది.
పవన్ అడుగు పెట్టడం వల్ల తమకు లాభమని బీఆర్ఎస్ నేతలకు బాగా తెలుసు. అందుకే మొదట పవన్ను తెలంగాణలో రాజకీయాల్ని సీరియస్గా చేసేలా ముగ్గులోకి దింపుతున్నారు.
అసలు కథ ఎన్నికల సమయంలో వుంటుందని బీఆర్ఎస్ నేతలకు బాగా తెలుసు.
తెలంగాణకు వ్యతిరేకంగా డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ చేసిన ఘాటు వ్యాఖ్యల్ని బీఆర్ఎస్, అలాగే అక్కడి ప్రజాసంఘాల నాయకులు, జర్నలిస్టులు సిద్ధం చేసుకున్నారు.
అదును చూసి, ప్రయోగించడానికి తెలంగాణ వ్యతిరేక అస్త్రాన్ని రెడీ చేసుకున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పుడే పవన్పై ప్రయోగించాలని అనుకోలేదు.
ఈ నెల మొదటి వారంలో తెలంగాణ ఆవిర్భావ దినాన్ని పురస్కరించుకుని ఏదో చేయాలని పవన్ అనుకుంటే, అక్కడి సమాజం ఏ రకంగా విరుచుకుపడిందో చూశాం. తెలంగాణలో నివాసం వుండడానికి, అలాగే రాజకీయాలు చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వారు చెబుతున్నారు.
అయితే తెలంగాణ ఏర్పాటునే కించపరిచే వ్యాఖ్యలు చేస్తూ, మరోవైపు ఆ రాష్ట్ర శ్రేయోభిలాషి అంటే ఒప్పుకునే పరిస్థితే వుండదనేది ఆ సమాజ నిశ్చితాభిప్రాయం.
ఈ నేపథ్యంలో నిజంగా పవన్కల్యాణ్ తెలంగాణలో సీరియస్గా రాజకీయాలు చేయాలని అనుకుంటే మాత్రం, అదంతా బీఆర్ఎస్కు ఉపయోగపడుతుంది.
పవన్ కారణంగా తెలంగాణలో మరోసారి సెంటిమెంట్ రగులుతుంది. 2018లో కాంగ్రెస్తో టీడీపీ పొత్తు పెట్టుకుని, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. చంద్రబాబు రూపంలో మరోసారి సీమాంధ్ర పాలన సాగించాలని అనుకుంటున్నారని కేసీఆర్ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దీంతో అధికారంలోకి వచ్చే అవకాశాన్ని చంద్రబాబు కారణంగా కాంగ్రెస్ కోల్పోయింది.
2028లో కూడా ఇదే జరుగుతుంది. పవన్కల్యాణ్ రూపంలో బీజేపీ సీమాంధ్ర పాలన తీసుకురావాలని అనుకుంటోందంటూ బీఆర్ఎస్ అస్త్రం ప్రయోగిస్తుంది.
ఆ దెబ్బకు బీజేపీ, కాంగ్రెస్ రాజకీయంగా తీవ్రంగా నష్టపోవడం ఖాయమని పలువురు అంటున్నారు.
అంతిమంగా బీఆర్ఎస్ రాజకీయంగా లబ్ధి పొందుతుంది. బీఆర్ఎస్తో పవన్కల్యాణ్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని, అక్కడ రాజకీయాలు చేయాలని అనుకంటున్నారా? అనే అనుమానం కూడా కొందరిలో లేకపోలేదు. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలతో తనకు గొడవ లేదని పవన్ అంటుండడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.
9 likes
13 shares