P.Venkateswara Rao
641 views 1 months ago
#ఏపి న్యూస్ ఏపీ పాలిటెక్స్🎯 #చంద్రబాబు *బాబు తెలివితేట‌లు ఏమ‌య్యాయో❗* 04.07.2026🎯 సీఎం చంద్ర‌బాబుకి అప‌ర చాణ‌క్యుడ‌నే పేరు వుంది. కొన్నేళ్ల పాటు తెలుగు స‌మాజాన్ని టీడీపీ అనుకూల మీడియానే రాజ్య‌మేలేది. ఎప్పుడైతే సోష‌ల్ మీడియా అందుబాటులోకి వ‌చ్చిందో, అప్ప‌టి నుంచి నాణేనికి రెండో వైపు కూడా చూప‌డం మొద‌లైంది. ఇదే సంద‌ర్భంలో టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియాని సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు చీల్చి చెండాడం స్టార్ట్ అయ్యింది. అయితే బ‌ల‌మైన మీడియా కార‌ణంగా చంద్ర‌బాబు అంటే గొప్ప విజ‌న‌రీ, రాజ‌కీయంగా అప‌ర చాణ‌క్యుడ‌నే కీర్తి స్థిర‌ప‌డింది. కానీ బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థి లేక‌పోవ‌డం వ‌ల్లే చంద్ర‌బాబు రాజ‌కీయ ఆట‌లు సాగాయ‌నే అభిప్రాయం లేక‌పోలేదు. ఏది ఏమైనా నాలుగో సారి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టి, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఏ రాజ‌కీయ నాయ‌కుడికి లేని ఘ‌న‌త‌ను బాబు ద‌క్కించుకున్నారు. ఈ విష‌యంలో ఆయ‌న్ను త‌ప్ప‌క అభినందించాలి. రాజ‌కీయ‌, ప‌రిపాల‌న అనుభ‌వం చంద్ర‌బాబును మ‌రింత ప‌రిణ‌తి చెందిన నాయ‌కుడిగా తీర్చిదిద్ది వుండాల్సింది. అదేంటో గానీ, నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాక‌, గ‌తంలో ఎప్పుడూ లేనంత అధ్వానంగా పాల‌న సాగిస్తున్నార‌నే విమ‌ర్శ‌ను మూట‌క‌ట్టుకుంటున్నారు. బాబు 4.0లో ఆయ‌న మార్క్ ప‌రిపాల‌న అస‌లు క‌నిపించ‌డం లేద‌ని చివ‌రికి సొంత పార్టీ నాయ‌కులు, ఆయ‌న్ను అభిమానించే త‌ట‌స్థులు వాపోతున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇటీవ‌ల చోటు చేసుకున్న మూడు ఘ‌ట‌న‌ల్ని తీసుకుందాం. వైసీపీకి ఏ మాత్రం సంబంధం లేని అంశాలు కూట‌మి ప్ర‌భుత్వాన్ని చిరాకు తెప్పిస్తున్నాయి. కూట‌మిని బ‌ద్నాం చేస్తున్నాయి. అంతిమంగా రాజ‌కీయంగా వైసీపీకి ప్ర‌యోజ‌నం క‌లిగిస్తున్నాయి. ద‌ళిత క్రైస్త‌వుల వివాదం, ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ కామెంట్స్‌, తాజాగా ఒకేరోజు హైద‌రాబాద్‌లో యూట్యూబ‌ర్ రావ‌ణ్‌, తెలంగాణ జ‌ర్న‌లిస్ట్ కేవీఆర్ అరెస్ట్ అంశాలు తెలుగు రాజ‌కీయాల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌ల‌య్యాయి. డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు అతి జోక్యంతో ద‌ళిత క్రిస్టియ‌న్ల వ్య‌వ‌హారం రావ‌ణ‌కాష్టంలా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ర‌గులుతోంది. ద‌ళితులే ఓట్లే అవ‌స‌రం లేద‌నే వ‌ర‌కూ ర‌ఘురామ వెళ్లారు. ఈ మాట‌లు మాల‌, మాదిగ‌, గిరిజన‌, మైనార్టీల్లో బాగా నాటుకుపోయాయి. వాళ్లంద‌ర్నీ బాగా హ‌ర్ట్ చేశాయి. ర‌ఘురామ ప్రాతినిథ్యం వ‌హిస్తున్న టీడీపీకి వ్య‌తిరేకంగా రానున్న ఎన్నిక‌ల్లో వాళ్లంతా ప‌ని చేయ‌నున్నారు. వైసీపీతో ఏ మాత్రం సంబంధం లేకుండానే జ‌డ శ్ర‌వ‌ణ్‌కుమార్‌, విజ‌య్‌కుమార్‌, పీవీ సునీల్‌కుమార్ , హ‌ర్ష‌కుమార్ త‌దిత‌రులంతా ఎవ‌రికి వారు వ్య‌క్తిగ‌తంగా స‌భ‌లు, స‌మావేశాల్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వ‌హిస్తున్నారు. కూట‌మిని వారంతా విల‌న్‌గా చూస్తున్నారు. అంతిమంగా రాజ‌కీయంగా వైసీపీకి ఉప‌యోగ‌ప‌డ‌నున్నారు. ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ త‌న‌కు తెలిసిన విశ్వ‌స‌నీయ స‌మాచారం గురించి విశ్లేషిస్తే, ఆయ‌న‌పై ఏపీలో కేసులు పెట్టారు. అరెస్ట్ చేస్తామంటే, తానే వ‌ద్ద‌న్నాన‌ని స్వ‌యంగా డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ అన్నారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ కేంద్రంగా పెద్ద ర‌చ్చే జరిగింది. ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ విష‌యంలో స‌మాజంలో కొంత గౌర‌వం వుంది. అలాంటి వ్య‌క్తిపై కూడా కేసులు పెట్టారంటే, పాల‌న ఏ రీతిలో సాగుతున్న‌దో అర్థం చేసుకోవ‌చ్చ‌నే అభిప్రాయానికి కూట‌మి ప్ర‌భుత్వం చేజేతులా చోటు ఇచ్చింది. మూడో అంశం… యూట్యూబ‌ర్ రావ‌ణ్‌, తెలంగాణ జ‌ర్న‌లిస్ట్ కేవీఆర్ అరెస్ట్‌లు ఒకే రోజు హైద‌రాబాద్‌లో జ‌రిగాయి. ప‌రుష ప‌ద‌జాలాలే త‌మ భాష‌గా, బ‌లంగా భావిస్తున్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో రావ‌ణ్ అభ్యంత‌ర‌క‌ర కామెంట్స్ చేశార‌ని కేసులు పెట్టి, రాష్ట్ర‌మంతా తిప్పుతున్నారు. జ‌ర్న‌లిస్ట్ కేవీఆర్‌పై అక్ర‌మ కేసు పెట్టారంటూ తెలంగాణ జ‌ర్న‌లిస్టులు తీవ్ర‌స్థాయిలో ర‌గిలిపోతున్నారు. ప్ర‌స్తుతం కేవీఆర్ రిమాండ్‌లో ఉన్నారు. రావ‌ణ్ విష‌యానికి వ‌స్తే …వ‌రుస‌గా మూడు కోర్టుల్లోనే బెయిల్ ల‌భించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కేసులు న‌మోదు చేసి, వేధిస్తున్న తీరు ఆయ‌న‌పై సానుభూతి పెంచుతోంది. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కూ సోష‌ల్ మీడియాలో రాజ‌కీయ ఆస‌క్తి వున్న‌వాళ్ల‌కు త‌ప్ప‌, ఇత‌రుల‌కు ఎవ‌రో తెలియ‌ని రావ‌ణ్‌, ఇప్పుడు హీరో అయ్యాడు. అత‌న్ని హీరో చేసిన ఘ‌న‌త జ‌న‌సేన‌కే ద‌క్కుతుంది. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో కూట‌మికి రాజ‌కీయంగా న‌ష్టం తీసుకొచ్చిన అంశాలున్నాయి. కాకినాడ‌లో పోలీస్ వాహ‌నంలో వెళ్తున్న రావ‌ణ్‌పై జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు దాడి చేయ‌డ‌మే అన్యాయం అనుకుంటే, మ‌చిలీప‌ట్నంలో ఏకంగా పోలీస్‌స్టేష‌న్‌పైకే వెళ్ల‌డం అరాచ‌కానికి ప‌రాకాష్టగా విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై ఎవ‌రైనా చిన్న విమ‌ర్శ చేసినా స‌రే ఇళ్ల‌పైకి, అవ‌స‌ర‌మైతే పోలీస్‌స్టేష‌న్ల‌పైకి కూడా దండ‌యాత్ర చేస్తామ‌ని జ‌న‌సేన సంకేతాలు పంపింది. ఈ ప‌రిణామాల‌పై విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్ మాట‌ల్లో చెప్పాలంటే, విప‌రీత ధోర‌ణుల్ని స‌మాజం చూస్తోంది. అధికారం ఇస్తే, మ‌రీ ముఖ్యంగా జ‌న‌సేన ఎలా ప్ర‌వ‌ర్తిస్తుందో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు క‌న‌ప‌డుతోంది. వీటిని పౌర స‌మాజం అంగీక‌రించే ప‌రిస్థితి లేదు. ఇవ‌న్నీ కూడా రాజ‌కీయంగా కూట‌మికి తీవ్ర న‌ష్టం క‌లిగించేవే. జ‌న‌సేన‌కు పెద్ద‌గా పోయేదేమీ లేదు. ఎందుకంటే ఆ పార్టీ 21 సీట్ల‌లోనే పోటీ చేసింది. రాబోయే ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి అంత‌కు మించి ఇచ్చే ప‌రిస్థితి కూడా వుండ‌ద‌ని టీడీపీ నాయ‌కులు అంటున్నారు. కానీ అత్య‌ధిక స్థానాల్లో పోటీ చేసే టీడీపీ మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుంది. ఇలాంటి చ‌ర్య‌ల‌తో ఏం జ‌రుగుతుందో తెలియ‌నంత అమాకుడు కాదు చంద్ర‌బాబు. కానీ ఎందుక‌నో ఆయ‌న మౌన‌ముద్ర‌లో ఉన్నారు. ప్ర‌జా వ్య‌తిరేక చ‌ర్య‌ల్ని క‌ట్ట‌డి చేయ‌డంలో బాబు స‌ర్కార్ విఫ‌ల‌మైంద‌నే విమ‌ర్శ‌కు చోటు క‌ల్పించారు. అప‌ర చాణ‌క్యుడు ఏమ‌య్యాడు? ఎక్క‌డికి పోయాడ‌నే ప్ర‌శ్న‌కు స‌మాధానం లేదు. ఎందుకంటే, రాజ‌కీయంగా వైసీపీని ఎదుర్కోవ‌డ‌మే టీడీపీకి స‌వాల్‌గా మారింది. అందుకే జ‌న‌సేన‌, బీజేపీని క‌లుపుకుని ఎన్నిక‌ల్లో టీడీపీ పోటీ చేసింది. ఒంట‌రిగా పోటీ ఆలోచ‌నే టీడీపీని భ‌య‌పెడుతుంది. అలాంటిది వైసీపీతో సంబంధం లేకుండానే, సాధార‌ణ వ్య‌క్తుల‌తో గొడ‌వ‌లు పెట్టుకుంటే, వాటిని పెద్ద‌వి చేసుకుంటూ రాజ‌కీయంగా న‌ష్టం చేసుకుంటున్నారు. అందుకే బాలు తెలివితేట‌లు ఏమయ్యాయో అని సొంత‌వాళ్లు కూడా ఆవేద‌న‌తో ప్ర‌శ్నిస్తున్నారు. రాజ‌కీయంగా వైసీపీ ఎటూ దూకుడుపై వుంది. ఇదే సంద‌ర్భంలో బ‌ల‌మైన పౌర స‌మాజం కూడా కూట‌మికి శ‌త్రువుగా త‌యార‌వుతోంది. కూట‌మి ఓట‌మిని కాంక్షిస్తోంది. ఈ ప్ర‌మాదాన్ని గుర్తించ‌క‌పోగా, ఆజ్యం పోస్తున్న‌ట్టు ప్ర‌భుత్వ తీరు వుంది. బాబు ప్ర‌మేయం లేకుండానే, కూట‌మిలోని ముఖ్య నేత‌లు ఎవ‌రికి వారు నియంత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తూ, రాజ‌కీయంగా తీవ్ర న‌ష్టం తీసుకొస్తున్నార‌నే అభిప్రాయం బ‌ల‌ప‌డుతోంది. దీన్ని అదుపు చేసే ప‌రిస్థితి కూడా క‌నిపించ‌డం లేదు. అస‌లు బాబు ఏం చేస్తున్నారో అనే ప్ర‌శ్న‌, ఆయ‌న్ను అభిమానించే వారి నుంచి రావ‌డం గ‌మ‌నార్హం.
5 likes
7 shares

More like this