P.Venkateswara Rao
636 views 8 days ago
#మావిగన్ V #అమరావతి *మావిగ‌న్‌కు జై.. టీడీపీ అఫీషియ‌ల్‌❗* 03.07.2026🎯 మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌తిపాదించిన మావిగ‌న్‌కు కూట‌మి ప్ర‌భుత్వంలో పెద్ద‌న్న పాత్ర పోషిస్తున్న టీడీపీ అధికారికంగా జై కొట్టిందా? అంటే .. ఔన‌ని నెటిజ‌న్లు అంటున్నారు. రానున్న ఎన్నిక‌ల్లో మావిగ‌న్ వ‌ర్సెస్ అమ‌రావ‌తి అని వైఎస్ జ‌గ‌న్ తేల్చి చెప్పిన సంగ‌తి తెలిసిందే. అయితే మావిగ‌న్‌ను గ‌ట్టిగా వ్య‌తిరేకించే సాహ‌సం సీఎం చంద్ర‌బాబునాయుడు, ఆ పార్టీ నేతలు చేయ‌లేక‌పోతున్నారు. తాము చెబుతున్న‌ది కూడా అదే క‌దా అని టీడీపీ స‌న్నాయి నొక్కులు నొక్కుతోంది. తాజాగా ఐ టీడీపీ అఫీషియ‌ల్‌గా రాజ‌ధానిపై పెట్టిన పోస్టే నిద‌ర్శ‌నం. చంద్ర‌బాబు కూడా 12 ఏళ్లుగా జ‌గ‌న్ చెబుతున్న‌దే క‌దా అంటోన్న‌ద‌ని ఐ టీడీపీ అఫీషియ‌ల్ పేజీ ఎక్స్ వేదిక‌గా గుర్తు చేస్తుండ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం. ముందుగా వైఎస్ జ‌గ‌న్ చేసిన మావిగ‌న్ ప్ర‌తిపాద‌నలో ఏముందో తెలుసుకుందాం. కూట‌మి ప్ర‌భుత్వం త‌ల‌పెట్టిన అమ‌రావ‌తి నిర్మాణం …ఎప్ప‌టికీ పూర్తి కాద‌ని వైఎస్ జ‌గ‌న్ తేల్చి చెప్పారు. రాష్ట్రానికి ఆర్థిక భారం త‌ప్ప‌, అది ఎప్ప‌టికీ అభివృద్ధి కాజాల‌ద‌ని ఆయ‌న నిశ్చితాభిప్రాయం. దీని కోసం ల‌క్ష ఎక‌రాలు తీసుకుని, రూ.2 ల‌క్ష‌ల కోట్లు పెట్టుబ‌డి ఎక్క‌డి నుంచి తీసుకొచ్చి వెచ్చిస్తార‌ని ఆయ‌న నిల‌దీస్తున్నారు. పైగా అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రానికి ఇంత భారీ మొత్తంలో రాజ‌ధానిపై ఖ‌ర్చు పెట్ట‌డం అవ‌స‌ర‌మా? అని ఆయ‌న బ‌లంగా వాదిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప్లాన్ బీ కింద మావిగ‌న్ ప్ర‌తిపాద‌న‌ను తెర‌పైకి తెచ్చారు. మ‌చిలీప‌ట్నం – విజ‌య‌వాడ – గుంటూరు (మావిగ‌న్‌) 110 కిలోమీట‌ర్ల కారిడార్‌ను రాజ‌ధాని ప్ర‌క‌టించాల‌ని జ‌గ‌న్ కోరారు. మ‌చిలీప‌ట్నం వ‌ద్ద పోర్ట్‌, అలాగే గ‌న్న‌వ‌రం వ‌ద్ద అంత‌ర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌, 110 కిలోమీట‌ర్ల ప‌రిధిలో రెండు ఆరు లైన్ల జాతీయ ర‌హ‌దారులు, విజ‌య‌వాడ‌, గుంటూరుల‌లో రెండు అతిపెద్ద‌ రైల్వే జంక్ష‌న్లు.. మావిగ‌న్‌లో ఉండ‌డాన్ని జ‌గ‌న్ ప్ర‌త్యేక గుర్తు చేస్తున్నారు. మావిగ‌న్‌లో నాలుగు కార్పొరేష‌న్లు, 60 ల‌క్ష‌ల జ‌నాభా వుంది. గ‌ల‌గ‌ల‌పారే కృష్ణా న‌ది, పోల‌వ‌రం కుడి కాల్వ ద్వారా ఇప్ప‌టికే జ‌ల‌సిరి. విజ‌య‌వాడ‌లోని ఎన్టీటీపీఎస్‌, పోల‌వ‌రంలో 960 మెగావాట్ల జ‌ల విద్యుత్ ప్రాజెక్ట్ ద్వారా మావిగ‌న్‌కు పుష్క‌లంగా విద్యుత్‌. అందుకే మావిగ‌న్‌ను రాజ‌ధానిగా ఎంచుకుంటే కేవ‌లం ప‌ది శాతం మాత్రమే ప్ర‌భుత్వం ఖ‌ర్చు పెడితే, మిగిలిన 90 శాతం పెట్టుబ‌డి ప్ర‌జ‌లే స్వ‌చ్ఛందంగా పెడ‌తార‌ని, త‌ద్వారా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు అప్పుల భారం త‌ప్పుతుంద‌ని వైఎస్ జ‌గ‌న్ ఉద్దేశం. ఈ నేప‌థ్యంలో ఐ టీడీపీ అఫీషియ‌ల్‌గా ఆస‌క్తిక‌ర విష‌యాలు తెరపైకి తీసుకొచ్చింది. అదేంటో తెలుసుకుందాం. “CRDA మాస్టర్ ప్లాన్ ఇది .. ప్రపంచ బ్యాంక్ కి ఇచ్చిన డాక్యుమెంట్ ..గుంటూరు – జగ్గయ్యపేట – నూజివీడు – మచిలీపట్నం ..విజయవాడ Airport కి 30 KM .. మచిలీపట్నం పోర్టుకి 68 KM .. 12 ఏళ్లుగా @ncbn గారు చెప్పేది ఇదే కదా ..?మరి ” MAVIGUN ” అంటే ఏంటి ?ఈ ప్రాంతాలలో కాకుండా గాల్లో కడతారా?” ఇదే సంద‌ర్భంలో మ్యాప్‌ను, ప్ర‌పంచ బ్యాంక్‌కు స‌మ‌ర్పించిన నివేదిక‌లో మావిగ‌న్‌ను బ‌ల‌ప‌రిచే అంశాలే ఉన్నాయ‌న్న‌ట్టు టీడీపీ ప్ర‌చారంలోకి తీసుకురావ‌డం విశేషం. అమరావతి కృష్ణా నది ఒడ్డున, గుంటూరు జిల్లాలోని మూడు మండలాలైన (తుళ్ళూరు, మంగళగిరి, తాడేపల్లి) 25 గ్రామాల్లో 217.23 చదరపు కిలోమీటర్ల (53,748 ఎకరాల) విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ సుమారు లక్ష జనాభా (39,000 కుటుంబాలు) నివసిస్తుంది. వ్యాపార కేంద్రమైన విజయవాడ (3 కిలోమీటర్ల దూరంలో), విద్యా కేంద్రమైన గుంటూరు (18 కిలోమీటర్ల దూరంలో) మధ్య వ్యూహాత్మకంగా ఉంది. ఈ నగరం జాతీయ రహదారుల (NH 16: కోల్‌కతా-చెన్నై, NH 65: పూణే-మచిలీపట్నం, NH 30: జగదల్‌పూర్-విజయవాడ) ద్వారా అనుసంధానించారు. దక్షిణ భారతదేశంలో రెండవ అతిపెద్ద నది అయిన కృష్ణా నది ఒడ్డున అమ‌రావ‌తి ఉంది. జాతీయ జలమార్గం అభివృద్ధికి అనువుగా ఉంది. ఇది 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉంది. అలాగే రాబోయే మచిలీపట్నం పోర్టుకు 68 కిలోమీటర్ల పరిధిలో ఉండటం వల్ల, వాణిజ్యానికి ఎంతో అనువుగా వుంటుందని పేర్కొన్న‌ట్టు ప్ర‌చారంలోకి తీసుకురావ‌డం గ‌మ‌నార్హం. టీడీపీ ప్ర‌చారాన్ని చూస్తే.. అమ‌రావ‌తి కూడా మావిగ‌న్‌లో వుంద‌ని బ‌లంగా చెప్ప‌ద‌లుచుకుంది. కానీ ఆ విష‌యాన్ని వైఎస్ జ‌గ‌న్‌, ఆయ‌న పార్టీ నాయ‌కులు అస‌లు ఒప్పుకోవ‌డం లేదు. అమ‌రావ‌తి, మావిగ‌న్ వేర్వేర‌ని వైఎస్ జ‌గ‌న్ రెండు రోజుల క్రితం మ‌రింత బ‌లంగా చెప్పారు. అంతేకాదు, మావిగ‌న్ అనేది త‌మ ఎన్నిక‌ల ఎజెండాగా వుంటుంద‌ని ఆయ‌న కుండ‌బ‌ద్ధ‌లు కొట్టారు. అమరావ‌తిలో అవినీతికి తాము వ్య‌తిరేకం అన్న‌ట్టుగా, మావిగ‌న్‌ను స‌మ‌ర్థించ‌లేమ‌ని చంద్ర‌బాబుతో సహా టీడీపీ నాయ‌కులెవ‌రూ ధైర్యంగా చెప్ప‌లేక‌పోతున్నారు. అమ‌రావ‌తిని ఎవ‌రూ క‌ద‌ల్చ‌లేర‌ని మాత్ర‌మే టీడీపీ నాయ‌కులు వ్యూహాత్మ‌కంగా మాట్లాడుతున్నారు. అయితే మావిగ‌న్ గురించి చ‌ర్చించ‌డానికి, దాన్ని వ్య‌తిరేకించ‌డానికి టీడీపీలో భ‌యాన్ని చూడొచ్చు. దీన్ని బ‌ట్టి మావిగ‌న్ ఎంత‌గా ప్ర‌భావితం చూపుతున్న‌దో అర్థం చేసుకోవ‌చ్చు. మావిగ‌న్‌లో ఏ విష‌యాలైతే వైసీపీ చెబుతున్న‌దో, అవే క‌దా చంద్ర‌బాబు చెబుతున్నారని టీడీపీ ప్ర‌చారం చేయ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం. అమ‌రావ‌తా? మావిగ‌నా?… ఏదో కావాలో తేల్చుకోవాల‌ని జ‌గ‌న్ పిలుపు ఇచ్చారు. అయితే ఆ రెండు వేర్వేరు కాద‌ని చెప్ప‌డానికే టీడీపీ మొగ్గు చూపుతోంది. మావిగ‌న్‌పై వైసీపీ దూకుడు పెంచ‌డానికి టీడీపీ ప్ర‌చారం కూడా కార‌ణం అవుతోంది. ఏది ఏమైనా రాజ‌ధాని విష‌యంలో వైఎస్ జ‌గ‌న్ ఎత్తుకున్న మావిగ‌న్‌… టీడీపీని క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తోంద‌న్న‌ది నిజం. అందుకే జ‌గ‌న్ ప్ర‌స్తావిస్తున్న అంశాల‌కు, ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌కుండా, సంబంధం లేని వాటిని చ‌ర్చ‌కు పెట్టి, త‌న‌దైన డైవ‌ర్ష‌న్ రాజ‌కీయాలు చేస్తోంది. అయితే అది ఎంత వ‌ర‌కు రాజ‌కీయంగా పైచేయి సాధిస్తుందో చూడాలి.
10 likes
11 shares

More like this