#చంద్రబాబు #🟡తెలుగుదేశం పార్టీ
*బాబును భయపెడుతున్న నివేదికలు⁉️*
29.06.2026🎯
ఇది ఎన్నికల సమయం కాదు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంది. ఇంకా మూడేళ్ల అధికారం చేతిలో వుంది. ఏ ప్రభుత్వ మనుగడైనా పాలనపై ఆధారపడి వుంటుంది. మంచి పరిపాలన అందిస్తే, ప్రజలు నెత్తిన పెట్టుకుంటారు. రాజకీయాల్లో అధికారంలోకి రావడానికి, అలాగే దిగిపోవడానికి పరిపాలనే ప్రధాన కారణం. ప్రజల అభిమానాన్ని చూరగొంటే ఎన్ని సంవత్సరాలైనా అధికారంలో కొనసాగొచ్చు.
ఎన్నికల వేళ ప్రత్యర్థులపై విమర్శలు చేయొచ్చు. ప్రత్యర్థులకు అధికారం ఇస్తే, రాష్ట్రం లేదా దేశం ఏమవుతుందో వాస్తవాలు చెప్పి, తమను ఎన్నుకుంటే ఎలా వుంటుందే అంత వరకూ సాగించిన పాలనను ఉదహరించొచ్చు. అప్పుడు ప్రజలు ఎవరేమిటో, నిజానిజాలేంటో బేరీజు వేసుకున్ని ఎన్నికల్లో తీర్పు ఇస్తారు.
కానీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి భయం పట్టుకున్నట్టుంది. ఇప్పుడేదో ఎన్నికలు వస్తున్నట్టుగా, మళ్లీ జగన్ను ఎన్నుకుంటే అంటూ ప్రజల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తన భయాన్ని ప్రజలపై రుద్దుతున్నారనే చర్చకు తెరలేచింది. వైసీపీని మళ్లీ ఎన్నుకుంటే అభివృద్ధి ఆగిపోతుందని చంద్రబాబు అంటున్నారు. వైకుంఠపాళీలో మాదిరిగా రాష్ట్ర పరిస్థితి తయారవుతుందని ఆయన పదేపదే హెచ్చరిస్తున్నారు.
సభ, సమయం, సందర్భం ఏవైనా, వైసీపీ అధినేత వైఎస్ జగన్, ఆ పార్టీ నేతల్ని తీవ్రంగా తిట్టిపోయడమే ఏకైక ఎజెండాగా చంద్రబాబు పెట్టుకున్నారు. వైఎస్ జగన్ వైపు ఆలోచించొద్దని ఆయన కోరుతున్నారు. ఇంకా కొందరు జగన్ వైపు చూస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబు మాటలు వింటే, ఎన్నికల ప్రచారాన్ని గుర్తు చేస్తోంది. మంచి పరిపాలన చేయవయ్యా అని అపరిమితమైన అధికారాన్ని ఆయన చేతిలో పెట్టారు. చంద్రబాబు మాత్రం…
అధికారంలోకి వచ్చిన మొదలు మళ్లీ జగన్ వస్తే అని తన భయాన్ని ప్రజలపై రుద్దుతూ, ఏదో జరుగుతోందన్న అనుమానాన్ని కలిగిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఐవీఆర్ఎస్, అలాగే పలు సర్వే సంస్థలతో ఆయన జనం నాడి తెలుసుకున్నారు.
వాటన్నింటిలోనూ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నివేదికలు వచ్చినట్టు తెలుస్తోంది. రెండేళ్ల పాలనకే ఈ స్థాయిలో ఒక ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించడం, మాట్లాడుకోవడం ఇదే మొదలు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
వ్యతిరేకతకు ప్రధాన కారణం… కూటమి ప్రజాప్రతినిధుల దోపిడీ, దౌర్జన్యాలు, పరిపాలనను వాళ్ల చేతుల్లోకి తీసుకోవడం. ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే రకమైనా రాజకీయ వాతావరణం నెలకుంది. చంద్రబాబే స్వయంగా పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పిన తర్వాత, అధికారులు వాళ్ల పని చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది.
గ్రామస్థాయి నాయకులు సైతం అధికార మదంతో విరవీగిపోతున్నారు. సచివాలయాల్లో కూడా ఉద్యోగుల్ని స్వచ్ఛంగా, నిబంధనలకు అనుగుణంగా పని చేయనివ్వడం లేదు. తమకు గిట్టని వారి పనుల్ని అడ్డుకుంటున్నారు.
అలాగే ప్రకృతి వనరుల్ని విచ్చలవిడిగా దోచుకుంటున్నారు. ఏ నియోజకవర్గంలో చూసినా ఏమున్నది గర్వకారణం అనే రీతిలో ప్రజాప్రతినిధుల విచ్చలవిడితనం కనిపిస్తోంది.
క్షేత్రస్థాయిలో ఏం జరుగుతున్నదో తెలిసి కూడా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ పట్టించుకునే పరిస్థితిలో లేనట్టుంది.
అప్పుడప్పుడు కొంత మంది ప్రజాప్రతినిధులపై సీరియస్ అయ్యినట్టు అనుకూల పత్రికల్లో కథనాలు వస్తుంటాయి. అదే నిజమైతే, రోజురోజుకూ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎందుకు పేట్రేగిపోతారో సమాధానం చెప్పాలి.
తన వాళ్లు మాత్రం ప్రజల్ని పట్టి పీడుస్తుంటారని, జనం మాత్రం ప్రత్యర్థుల వైపు సానుకూల ధోరణితో చూడొద్దని చంద్రబాబు కోరుకోవడం విడ్డూరంగా వుంది. తన నేతృత్వంలో మంచి పరిపాలన సాగిస్తుంటే, ఇంకో వైపు ప్రజలు ఎందుకు చూస్తారని చంద్రబాబు ప్రశ్నించుకోవడం లేదు. ఏమీ తెలియని అమాయకులైతే చెప్పొచ్చు.
అపరచాణక్యుడిగా పేరొందిన చంద్రబాబు పదేపదే భయాన్ని ప్రదర్శించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
వైసీపీని గొడ్డలి పార్టీ అని విమర్శించడం ద్వారా ప్రజలంతా భయంతో ఆ పార్టీకి దూరం అవుతారని అనుకోవడం భ్రమే.
పరిపాలన తప్ప, ప్రజలు తమ విమర్శలు పట్టించుకోరని చంద్రబాబు గమనంలో పెట్టుకోవాలి. మంచి పరిపాలన చేయడం ద్వారా మాత్రమే, రాజకీయ ప్రత్యర్థులకు అధికారం దక్కకుండా చేయొచ్చని చంద్రబాబు గుర్తించుకోవాలి.
అలా కాకుండా తాము మాత్రం ఇష్టానుసారం చేస్తామని, ప్రజలు మాత్రం ఆదరించాలని కోరుకుంటే, ఆశించిందేదీ జరగదని గతానుభవాలు చంద్రబాబును హెచ్చరిస్తున్నాయి.
చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత మహాదేవ అని పెద్దలు ఊరికే చెప్పలేదు. మంచైనా, చెడైనా ప్రజలెప్పుడూ పాలకుల రుణాన్ని వుంచుకోరు.


