Panduranga Reddy kappati
766 views • 5 days ago •
*పరమోత్తమం మధురభక్తి.....*
శ్రవణ, కీర్తన, స్మరణ, పాదసేవన, అర్చన, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదన అను నవవిధ భక్తిమార్గాలనే గాక వాత్సల్యభక్తి మధురభక్తి అనే మరో రెండు భక్తి విధానాలు కూడా ఉన్నాయి. మధుర భక్తిని గానీ వాత్సల్యభక్తిని గాని అలవర్చుకుంటే సమదృష్టి ఏర్పడుతుంది. అనిర్వచనీయమైన ఆనందం నిలిచి ఉంటుంది. వాటిని గురించి తెలుసుకొందాం.
వాత్సల్య భక్తిలో భగవానుని తమ బిడ్డగా భావిస్తారు. ప్రత్యక్షంగా శ్రీరాముని కనిన కౌసల్యా దశరథులు, శ్రీకృష్ణుని పొందిన వసుదేవ దేవికీదేవిలను తమ భక్తిని వాత్సల్యరూపంలో ప్రకటించారు. అంటే వీరు ఆ భగవానుని బిడ్డగా భావించి, ఉపాసన చేసి బాల రూపంలో ఆ భగవంతుని సాక్షాత్కరింపజేసుకున్నా రు. ఇటువంటివారిలో శివపురాణం లో బెజ్జమహాదేవి ఒకరు. ఈవిడ శివుడిని కన్నబిడ్డగా భావించి లాలించేది. జట ధారి, శ్రీరామకృష్ణపరమహంస, అఘోరమణి, సూరదాసు మొదలైన వాత్సల్య భక్తిని కలిగిన వారే.
జటధారి సన్యాసి. ఆయన వద్ద ఒక చిన్న రామ్ లాల్ విగ్రహం ఉండేది. బాలరాముడు ఆయన వెనుక గంతులు వేస్తూ తిరిగేవాడట. ప్రతిదినం బాలరాముని స్నానం చేయించడం, ఎత్తుకొని లాలించడం, అన్నం తినిపించడం చేసేవాడు జటధారి. ఇది ఆయన వాత్సల్య భావోపాసనా ఫలితమని oచెబుతారు.
శ్రీరామకృష్ణ పరమహంస ఎంతో సాధన చేసి బాలరాముని, నందకిశోరుని ప్రత్యక్షం చేసుకున్నాడు. వారిని తన ఒడిలో కూర్చుండ బెట్టుకొని లాలించి ఆడుకున్నాడు. ఈ వాత్సల్య భావంతో భగవంతుడు పసివాడై భక్తుని ఒడిలో ఒదిగి చిలిపి పనులతో ఆ భక్తుని అలరింపజేసి ఆనందాన్నిస్తాడు. అఘో రమణి దేవి బాలకృష్ణుని ఉపాసకురాలు. ఆ బుల్లికృష్ణుడు ఎల్లప్పుడూ ఆమెను అంటిపెట్టు కొని వుంటూ అలరించేవాడట. బాలకృష్ణుని మీద అంత వాత్సల్యం చూపించిన ఆమె ఎంత ధన్యాత్మురాలో! నేటికీ ఇటువంటి భక్తికలవాళ్లు కలియుగంలోను ఉన్నారు. వీరంతా భగవంతుడని తమ బిడ్డగా భావించి
పూజిస్తుంటారు. ఇక మధుర భక్తిలో అలౌకికమైన అరమరికలు లేని సంబంధం ఉంది. భగవంతుని భర్తగా ఆరాధించడం, భగవానుడు భరించువాడని- భరింపబడువాడు భక్తుడని అంటారు. భగవంతుడొక్కడే పురుషోత్తముడనీ, జీవులందరూ స్త్రీలని- అంటే జీవులెల్లరూ భరింపబడువారనీ అసలు అంతరార్థం. ఈ బంధాన్ని భార్యాభర్తల సంబంధంతో అన్వయం చేశారు. నదులు ఏ విధంగా తమ నామ రూపాదులను విడిచి సముద్రంలో లీనం అవుతున్నాయో అదేవిధంగా జీవులంతా తమ నామ రూపాలను త్యజించి బ్రహ్మానంద సాగరంలో చేరుతారని వర్ణించింది శాస్త్రం.
అందుచేత ఈ భక్తి భగవానుల సంబంధం అనిర్వచనీయమైనదని చెప్పాలి. భగవంతుని భర్తగా భావించి ఆరాధించిన వారిలో అత్యున్నత స్థానాన్ని అందుకున్నది మీరా సాధ్వి. వివాహం యొక్క అర్థం తెలియని చిన్ని వయస్సులో ఒక పెళ్ళి ఊరేగింపును చూసింది బాల మీరా. అదేమిటని పెద్దలను ప్రశ్నించి, సమాధానం రాబట్టుకొని తనకు కూడా భర్త కావాలని పేచీ పెట్టింది. ఆ గొడవ భరించలేక పెద్దలు ఓ చిన్న కృష్ణవిగ్రహాన్ని భర్త అని చెప్పి ఆ పసిమీరాబాయికి అందించారు.
నాటి నుండి తన భర్త ఆ గోపాలుడే అని గాఢంగా, త్రికరణశుద్ధిగా ఆమె విశ్వసించింది. ఆమె భావనను పెద్దలు పట్టించుకోలేదు.
ఆమె బాల్యాన్ని వదిలి యవనంలోకి వచ్చిన తరువాత అందరి తల్లిదండ్రుల వలె మీరాబాయి తల్లిదండ్రులు ఆమెకు ఓ యువకుడిని చూసి వివాహం చేశారు. అయినా ఆమె మాత్రం కృష్ణుడే తన పతి అని ధృడంగా నమ్మింది. నమ్మడమేకాక కృష్ణుడినే సేవించింది. ఆమె ఏ లౌకిక సుఖాలను, లౌకిక సంపదలనూ ఆశించలేదు. ఒకసారి ఆమె భక్తిని భరించలేనివారు ఆమెకు విషం ఇవ్వాలనుకొన్నారు. ఇచ్చారు. ఆ విషాన్ని కూడా గిరిధారికి సమర్పించి ఆయన ప్రసాదంగా ఆమె స్వీకరించింది. భగవంతుని ప్రసాదరూపంలో వచ్చిన తరువాత విషం అయినా అమృతమైనా ఒక్కటే కదా. అందుకే ఆ విషం కూడా మీరాకు అమృతోపానంగా అనిపించింది. అప్పుడు ఆమె విరోధులకు ఆమె భక్తి అంటే ఏమిటో అర్థమయింది.
ఆ మురళీమోహనుని, ఆ నందకిశోరుని గూర్చి 'మీరాకే ప్రభు' అని మీరాకే ప్రభూ అంటూ ఆ గిరిధరబాలుని కీర్తించింది. అనేక కీర్తనలు రచించి, భక్త మీరాబాయిగా తన జీవితానికి ధన్యతను కలిగించుకొన్నది. ఆమె భక్తికి మెచ్చి, ఆమె పాటలకు ముగ్ధుడైన నంద నందనుడు మీరాబాయికి ముక్తిని అనుగ్రహించాడు.
*ఈ మధుర భక్తిలోని మధుర రసాస్వాదన చేసేవారు, వాత్సల్య భక్తిలో ఓలలాడేవారు ధన్యులు.*
┈┉┅━❀꧁హరేకృష్ణ꧂❀━┅┉┈
https://whatsapp.com/channel/0029Vb71iJ17dmeRkd4QTe1a
#🌞శుభ మధ్యాహ్నం #కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy) #శ్రీకృష్ణ #😃మంచి మాటలు #భక్తి
18 shares