జీవుడు దేహంలోకి ఎలా ప్రవేశిస్తాడు? . జీవుడు వాసనలు ఎలా తగిలించుకుంటాడు? జీవుడు అన్నం ద్వారా తండ్రి శరీరంలోకి ప్రవేశించి, శుక్రకణం ద్వారా తల్లి గర్భంలోకి చేరి, తొమ్మిది నెలలు పెరిగి ఈ లోకంలో జన్మిస్తాడు. పుట్టినప్పుడు అతనికి ఈ జన్మలోని సంబంధాల గురించి ఎలాంటి జ్ఞాపకం ఉండదు. కానీ జీవుడు ఖాళీగా రాడు. గత జన్మల సంస్కారాలు, వాసనలు సూక్ష్మరూపంలో అతనితో ఉంటాయని శాస్త్రాలు చెబుతాయి. పుట్టిన తర్వాత జీవుడు చూసే దృశ్యాలు, వినే మాటలు, తినే ఆహారం, చేసే పనులు, కలిసే మనుషులు, అనుభవించే సుఖదుఃఖాలు అన్నీ మనస్సులో ముద్రలు వేస్తాయి. ఆ ముద్రలే సంస్కారాలు. ఒకే విషయాన్ని పదేపదే ఆలోచించడం వల్ల అది మమకారంగా మారుతుంది. ఆ మమకారం బలపడితే అదే వాసన అవుతుంది. ఈ వాసనే మరణం తరువాత కూడా జీవునితో పాటు కొనసాగుతాయి. ఉదాహరణకు ఒక దంపతులు ప్రేమతో వివాహం చేసుకున్నారు. కొంతకాలానికి భార్య గర్భవతి అయిందని తెలిసింది. అప్పటివరకు కేవలం భర్త, భార్య మాత్రమే ఉన్నారు. గర్భం ఉందని తెలిసిన క్షణం నుండి ఇంకా పుట్టని బిడ్డపై ప్రేమ మొదలవుతుంది. నెలలు గడిచే కొద్దీ ఆ ప్రేమ పెరుగుతుంది. బిడ్డ పుట్టిన తర్వాత ఆ ప్రేమ మరింత బలపడుతుంది. బిడ్డ నడవడం, మాట్లాడడం, చదవడం, ఎదగడం ప్రతి దశలో తల్లిదండ్రుల మమకారం పెరుగుతూనే ఉంటుంది. ఈ ప్రేమ జీవితాంతం కొనసాగుతుంది. మరణ సమయంలో కూడా మనస్సు అదే బిడ్డ గురించే ఆలోచిస్తూ ఉంటే, ఆ మమకారం వాసనగా జీవునితో పాటు ఉంటుంది. అందువల్ల ఆ జీవుడు ఆ బంధాన్ని వెంటనే విడిచిపెట్టలేడు. ఇదే భావాన్ని భగవద్గీతలో కూడా "అంత్యకాలంలో ఏ భావంతో శరీరాన్ని విడిచిపెడతాడో, ఆ భావానికే సంబంధించిన గతి పొందుతాడు" అని వివరిస్తుంది. అలాగే ధనం విషయంలో కూడా ఇదే జరుగుతుంది. జీవితమంతా డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకొని, "నా డబ్బు, నా సంపద" అనే భావంతో జీవించిన వ్యక్తి మరణ సమయంలో కూడా అదే ఆలోచనలో ఉంటే, ఆ ధనాసక్తి వాసనగా కొనసాగుతుంది. ఆస్తి విషయంలో కూడా అలాగే. "ఈ ఇల్లు నాది, ఈ పొలం నాది, ఈ భూమి నాది" అనే భావం ఎంత బలంగా ఉంటే, అంత బలమైన మమకారం ఏర్పడుతుంది. శరీరం పోయినా ఆ భావన వెంటనే పోదు అని వేదాంతం చెబుతుంది. అధికారం, పేరు, కీర్తి, పదవి, కుటుంబం, స్నేహితులు, శత్రుత్వం, కోపం, కామం, లోభం—ఏది ఎక్కువగా మనస్సులో నిలిచిపోతుందో అదే వాసనగా మారుతుంది. చిన్నప్పటి నుండి సంగీతంపై ప్రేమ పెంచుకున్న వ్యక్తికి సంగీత వాసన బలంగా ఉంటుంది. ఎప్పుడూ దైవస్మరణ చేసే భక్తునికి భక్తి వాసన ఏర్పడుతుంది. మద్యానికి బానిసైనవాడికి ఆ వ్యసన వాసన కొనసాగుతుంది. సేవాభావంతో జీవించినవాడికి దయ, కరుణ వాసనలు బలపడతాయి. ఎప్పుడూ ఇతరులకు సహాయం చేసినవాడికి సేవాసంస్కారం కొనసాగుతుంది ఎప్పుడూ జ్ఞానాన్ని కోరుకున్నవాడికి జ్ఞాన వాసన పెరుగుతుంది. భోగాలపైనే మనస్సు నిలిపినవాడికి భోగవాసన బలపడుతుంది అందుకే వస్తువులను ఉపయోగించాలి కానీ వాటిపట్ల బంధం పెంచుకోకూడదు. కుటుంబాన్ని ప్రేమించాలి కానీ అది బంధనంగా మారకూడదు. ధనాన్ని సంపాదించాలి కానీ ధనదాసుడిగా మారకూడదు. ఆస్తిని కాపాడాలి కానీ "ఇదే నేను" అనే అహంకారం పెంచుకోకూడదు. ఒక గుడ్డ ముక్కలో ఎండిపోయిన చేపలను మూట కట్టి ఓ నాలుగు రోజులు ఉంచండి అ తరువాత ఎండు చేపలని ఆ గుడ్డ నుండి చేపలని తీసివేయండి ఆ వాసన కొన్ని రోజులు అలాగే ఉంటుంది ఆ గుడ్డ ముక్కకు ఎంత ఉతికినా ఆ చేపల వాసన పోదు చాలా రోజులకు ఆ వాసన పోతుంది శుభ్రం చేయగా చేయగా మరి జీవుడు కొన్ని కోట్ల జన్మల నుండి ఇ దేహాలనీ పొందుతూ విడిచిపెడుతూ ఎన్నో జన్మలు ఎత్తుతూ తిరుగుతూ ఉంటున్నాడు అంత తొందరగా ఈ దేహ వాసన జీవుడికి పోతుందా జీవుడికి దేహ వాసన పోవాలి అంటే ఎన్ని రోజులు శుభ్రం చేయాలి శుభ్రపరిచే వస్తువు ఏది ? అదే భగవద్గీత పురాణాలు వేదములు ఉపనిషత్తులు రామాయణం భారతం భాగవతం అలవాటు చేయాలి మమకారం ఎంత తక్కువగా ఉంటే మనస్సు అంత స్వేచ్ఛగా ఉంటుంది. మనస్సు ఎంత నిర్మలంగా ఉంటే వాసనలు అంత క్షీణిస్తాయి. వాసనలు క్షీణించినప్పుడు జననమరణ చక్రం నుండి విముక్తి పొందే మార్గం సులభమవుతుంది. అందువల్ల ప్రతి మనిషి తనను తాను ప్రశ్నించుకోవాలి "నేను ఏమి తీసుకెళ్తాను?" శరీరాన్ని కాదు, ధనాన్ని కాదు, ఆస్తిని కాదు, బంధువులను కాదు. తనతో వెళ్లేది తాను పెంచుకున్న సంస్కారాలు, వాసనలు మాత్రమే అని వేదాంతం బోధిస్తుంది. కాబట్టి ప్రేమను పవిత్రంగా ఉంచాలి, కర్తవ్యాన్ని నిష్కామంగా చేయాలి, మమకారాన్ని తగ్గించాలి, దైవస్మరణను పెంచాలి. అప్పుడు వాసనలు క్రమంగా క్షీణించి జీవుడు పరమశాంతి వైపు పయనిస్తాడు. #తెలుసుకుందాం
24 likes
17 shares

More like this