*విపక్షాల #సోషల్ మీడియా ఖాతాలపై ఎందుకంత కక్ష❓*
15.06.2026🎯
విపక్షాల సోషల్ మీడియా ఖాతాలపై పాలకులు కక్ష కట్టారు. ఈ మధ్య కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియా ఖాతాలను సీజ్ చేయడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. తాజాగా వైసీపీ ఫేస్బుక్ అధికారిక ఖాతాను స్తంభింపజేయడం చర్చనీయాంశమైంది.
తమకు నచ్చని అంశాలేవీ లోకానికి తెలియకూడదనే పాలకుల ధోరణులు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రధాన మీడియా అంతా పాలకుల గుప్పిట్లో వుంటున్న సంగతి తెలిసిందే. జాతీయ స్థాయిలో మీడియా వ్యవహార శైలిపై తీవ్ర చర్చ నడుస్తోంది.
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, టీడీపీ మీడియా అత్యంత శక్తిమంతంగా వుంది. అయితే అదే స్థాయిలో సోషల్ మీడియా కూడా బలీయమైన పాత్రను పోషిస్తోంది. ఏపీలో కూటమి ప్రజా వ్యతిరేక విధానాల్ని, అలాగే ప్రభుత్వానికి కొమ్ము కాసే మీడియా ఒంటెత్తు పోకడల్ని సోషల్ మీడియాలో తటస్థ జర్నలిస్టులు చీల్చి చెండాడుతున్నారు.
అలాంటి వాళ్ల వాయిస్ వినిపించకూడదనే దురుద్దేశంతో అధికారాన్ని అడ్డంపెట్టుకుని పాలక వర్గాలు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. కానీ అది సాధ్యం కావడం లేదు. సోషల్ మీడియాలో ప్రజాగళాల్ని వినిపించకూడదనే ప్రయత్నం, అరచేతిని అడ్డం పెట్టి, సూర్యోదయాన్ని ఆపాలని అనుకున్నట్టుగా ఉంది.
ఈ నేపథ్యంలో ఏపీలో బలమైన రాజకీయ పార్టీ వైసీపీకి చెందిన ఫేస్బుక్ అఫీషియల్ ఖాతాను స్తంభింపజేయడంపై ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా తప్పు పట్టారు. భారతదేశంలో వైసీపీ ఖాతాను చూడకుండా చేయాల్సిన అవసరం ఎవరికి, ఎందుకొచ్చిందనేదే ఇప్పుడు ప్రశ్న.
ఈ మధ్య కాలంలో అమరావతి రాజధానిలో దోపిడీ, డీఎస్సీలో అక్రమాలు ఇతరత్రా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ సోషల్ మీడియా వేదికగా బలంగా పని చేస్తోంది. దీంతో కూటమి ప్రభుత్వం తనకు రాజకీయంగా తీవ్రమైన నష్టం వాటిల్లుతున్నట్టు భావిస్తోంది. ఆ భయం నుంచే తమ ప్రధాన రాజకీయ ప్రత్యర్థి సోషల్ మీడియా ఖాతాను కనిపించకుండా చేయాలని కుట్రకు పాల్పడినట్టు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఇలాంటి చర్యలతో భావ ప్రకటనను అడ్డుకోవాలని అనుకోవడం దుర్మార్గం. తమ సంకుచిత, నియంత బుద్ధిని బయట పెట్టుకోవడం తప్ప, సాధించేదేమీ వుండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రత్యర్థులు మరింత బలంగా, వేర్వేరు మార్గాల్లో తమకు వ్యతిరేకంగా పని చేస్తారని గుర్తించాలి.
కాక్రోచ్ జనతా పార్టీ గళాన్ని అణచివేయాలనుకుని, చివరికి బలపడేలా చేసిన ఘనత మోదీ సర్కార్కే దక్కుతుంది. కాక్రోచ్లు చివరికి హైదరాబాద్ వరకూ వచ్చారు. రేపు మారుమూల గ్రామానికి కూడా వాళ్లు రారని గ్యారెంటీ లేదు. పైపెచ్చు అణచివేత చర్యలతో మరింత కసి, పట్టుదల పెంచుతున్నారు.
ఇప్పటికైనా పాలకులు తమకు వ్యతిరేక అభిప్రాయాల్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి.
అందులో సహేతుక అంశాలుంటే మార్పు చేసుకోవాలి. అంతేగానీ, తమకు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకూడదని అనుకుంటే, మరింత పెరగడమే తప్ప తగ్గదని గుర్తించాలి. అధికారంలో ఉన్నోళ్లకు తప్పుల్ని సరిదిద్దుకునే మంచి అవకాశం వుంటుంది. అంతే తప్ప, ఇతరుల భావ ప్రకటనను అణచివేయాలన్న చెడు సంప్రదాయానికి శ్రీకారం చుట్టడం ఎంత మాత్రం మంచిదికాదు.


