Mahbubnagar Police
10K views • 19 days ago
మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యం – యువతే సమాజానికి మార్గదర్శకులు: జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్
తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఎస్వీఎస్ డెంటల్ కళాశాలలో మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం
తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా ఎస్వీఎస్ డెంటల్ కళాశాలలో మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ హాజరై విద్యార్థులను ఉద్దేశించి అవగాహన సందేశాన్ని అందించారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఈగల్ ఫోర్స్ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో పాటు ప్రత్యేక అవగాహన వీడియోలను ప్రదర్శిస్తూ మాదకద్రవ్యాల బారిన పడిన వ్యక్తుల జీవితాలు ఎలా నాశనమవుతాయో, కుటుంబాలు, స్నేహితులు, సమాజంపై వాటి ప్రభావం ఎలా ఉంటుందో విద్యార్థులకు వివరించారు.
అనంతరం జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి గారు మాట్లాడుతూ యువత తమ భవిష్యత్తును నిర్మించుకునే కీలక దశలో మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాల వ్యసనం కారణంగా వ్యక్తి తన ఆరోగ్యం, కుటుంబం, స్నేహితులు, విద్య, ఉపాధి అవకాశాలు, సమాజంలో గౌరవం వంటి అమూల్యమైన అంశాలను కోల్పోతాడని తెలిపారు. ప్రతి విద్యార్థి మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడే బాధ్యతను స్వీకరించి, మరొకరికి కూడా అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.
ఎవరైనా మాదకద్రవ్యాలను వినియోగిస్తున్నా, విక్రయిస్తున్నా లేదా రవాణా చేస్తున్నా వెంటనే 1908 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు. మాదకద్రవ్యాల వ్యసనానికి గురైన వారిని శిక్షించడం కాకుండా, అవసరమైతే డి-అడిక్షన్ సెంటర్లకు పంపించి తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని వివరించారు.
అలాగే జూన్ 26, 2026న అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ ఈగల్ ఫోర్స్ వారు నిర్వహించిన పోటీలలో పాల్గొన్న కళాశాల విద్యార్థిని విద్యార్థులకు జిల్లా ఎస్పీ గారి చేతుల మీదుగా విశేష ప్రతిభ కనబరిచిన ముగ్గురు విద్యార్థులకు గోల్డ్, సిల్వర్ మరియు బ్రోన్జ్ మెడల్ అందజేయడమే కాకుండా ఈ పోటీలలో పాల్గొన్న మిగతా విద్యార్థినీ విద్యార్థులకు తెలంగాణ ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ శ్రీ సందీప్ శాండిల్య ఐపీఎస్ గారి అప్రసియేషన్ లెటర్ మరియు యాంటీ డ్రగ్ సోల్జర్స్ సర్టిఫికెట్స్ ప్రధానం చేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా తెలంగాణ ఈగల్ ఫోర్స్ డీఎస్పీ ఎన్.బుచ్చయ్య, ఎస్వీఎస్ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, ప్రిన్సిపల్ దామోదర్ రెడ్డి, అధ్యాపకులు, రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్, ఈగల్ ఫోర్స్ సభ్యులు మరియు సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
#MahabubnagarPolice #📰 వార్తలు
132 likes
83 shares