#ఎల్లో మీడియా.. 💥 #సోషల్ మీడియా
*బాబూ.. ప్రధాన మీడియా అంటే ఇందుకేనా ఇష్టం❓*
12.07.2026🎯
ఏపీ పాలకులకు సోషల్ మీడియా
అంటే మంట, ప్రధాన మీడియా అంటే ఇష్టం. సోషల్ మీడియా అనేది లేకపోతే, ముఖ్యంగా టీడీపీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ప్రశ్నించే దిక్కే వుండదు. ఎందుకంటే, ప్రధాన మీడియా అంతా టీడీపీ నేతల గుప్పిట్లోనే ఉన్న సంగతి తెలిసిందే. ఇదే సోషల్ మీడియాలో అయితే ఎవరో ఒకరు అన్నట్టు ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నిస్తారు, నిలదీస్తారు. అలాంటి వాళ్లకు ప్రజాదరణ వుంటోంది.
రెండు రోజుల క్రితం ఏపీ కేబినెట్ సమావేశంలో ఎక్కువ సమయాన్ని సోషల్ మీడియా కట్టడి చేయడంపైనే వెచ్చించారు. దీన్నిబట్టి సోషల్ మీడియా అనేది ప్రభుత్వానికి ఎంత అడ్డంకిగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఇదే సందర్భంలో ప్రధాన మీడియా అంటే పాలకులకు ఎందుకంత ఇష్టమో చెప్పుకోడానికి మంచి ఉదాహరణ వుంది.
తాజాగా రాజధాని ప్రాంతంలో సీడ్ యాక్సెస్ రహదారి వేయడానికి కొంత స్థలం అవసరమైంది. ఉండవల్లి, పెనుమాక తదితర రాజధాని గ్రామాల రైతులకు రాజధానికి అదనంగా భూములు ఇవ్వడం అసలు ఇష్టం లేదు. ఇప్పటికే సీడ్ యాక్సెస్ రోడ్డు వేయడానికి భూములిచ్చినట్టు వారు ఇప్పటికే చెప్పారు. మరికొందరి రైతుల వాదన మరోలా వుంది. సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం భూములు ఇవ్వడానికి ఎలాంటి ఇబ్బంది లేదని, కానీ అదనంగా అడుగుతున్నారని, దానిపైనే అభ్యంతరం అని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ఉండవల్లిలో బుల్డోజర్లు దిగాయి. పచ్చని పంటల్ని అమానవీయంగా ధ్వంసం చేశారు. కావాల్సిన భూముల్ని రైతుల అంగీకారంతో సంబంధం లేకుండా సీఆర్డీఏ అధికారులు లాక్కున్నారు. ఈ ఘటనకు సంబంధించి చంద్రబాబు రాజగురువుగా భావించే పత్రికలో ఏం రాశారో చూద్దాం.
“రాజధాని అమరావతికి కీలకమైన సీడ్ యాక్సెస్ రహదారి నిర్మాణానికి అడ్డంకి తొలగిపోయింది. అవసరమైన 2.77 ఎకరాల భూమికి అవార్డు పాస్ చేసిన సీఆర్డీఏ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఉండవల్లిలో భూయజమానులు అడ్డుకోగా పోలీసులు వారిని నిలువరించేందుకు ప్రయత్నించారు. మహిళా ఎస్ఐపై ఓ మహిళ చేయి చేసుకున్నా పోలీసులు సహనంతో వ్యవహరించారు. భూముల స్వాధీనం అనంతరం కాంట్రాక్టర్కు అప్పగించగా, వెంటనే చదును పనులు ప్రారంభించారు. ఇప్పటికే ప్రకటనలు ఇచ్చిన గ్రామాల్లోనూ అవార్డు నోటీసులిచ్చి తదుపరి ప్రక్రియ పూర్తి చేయనున్నారు”
మీడియా అంటే ప్రతిపక్ష పాత్ర పోషించాలి. ప్రజల గొంతుకగా నిలబడాలి. బాధితుల ఆవేదన, ఆక్రందనను ప్రపంచానికి చాటి చెప్పాల్సిన మీడియా… అందుకు విరుద్ధంగా ప్రభుత్వ దుశ్చర్యలకు వెన్నుదన్నుగా నిలబడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పైగా భూమి పోగొట్టుకున్న మహిళా రైతు ఆవేదనతో మహిళా ఎస్ఐపై చేయి చేసుకోగా, చాలా గొప్ప మనసుతో పోలీసులు సంయమనం పాటించారని రాశారంటే, వీళ్ల రాతలు ఎవరి ప్రయోజనాల కోసం అర్థం చేసుకోలేనంత అమాయకత్వంలో జనం లేరని నెటిజన్లు చీవాట్లు పెడుతున్నారు.
ఇదిలా వుండగా, మరో టీడీపీ అనుకూల పత్రికలో అయితే అసలు ఆ వార్తే లేకపోవడం గమనార్హం. సదరు పత్రిక యజమాని ఆదివారమైతే చాలు… ప్రపంచం అట్లా, ఇట్లా అంటూ ఆకాశమే హద్దుగా నీతి కబుర్లను అక్షర రాశులుగా పోసి చెబుతుంటారు. అదేంటో గానీ చంద్రబాబు అధికారంలో వుంటే, ప్రజా వ్యతిరేక విధానాల్ని కప్పి పుచ్చడం తమ గురుతర బాధ్యతగా టీడీపీ అనుకూల మీడియా విలువల వలువల్ని యథేచ్ఛగా విడిచి పెట్టి, రాతల్ని వండివార్చుతోంది.
ఇదే సోషల్ మీడియాలో బాధ్యతాయుత జర్నలిస్టులు అమరావతిలో వాస్తవాల్ని ప్రజల ముందు వుంచారు. అందుకే పాలకులకు సోషల్ మీడియా అంటే అసలు నచ్చడం లేదు. ఇంతకాలం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అనుకూల మీడియా ఆడిందే ఆట, పాడిందే పాటగా కొనసాగింది. తాను కూయకపోతే, లోకం తెల్లారదని వెనుకటికి ఓ కోడి పుంజు అనుకున్నదట. టీడీపీ అనుకూల మీడియా తీరు కూడా ఇంతే. తాము రాసిందే వార్త, లేదంటే ఏదీ సమాజానికి తెలియదని అనుకుంటోంది.
సోషల్ మీడియా పుణ్యమా అని ప్రత్యామ్నాయ మీడియా ఉధృతంగా తెరపైకి వచ్చింది. నిజాలు చెప్పాలని భావించే వారికి అది మంచి వేదికైంది. అలాగే అబద్ధాల్ని, ప్రత్యర్థులపై విషం చిమ్మేవాళ్లకు కూడా సోషల్ మీడియా వేదికైంది. కానీ మంచీచెడుల్ని అంచనా వేసుకునే తెలివితేటలు , చైతన్యం మన సమాజంలో ఉన్నాయి. అందుకే అబద్ధాలు, దుష్ప్రచారం చేసేవారికి ఆదరణ కరవవుతోంది.
ఉదాహరణకు ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వారికి ఎప్పుడూ ఆదరణ వుంటుంది. వాస్తవాల ఆధారంగా చాలా వరకు ఆయన విశ్లేషణలు చేస్తుంటారు. అలాగని ఆయన ప్రతి విశ్లేషణా రాజకీయాలు, వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు లోబడి వుండవని చెప్పలేం. కొన్ని సందర్భాల్లో ఆ బలహీనతలు ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణల్లో వుంటాయి. కానీ ఒక విశ్లేషకుడిని సామాజిక శ్రేయోభిలాషిగా అంచనా వేసే తీరు ఒకటి వుంటుంది. అతను లేదా ఆమె వెల్లడించే అభిప్రాయాల్లో సామాజిక ప్రయోజనాలున్నాయా? లేక కొన్ని రాజకీయ పార్టీలకు లాభం కలిగించేలా ఉన్నాయా? అని గుర్తించడం పెద్ద కష్టం కాదు.
పచ్చని పంటలను యంత్రాలతో ప్రభుత్వమే దున్నినా, పట్టించుకోని మీడియా ఎవరికి కొమ్ము కాస్తున్నదో అర్థం చేసుకోనంత అమాయక స్థితిలో సమాజం లేదు. ఇంతకాలం ఇలాంటి మీడియా వ్యవస్థల్ని రక్షణ కవచంగా పెట్టుకుని రాజకీయాలు చేస్తున్న వారికి, ప్రత్యామ్నాయంగా ప్రజల గళాన్ని వినిపించే సోషల్ మీడియా అంటే గిట్టకపోవడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు.
కట్టడి చేయాలనే ప్రయత్నాలతో మరింత వ్యతిరేకతను సృష్టించుకుంటామనే స్పృహలో వుంటే మంచిది. ఎందుకంటే, సోషల్ మీడియా విస్తృతి ప్రపంచమంత అని గుర్తించుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో కాకపోతే, ఇంకో రాష్ట్రమో, దేశం నుంచో ప్రజా వ్యతిరేక విధానాలపై నిప్పులాంటి నిజాలు మాట్లాడుతూనే వుంటారు. సోషల్ మీడియా కారణంగా ప్రపంచమే కుగ్రామమైంది. అలాంటప్పుడు ఎల్లలు అడ్డంకి కావని పాలకులు గుర్తించుకోవాలి.
ప్రధాన మీడియాపై పాలకుల ఇష్టం, సోషల్ మీడియాపై అయిష్టం ఎందుకో .. తాజాగా ఉండవల్లిలో సీఆర్డీఏ భూమి లాక్కోడానికి సంబంధించి వార్తను ప్రజెంట్ చేయడంలోనే తెలుస్తోంది. చట్టాల్ని అడ్డుపెట్టి, నిజాల్ని బయటికి రాకుండా చేయాలనే ప్రయత్నాల్ని ఇప్పటికైనా విడనాడాలి. తప్పుల్ని ఎత్తి చూపితే, వాటిని సరిదిద్దుకుంటే మంచిదని సీనియర్ పాలకులకు మరెవరో చెప్పాల్సిన పనిలేదు.