శ్రీరాముడు వనవాస కాలంలో అనేక ప్రాంతాల మీదుగా తన ప్రయాణాన్ని సాగించాడు. ఆ రామచంద్రుని గుర్తుగా ఆయా ప్రదేశాల్లో రామాలయాలు వెలిశాయి. భక్తుల పాలిట కల్పతరువులుగా నేటికీ అవి విలసిల్లుతున్నాయి. ఆ ఆలయాల విశేషాలను తెలుసుకుంటే అంతా రామమయమే........... !!
రామాయణంలో చెప్పిన ఘట్టాలు, జరిగిన ప్రదేశాలు భారతదేశంలో ఆయా ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. అక్కడ వెలసిన రామాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా భాసిల్లుతున్నాయి. అహల్య శాపవిమోచనం పొందిన ఆశ్రమం, రామభద్రుడు గుహుడ్ని గుండెలకు హత్తుకున్న ప్రాంతం, సీతారామ లక్ష్మణులు వనవాసం చేసిన నెలవు, శూర్పనక ముక్కు కోసిన ప్రాంతం ఇలా ఆ శ్రీరాముడు నడయాడిన ఎన్నెన్నో ప్రదేశాలు నేటికీ రామకథను వివరిస్తున్నాయి.
అయోధ్య
శ్రీరాముని జన్మస్థలంగా అయోధ్య చరిత్రకెక్కింది. బంగారు సీతతో అశ్వమేధ యాగం చేసిన ప్రదేశంగానూ దీన్ని అభివర్ణిస్తారు. అవతార పరిసమాప్తి సమయంలో రామచంద్రుడు ఇక్కడి సరయూ నదిలో మునిగి వైకుంఠానికి చేరుకున్నాడని ప్రజల నమ్మకం.
ఫైజాబాద్
ఉత్తరప్రదేశలోని ఫైజాబాద్ ప్రాంతంలోనే దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేశాడని చరిత్ర చెబుతోంది. గంగానదికి ఉపనది అయిన ఘాఘ్రా నది ఒడ్డున ఫైజాబాద్ ఉంది. రాముడే విష్ణువుగా ఇక్కడే భూమిలో కలిసిపోయాడని స్థానికంగా చెబుతుంటారు.
శృంగభేరిపురం
ఉత్తరప్రదేశలోని అలహాబాద్ సమీపంలో శృంగభేరిపురం ఉంది. కోదండ రామునికి గుహుడు అపరభక్తుడే కాదు మంచి స్నేహితుడు కూడా. అరణ్యవాసానికి వెళుతున్న సీతారామలక్ష్మణులను గుహుడు గంగానదిని దాటించింది ఇక్కడే. రాములోరు తన
మిత్రుడిని గుండెలకు హత్తుకున్న చోటు కూడా ఇదే.
సర్బన
కర్ణాటకలోని బెల్గావ్కు సమీపంలో సర్బన అనే ప్రాంతముంది. రామలక్ష్మణులు ఆ ప్రాంతంలోని అరణ్యంలో తిరుగాడుతుండగా ఓ సరోవరం కనిపిస్తుంది. అదే పంపా సరోవరం. దీని పక్కనే శబరి నివసిస్తూ ఉండేది. దశరథ తనయుడ్ని చూసిన శబరి
భక్తిపారవశ్యంతో ఆయన పాదాలకు మొక్కి, మధుర ఫలాలను వారికి అందించింది.
చిత్రకూటం
ఉత్తర, మధ్య ప్రదేశ సరిహద్దుల్లో ఈ ప్రాంతం ఉంది. పచ్చని ప్రకృతి శోభతో అలరారే ఈ ప్రాంతంలోనే వనవాస వేళ సీతారాములు తిరుగాడినట్టు చెబుతారు. స్నాన, తపమాచరించిన ప్రదేశాలతో పాటు, వాళ్లు విశ్రాంతి తీసుకున్న కుటిరాలు ఇక్కడ కనిపిస్తాయి. అందమైన మందాకిని నది చూపరులను ఆకట్టుకుంటుంది.
బక్సర్
ఇది బిహార్లోని ప్రాంతం. రామలక్ష్మణులకు విశ్వామిత్రుడు అస్త్రవిద్యలు ఇక్కడే ఉపదేశించారని చెబుతారు. ఈ ప్రాంతంలోనే తాటక సంహారం జరిగిందట. బక్సర్ ప్రాంతానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న అహిరౌలి ప్రాంతంలో అహల్య శాపవిమోచన చెందిన ప్రాంతంగా భావిస్తారు.
పంచవటి
శూర్పణక ముక్కుచెవులు కోసిన స్థలంగా పంచవటిని చెప్పుకుంటారు.
ధనుష్కోటి
ఈ ప్రాంతం రామేశ్వరంలో ఉంది. రావణుని సోదరుడు విభీషణుడు రామమూర్తిని శరణు కోరిన స్థలం ఇదే.
భద్రాచలం, ఒంటిమిట్ట, రామతీర్థ, రామగిరి, దండాకారణ్యం వంటి ఎన్నో ప్రదేశాలు రామాయణ చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తాయి.
సీతామర్హి (బిహార్): సీతాదేవి భూమిలో దొరికిన చోటు
జనక్పూర్ (నేపాల్) : సీతమ్మ పుట్టిల్లు.
సీతా సమాహిత స్థల్ : సీతాదేవి భూమాతాలో ఐక్యం అయ్యింది ఈ ప్రదేశంలోనే. అలహాబాద్, వారణాసిలను కలిపే రెండో జాతీయ రహాదారికి 4 కిలోమీటర్ల దూరంలో సీతాసమాహిత స్థల్ ఉంటుంది. సీతా స్మారక విగ్రహముండే ఈ ప్రదేశాన్ని సీతామారి అని కూడా పిలుస్తారు. సీతా భూమిలో ఐక్యం అయ్యే దృశ్యాన్ని కళ్లకు కడుతూ ఓ విగ్రహం కూడా ఉంటుందిక్కడ...!!
#హిందూ దేవుళ్ళు * దేవాలయాలు #హిందూ దేవాలయాలు💐🎂 #hindu temples #🚩జై శ్రీరామ 🕉️
#తెలుసుకుందాం