#పొలిటికల్ జోక్స్ 😂 #ఏపి న్యూస్ ఏపీ పాలిటెక్స్🎯
*చంద్రబాబూ……… ఎందుకీ పొలిటికల్ ఫీట్లు❗*
APRIL 25, 2026🎯
ఈ నెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 76వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఆయనది సుదీర్ఘ రాజకీయ జీవితం. దాదాపు 40 ఏళ్లకు పైగా రాజకీయాల్లో వుంటూ, అనేక ఎత్తుపల్లాల్ని చంద్రబాబు చూశారు. రాజకీయ రూపురేఖల గురించి ఆయనకు తెలియంది ఏమీలేదు. అయితే జీవిత చరమాంకంలో తన కోసం కాకుండా, మరెవరి కోసమో పొలిటికల్ ఫీట్లు వేస్తున్నారన్న అభిప్రాయం పౌర సమాజంలో కలుగుతోంది.
ఒకప్పుడు చంద్రబాబు లాంటి నాయకుల పొలిటికల్ స్టంట్స్ వెనుక ఉద్దేశాలు, దురుద్దేశాలు పెద్దగా జనానికి తెలిసేవి కావు. అది వేరే కాలం. కానీ ఇప్పటి పరిస్థితులు వేరు. ప్రజల్లో చైతన్యం పెరిగింది. మాధ్యమాల విస్తృతి పెరగడంతో రాజకీయ నాయకుల మాటల వెనుక మర్మం ఏంటో వెంటనే ప్రజలు పసిగడుతున్నారు. ఓహో ఇందుకోసమేనా. ఈ నాటకాలు అని జనం చర్చించుకుంటున్నారు.
తాజాగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడంపై జనంలో కూడా అలాంటి చర్చే జరుగుతోంది. వీగిపోయిన బిల్లుకు మద్దతు కోసమంటూ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించడమే ఒక విడ్డూరమనే విమర్శ. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన ఇండియా కూటమి పార్టీల వైఖరిని ప్రజల్లో ఎండగట్టేందుకు అసెంబ్లీని వేదికగా వాడుకుంటారట!
ఆంధ్రప్రదేశ్లో ఇండియా కూటమి బలం శూన్యం. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో ఎస్పీ, వామపక్షాలు, టీఎంసీ, డీఎంకే తదితర పార్టీలున్నాయి. వీటిలో ఒక్కటైనా ఆంధ్రప్రదేశ్లో లేదని తెలుసు. దేశమంతా కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏకి వ్యతిరేకంగా పని చేస్తుంటే, ఆంధ్రప్రదేశ్లో మాత్రం అందుకు విరుద్ధంగా నడుచుకుంటోంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కేవలం తన అన్న, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను రాజకీయంగా బద్నాం చేస్తూ, తద్వారా చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏకి రాజకీయ ప్రయోజనం కలిగించేందుకు శక్తి వంచన లేకుండా పని చేస్తున్నారనేది జగమెరిగిన సత్యం.
'కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే పార్టీలు మహిళలకు చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరించాలి. ఇండియా కూటమి పార్టీల తీరును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు, సమావేశాలు నిర్వహించాలి. టీడీపీ-జనసేన-బీజేపీ నేతలు సమన్వయంతో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలి' ..ఇదీ చంద్రబాబు ఆదేశం.
2023లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. 2024 ఎన్నికల నుంచి అమలు చేయాలని విపక్షాలు నాడు డిమాండ్ చేశాయి. అయితే 2034 నుంచి అమలు చేస్తామని మోదీ సర్కార్ చెప్పింది. ఇప్పుడేమో డీలిమిటేషన్ బిల్లును ఆమోదించుకోడానికి, దానికి మహిళా రిజర్వేషన్ బిల్లుతో మెలిక పెట్టారు. దాన్ని విపక్షాలు
ఒప్పుకోలేదు. ముఖ్యంగా దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని ఇండియా కూటమి నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవాలు ఇవైతే, వాటిని మరుగున పరిచి, బీజేపీ నినాదాన్నే చంద్రబాబు ఎత్తుకోవడం గమనార్హం.
అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు, అలాగే మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ సదస్సులు, ఆందోళనలు నిర్వహించి, ఇండియా కూటమి పార్టీలను ఎండగట్టాలనే నిర్ణయమే అర్థంలేనిదని జనం అంటున్నారు. చంద్రబాబునాయుడు తాను చేస్తున్నది సరైంది కాదని తెలిసి కూడా, కేవలం మోదీ, అమిల్షా తదితర బీజేపీ అగ్రనేతల మెప్పుకోసమే పొలిటికల్ ఫీట్లకు తెరలేపారనే విమర్శ వెల్లువెత్తుతోంది.
ఒకవైపు పార్లమెంట్లో మహిళా బిల్లు ఆమోదం పొందదని తెలిసి కూడా, కూటమి మహిళా నాయకురాళ్లను ఢిల్లీకి పంపి హడావుడి చేసిన సంగతి తెలిసిందే. ఇదంతా పొలిటికల్ మైలేజీ కోసం తప్ప, మహిళల రిజర్వేషన్ కోసం చిత్తశుద్ధితో చేసిన పని కాదనే విమర్శ దేశ వ్యాప్తంగా వుంది. అయినప్పటికీ చంద్రబాబు ప్రతిదీ కేంద్ర పెద్దల మెప్పు కోసం పని చేయడం చూస్తే ఆశ్చర్యం కలుగుతోందని నెటిజన్లు అంటున్నారు.
ఇటీవల తమిళనాడు వెళ్లి డీఎంకేపై ఆరోపణలు కూడా మోదీ కోసమే అని అందరూ అంటున్న మాట. రాజకీయంగా మోదీ కంటే తానే సీనియర్ అని అనేక సందర్భాల్లో మాట్లాడిన చంద్రబాబు, ఇప్పుడు ఆయన మెహర్బానీ కోసం సర్కస్ ఫీట్లను తలపించేలా నడుచుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని రాజకీయ
విమర్శకులు అంటున్నారు. మోదీ మెప్పుకోసం భవిష్యత్లో ఇంకేం చేస్తారో అనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది.