#ఏపీ అప్డేట్స్ 🎯 #చంద్రబాబు నాయుడు
*ఈ నిందలు మాని.. పారదర్శకత ప్రూవ్ చేసుకోవాలి❗*
29.08.2026🎯
ఓటరు జాబితాల సవరణకు
సంబంధించిన ప్రక్రియ మొత్తం పూర్తయ్యే వరకు స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని కోరడం అతిశయమైన డిమాండ్ ఎంత మాత్రమూ కాదు. ఎందుకంటే.. ప్రస్తుతం సవరించిన ఓటరు జాబితాల్లో తమ పార్టీలకు చెందిన ఓట్లు ప్రతి నియోజకవర్గంలోనూ వేలకు వేలు గల్లంతైపోయాయని ఎన్డీయేతర పార్టీలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ లేవనెత్తిన ఈ డిమాండ్ చాలా సహేతుకమైనది.
జాబితాలపై అభ్యంతరాలు వెల్లడించి, గల్లంతైన ఓటర్లు తిరిగి జాబితాల్లోకి వచ్చేవరకు ఆగడం తప్పు కాదు. న్యాయం కూడా. కానీ.. ఈ డిమాండ్ తో వైసీపీ కోర్టుకు వెళ్లడాన్ని చంద్రబాబునాయుడు ఎద్దేవా చేయడం చిత్రంగా కనిపిస్తోంది.
ఇప్పటికిప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరగడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదంటూ చంద్రబాబునాయుడు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికలు వాయిదా పడితే తమ పార్టీకి లాభం ఉంటుందని జగన్ అనుకుంటే కూడా అవి దింపుడు కళ్లెం ఆశలేనని చంద్రబాబు వ్యాఖ్యానించడం విశేషం.
ఇప్పటినుంచే చంద్రబాబు మైండ్ గేమ్ ప్రారంభించారని, ప్రత్యర్థుల మీద బురదచల్లడం ప్రారంభించారని కనిపిస్తోంది. సర్ జాబితాల సవరణ పూర్తయ్యే దాకా ఎన్నికలు ఆపాలనే విషయంలో చంద్రబాబు ఎందుకంత అత్యుత్సాహం చూపిస్తున్నారో అర్థం కాదు.
ఆ మాటకొస్తే.. చంద్రబాబు ప్రతి నిర్ణయాన్నీ వ్యతిరేకించే స్థితిలో జగన్ లేరు. మునిసిపల్ ఛైర్మన్ స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలే నిర్వహించాలని ఏపీ సర్కారు నిర్ణయించడాన్ని ఆయన ఆహ్వానించారు. అది తమ పార్టీకే లాభం చేస్తుందని కూడా అన్నారు.
ఇప్పుడు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత తమకు లాభిస్తుందని ఎన్నికల్లో లాభపడతామని జగన్ ఆశిస్తున్నారు. పార్టీ శ్రేణులకు అదే చెప్పారు. అయితే.. సర్ ద్వారా తొలగించిన ఓట్ల విషయంలో ఇంకా అభ్యంతరాలున్నందువల్ల.. వైసీపీ అప్పటిదాకా వాయిదా వేయమంటోందే తప్ప.. ఏళ్ల తరబడి ఆపాలని అనడం లేదు. వారి సహేతుకమైన డిమాండ్ ను ఎద్దేవా చేయడం మానేసి.. చంద్రబాబునాయుడు స్థానిక ఎన్నికలను పారదర్శకంగా నిజాయితీగా నిర్వహించడం గురించి శ్రద్ధ పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.
స్థానిక ఎన్నికలు అనగానే.. అధికారంలో ఉన్న పార్టీలు చేసే దాదాగిరీగా ప్రజల దృష్టిలో ముద్రపడిపోయింది. జగన్ కూడా ఇలాంటి భయాలను వ్యక్తం చేశారు. ఆ ముద్ర చెరగిపోయేలాగా ఎన్నికలు నిజాయితీగా నిర్వహించాలని ప్రజలు కోరుకుంటున్నారు.