*అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు?* *దీని విశిష్టత ఏమిటో మీకు తెలుసా?* *తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన బోనాలు పండుగ* *ఆషాఢ మాసంలో అత్యంత వైభవంగా అమ్మవారికి బోనం* *ఈ మహోత్సవం విశిష్టత, చరిత్ర, ఈ ఏడాది ఉత్సవాల విశేషాలు మీ కోసం!* తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ బోనాలు పండుగ. ఆషాఢ మాసం ఆరంభం కాగానే తెలంగాణలోని నగరాల నుంచి, మారుమూల గ్రామాల వరకు జాతర కళతో నిండిపోతాయి. పల్లెల్లో, పట్టణాల్లో వయో లింగ భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, ఆనందంగా జరుపుకునే బోనాలు జాతర గురించిన ప్రత్యేక విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం. *బోనాలు అంటే?* బోనాలు తెలంగాణ రాష్ట్రం అత్యంత వైభవంగా జరుపుకునే సాంస్కృతిక జాతర. ఆషాఢ మాసంలో మహంకాళి, పోచమ్మ, ఎల్లమ్మ, రేణుక ఎల్లమ్మ, గండి మైసమ్మ మొదలైన గ్రామ దేవతలకు భక్తిశ్రద్ధలతో బోనం అంటే నైవేద్యం సమర్పించి, అంటువ్యాధులు రాకుండా కాపాడమని అమ్మవారిని ప్రార్థిస్తారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన బోనాలు జాతర తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. 'భోజనం' అనే పదానికి మరో రూపమే బోనం. ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో ప్రబలిన ప్లేగు మహమ్మారిని అమ్మవారు పారద్రోలిందంట! అందుకు కృతజ్ఞతగా అమ్మవారికి బోనాలు సమర్పించే ఆచారం అనాదిగా కొనసాగుతోంది. *బోనాలు విశిష్టత* సాధారణంగా తెలుగువారి సంప్రదాయం ప్రకారం కొత్తగా పెళ్లైన అమ్మాయి ఆషాఢ మాసంలో పుట్టింటికి రావడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే నిత్య పెళ్లికూతురైన అమ్మవారు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో పుట్టింటికి వస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే ఈ మాసం మొత్తం పుట్టింటికి వచ్చే శక్తి స్వరూపిణికి ప్రేమతో, భక్తి శ్రద్ధలతో బోనంతో పాటు సారెను కూడా సమర్పించడం వలన ఆ తల్లి తన చల్లని చూపులతో అనుగ్రహిస్తుందని విశ్వాసం. అంతేకాదు అమ్మవారికి బోనాలు సమర్పించడం వలన ఈ కాలంలో ప్రబలే అంటువ్యాధుల నుంచి ఆ జగదాంబిక రక్షించి ఆయురారోగ్యాలు ప్రసాదిస్తుందని విశ్వాసం. *బోనాలు వేడుకలు షురూ ఇలా* తెలంగాణ ప్రజలు అత్యంత భక్తి విశ్వాసాలతో జరుపుకునే బోనాలు వేడుకలు తొలుత గోల్కొండ కోటలోని జగదాంబిక ఆలయంలో మొదలవుతాయి. అటు తర్వాత వరుసగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో, లాల్ దర్వాజా సింహవాహిని ఆలయాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అనేక అమ్మవారి ఆలయాల్లో ఘనంగా జరుగుతాయి. చివరగా గోల్కొండ కోటలోనే ఈ ఉత్సవాలు ముగుస్తాయి. *ఈ ఏడాది బోనాలు షెడ్యూల్ ఇదే!* 👉 జులై 16, గురువారం: రోజున చారిత్రాత్మక గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆలయంలో బోనాలు ప్రారంభం కానున్నాయి. 👉 జూలై 19, ఆదివారం: గోల్కొండ కోటలో జగదాంబిక అమ్మవారి ఆలయంలో తొలి బోనంతో ఉత్సవాలు ప్రారంభం మరియు లష్కర్ బోనాలు ఘటోత్సవం జరుగుతాయి. 👉 ఆగస్టు 2, ఆదివారం: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ప్రధాన లష్కర్ బోనాలు. 👉 ఆగస్టు 3, సోమవారం: లష్కర్ బోనాల్లో అత్యంత కీలకమైన 'రంగం' మరియు అంబారీపై అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాలు జరగనున్నాయి. 👉 ఆగస్టు 9, ఆదివారం: పాతబస్తీ లాల్ దర్వాజ మరియు ఇతర ఉమ్మడి దేవాలయాలలో బోనాలు ఉత్సవాలు జరుగుతాయి. 👉 ఆగస్టు 10, సోమవారం: ఘటాల ఊరేగింపుతో బోనాల జాతర ముగింపు. *ఉత్సాహంగా జాతర* బోనాల ఉత్సవాలు జరిగిన్నని రోజులు ప్రతి ఆది, సోమ, గురువారాల్లో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరుగుతాయి. డప్పుల మోతలు, గజ్జెల సవ్వళ్లు, పోతురాజుల విన్యాసాలతో అంగరంగ వైభవంగా జరిగే బోనాల ఉత్సవాలు చూడటానికి రెండు కళ్లు సరిపోవు. ఇటీవలి కాలంలో విదేశాల్లో కూడా బోనాలు ఉత్సవాలు నిర్వహిస్తున్నారంటే ఈ ఉత్సవాలకు ఉన్న ప్రాధాన్యతను గుర్తించవచ్చు. మనం కూడా ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పిద్దాం. బోనాలు జాతరలో పాల్గొని అమ్మవారి అనుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందుదాం.! *ఓం శ్రీ మాత్రే నమః* #తెలుసుకుందాం #🏺బోనం అలంకరణ🌺 #💮బోనాలు ప్రారంభం🙏 #💮బోనాలు ప్రారంభం🙏
40 likes
47 shares

More like this