#ఏపీ అప్ డేట్స్..📖 #ఏపీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ 🎯
*బాబు సర్కార్ను బజార్న పడేసిన కొలికపూడి❗*
FEBRUARY 9, 2026🎯
కూటమి సర్కార్కు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కొరకరాని కొయ్యగా మారారు. పదేపదే సొంత ప్రభుత్వాన్ని బజారులో పడేస్తున్నారు. కొలికపూడిపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని అనుకూల మీడియాలో లీకు వార్తలు రావడం తప్ప, ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు.
పలుమార్లు టీడీపీ క్రమశిక్షణా సంఘం ముందుకు వెళ్లినా, ఆయనలో మాత్రం ఎలాంటి మార్పు లేదని మరోసారి తేలిపోయింది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి ఎన్నికల సమయంలో కోట్లాది రూపాయిలు డబ్బు ఇచ్చానని, అందుకు సంబంధించిన ఆధారాల్ని కూడా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసి సంచలనం సృష్టించారు. ఆ వ్యవహారంలో కేశినేని చిన్ని, కొలికపూడిపై చంద్రబాబు కఠిన చర్యలు తీసుకుంటారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
అయితే అదంతా ఉత్తుత్తిదే అని కాలం నిరూపించింది. తాజాగా సీఎం చంద్రబాబు, టీడీపీ క్రమశిక్షణ సంఘానికి కొలికపూడి సవాల్ విసిరేలా, వాట్సప్ స్టేటస్ పెట్టడం తీవ్ర చర్చనీయైశమైంది.
*“మూడు రోజులు 35 గ్రామాలు. 480 కుటుంబాలతో ఆత్మీయ సంభాషణ. రోడ్లు లేని పల్లెలు, ఉద్యోగాలు రాని పల్లెలు. పల్లె కన్నీరు పెడుతోంది”* అని కొలికపూడి తన వాట్సప్ స్టేటస్ పెట్టుకున్నారు.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ పదేపదే తమ పాలనలో ఏపీ రూపు రేఖలు మారిపోయాయని చెబుతున్నారు. అయితే అందులో ఏ మాత్రం వాస్తవం లేదని కొలికపూడి తన వాట్సప్ స్టేటస్తో తేల్చి చెప్పి, ప్రభుత్వ పరువును వీధిన పడేశారు.
రోడ్లు లేవు, అలాగే పిల్లలకు ఉద్యోగాలు లేవని ఆయన అభిప్రాయపడ్డారు. అంతిమంగా పల్లె కన్నీరు పెడుతోందని నేరుగానే ఆయన సొంత ప్రభుత్వానికి చురకలు అంటించేలా పోస్టు పెట్టడం గమనార్హం. ఇదేదో గాలి మాటగా ఆయన చెప్పలేదు. మూడు రోజుల పాటు 35 గ్రామాల్లో తిరిగి, 480 కుటుంబాలతో ఆత్మీయంగా మాట్లాడి, మరీ చెబుతున్నట్టు ఆయన గణాంకాలతో సహా వాట్సప్ స్టేటస్లో పొందుపరిచడం గమనార్హం.