#సింహాచలం శ్రీ సింహాద్రి అప్పన్న క్షేత్రంలో ఉత్సవాలు #విశాఖపట్నం సమాచారం 📷స్థానిక వార్తలు 📺 లోకల్ న్యూస్ ✍️
( Visakhapatnam Local News ) #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత
శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి దేవస్థానం, సింహాచలం
* సింహాచలంలో శ్రీ వైకుంఠవాసునికి వైభవంగా వరద పాయసం.
* దేశంలో సకాలంలో వర్షాలు కురిసి సస్యశ్యామలం కావాలని ప్రత్యేక ప్రార్థనలు.
– ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు
సింహాచలం, జూలై 1:
శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం కొండపై ఉత్తర దిశలోని పర్వత శిఖరంపై వెలసిన శ్రీ వైకుంఠవాసునికి దేశంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, చెరువులు, బావులు నిండి భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండి దేశం సస్యశ్యామలంగా వర్ధిల్లాలని కోరుతూ వరద పాయసం కార్యక్రమాన్ని బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు తెలిపారు.
అనాదిగా కొనసాగుతున్న ఆలయ సంప్రదాయం ప్రకారం ఆలయ స్థానాచార్యులు డా. టి.పి. రాజగోపాల్ వారి ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, సీతారామాచార్యులు మరియు అర్చక స్వాములు ఉదయం విశ్వక్షేన పూజ, పుణ్యాహవాచనం, పంచకలశ స్నపన పూర్వక అభిషేకం, విరాటపర్వ పారాయణం, వరుణ మంత్రజపం నిర్వహించారు. అనంతరం స్వామివారికి పాయస నివేదన చేసి, శ్రీ వైకుంఠవాసుని వద్దనున్న పవిత్ర శిలపై సంప్రదాయబద్ధంగా వరద పాయసం సమర్పించారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు మాట్లాడుతూ, ప్రకృతి సమతుల్యత, రైతుల సంక్షేమం, సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించడం ఆనవాయితీ అని తెలిపారు.
ప్రకృతి సోయగాల నడుమ, పచ్చని కొండలు, ఔషధ మొక్కల సుగంధ గాలులు, గంగధార ప్రవాహం మధ్య వెలసిన సింహగిరిలో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం భక్తులకు విశేష దైవానుభూతిని కలిగించింది.
వేల ఏళ్ల చారిత్రక వైభవాన్ని సంతరించుకున్న ఈ పుణ్యక్షేత్రంలో వేదమంత్రాల నడుమ జరిగిన వరద పాయసం కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బండారు రాంబాబు, సహాయ కార్యనిర్వహణాధికారి
కె. తిరుమలేశ్వరరావు, పంతం శ్రీనివాసరావు, డి.ఈ. (ఐ/సి) రామరాజు, పర్యవేక్షణాధికారి రాజ్యలక్ష్మి, పిఆర్వో నాయుడు, ఆలయ అధికారులు, సిబ్బంది, వేదపండితులు మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.