#ఏపీ అప్ డేట్స్..📖 #ఏపి న్యూస్ ఏపీ పాలిటెక్స్🎯
*ఉన్నోళ్లకే దిక్కులేదు.. పిల్లల్ని కనాలట❗*
MAY 17, 2026🎯
కార్లలో వెళ్లొద్దు, వారంలో ఒకసారి వాహనాల్ని వాడొద్దు. పబ్లిక్ రవాణా వ్యవస్థల్ని వాడుకుంటే మంచిది. అది తినొద్దు, ఇది తాగకూడదని ఒక వైపు పొదుపు మంత్రాన్ని జపిస్తూ, మరోవైపు ఇంకా ఇంకా పిల్లల్ని కంటే ప్రోత్సహకాలు ఇస్తామనే సీఎం చంద్రబాబు ప్రకటన విడ్డూరంగా వుంది.
ఈ మధ్య కాలంలో చంద్రబాబునాయుడు అధిక సంఖ్యలో పిల్లల్ని కనడంపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా సంపదకు సరికొత్త భాష్యం చెబుతున్నారు. సంపదే సృష్టి అంటున్నారాయన. పిల్లల్ని భారంగా భావించొద్దని
మరీమరీ చెబుతున్నారు.
మూడో బిడ్డకు రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేల ప్రోత్సాహక బహుమతి ఇస్తానంటున్నారు. అలాగే తల్లికి వందనాన్ని రూ.15 వేల నుంచి ఇంకా పెంచడానికి ఆలోచిస్తున్నట్టు ఆశ చూపుతున్నారు. మనకు ఏ మాత్రం సంబంధం లేని పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతుంటే, ఇతర దేశాలతో పాటు మన దేశం కూడా అల్లాడిపోతోంది. గట్టిగా అక్కడ నెల రోజులు యుద్ధం జరిగితే గ్యాస్ దొరకదు, అలాగే పెట్రోల్ బంకుల వద్ద గంటల తరబడి క్యూలైన్లు చూస్తున్నాం. జనం హాహాకారాలు పెడుతున్నారు.
ముఖ్యంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇంధన కొరత తలెత్తడాన్ని చూశాం. వాస్తవాలు ఇలా వుంటే, ఎక్కువ మంది పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలివిగో అంటూ చంద్రబాబు ఒక ఉద్యమంలా ప్రచారం చేస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బహుశా దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇలా చేయడం లేదు. చంద్రబాబు ప్రచారం వెనుక ఉద్దేశం ఏంటో ఎవరికీ అంతుచిక్కడం లేదు.
మరోవైపు విపక్షాలు, పౌర సంఘాల నేతలు చంద్రబాబు ఎక్కువ మంది పిల్లల్ని కనాలనే ప్రచారాన్ని తప్పు పడుతున్నారు. ఆల్రెడీ ఉన్నోళ్లకు ప్రభుత్వ వైపు నుంచి ఎలాంటి సాయం అందడం లేదని, అలాంటిది జనాభా పెరిగితే ఏం చేస్తారని నిలదీస్తున్నారు. ఇదే సందర్భంలో చంద్రబాబు కేవలం ఒక బిడ్డతోనే సరిపెట్టారు. అంతేకాదు, ఆయన తనయుడు లోకేశ్కు కూడా దేవాల్ష్ ఒక్కడే కుమారుడు. ఇంట్లో మాత్రం బిడ్డలను కనడంలో పొదుపు మంత్రం పాటిస్తూ, ఊరోళ్లకు మాత్రం నీతులు చెబుతారా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
మరీ ముఖ్యంగా రానున్న రోజుల్లో ప్రపంచమే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం కనిపిస్తోంది. మరోవైపు నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఏమీ తినేదానికీ కావడం లేదు. సామాన్యులైతే నిత్యావసర సరుకులు కొని, బతికే పరిస్థితి రోజురోజుకూ కష్టమవుతోంది. కనీసం వాటి రేట్లను తగ్గించే చర్యల్ని పాలకులు తీసుకోవడం లేదు.
ఇలాంటి వాళ్లు మాత్రం ఎక్కువ మంది పిల్లల్ని కనాలని ఎలా ప్రచారం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. మన జీవితం మన చేతుల్లో లేదని పశ్చిమాసియా యుద్ధం చెబుతోంది. ఇందుకు దేశ వ్యాప్తంగా పాటిస్తున్న పొదుపు చర్యలే నిదర్శనం. చివరికి ప్రధానితో పాటు ముఖ్యమంత్రులంతా తమ కాన్వాయ్లలో భారీగా వాహనాలను కుదించారు. మరి ఎక్కువ మంది పిల్లల్ని కని రోడ్డున వేయడానికా? అనే ప్రశ్నకు చంద్రబాబు సమాధానం చెప్పాలి.
అయినా చంద్రబాబు ఎన్నాళ్లు అధికారంలో వుంటారు? ఆయన చెప్పినట్టు పిల్లల్ని కనే సరికి, పాలనాకాలం కూడా పూర్తి అవుతుంది. ఇక ప్రోత్సాహకాలు ఎవరు ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? కాస్త పనికొచ్చే మాటలు పాలకులు మాట్లాడితే అందరికీ మంచిది. ప్రజల్ని మభ్యపెట్టడానికో, హామీల అమలు నుంచి తప్పించుకోడానికో పిల్లలే సంపద అని ప్రచారం చేయడం దుర్మార్గం, అన్యాయం.


