👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
511 views • 11 hours ago
*తొలి ఏకాదశినే శ్రీమహావిష్ణువు యోగ నిద్రలోకి ఎందుకు వెళ్తారు?*
*ఈ పర్వదినం వెనుకున్న విశిష్టత, పురాణ కథ ఇదే!*
2026లో జూలై 25న తొలి ఏకాదశి- ఈ రోజు శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశిస్తారని పురాణ విశ్వాసం- తొలి ఏకాదశి ప్రాముఖ్యత, ఏకాదశి ఆవిర్భావ కథ ఈ కథనంలో తెలుసుకుందాం.
*హిందూ ధర్మచక్రం*
తెలుగు పంచాంగం ప్రకారం తిథుల్లో ఏకాదశి విశిష్టమైనది. ఒక సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో కొన్ని చాలా పవిత్రమైనవి. వాటిల్లో ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి, కార్తీక శుద్ధ ఏకాదశి, మార్గశిర మాసంలో వచ్చే ముక్కోటి ఏకాదశి అత్యంత పవిత్రమైనవి. పురాణాల ప్రకారం ఈ మూడు ఏకాదశులు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనవని తెలుస్తోంది.
*తొలి ఏకాదశి ఎప్పుడు?*
ఆషాఢ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఈ ఏడాది జులై 25, శనివారం ఆషాఢ శుద్ధ ఏకాదశి సందర్భంగా ఈ రోజునే తొలి ఏకాదశి పర్వదినాన్ని జరుపుకోవాలి.
*తొలి ఏకాదశితో తోసుకొచ్చే పండుగలు*
హిందూ సంప్రదాయంలో పండుగలకు అత్యంత ప్రాధాన్యం ఉంది. తొలి ఏకాదశి హిందువులకు అత్యంత విశిష్టమైన పండుగ. ఈ ఏకాదశినే శయన ఏకాదశి అని దేవశయని ఏకాదశి అని కూడా అంటారు. అతి ప్రాచీన తెలుగు పంచాంగం ప్రకారం తొలి ఏకాదశి నుంచి తెలుగు సంవత్సరంలో పండుగలు ప్రారంభం అవుతాయి. అందుకే 'తొలి ఏకాదశితో పండుగలు తోసుకొస్తాయి' అనే నానుడి ప్రచారంలోకి వచ్చింది. ఈ తొలి ఏకాదశి రోజున ఉపవాస జాగారాలతో శ్రీమహావిష్ణువును పూజిస్తే కోరిన కోర్కెలన్నీ నెరవేరుతాయని ప్రతీతి.
*తొలి ఏకాదశి విశిష్టత*
శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశించే పుణ్యతిథి తొలి ఏకాదశి. ఈ ఏకాదశి రోజు స్వామి నిద్రకు ఉపక్రమిస్తాడు కనుక ఈ రోజును శయనేకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై యోగనిద్రలోకి వెళ్తాడని పురాణాలు కూడా చెబుతున్నాయి. తొలి ఏకాదశి రోజు యోగనిద్రలోకి వెళ్లే శ్రీ మహావిష్ణువు తిరిగి 4 నెలల తరువాత అంటే కార్తిక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటాడని విష్ణు పురాణంలో, స్కంద పురాణంలో వివరించి ఉంది. ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాసం అని అంటారు. ఈ ఈ చాతుర్మాసం నాలుగు నెలల కాలం ఆధ్యాత్మిక సాధనకు, పూజలు, వ్రతాలకు, దానధర్మాలకు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. అలాగే శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లడంతో సృష్టి, స్థితి, లయ కారకత్వాలు పరమశివుడికి, ఇతర దేవతలకు అప్పగించబడతాయని కూడా విశ్వాసం.
*ఏకాదశి ఎలా ఏర్పడింది?*
పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు మురాసురుడనే రాక్షసునితో యుద్ధం చేస్తూ అలిసిపోయి సింహావతి అనే గుహలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఆ రాక్షసుడు మాయోపాయంతో శ్రీ మహావిష్ణువును సంహరించాలని చూస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి శరీరం నుంచి యోగమాయ శక్తి రూపంలో వెలువడి మురాసురుని సంహరించింది. ఈ శక్తి స్వరూపం పౌర్ణమి నుంచి 11వ రోజు జన్మించినందున విష్ణువు ఆ శక్తిని ఏకాదశి తిథిగా ఉంటూ పూజలందుకోమని వరాన్ని అనుగ్రహించాడు. ఆనాటి నుంచి ఆ శక్తి స్వామికి ప్రియమైన ఏకాదశి తిథిగా పూజలందుకుంటోంది.
*తొలి ఏకాదశి పూజా విధానం*
తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండి, విష్ణుమూర్తిని పూజించడం వల్ల సకల పాపాలు తొలగిపోయి, కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢమైన విశ్వాసం. ఈ ఒక్క ఏకాదశి రోజున ఉపవాసం, జాగరణ దీక్ష చేస్తే కోటి పుణ్యాలు లభిస్తాయని పండితులు చెబుతారు. ఈ రోజున సూర్యోదయంతో నదీస్నానం చేయాలి. వీలుకాని వారు ఇంట్లో స్నానం చేసే నీటిలో సమస్త నదీ జలాలు ఆవాహన చేసుకుని స్నానం చేస్తే నదీ స్నానం చేసిన ఫలితం దక్కుతుంది. పూజామందిరంలో ఆవునేతితో దీపారాధన చేసి, లక్ష్మీ నారాయణులను ప్రతిష్టించుకోవాలి. విష్ణుమూర్తిని పంచామృతాలతో, గంగా జలంతో అభిషేకించాలి. పసుపు రంగు పూలతో, తులసి దళాలతో శ్రీమన్నారాయణుని పూజించాలి. విష్ణు సహస్రనామ పారాయణ విధిగా చేయాలి. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన చక్రపొంగలి, కొబ్బరికాయ, అరటిపండ్లు వంటి ప్రసాదాలు నివేదించాలి. చివరగా మంగళ హారతి ఇచ్చి నమస్కరించుకోవాలి.
*ఆలయ దర్శనం*
సాయంకాల సమయంలో విష్ణువు ఆలయానికి వెళ్లి విష్ణువును దర్శించి, తులసి మాలను సమర్పించాలి. ఈ రాత్రంతా భగవంతుని కీర్తనలు పాడుతూ, భాగవత కథలు వింటూ జాగారం చేయాలి.
*తొలి ఏకాదశి ప్రత్యేకం పేలపిండి*
తొలి ఏకాదశి రోజు వడ్లతో చేసిన పేలాల్లో బెల్లం, యాలకులు వేసి దంచి మెత్తని పిండిగా చేసి శ్రీ మహావిష్ణువుకు నివేదించి ప్రసాదంగా స్వీకరిస్తారు. ఆరోగ్యప్రదాయిని అయిన ఈ పేలపిండిని సేవించడం వలన వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని విశ్వాసం. అలాగే రైతులు తమ పంట పొలాల్లో ఈ పేలపిండిని చల్లుతారు. ఇలా చేయడం వలన వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండుతాయని నమ్మకం.
*ఏకాదశి ఉపవాసం సమయం*
ఉపవాసం చేసేవారు శుక్రవారం సాయంత్రం అనగా జూలై 24 వ తేదీ సూర్యాస్తమయం నుండే ఉపవాసం ప్రారంభం చేయాలి.
శుక్రవారం సాయంత్రం నుండి నియమాలు వర్తిస్తాయి.
శుక్రవారం సాయంత్రం తేలికపాటి సాత్విక పదార్థాలు స్వీకరించాలి కానీ, భోజనం చేయకూడదు.
రాత్రి బ్రహ్మచర్యం పాటించాలి.
శనివారం విధులన్నీ నియమంగా చేయాలి. ఆదివారం ఉదయం స్వామికి అర్చన చేసి నివేదన చేసిన పదార్థాన్ని ద్వాదశి ఘడియలు ముగియక ముందే ఎంత త్వరగా అయిన ఫరవాలేదు కానీ మ. 1:30 లోపు భోజనం చేసేయాలి.
*ద్వాదశి పారణ*
మరుసటి రోజు ఉదయాన్నే తలారా స్నానం చేసి నిత్య పూజాదికాలు ముగించుకోవాలి. ద్వాదశి ఘడియలు సమీపించగానే ఒక సద్బ్రాహ్మణునికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు సమర్పించి నమస్కరించాలి. అనంతరం భోజనం చేసి ఉపవాసాన్ని విరమించవచ్చు. ఏకాదశి నియమాలు పాటించేవారు జ్ఞానవంతులు అవుతారని, గత జన్మ పాపాలు తొలగి మోక్షానికి అర్హులు అవుతారని పురాణాలు చెబుతున్నాయి. ఈ తొలి ఏకాదశి పండుగను మనం కూడా శాస్త్రోక్తంగా జరుపుకొని శ్రీహరి అనుగ్రహానికి పాత్రులవుదాం.
*ఓం నమో భగవతే వాసుదేవాయ*
స్థితి కారకుడైన విష్ణువు పాలకడలిలో ఆషాడశుద్ధ ఏకాదశినాడు శేష శయ్యపై యోగనిద్రకు ఉపక్రమిస్తాడు, దీనినే తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అంటారు.
మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు
#తెలుసుకుందాం #శ్రీ మహావిష్ణు 🪐 #🪐 శ్రీ మహావిష్ణు 🔱 #🌻" తొలి ఏకాదశి శుభాకాంక్షలు "🌻 #తొలి ఏకాదశి
18 likes
10 shares