PSV APPARAO
1K views
10 hours ago
#పాపవిమోచని ఏకాదశి / పాప నాశని ఏకాదశి 🕉️🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #పాపమోచని ఏకాదశి శుభాకాంక్షలు #ఏకాదశి *పాపమోచనీ ఏకాదశి* *ఏకాదశీ వ్రత మహిమ* పాపమోచనీ ఏకాదశీ మహిమ శ్రీకృష్ణయుధిష్ఠిర సంవాద రూపంగా భవిష్యోత్తర పురాణంలో వర్ణించబడింది. ఒకసారి ధర్మరాజు కృష్ణునితో పలుకుతూ “కృష్ణా! ఆమలకీ ఏకాదశీ మహిమను నీవు ఇదివరకే వివరించావు. అయితే ఇపుడు వచ్చే ఏకాదశిని గురించి వివరించవలసింది. ఆ ఏకాదశి పేరేమిటి? ఆ ఏకాదశిని పాటించే పద్ధతిని, దాని ఫలితాన్ని నాకు చెప్పవలసిందిగా కోరుతున్నాను” అని అన్నాడు. అపుడు శ్రీకృష్ణుడు దానికి ప్రత్యుత్తరంగా పలుకుతూ “రాజోత్తమా! ఆ ఏకాదశి పేరు పాపమోచనీ, దాని మహిమను ఇపుడు విను. అతిపురాతన కాలంలో ఈ ఏకాదశీ మహిమను లోమశముని మాంధాతకు వివరించాడు. ఈ ఏకాదశి సకల పాపాలను హరిస్తుంది. జీవుని పిశాచ జీవనాన్ని నశింపజేస్తుంది, అష్టసిద్ధులను ప్రసాదిస్తుంది” అని అన్నాడు. లోమశముని చెప్పిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. దేవతల కోశాధిపతియైన కుబేరునికి ఒక రమ్యమైన పుష్పవనం ఉండేది. దాని పేరు చైత్రరథం. నిత్యవసంతఫలితంగా అక్కడ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేది. గంధర్వులు, కిన్నరులు వంటివారు అక్కడ క్రీడించేవారు. ఇంద్రాది దేవతలు కూడ అక్కడకు వచ్చి విహరించేవారు. అదే వనంలో మేధావి అనే శివభక్తుడు తపస్సు చేస్తుండేవాడు. ఒకసారి అప్సరసలు ఆయన నిష్ఠను భంగపరచడానికి ప్రయత్నించారు. వారిలో మంజుఘోష అనే అప్సరస మునిమనస్సును హరించడానికి ఒక పన్నాగం పన్నింది. ఆమె ముని ఆశ్రమానికి దగ్గరలోనే ఒక చిన్న కుటీరాన్ని నిర్మించుకొని తియ్యని గొంతుతో వీణను మీటుతూ గీతాలాపన చేయసాగింది. శరీరానికి చందనాన్ని అలదుకొని, మెడలో సుగంధ పుష్పమాలను ధరించి తియ్యగా పాడుతున్న మంజుఘోషను చూసి శివవైరియైన మన్మథుడు కూడ మునిని జయించడానికి యత్నించాడు. పూర్వం ఒకసారి శివుడు మన్మథుని కాల్చి భస్మం చేశాడు. పూర్వశత్రుత్వాన్ని గుర్తు చేసికొనినవాడై మన్మథుడు ప్రతీకారం తీర్చుకోవడానికి శివభక్తుడైన మునిమనస్సులో ప్రవేశించాడు. తెల్లని యజ్ఞోపవీతాన్ని ధరించి చ్యవనఋషి ఆశ్రమంలో వసిస్తున్న మేధావి ఋషి అపుడు రెండవ మన్మథునిగా గోచరించాడు. అపుడు మంజుఘోష అతని చెంతకు చేరింది. అది చూసి మేధావి కూడ కామపీడితుడై తన దైవాన్ని మరిచాడు. ఆ విధంగా అతడు శివభక్తిని విడిచి ఆ వనితాసాంగత్యంలో మునిగిపోయాడు. అనేకసంవత్సరాలు గడిచాయి. ముని తన స్థితి నుండి పతనం చెందాడని గుర్తించిన మంజుఘోష తిరిగి తన లోకానికి వెళ్ళిపోవాలని నిశ్చయించుకొంది. అదే విషయాన్ని ఆమె మేధావితో చెప్పి తన లోకానికి వెళ్ళడానికి అనుజ్ఞను కోరింది. అపుడు మేధావి ఆమెతో "రమణీ! నీవు నా దగ్గరకు వచ్చింది ఈ సాయంత్రమే కదా. ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు ప్రొద్దున్నే వెళ్ళిపో" అని అన్నాడు. మునికి భయపడిన మంజుఘోష సరేనని చెప్పి మరికొన్ని సంవత్సరాలు అక్కడే ఉండిపోయింది. ఈ రకంగా ఆ అప్సరస యాభైఏడు సంవత్సరాల తొమ్మిది నెలల మూడు రోజులు మునితో గడిపినప్పటికిని అదంతా కేవలం ఒక రాత్రిలో సగభాగం వలెనే తోచసాగింది. తిరిగి మంజుఘోష తన ఇంటికి వెళ్ళడానికి అనుజ్ఞను కోరింది. కాని ఈ సారి ముని ఆమెతో "రమణీ! నా మాటలు విను. ఇది కేవలం ప్రాతఃసమయం. నేను ప్రాతః కాలవిధులు పూర్తి చేసేంతవరకు ఇక్కడే ఉండు" అని అన్నాడు. అపుడు అప్సరస నవ్వి “మహర్షీ! మీ ప్రాతఃకాల విధులు పూర్తి కావడానికి ఇంకెంత సమయం పడుతుంది? ఇంకా మీరు అవి పూర్తి చేయలేదా? ఇప్పటికే నా సాంగత్యంలో మీరు అనేక సంవత్సరాలు గడిపారు. ఇప్పటికైనా సమయం విలువ తెలుసుకోండి” అని అన్నది. ఆ మాటలు వినగానే ఋషికి జ్ఞానోదయం కలిగింది. అపుడు ఆ ఋషి “సుందరీ! యాభైఏడేళ్ళ విలువైన కాలాన్ని నేను వృథా చేశాను. నీవే నా సమస్తాన్నీ, తపస్సును నాశనం చేశావు" అని అంటూనే ఆయన కళ్ళలో నీళ్ళు తిరిగాయి. దేహం కోపంతో కంపించింది. అదే కోపంతో మేధావి ఆమెతో పలుకుతూ “నీవు మంత్రకత్తె, పిశాచిలాగా ప్రవర్తించావు. కాబట్టి పిశాచిలాగా మారిపో. పాపిష్ఠిదానా! సిగ్గు సిగ్గు” అని అన్నాడు. మేధావి ఇచ్చిన శాపాన్ని వినగానే మంజుఘోష అతనితో “ఓ బ్రాహ్మణోత్తమా! దయచేసి ఈ శాపాన్ని ఉపసంహరించుకో. నేను నీకు అనేకసంవత్సరాల సాంగత్యాన్ని ఇచ్చాను కాబట్టి క్షమార్హురాలిని. నా మీద దయ చూపించు” అని అన్నది. ఆమె మాటలను వినిన మేధావి అపుడు ఆమెతో "సౌమ్యురాలా! నేనేం చేసేది? నీవు నా తపస్సంపదను కొల్లగొట్టావు. అయినా ఈ శాపం నుండి బయటపడే మార్గం నీకొకటి నేను చెబుతాను, చైత్రమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు పాపమోచనీ ఏకాదశి. అది సకలపాపహరం. నీవు ఆ ఏకాదశివ్రతాన్ని పాటిస్తే నీ పిశాచజీవనం పోతుంది” అని పలికాడు. తరువాత మేధావి తన తండ్రి చ్యవనఋషి ఆశ్రమానికి వెళ్ళాడు. పతితుడైన తన పుత్రుని చూసి చ్యవనఋషి అతిదుః ఖితుడై “అయ్యో! నీవెంత పనిచేశావు! సాధారణమైన వనితకు ఆకర్షితుడవై తపస్సంపదను నష్టపరచడం నీకు తగనే తగదు" అని అన్నాడు. అపుడు మేధావి పలుకుతూ "తండ్రీ! దురదృష్టవశాత్తు నేను అప్సరససాంగత్యంలో మహాపాపానికి ఒడిగట్టాను. కాబట్టి నాకు పాపపరిహారాన్ని తెలియజేయండి” అని అర్థించాడు. కుమారుడి దీనాలాపన వినిన చ్యవనఋషి అపుడు మార్గోపదేశం చేస్తూ "పుత్రా! పాపమోచని ఏకాదశీ వ్రతపాలన వలన సమస్తపాపాలు నశిస్తాయి. కాబట్టి శ్రద్ధతో దానిని పాటించు” అని అన్నాడు. తండ్రి మాటలను వినిన మేధావి పరమోత్సాహంతో ఆ ఏకాదశీ వ్రతపాలనకు సిద్ధపడ్డాడు. తరువాత ఆ ఏకాదశి వ్రతవిధానం వలన మేధావి పాపాలన్నీ నశించిపోయాయి, అతడు కూడ పరమభాగ్యవంతుడయ్యాడు. మంజుఘోష కూడ పాపమోచనీ ఏకాదశీ పాలన ద్వారా పిశాచరూపం నుండి బయటపడి తిరిగి స్వర్గానికి వెళ్ళిపోయింది. మాంధాతకు ఈ కథను వివరించిన లోమశముని చివరిగా పలుకుతూ "రాజా! ఈ పాపమోచనీ ఏకాదశీ వ్రతపాలన చేత సమస్త పాపాలు నశిస్తాయి. ఈ ఏకాదశి వ్రతమాహాత్మ్యాన్ని చదవడం వలన, వినడం వలన సహస్ర గోదానఫలం లభిస్తుంది. ఈ వ్రతపాలన ద్వారా బ్రహ్మహత్యాపాతకం, భ్రూణహత్యాపాతకం, మదిరాపాన పాతకం, గురుపత్ని సంగమపాతకం వంటి సకలపాపాలు సమూలంగా నశిస్తాయి” అని అన్నాడు. సారాంశమేమనగా ఈ ఏకాదశి పరమమంగళకరమైనది, సకల పాపహరమైనది కాబట్టి ప్రతియొక్కరు శ్రద్ధతో ఈ ఏకాదశి వ్రతపాలన చేయాలి. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*