P.Venkateswara Rao
514 views
2 days ago
#ఏపి న్యూస్ ఏపీ పాలిటెక్స్🎯 *వ్య‌తిరేక‌త‌పై కూట‌మి కింక‌ర్త‌వ్యం ఏంటి❓* 14.06 2026🎯 కూట‌మి ప్ర‌భుత్వం రెండేళ్ల పాల‌న పూర్తి చేసుకుంది. అధికారంలో ఉన్నోళ్ల‌కు అప్పుడే రెండేళ్లు గ‌డిచిపోయాయా? అనిపిస్తోంది. ప్ర‌తిప‌క్ష వైసీపీకి మాత్రం, కాలం మ‌రికాస్త వేగంగా ప‌రుగు తీసి వుండాల్సింద‌ని కోరుకుంటోంది. చంద్ర‌బాబు స‌ర్కార్ చాలా త్వ‌ర‌గా రెండేళ్ల కాలాన్ని పూర్తి చేసుకుంద‌న్న మాట వాస్త‌వం. రెండేళ్ల‌లో ఏం జ‌రిగింద‌ని వెన‌క్కి తిరిగి చూసుకుంటే, కూట‌మి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల మ‌న‌సుల్లో ఏదో తెలియ‌ని వెల‌తి. కూట‌మి కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు ఎన్నెన్నో ఆశ‌ల‌తో ప్ర‌భుత్వాన్ని తెచ్చుకున్నారు. కోరుకుంటున్న‌ట్టే ప్ర‌భుత్వం ఏర్ప‌డినా, వారి ఆశ‌లేవీ నెర‌వేర‌లేదు. భ‌విష్య‌త్‌లో అయినా అనుకున్న‌వి జ‌రుగుతాయ‌న్న న‌మ్మ‌కం కుద‌ర‌డం లేదు. కూట‌మి ప్ర‌భుత్వంలో ఎమ్మెల్యేలే అన్నీ చూసుకుంటున్నారు, చేసుకుంటున్నార‌న్న ప్ర‌చారం విస్తృతంగా సాగుతోంది. చిన్న‌చిన్న ప‌నులు కూడా కావ‌డం లేద‌న్న ఆవేద‌న కూట‌మి శ్రేణుల్లో వుంది. మ‌రోవైపు ప్ర‌తి దానికీ లంచ‌మే. మ‌రీ ముఖ్యంగా టీడీపీ, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులకు తీవ్ర అసంతృప్తి క‌లిగించే ఒక విష‌యం గురించి తెలుసుకోవాలి. కూట‌మి ఎమ్మెల్యేలు, మంత్రులు డ‌బ్బు కోసం, ఎవ‌రేమిటో చూసుకోకుండా ప‌నులు చ‌క్క‌బెడుతున్నార‌నేది రెండు పార్టీల కార్య‌క‌ర్త‌ల‌, నాయ‌కుల ప్ర‌ధాన ఆరోప‌ణ‌. ఇది నిజం కూడా. ప‌వ‌ర్ అంటే అధికారం కానే కాదు. డ‌బ్బే అని ప్ర‌జాప్ర‌తినిధులు నిరూపిస్తున్నారు. మ‌రెవ‌రికో ప‌నులు చేస్తూ, ఎమ్మెల్యేలు, మంత్రులు భారీగా దోచుకోడానికేనా అధికారం తెచ్చింద‌నే నిరాశ, నిస్పృహ‌లో కార్య‌క‌ర్త‌లున్నారు. చివ‌రికి చికెన్ సెంట‌ర్ల య‌జ‌మానుల నుంచి కిలో చికెన్‌పై రూ.10 చొప్పున ఎమ్మెల్యేలే వ‌సూళ్లు చేసుకుంటున్నారు. ఇక త‌మ గ‌తి ఏంట‌ని టీడీపీ, జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ప్ర‌శ్నిస్తున్నారు. చిన్న‌చిన్న కాంట్రాక్టు ప‌నులు చేస్తుంటే, వాటికి నెల‌ల త‌ర‌బ‌డి బిల్లులు రావ‌డం లేదు. ఇటీవ‌ల క‌డ‌ప ఎమ్మెల్యే మాధ‌వీరెడ్డి భ‌ర్త‌, టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు బిల్లుల విష‌య‌మై డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను ఉద్దేశించి ఘాటైన పోస్టు పెట్టారు. 18 నెల‌లుగా త‌మ కార్య‌క‌ర్త బిల్లుల కోసం ఎదురు చూడాల్సి వ‌స్తోంద‌ని, అధికారుల చుట్టూ తిరుగుతున్నా ప‌ట్టించుకోక‌పోతే ఎలా అని ఆయ‌న నిల‌దీశారు. కొంత మంది కాంట్రాక్ట‌ర్లు బిల్లుల కోసం రోడ్డెక్కిన సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు పెద్ద మొత్తంలో క‌మీష‌న్లు ఇచ్చిన వారికి మాత్రం బిల్లులవుతున్నాయ‌నే ప్ర‌చారం లేక‌పోలేదు. కూట‌మి ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త వుంద‌ని ఆ మూడు పార్టీల నాయ‌కులు సైతం అంగీక‌రించే చేదు నిజం. వ్య‌తిరేక‌త‌కు అనేక కార‌ణాలున్నాయి. ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు, మ‌హిళ‌లు, విద్యార్థులు…ఇలా చెప్పుకుంటూపోతే, అస‌లు వ్య‌తిరేకించ‌ని వ‌ర్గ‌మంటూ ఏద‌నే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది. ఎలాగైనా అధికారంలోకి రావాల‌నే ఉద్దేశంతో ఇష్టానుసారం చంద్ర‌బాబు, ప‌వ‌న్ హామీలిచ్చారు. వాటి అమ‌లు విష‌యానికి వ‌చ్చే స‌రికి చేతులెత్తేస్తున్నారు. అయితే బ‌ల‌మైన మీడియా వ్య‌వ‌స్థ‌ను చేతుల్లో పెట్టుకుని, వ్య‌తిరేక‌త‌ను బ‌య‌ట‌ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. కానీ ప్ర‌త్యామ్నాయంగా సోష‌ల్ మీడియా రావ‌డంతో దేన్నీ దాచిపెట్ట‌డానికి వీలు కావ‌డం లేదు. దీంతో ప్ర‌జాభిప్రాయం ఎప్ప‌టిక‌ప్పుడు బ‌య‌ట ప‌డుతూనే వుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌జా వ్య‌తిరేక‌త నుంచి బ‌య‌ట‌ప‌డ‌డం ఎలా? అనే ప్ర‌శ్న ప్ర‌భుత్వ పెద్ద‌ల్ని తీవ్రంగా తొలిచేస్తోంది. రెండేళ్ల‌లో 8 శాతం గ్రాఫ్ పెరిగింద‌ని సీఎం చంద్ర‌బాబు ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. అయితే దాన్ని రివ‌ర్స్‌లో అర్థం చేసుకోవాల‌ని కూట‌మి వ‌ర్గాలే చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. కూట‌మి గ్రాఫ్ ఎంత శాతం ప‌డిపోయింద‌నే సంఖ్య ప‌క్క‌న పెడితే, వ్య‌తిరేక‌త వుందని అంద‌రూ ఒప్పుకునే వాస్త‌వం. ఇప్ప‌టికే చంద్ర‌బాబు అనేక సంద‌ర్భాల్లో అరాచ‌క ఎమ్మెల్యేల‌ను మంద‌లించిన‌ట్టు వార్త‌లొచ్చాయి. ప‌ద్ధ‌తి మార్చుకోక‌పోతే, తానే ప‌క్క‌న పెడ‌తాన‌ని ఆయ‌న ప‌దేప‌దే హెచ్చ‌రిస్తున్నారు. అయినా క్షేత్ర‌స్థాయిలో ఎలాంటి మార్పు క‌నిపించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి వైసీపీకి అధికారం అనే మాట‌నే టీడీపీ, జ‌న‌సేన అధినాయ‌కులు అంగీక‌రించే ప‌రిస్థితిలో కూడా లేరు. అధికారం శాశ్వ‌తంగా మ‌న‌దే అనే ఆలోచ‌న‌లో వారున్నారు. అలా ఉండాల‌ని కోరుకోవ‌డాన్ని ఎవ‌రూ త‌ప్పు ప‌ట్ట‌రు. అయితే అందుకు త‌గ్గ‌ట్టు ఏం చేస్తున్నామో ఆలోచించుకోవాల్సిన బాధ్య‌త వారిపై వుంది. ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించుకునే త‌క్ష‌ణ ఉపాయం కూట‌మికి అవ‌స‌రం. ఒక్క‌సారి వ్య‌తిరేక‌త ఉంద‌నే ప్ర‌చారం మొద‌లైతే, దాని దుష్ప‌రిణామాలు భ‌విష్య‌త్‌లో చాలా వుంటాయి. అందుకే ఆ ప్ర‌చారానికి మొద‌ట్లోనే అడ్డుకట్ట వేసుకోవాల్సి వుంటుంది. రాజ‌కీయ చాణ‌క్యుడిగా పేరుగాంచిన చంద్ర‌బాబు, వ్య‌తిరేక‌త‌కు విరుగుడు ఏం ఆలోచిస్తారో చూడాలి.