#🆕Current అప్డేట్స్📢 #📰జాతీయం/అంతర్జాతీయం #🏛️రాజకీయాలు #🏛️పొలిటికల్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్
*ఓటు ఉంటేనే ఆధార్ ... ఆధార్ ఉంటేనే ఓటు..!!!*
*రికార్డుల్లో లేని మనిషి.. ఆధార్ చట్రంలో నలిగిపోతున్న శ్రీనివాసరావు..!!!*
*✍️..పై ప్రత్యేక కథనం..రిపోర్టర్ :- శేఖర్📲..9603197203..✍️*
అతనో సామాన్యుడు..చదువు అబ్బలేదు కానీ, రెక్కాడితే గానీ డొక్కాడని బతుకు అతనిది. 50 ఏళ్లుగా ఈ గడ్డపైనే పుట్టి పెరిగాడు. కానీ నేడు 'నేను ఉన్నాను' అని నిరూపించుకోవడానికి ఆ అక్షరాల కార్డు అతని దగ్గర లేదు. అదే 'ఆధార్' అది లేకపోవడంతో నేడు ప్రభుత్వ రికార్డుల్లో అతను అస్తిత్వం లేని వ్యక్తిగా మిగిలిపోయాడు. కాట్రేనికోన మండలం, లక్ష్మీవాడకు చెందిన చొల్లంగి శ్రీనివాసరావు పడుతున్న వ్యధ ఇది. శ్రీనివాస రావు సమస్య ఒక విచిత్రమైన ఉచ్చు లాంటిది..*రేషన్ కార్డు కావాలన్నా, బ్యాంక్ ఖాతా తెరవాలన్నా, కనీసం ఓటు హక్కు నమోదు చేసుకోవాలన్నా ఆధార్ తప్పనిసరి..* ఆధార్ కోసం వెళ్తే ఓటర్ కార్డు అడుగుతున్నారు. తీరా ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేస్తే ఆధార్ కార్డు అడుగుతున్నారు. ఈ రెండింటి మధ్య శ్రీనివాస రావు ఏళ్ల తరబడి నలిగిపోతున్నాడు..నివాస ధృవీకరణ కోసం రెవెన్యూ అధికారులను ఆశ్రయించినా, ఫలితం లేని పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లా కేంద్రమైన కాకినాడ, పిండాల చెరువు వద్ద ఉన్న ప్రధాన ఆధార్ సేవా కేంద్రానికి ఆయన ఎన్నో సార్లు ఆధార్ కార్డు నమోదుకు వెళ్ళాడు..కాట్రేనికోన తహసీల్దార్ సంతకం చేసిన నివాస ధృవీకరణ పత్రాన్ని సమర్పించినా, అక్కడ సిబ్బంది,అధికారులు 'ఇది చెల్లదు..ఓటర్ కార్డు తీసుకురావాల్సిందే' అని వెనక్కి పంపేస్తున్నారు..ఆధార్ అథారిటీ నిబంధనల ప్రకారం గెజిటెడ్ ఆఫీసర్ ధృవీకరణ చెల్లుబాటు కావాల్సి ఉన్నా, క్షేత్రస్థాయిలో శ్రీనివాస రావు లాంటి అమాయకులకు చుక్కలు కనిపిస్తున్నాయి."నాకు ఈ దేశంలో ఆధార్ పొందే హక్కు లేదా..? కనీసం ఓటు వేసే హక్కును కూడా అధికారులు కల్పించరా? ఏళ్లు గడుస్తున్నా నా గోడు ఎవరూ వినడం లేదు. ఆధార్ లేకపోతే నేను బతికున్నా లేనట్టేనా..?" అంటూ శ్రీనివాస రావు ఆవేదనగా ప్రశ్నిస్తున్నాడు..ఆధార్ లేకపోవడం వల్ల అతను ఏ ప్రభుత్వ సంక్షేమ పథకానికి దరఖాస్తు చేసుకోలేకపోతున్నాడు. వృద్ధాప్యం దరి చేరుతున్న తరుణంలో, రేషన్ కార్డు కూడా లేకపోవడంతో అతని జీవనం ప్రశ్నార్థకంగా మారింది.డిజిటల్ భారత్ అని చెప్పుకుంటున్న ఈ రోజుల్లో, ఒక నిరుపేద వ్యక్తి తన ఉనికిని చాటుకోవడానికి ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగడం వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోంది. ప్రత్యేక కేసుగా పరిగణించి, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసి అతనికి ఆధార్, ఓటర్ కార్డు అందేలా చూడాలని లక్ష్మీవాడ గ్రామస్తులు కోరుతున్నారు.ఓ మనిషిని రికార్డుల్లోకి చేర్చి, అతనికి పౌర హక్కులు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఈ సమస్య ఒక్క శ్రీనివాసరావు వ్యక్తిగత సమస్యే కాదు. ఇలాంటి అడ్రస్సు లేని వారు ఎందరో ఆధార్ కార్డులు పొందలేక ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతూ పడిగాపులు పడుతున్నారు. అక్కడి ఆధార్ నిబంధనలు వారి పాలిట శాపంగా మారాయి.అయినా ఇలాంటి అభాగ్యులకు నేటికీ ఆధార్ అందక అనేక ఇక్కట్లు పడుతున్నారు. ఆధార్ సంస్థ ఇటువంటి వారి విషయంలో ప్రత్యేకంగా పరిగణించి నిబంధనలు సడలించి ఆధార్ కార్డులు జారీ చేయాలని బాధితులు కోరుతున్నారు. ఇకనైనా ప్రభుత్వాలు ప్రత్యేక కేసులుగా పరిశీలించి గుర్తింపు లేని వారికి గుర్తింపు కార్డులు ఇచ్చి ఆధార్ కార్డులు జారీ చేసి ఆదుకోవాలని వారు కోరుతున్నారు..