#ఏపీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ 🎯
*అబద్ధం.. అబద్ధం❗‼️*
FEBRUARY 25, 2026🎯
ఇటీవల “గ్రేట్ ఆంధ్ర” వెబ్సైట్లో ప్రసిద్ధ వ్యంగ్య రచయిత అద్భుతమైన మాట రాశారు. ఆ మాట ఏంటంటే……… *"అబద్ధాన్ని గౌరవించు. అదే ప్రపంచ విజేత”*
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ మాట కొందరు నేతలకు అతికినట్టు సరిపోతుంది. కేవలం అబద్ధాలే తమను మళ్లీమళ్లీ విజేతలుగా నిలుపుతాయనే నమ్మకంతో, నిత్యం అవే ప్రాక్టీస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. సహజ న్యాయ సూత్రం ఏంటంటే……… న్యాయం జరగడమే కాదు, జరిగిటనట్టు కనిపించాలి. ఏపీలోని కొంత మంది నాయకుల తీరు ఎలా వుందంటే... తామే చెసిందే న్యాయం, చెప్పిందే చట్టం. ఎవరైనా ఇదేంటని ప్రశ్నిస్తే, ఆ మరుసటి రోజు ఏదో ఒక కేసులో సమీపంలోని జైళ్లలో ఊచలు లెక్కించాల్సి వుంటుంది. ఎవరైనా న్యాయాన్ని,
చట్టాన్ని లెక్క చేయరో, వాళ్లే వాటి గొప్పతనం గురించి ఉపన్యాసాలు ఇవ్వడం ఇక్కడి ప్రత్యేకత.
కొంత మంది నాయకుల రాజకీయ పంథాను మొదటి నుంచి గమనిస్తే… కేవలం అబద్ధాల్ని మాత్రమే సాధన చేసిన భావన కలుగుతుంది. అబద్ధాల పునాదులపై రాజకీయ సౌధాల్ని నిర్మించుకున్న వైనం ఆశ్చర్యం కలిగిస్తోంది. దశాబ్దాలుగా కేవలం అబద్ధాల్నే చెబుతూ, ప్రజల్ని వంచిస్తూ ఎంత బాగా రాణిస్తున్నారయ్యా అని ముక్కున వేలేసుకునేలా చేస్తున్నారు.
ఈ మాటలన్నీ ఎవరి గురించి పేరు చెప్పకుండా, అర్థం చేసుకునే చైతన్యం తెలుగు సమాజం సొంతం. అయితే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత……… అరర్రె ఇంతకాలం మనం మోసపోయాం, మోసపోతున్నాం గురూ అనే ఆవేదన కలగకుండా వుండదు.
దేశ రాజకీయాల్లోనే ఏపీ రాజకీయాలు ఎంతో ప్రత్యేకం. సీఎం చంద్రబాబు తరచూ కేస్ స్టడీ అంటుంటారు. ఏపీ రాజకీయాలు కూడా కేస్ స్టడీ లాంటివే. రాజకీయ ప్రత్యర్థుల్ని దెబ్బ కొట్టడానికి ఎన్నైనా అబద్ధాలు చెప్పు. వాటిని నిజమని నమ్మించే మీడియాను చేతిలో పెట్టుకో. ఒకే అబద్ధాన్ని పదేపదే చెబుతుంటే, చివరికి అదే నిజమని నమ్మే పరిస్థితిని సృష్టించు. నచ్చి నాయకుడు ఎద్దు ఈనిందంటే కళ్లు మూసుకుని గాటిన కట్టేసే మీడియా ఎలాగూ తోడుంటుంది.
బలమైన మీడియా వ్యవస్థని చేతిలో పెట్టుకుని, ప్రజలతో మైండ్రోమ్ ఆడడం ఏపీలో అలవాటైంది. రాజకీయ ప్రత్యర్థులపై తాము మాత్రం ఇష్టానుసారం అబద్ధాల్ని ప్రచారం చేస్తామని, తమ జోలికి వస్తే మాత్రం న్యాయ స్థానాల్ని ఆశ్రయించి, నోళ్లు మూయిస్తామనే ధోరణి ఏపీలో నడుస్తోంది.
కొన్ని రోజులుగా తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీని అడ్డుపెట్టుకుని ………బాబోయ్ ఎన్నెన్ని విష ప్రచారాలో. వినడానికే జుగుప్స. కానీ విష ప్రచారం చేసేవారిలో మాత్రం అలుపుసొలుపు లేదు. అబద్ధాల్ని నిత్యం ప్రాక్టీస్ చేయడం ఒక కళ అయితే తప్ప, రాజకీయాల్లో అలా చెప్పడం సాధ్యం కాదనిపిస్తుంది.
ఇప్పుడ బాధంతా ఏందంటే… ఇలాంటి వాళ్ల చేతిలో రాష్ట్ర భవిష్యత్ ఏమవుతుంది? అధికారం, రాజకీయ స్వార్థం కోసం ఎంత వరకైనా దిగజారే వ్యక్తిత్వం ఉన్నోళ్లు, ఆంధ్రప్రదేశ్ పురోగతి కోసం గొప్ప ఆలోచనలు చేస్తారని ఆశించడం అత్యాశే. అధికారం లేకపోతే, ఏమవుతామో అని భయపడే
వాళ్లు, దాని కోసం రాష్ట్ర ప్రయోజనాల్ని బలి తీసుకోవడం పెద్ద విషయం కాదు.
ఐదేళ్లకోసారి అధికారం కట్టబెట్టడానికే ప్రజలున్నారని నాయకుల భావన. అబద్ధాలు, దుష్ప్రచారానికి చట్టసభలు అతీతం కాదని నిరూపిస్తున్న వైనం ఆందోళన కలిగిస్తోంది. చట్టసభలు, బయట కొంత మంది అలవోకగా అసత్యాలు చెబుతున్న తీరు చూసి, బహుశా అబద్ధం కూడా సిగ్గుపడుతోంటోంది.
తనను అంటరానిదానిగా చూస్తుంటారని, కేవలం దాన్నే నమ్ముకుని రాజకీయ బతుకీడుస్తున్న నాయకులు దర్జాగా అధికారాన్ని అనుభవిస్తున్నారని అబద్ధం వెక్కివెక్కి ఏడుస్తుందేమో! ఏ వినాశకానికి ఈ విపరీత అబద్ధాలో తెలియదు కానీ, పాలకులు మాత్రం ఇలా వుండకూడదని సర్వత్రా కోరుకుంటున్నారు.


